breaking news
Nairuthi Ruthupavanalu
-
వానొచ్చె.. వరదొచ్చె
సాక్షి, హైదరాబాద్/సాక్షి నెట్వర్క్: నైరుతి రుతుపవనాల ప్రభావంతో రాష్ట్రమంతటా విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. వాగులు, వంకలు పోటెత్తుతున్నాయి. పలుచోట్ల చెరువులు, చిన్న ప్రాజెక్టులు నిండిపోయాయి. గోదావరి, కృష్ణా, వాటి ఉప నదులు జలకళను సంతరించుకున్నాయి. అత్యధికంగా నిజామాబాద్ జిల్లా నవీపేటలో 20.6 సెంటీమీటర్లు, నిర్మల్ జిల్లా ముథోల్లో 19.1, భైంసాలో 16.5 సెంటీమీటర్లు వర్షపాతం నమోదైంది. సుమారు 20 ప్రాంతాల్లో పది సెంటీమీటర్లకుపైనే భారీ వర్షం కురిసింది. మొత్తంగా శుక్రవారం సాయంత్రం నుంచి శనివారం సాయంత్రం వరకు తెలంగాణవ్యాప్తంగా సగటున 4.01 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్టు రాష్ట్ర ప్రణాళికా విభాగం వెల్లడించింది. నైరుతి సీజన్లో ఇప్పటివరకు 18.9 సెంటీమీటర్ల సాధారణ వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా.. ఈసారి 30.5 సెంటీమీటర్లు కురిసింది. ఇది సాధారణం కంటే 61 శాతం అధికం కావడం గమనార్హం. రాష్ట్రంలోని 18 జిల్లాల్లో అత్యధిక, 15 జిల్లాల్లో అధిక వర్షపాతం నమోదైంది. మరో రెండు, మూడు రోజులు రుతు పవనాలకు గత రెండు రోజులుగా ఉపరితల ఆవర్తనం తోడుకాగా.. శనివారం వాయవ్య, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. దీని ప్రభావంతో తెలంగాణవ్యాప్తంగా మరో రెండు, మూడు రోజులు వానలు పడతాయని వాతావరణ శాఖ ప్రకటించింది. పలు జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని.. ముఖ్యంగా కుమురంభీం ఆసిఫాబాద్, ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్ జిల్లాల్లో కుండపోత కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ను జారీ చేసింది. రాష్ట్రంలోని మిగతా జిల్లాలకు ఎల్లో అలర్ట్ను జారీ చేసింది. పంటల సాగులో జాగ్రత్త భారీ వర్షాల నేపథ్యంలో రైతాంగం అప్రమత్తంగా ఉండాలని వాతావరణశాఖ సూచించింది. ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాల్లో అతిభారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో పొలాల్లో జాగ్రత్త చర్యలు చేపట్టాలని పేర్కొంది. ఈ మేరకు ప్రత్యేక బులిటెన్ విడుదల చేసింది. వర్షాధార పంటలైన పత్తి, కంది, మొక్కజొన్న, సోయాచిక్కుడు చేన్లలో నీరు నిల్వకుండా చూసుకోవాలని పేర్కొంది. నీరు సమృద్ధిగా ఉండే ప్రాంతాల్లో మధ్యకాలిక రకాల వరి నారు పోసుకోవాలని సూచించింది. వర్షాలతో నారుమళ్లలో తాటాకు తెగుళ్లు వస్తాయని, వాటి నివారణకు లీటరు నీటిలో ప్రోపినోపాస్ 2 మిల్లీలీటర్లు కలిపి పిచికారీ చేయాలని పేర్కొంది. ఉమ్మడి ఆదిలాబాద్: పోటెత్తిన వాగులు రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. పంటలు నీట మునిగాయి. చెరువుల్లో వరద చేరుతోంది. మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం నక్కలపల్లి, ఎదులబంధం లింగన్నపేటకు రాకపోకలు నిలిచిపోయాయి. ఆదిలాబాద్ జిల్లాలో ఇంద్రవెల్లి, నార్నూర్, బోథ్ మండలాల్లో 30కిపైగా గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. కుంటాల, పొచ్చెర జలపాతాలకు వరద పోటెత్తింది. ఆసిఫాబాద్ జిల్లాలో పెంచికల్ పేట, బెజ్జూరు మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. ఉమ్మడి నిజామాబాద్: వానతో ఆగమాగం రాష్ట్రంలోనే అత్యధికంగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లా పరిధిలో భారీ వర్షాలు కురిశాయి. ఎడతెరిపి లేని వర్షంతో నిజామాబాద్, ఆర్మూర్ సహా ప్రధాన పట్టణాల్లో లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. పలు మండలాల్లో వాగులు పొంగి రోడ్లు, లోలెవల్ వంతెనలు కొట్టుకుపోయాయి. రాకపోకలకు అంతరాయం కలిగింది. కామారెడ్డి జిల్లాలో 57 చెరువులు నిండి అలుగు పారాయి. బాన్సువాడలో రేకులషెడ్డు కూలి నలుగురికి గాయాలయ్యాయి. ఉమ్మడి కరీంనగర్: దంచికొట్టిన వాన కరీంనగర్ ఉమ్మడి జిల్లా పరిధిలో శనివారం వాన దంచికొట్టింది. వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. రాజన్న సిరిసిల్ల జిల్లాలో చెరువుల్లోకి భారీగా నీరు చేరుతోంది. పెద్దపల్లి, జగిత్యాల జిల్లాల్లో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. జగిత్యాల జిల్లా కేంద్రంలో మాతాశిశు సంరక్షణ కేంద్రం పైకప్పు కూలిపడింది. ధర్మపురి మండలం నాగారంలో ఇల్లు ధ్వంసమైంది. పెగడపల్లి మండలం దీకొండలో విద్యుత్ తీగలు తెగిపడి 9 గొర్రెలు చనిపోయాయి. ఉమ్మడి వరంగల్: పోటెత్తిన వరద విస్తారంగా కురుస్తున్న వర్షాలతో ఉమ్మడి వరంగల్లో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. మహబూబాబాద్ జిల్లా కురవిలో మున్నేరు వాగు ఉధృతంగా పారుతోంది. మహాముత్తారం మండలంలో పెద్దవాగు పోటెత్తడంతో రాకపోకలు నిలిచిపోయాయి. కురవి మండలం కొత్తూరు (జి) శివారులో మున్నేరు వాగు చెక్డ్యాంపై నుంచి ప్రవహిస్తోంది. పరకాల సమీపంలో చలివాగు పొంగిపొర్లుతోంది. ఉమ్మడి ఖమ్మం: ఆగని వాన ఖమ్మం ఉమ్మడి జిల్లాలో గురువారం మొదలైన వర్షం శనివారం సాయంత్రందాకా కురుస్తూనే ఉంది. లోతట్టు ప్రాంతాల్లో నీరు చేరింది. రోడ్లన్నీ చిత్తడిగా మారాయి. భద్రాచలం వద్ద గోదావరి నీటి ప్రవాహం 20 అడుగులు దాటి ప్రవహిస్తోంది. భారీగా వరద వస్తుండటంతో వైరా, పాలేరు, తాలిపేరు రిజర్వాయర్లు జలకళ సంతరించుకున్నాయి. ఉమ్మడి మెదక్: నీట మునిగిన పంటలు ఉమ్మడి మెదక్ జిల్లావ్యాప్తంగా రెండు రోజులుగా ఎడతెరపి లేకుండా వాన కురుస్తోంది. ముఖ్యంగా సిద్దిపేట జిల్లా పరిధిలో భారీ వర్షం పడింది. పోచారం, ఘనపూర్, బొల్లారం ప్రాజెక్టులు నీటితో నిండుకుండల్లా మారాయి. మెదక్లో పంటలు నీట మునిగాయి. పలుచోట్ల గాలివానకు చెట్లు నేలకొరిగి రాకపోకలకు అంతరాయం కలిగింది. తొగుట మండలంలో కూడవెల్లి వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. ఉమ్మడి మహబూబ్నగర్: చెరువులకు జలకళ మహబూబ్నగర్ ఉమ్మడి జిల్లాల్లో చెరువులు జలకళ సంతరించుకున్నాయి. వాగుల్లో చెక్డ్యామ్లు నిండాయి. దుందుభి నది ఉధృతంగా ప్రవహిస్తోంది. ఒక్క వనపర్తి జిల్లా తప్ప మిగతా చోట్ల వానలు ఓ మోస్తరుగా పడుతున్నాయి. ముసురుపట్టడంతో జనం ఇబ్బందిపడటం కనిపించింది. ఉమ్మడి నల్లగొండ: నిండుగా వాగులు ఉమ్మడి నల్లగొండ జిల్లాలో శనివారం మోస్తరు వర్షం కురిసింది. సూర్యాపేట జిల్లా కేంద్రంలో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. సద్దల చెరువు అలుగు పోస్తోంది. యాదాద్రి