breaking news
manda jagannatham
-
మందా కుటుంబ సభ్యులను ఓదార్చిన కేటీఆర్
హైదరాబాద్, సాక్షి: అనారోగ్యంతో కన్నుమూసిన మందా జగన్నాథంకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నివాళులర్పించారు. చంపాపేటలోని మందా ఇంటికి వెళ్లిన కేటీఆర్.. మంధా పార్థివదేహానికి నివాళులర్పించారు. ఈ సందర్భంలో కుటుంబ సభ్యులను ఆయన ఓదార్చారు. ‘‘మందా జగన్నాథం తెలంగాణ మేలు కోరుకున్న వ్యక్తి. మహాబూబ్ నగర్ అభివృద్ధిని కాంక్షించిన వ్యక్తి ఆయన. రాజకీయాల్లో వివాదరహితుడు ,సౌమ్యుడు. ఆయన మరణంతో తెలంగాణ ఒక సీనియర్ రాజకీయవేత్తను కోల్పోయింది. పాలమూరు జిల్లా రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకున్నారాయన. నాలుగు సార్లు ఎంపీ గా అయన అందించిన సేవలు చిరస్మరణీయం. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నాను’’ అని కేటీఆర్ మీడియాతో అన్నారు. అధికారిక లాంఛనాలతో.. మందా జగన్నాథం అంత్యక్రియల విషయంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింది.ప్రముఖుల సంతాపంమందా జగన్నాథం మృతి పట్ల ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియజేశారు. ఎంపీగా, సామాజిక తెలంగాణ ఉద్యమకారునిగా రాష్ట్రంలో మందా జగన్నాథం పోషించిన పాత్ర మరువరానిదని అన్నారు. జగన్నాథం మరణం తెలంగాణకు తీరని లోటు అని అన్నారు. మందా జగన్నాథం మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం ప్రకటించారు. తెలంగాణ ఉద్యమానికి, బీఆర్ఎస్ పార్టీకి ఆయన అందించిన సేవలను గుర్తు చేసుకున్నారు. జగన్నాథం కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. మందా ప్రస్థానంనాగర్కర్నూల్ జిల్లా ఇటిక్యాలలో 1951 మే 22న జన్మించిన మందా జగన్నాథం.. నాలుగు పర్యాయాలు ఎంపీగా నెగ్గారు. 1996, 1999, 2004 పార్లమెంటు ఎన్నికల్లో తెలుగుదేశం నుంచి 2009లో కాంగ్రెస్ నుంచి గెలిచారు. 2014 తరువాత బీఆర్ఎస్లో చేరారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా సేవలందించారు. గత లోక్సభ ఎన్నికల ముందు బీఎస్పీలో చేరారు. గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో నిమ్స్లో ఆయన చికిత్స పొందుతున్నారు. ఆదివారం సాయంత్రం పరిస్థితి విషమించి కన్నుమూశారు. -
కాసులు దొరవారికి.. కేసులు పనివారిపై..
