breaking news
Muhurtam.
-
భలే మంచి రోజు..!
సాక్షి, శ్రీకాకుళం : ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడం, నామినేషన్లు వేయడానికి రోజులు దగ్గర పడుతుండడంతో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల బరిలో నిలిచే రాజకీయ నాయకులు మంచి ముహూర్తాల కోసం పండితులు, సిద్ధాంతుల వద్దకు పరుగు పెడుతున్నారు. జిల్లాలోని ప్రధాన పార్టీల అభ్యర్థులు, చిన్నాచితకా పార్టీల నాయకులు, స్వతంత్ర అభ్యర్థులు ఇలా ప్రతి ఒక్కరికీ ఎన్నికల సెంటిమెంట్ ఎక్కువగానే ఉంటుంది. ప్రధానంగా నామినేషన్ వేయడానికి మంచి ముహూర్తంతో పాటు తమ భవితవ్యాన్ని నిర్ణయించే ప్రచారాన్ని ఎప్పుడు, ఎక్కడి నుంచి ప్రారంభించాలనే సెంటిమెంట్ను వీరంతా ఫాలో అవుతుంటారు. 8 రోజులే చాన్స్ ఇదిలా ఉండగా ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులు ఈనెల 18వ తేదీ నుంచి 25వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్ వేసేందుకు ఎన్నికల కమిషన్ అవకాశం కల్పించింది. ఈ 8రోజుల్లో అభ్యర్థుల జాతకం ప్రకారం, తిథి, వార, నక్షత్రం ఆధారంగా సిద్ధాంతులు మంచిరోజులను నిర్ణయిస్తారు. ఈ పద్ధతి ఎప్పటి నుంచి ఆచరణలో ఉంది. ఈ నేపథ్యంలో ప్రస్తుత ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు కూడా మంచి ముహూర్తాల కోసం అన్వేషిస్తున్నారు. ఈసారి నామినేషన్లకు కేవలం 8 రోజులు మాత్రమే గడువు ఉండగా..వాటిలో 18వ తేదీ ద్వాదశి, 19న త్రయోదశి, 22వ తేదీ విదియ, 25వ తేదీ పంచమి మంచి రోజులుగా లెక్కలు వేసుకుంటున్నారు. నామినేషన్లకు చివరిరోజైన 25వ తేదీన పంచమి సోమవారం బలమైన ముహూర్తం ఉండడంతో ఆరోజు నామినేషన్లు వేస్తే శుభం కలగుతుందని పండితులు చెబుతున్నారు. పేరు, జన్మనక్షత్రం, జాతకమే కీలకం.. అయితే పోటీచేసే అభ్యర్థిపేరు, జన్మనక్షత్రం, జాతకం ప్రకారమే ముహూర్తం నిర్ణయించాల్సి ఉంటుందని పడింతులు పేర్కొంటున్నారు. మొత్తంమీద ఈ నాలుగురోజులు పండితులు, సిద్ధాంతులను రాజకీయ నాయకులు ఊపిరి సలపనివ్వరని తెలుస్తోంది. నామినేషన్ ముహూర్తంతో పాటు ఎన్నికల ప్రచారం ఎప్పుడు, ఎక్కడి నుంచి ప్రారంభించాలనే దానిపై ఇప్పటికే పండితులు సూచించిన విధంగా కొంతమంది మొదలు పెట్టారు. మరికొంతమంది నిర్దిష్ట సమయం కోసం వేచి చూస్తున్నారు. ముఖ్యంగా ఎన్నికల ప్రచారం నియోజకవర్గానికి ఈశాన్యం నుంచి ప్రారంభించడం పరిపాటిగా జరుగుతుంది. అయితే కొందరు నాయకులు మాత్రం గతంలో ప్రచారం ప్రారంభించిన ప్రాంతాన్నే తమ సెంటిమెంట్గా భావించి ఎన్నికల బరిలో దిగుతున్నారు. అయితే ఆ సెంటిమెంట్లు ఎవరిని విజేతలుగా నిలుపుతాయో వేచి చూడాలి. -
గ్రేటర్ పెళ్లిపందిరి..
నేడు వేలాది వివాహాలు.. కళకళలాడుతున్న ఫంక్షన్హాళ్లు సిటీబ్యూరో: హైదరాబాద్ మహానగరం పెళ్లి పందిరవుతోంది. ఆకాశం అదిరేలా.. కళ్లు చెదిరేలా విద్యుత్ కాంతులతో కల్యాణ మండపాలు ముస్తాబయ్యాయి. మార్గశిర మాసం బహుళ ఏకాదశి గురువారం ఉదయం 11.39 గంటలకు ‘కుంభలగ్నం’ దివ్యమైన మూహూర్తం. ఈ శుభ తరుణాన నగరంలో వేలాది వివాహాలు జరుగనున్నాయి. ఈ ఏడాదికి ఇదే చివరి మంచి ముహూర్తం. వచ్చే జనవరి 23 వరకు మంచి ముహూర్తాలు లేవు. నగరంలోని హైటెక్స్, అమీర్పేట్, పంజ గుట్ట, నాంపల్లి, అబిడ్స్, సికింద్రాబాద్, బొల్లారంతో పాటు శివార్లలోని చంపాపేట్, ఘట్కేసర్, ఇబ్రహీంపట్నం, హయత్నగర్, మొయినాబాద్, మేడ్చల్.. ఏ రూట్లో చూసినా ఈ రోజున పెళ్లి బాజాలే మోగనున్నాయి. పెళ్లిళ్లు అధికంగా ఉండడంతో నగరంలో సుమారు పాతిక వేల మండపాలు, ఫంక్షన్హాళ్లు బుక్కయినట్టు అంచనా. ఇక క్యాటరింగ్, డెకరేషన్ సంస్థలు, ఈవెంట్ మేనేజ్మెంట్స్, బ్యాండు, సన్నాయి మేళం నిర్వాహకులకు సైతం గిరాకీ పెరిగింది. ఫంక్షన్హాళ్ల నిర్వాహకులైతే డిమాండ్కు తగ్గట్టు భారీగా అద్దెలు పెంచినట్టు పలువురు వాపోతున్నారు. మండపం ఉన్న ప్రాంతాన్ని బట్టి ఐదు గంటల వేడుకకు రూ.50 వేల నుంచి రూ.5 లక్షల వరకు అద్దె వసూలు చేయడం గమనార్హం. ట్రాఫిక్ జంఝాటం తప్పదు..! ఇక సిటీజన్లు పెళ్లి వేడుకకు హాజరవడం ఒకెత్తయితే గురువారం పలు రూట్లలో రెండు గంటలకు పైగా ట్రాఫిక్ పద్మవ్యూహంలో చిక్కుకోక తప్పని పరిస్థితి రానుంది. అన్ని ముహూర్తాలు ఒకే సమయానికి ఉండడం, ఆయా రూట్లలో వీఐపీల రాకపోకలకు తోడు వ్యక్తిగత వాహనాలు, ఆటోలు, ఇతర జిల్లాల నుంచి నగరానికి వచ్చే వాహనాలు ఒక్కసారిగా నగర రోడ్లను ముంచెత్తనుండడంతో అడుగు తీసి వేసే పరిస్థితి ఉండదని పలువురు అంటున్నారు.