భువనగిరి జిల్లాలో శుక్రవారం రాత్రి నుంచి శనివారం ఉదయం వరకు ఎడతెరిపి లేకుండా కురిసిన వానతో పలుచోట్ల వాగులు, వంకలు ఉప్పొంగాయి. చెరువుల్లోకి భారీగా నీరు చేరుతోంది. మోటకొండూరు– సికిందర్నగర్ మధ్య పెద్దవాగు.. ఆత్మకూర్(ఎం) పరిధిలో బిక్కేరు వాగు నిండుగా ప్రవహిస్తున్నాయి. మూసీకి కూడా వరద పెరిగింది. నలుగురు మృతి.. మరికొందరు గల్లంతు రాష్ట్రవ్యాప్తంగా రెండు రోజుల్లో వరద నీటిలో కొట్టుకుపోయి నలుగురు మృతి చెందారు. మరికొందరు గల్లంతయ్యారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో శుక్రవారం వేర్వేరు ప్రాంతాల్లో గల్లంతైన ముగ్గురి మృతదేహాలను శనివారం గుర్తించారు. భద్రాద్రి జిల్లా పర్ణశాల పంచాయతీ పరిధిలోని గుబ్బలమంగి వాగులో కొట్టుకుపోయిన ఏనిక దుర్గమ్మ (55) మృతదేహం చిన్నబండిరేవు సమీపంలో చెట్టుకు చిక్కుకుని కనిపించింది. ఇక మణుగూరు మండలం కోడిపుంజుల వాగులో గల్లంతైన వర్సా శంకర్ (30), పాత కొత్తగూడెం ముర్రేడు వాగులో కొట్టుకుపోయిన ఖాజా మొహియుద్దీన్ (40) మృతదేహాలు శనివారం ఉదయం లభ్యమయ్యాయి. రాజన్న సిరిసిల్ల జిల్లాలో చేపలు పట్టేందుకు వెళ్లిన ముస్తాబాద్ మండలం గూడెంకు చెందిన కస్తూరి రవి (45) మృత్యువాత పడ్డాడు. ►శనివారం సాయంత్రం నిజామాబాద్ జిల్లా నెమిలికుంట అలుగులో లింగితండాకు చెందిన మక్కల నడిపి సాయిలు (45), దారంగుల రెడ్డి(35) గల్లంతయ్యారు. ►ములుగు జిల్లా ఎస్ఎస్ తాడ్వాయి మండలం పడిగాపూర్ జంపన్నవాగు బ్రిడ్జిపై వరదలో చిక్కుకున్న ఇద్దరు వ్యక్తులను డీఎంహెచ్వో అల్లెం అప్పయ్య, వీఆర్వో బొప్ప సమ్మ కలిసి రక్షించారు. -
నైరుతి సాధారణమే
సాక్షి, హైదరాబాద్: ఈసారి నైరుతి రుతుపవనాలు ఆశాజనకంగా ఉంటాయని, సాధారణ వర్షపాతం నమోదవుతుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. నైరుతి రుతుపవనాలు ఈసారి ఎలా ఉంటాయన్న దానిపై మొదటి ముందస్తు అంచనాలను వాతావరణ కేంద్రం డైరెక్టర్ వై.కె.రెడ్డి సోమవారం వెల్లడించారు. జూన్ నుంచి సెప్టెంబర్ మధ్య నైరుతి రుతుపవనాల కాలం ఉంటుందని, 50 ఏళ్ల సరాసరి అంచనాల ప్రకారం ఈసారి 96 శాతం వర్షపాతం రాష్ట్రంలో నమోదవుతుందని తెలిపారు. 96 శాతానికి అటుఇటుగా ఐదు శాతం తేడా ఉంటుందని ఆయన తెలిపారు. సాంకేతికంగా చూస్తే సాధారణానికి కాస్తంత తక్కువగానే నమోదవుతుందని అభిప్రాయపడ్డారు. వచ్చే జూన్ మొదటి వారంలో విడుదల చేయబోయే రెండో అంచనా నివేదిక ఇంకా స్పష్టంగా, ప్రాంతాల వారీగా ఉంటుందని, అప్పుడు కచ్చితమైన సమాచారం వస్తుందని చెప్పారు. దేశ వ్యాప్తంగా ఈసారి నైరుతి రుతుపవనాల ద్వారా పడే వర్షపాతం అన్ని ప్రాంతాల్లో సమానంగా ఉంటుందన్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోనూ ఇలాగే ఉంటుందన్నారు. దీనివల్ల రైతులకు ప్రయోజకరంగా ఉంటుందన్నారు. నైరుతిలో 717 మి.మీ.వర్షం.. రాష్ట్రంలో నైరుతి రుతుపవనాల ద్వారా సాధారణంగా 755 మిల్లీమీటర్ల (మి.మీ.) వర్షపాతం నమోదుకావాల్సి ఉందని, అయితే వచ్చే నైరుతి సీజన్లో 717 మి.మీ. వర్షం కురుస్తుందని వై.కె.