minister s son
-
పదవి లేకున్నా శంకుస్థాపనలు చేస్తున్న మంత్రి తనయుడు
పశ్చిమగోదావరి, పోడూరు: రాష్ట్ర కార్మిక, ఉపాధి కల్పనశాఖ మంత్రి పితాని సత్యనారాయణ ప్రాతినిధ్యం వహిస్తున్న ఆచంట నియోజకవర్గంలో ప్రజాస్వామ్యం అపహాస్యమవుతోంది. ఏ పదవీ లేకున్నా మంత్రి పితాని తనయుడు వెంకట్ నియోజకవర్గంలో ప్రభుత్వం తలపెట్టిన పనులకు శంకుస్థాపనలు చేసేస్తున్నారు. పోడూరు మండలం తూర్పుపాలెంలో ఇటీవలే బీసీ కమ్యునిటీ హాలు నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు. ఈ భవనం నిర్మాణానికి ప్రభుత్వ నిధులు రూ.10 లక్షలు మంజూరయ్యాయి. పెనుగొండ మండలం ఇలపర్రు గ్రామంలో కూడా మంత్రి తనయుడు వెంకట్ ఇటీవల ఎస్సీ కమ్యునిటీ హాలు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఏహోదా లేకుండానే.. సాధారణంగా ప్రభుత్వ నిధులతో ప్రభుత్వశాఖల పర్యవేక్షణలో చేపట్టే ఏ అభివృద్ధి పని నిర్మాణ పనులకైనా శంకుస్థాపన, ప్రారంభోత్సవాలను ప్రజాప్రతినిధుల హోదాలో సర్పంచ్లు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, ఎమ్మెల్యేలు, మంత్రుల హోదాలో ఉన్నవారు చేస్తారు. అయితే దీనికి భిన్నంగా కొన్నిచోట్ల మంత్రి తనయుడు శంకుస్థాపనలు నిర్వహించడం విమర్శలకు తావిస్తోంది. తూర్పుపాలెంలో మంత్రి తనయుడు నిర్వహించిన శంకుస్థాపన కార్యక్రమానికి పంచాయతీ కార్యదర్శి , ఐకేపీ సిబ్బంది హాజరయ్యారు. పనులు మాత్రం పూర్తి కావడం లేదు అలాగే 10 ఏళ్ల కిందట పెనుగొండ మండలం వెంకట్రామపురంలో కూడా ఎస్సీ కమ్యూనిటీ హాలు నిర్మాణానికి మంత్రి తనయుడు వెంకట్ శంకుస్థాపన నిర్వహించగా ఇంతవరకు పనులు పూర్తి కాలేదు. అప్పటి నుంచి భవన నిర్మాణం పూర్తి చేయాలని మంత్రి పితాని దగ్గరకు తిరగడానికి దాదాపుగా రూ.25 వేలు ఖర్చయ్యాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల కమిషన్కుఫిర్యాదు చేసే యోచనలో ప్రతిపక్షం మంత్రి తనయుడు వెంకట్ ఇలపర్రు, వెంకట్రామపురంలో ఎస్సీ కమ్యూనిటీ హాలు నిర్మాణ పనులకు శంకుస్థాపన నిర్వహించడంపై పెనుగొండ మండల వైఎస్సార్ సీపీ ఎస్సీసెల్ కన్వీనర్ బళ్ల శ్రీను(బద్రి) ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేస్తానని ఇటీవల పత్రికా విలేకరుల సమావేశంలో పేర్కొన్న సంగతి విదితమే. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజాప్రతినిధుల చేతులమీదుగా జరగాల్సిన శంకుస్థాపనలు, ప్రారంభోత్సవ కార్యక్రమాలు ప్రైవేటు వ్యక్తుల చేతుల మీదుగా జరపడం ఏమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు. దీనికి ప్రభుత్వ అధికారులు, అధికార పార్టీ ప్రజాప్రతినిధులు వంతపాడటంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
మద్యం మత్తులో మంత్రి కొడుకు వీరంగం
-అర్ధరాత్రి లేడీస్ హాస్టల్లోకి చొరబడేందుకు యత్నం -పోలీసులకు సమాచారం అందించిన స్థానికులు -మంత్రి తనయుడని తెలిసి వదిలేసిన పోలీసులు -శనివారం రాత్రి జరిగిన ఘటన.. ఆలస్యంగా వెలుగుచూసిన వైనం సాక్షి, గుంటూరు: అసలే మంత్రిగారి అబ్బాయ్... ఆపై మద్యం సేవించాడు.. ఇంకేముంది అర్ధరాత్రి లేడీస్ హాస్టల్ వద్దకు వెళ్లి నానా యాగీ చేశాడు.. ఓ దశలో హాస్టల్లోకి చొరబడేందుకు యత్నించాడు.. మంత్రిగారి అబ్బాయ్ ఉన్నాడు కదా అనే ధైర్యంతో పక్కనే ఉన్న అతడి ఇద్దరు స్నేహితులు సైతం మద్యం మత్తులో రెచ్చిపోయారు. అడ్డుపడితే దాడికి దిగుతారనే భయంతో హాస్టల్ వాచ్మన్, స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. మంత్రి తనయుడితోపాటు స్నేహితులిద్దరినీ పోలీస్ స్టేషన్కు తరలించిన పోలీసులకు అసలు విషయం తెలిసి అవాక్కయ్యారు. అదే సమయంలో మంత్రి నుంచి ఫోన్ రావడంతో రాచమర్యాదలతో సాగనంపారు. పోలీసులు ఈ విషయాన్ని గోప్యంగా ఉంచారు. శనివారం అర్ధరాత్రి సంఘటన జరగగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సంఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి... గుంటూరు నగరంలోని ఓ కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న మంత్రి తనయుడు ఎస్వీన్ కాలనీలో స్నేహితులతో కలిసి రూమ్లో ఉంటున్నారు. మంత్రి కొడుకు ఇద్దరు స్నేహితులతో కలిసి శనివారం రాత్రి ఎస్వీన్ కాలనీలోని ఓ లేడీస్ హాస్టల్ ఎదురుగా ఉన్న ఖాళీ స్థలంలో బహిరంగంగా మద్యం తాగారు. తర్వాత మంత్రి తనయుడు ఎదురుగా ఉన్న లేడీస్ హాస్టల్లోకి వెళ్ళేందుకు యత్నించినట్లు సమాచారం. వీరిని అడ్డుకున్న హాస్టల్ వాచ్మన్, స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. అక్కడకు చేరుకున్న పోలీసులు మంత్రి తనయుడితోపాటు స్నేహితులను పోలీస్స్టేషన్కు తరలించారు. ఇదే సమయంలో మంత్రి నుంచి ఫోన్ రావడంతో అందరినీ రాచమర్యాదలతో ఇంటి వరకూ వెళ్లి దిగబెట్టారు. ఈ విషయం సోమవారం వెలుగులోకి రావడంతో అలాంటిదేమీ జరగలేదంటూ పోలీసులు బొంకుతున్నారు. విషయం ఆనోటా ఈనోటా నగరం మొత్తం పాకడంతో మంత్రి కొడుకైతే ఏం చేసినా వదిలేస్తారా అంటూ నగరవాసులు పోలీసులపై మండిపడుతున్నారు. లేడీస్ హాస్టల్లోకి వెళ్లి ఏదైనా అఘాయాత్యానికి పాల్పడితే ఎవరు బాధ్యత వహిస్తారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలీస్ ఉన్నతాధికారులు ఈ వ్యవహారంపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని వారు అభిప్రాయపడుతున్నారు.