విద్యార్థిని నిలువు దోపిడి చేసిన ఆగంతకులు
దేశ రాజధానిలో ఈశాన్య రాష్ట్రాలకు చెందిన విద్యార్థులపై దాడులు, దోపిడిలు నిరంతరాయంగా కొనసాగుతున్నాయి. దక్షిణ ఢిల్లీలోని నిజాముద్దీన్ సమీపంలోని మణిపూర్ విద్యార్థి (20)ని ముగ్గురు యువకులు అటకాయించి, అతడి వద్ద నుంచి సెల్ ఫోన్తో పాటు రూ. 400 నగదును అపహరించుకుని పోయారు. దాంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు.
సెల్ఫోన్ను రీఛార్జ్ చేసుకునేందుకు వెళ్తుండగా హజ్రత్ నిజాముద్దీన్ దర్గా సమీపంలో ముగ్గురు యువకులు అతనను బెదిరించి సెల్ ఫోన్, నగదు అపహరించారని బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు పోలీసు ఉన్నతాధికారులు సోమవారం వెల్లడించారు.
ఇటీవల న్యూఢిల్లీలోని లజ్పత్ నగర్లోమణిపూర్కు చెందిన విద్యార్థి నిడో తానియాను కొంత మంది విద్యార్థులు వేధించారు. దాంతో కొద్ది పాటి ఘర్షణ చోటు చేసుకుంది. ఆ మరసటి దినమే నిడో తానియా మృతి చెందాడు. దాంతో దేశ రాజధాని హస్తినలోని ఈశాన్య రాష్ట్ర వాసులు ఆందోళనకు దిగారు.
దాంతో న్యూఢిల్లీలో ఈశాన్య రాష్ట్రాల ప్రజల ఎదుర్కొంటున్న ఇబ్బందులు, సమస్యలపై ప్రభుత్వం ఓ కమిటీని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఆ కమిటీ ఏర్పాటుపై ఈశాన్య రాష్ట్రాలకు చెందిన వివిధ సంఘాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. ఏడు రాష్ట్రాలలోని ఏ ఒక్క సంఘాన్ని సంప్రదించకుండా ప్రభుత్వం ఆ కమిటీని ఏర్పాటు చేయడంపై ఆయా సంఘాలు మండిపడుతున్నాయి.