రెడ్డి తెలిపారు. గతేడాది 97 శాతం వర్షపాతం నమోదవుతుందని అంచనా వేయగా, 91 శాతానికే పరిమితమైందని చెప్పారు. రాయలసీమలో ఏకంగా 37 శాతం లోటు కనిపించిందన్నారు. ఈ విషయంలో వాతావరణశాఖ సరిగా అంచనా వేయలేకపోయిందని అంగీకరించారు. ఈసారి నైరుతి రుతుపవనాలు తెలంగాణలో జూన్ 5–7 తేదీల మధ్య ప్రవేశిస్తాయని చెప్పారు. రాయలసీమలో 3–4 తేదీల మధ్య ప్రవేశించే అవకాశముందన్నారు. తమ వాతావరణ కేంద్రానికి చెందిన సబ్ డివిజన్లలో 60 శాతం చోట్ల వర్షాలు కురిస్తే రుతుపవనాలు వచ్చినట్లుగా ప్రకటిస్తామన్నారు. గాలులు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీస్తే కూడా రుతుపవనాలుగా గుర్తిస్తామన్నారు. నైరుతి రుతుపవనాల కాలంలో ఆదిలాబాద్లో అత్యధికంగా 999 ఎంఎంలు వర్షపాతం నమోదవుతుందన్నారు. అత్యంత తక్కువగా మహబూబ్నగర్, గద్వాల జిల్లాల్లో నమోదవుతుందని అన్నారు. ఎల్నినో బలహీనం.. ఎలినినో, లానినోలపైనా వర్షాలు ఆధారపడి ఉంటాయని వై.కె.రెడ్డి తెలిపారు. అయితే ఒక్కోసారి వాటితో సంబంధం లేకుండా కూడా వర్షాలు వస్తాయని చెప్పారు. వచ్చే సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో ఎల్నినో మరింత బలహీనంగా ఉంటుందన్నారు. పసిఫిక్ మహా సముద్రంలో భూమధ్య రేఖ దగ్గర సముద్రంలో ఉష్ణోగ్రత సాధారణం కంటే 0.5 డిగ్రీలు అధికంగా ఉంటే దాన్ని ఎల్నినో అంటారు. అంతకంటే తక్కువగా ఉంటే దాన్ని లానినో అంటారు. ఎల్నినో ఉంటే వర్షాలు తక్కువగా కురుస్తాయని, లానినో వల్ల వర్షాలు అధికంగా కురుస్తాయన్నారు. వచ్చే వారం నుంచి ఎక్కువ ఎండలు.. రాష్ట్రంలో వచ్చే వారం నుంచి ఎండలు మరింత తీవ్రంగా ఉంటాయని వై.కె.రెడ్డి తెలిపారు. నైరుతి రుతుపవనాలు వచ్చే వరకు తీవ్రమైన ఉష్ణోగ్రతలు నమోదవుతాయన్నారు. వారం తర్వాత ఉత్తర, తూర్పు తెలంగాణల్లో ఎండలు, వడగాడ్పుల తీవ్రత ఉంటుందన్నారు. -
తెలుగు రాష్ట్రాల్లో విస్తరించిన రుతుపవనాలు
విశాఖపట్నం: ఛత్తీస్గఢ్ నుంచి తెలంగాణ, దక్షిణకోస్తా మీదుగా దక్షిణ తమిళనాడు వరకు అల్పపీడన ద్రోణి విస్తరించి ఉందని విశాఖపట్నంలోని వాతావరణ కేంద్రం ఆదివారం వెల్లడించింది. అలాగే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో రుతుపవనాలు విస్తరించాయని తెలిపింది. ఈ రెండింటి ప్రభావంతో రానున్న మూడు రోజులూ కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో కొన్ని చోట్ల.... తెలంగాణలో పలు చోట్ల చెదురుమదురు నుంచి మోస్తరు వర్షాలు పడతాయని వాతావరణ కేంద్రం వివరించింది. -
కేరళ తీరాన్ని తాకిన నైరుతి రుతుపవనాలు
విశాఖపట్నం: రాగల 24 గంటల్లో కోస్తాంధ్రలో ఉరుములతో కూడిన ఓ మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని విశాఖపట్నంలోని వాతావరణ కేంద్రం శుక్రవారం తెలిపింది. ఈ రోజు ఉదయం 9.35 గంటలకు నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకాయని వెల్లడించింది. రెండు మూడు రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నైరుతి రుతుపవనాలు తాకనున్నాయని వాతావరణ శాఖ పేర్కొంది. -
మరో 48 గంటలపాటు వడగాల్పులు
విశాఖపట్నం: రెండు తెలుగు రాష్ట్రాలలో మరో రెండు రోజుల పాటు వడగాల్పులు కొనసాగనున్నాయని విశాఖపట్నంలోని వాతావరణ కేంద్రం గురువారం వెల్లడించింది. కోస్తాంధ్ర మీదుగా ఉపరితల ద్రోణి కొనసాగుతుందని తెలిపింది. ఈ నెల 30 నాటికి నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం పేర్కొంది.