సాక్షి, సంగారెడ్డి/ సంగారెడ్డి క్రైం: జాతీయ రహదారుల వెంటగల దాబాలు, రెస్టారెంట్లలో రాత్రింబవళ్లు అక్రమ మద్యం విక్రయాలు, అనధికార సిట్టింగ్లు జరుగుతున్నాయి. మహబూబ్నగర్ జిల్లా నాగర్కర్నూల్ ఎంపీ మందజగన్నాథం ఈ అంశంపై ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ శాఖ ఎన్ఫోర్స్మెంట్ డెరైక్టర్కు నెల రోజుల కింద ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై స్పందించిన ఎన్ఫోర్స్మెంట్ డెరైక్టర్ అక్రమ మద్యం విక్రయాలపై చర్యలు తీసుకోవాలని ఆ శాఖ జిల్లాధికారులకు ఆదేశాలు జారీ చేశారు. మెదక్ డివిజన్ డిప్యూటీ కమిషనర్ సయ్యద్ యాసీన్ ఖరేషీ నేతృత్వంలో గత నెల 23 నుంచి ఈ నెల 3 తేదీ వరకు దాడులు జరిగాయి. గజ్వెల్, సిద్దిపేట, తూప్రాన్, మెదక్ ప్రాంతాల్లోని ధాబాల పై దాడులు జరిపి అక్రమ మధ్యం స్వాధీనం చేసుకున్నారు. ఈ వ్యవహారంలో మూడు ధా బా టల యజమానులపై కేసులు పెట్టిన ఎక్సైజ్ అధికారులు మరో మూడు ధాబాల విషయంలో మాత్రం పనివాళ్లపై కేసులు పెట్టారు. గత నెల 14న గజ్వేల్లోని ఆధిత్య ఫ్యామిలీ రెస్టారెంట్, నక్షత్ర ఫ్యామిలీ రెస్టారెంట్పై ఎక్సైజ్ అధికారులు దాడులు జరపగా బీర్ బాటిళ్లు లభ్యమయ్యాయి. అయితే, ఈ రెస్టారెంట్ల యజమానులకు బదులు అందులో పనిచేస్తున్న యువకులపై కేసులు పెటారు. పొట్ట కూటి కోసం ఆధిత్య రెస్టారెంట్లో పనిచేస్తున్న సాయి కుమార్, నక్షత్ర రెస్టారెంట్లో పనిచేస్తున్న ఎల్. వంశిలపై కేసులు పెట్టారు. మెదక్ మండలం పిల్లికొట్యాల వద్ద గల రాజ్దాబాపై ఈ నెల 3న దాడులు జరపగా భారీ మొత్తంలో అక్రమ మద్యం లభ్యమైంది. 18 విస్కీ బాటిళ్లు, 22 బీర్ బాటిళ్లు లభ్యమయ్యాయి. ఈ దాబా యజమానికి బదులు అందులో సప్లయర్గా పనిచేస్తున్న ఎం.శ్రీనివాస్ అనే యువకుడిపై కేసు పెట్టి జైలుపాలు చేశారు. సిద్దిపేటలోని మయూరి, కొకకోలా దాబాలతో పాటు గజ్వేల్లోని యోగేష్ ఫ్యామిలీ దాబాల విషయంలో మాత్రం యజమానులపై కేసులు పెట్టారు. షరా‘మామూళ్లే’ జిల్లాపై నుంచి 65వ, 44వ నంబర్ల జాతీయ రహదారితో పాటు రాజీవ్ రహదారి వెళ్తున్నాయి. ఈ రహదారులపై పక్క రాష్ట్రాల నుంచి నిత్యం వేల సంఖ్యలో వాహనాల రాకపోకలుంటున్నాయి. దీంతో రహదారులకు ఇరువైపుల వందల సంఖ్యలో ధాబాలు, రెస్టారెంట్లు వెలిసాయి. ప్రతి రోజూ తెల్లవారుఝామున వరకు ఈ ధాబాల్లో అక్రమ మద్యాన్ని విక్రయిస్తున్నారు. జిల్లాలో 147 లెసెన్సైడ్ మద్యం దుకాణాలున్నాయి. అయితే, అంతే సంఖ్యలో ధాబాలు, రెస్టారెంట్లలో అక్రమంగా మద్యాన్ని విక్రయిస్తున్నారు. పోలీసు, ఎక్సైజ్ శాఖల అధికారులకు ప్రతి ధాబా నుంచి నెలనెల మామూళ్లు అందుతుండడంతో చూసిచూడనట్లు వ్యవహరిస్తున్నారు. కేసులపై పరిశీలిస్తాం దాబాలు, రెస్టారెంట్లలో అక్రమ మద్యం నిల్వలు లభించినప్పుడు అందుకు బాధ్యులైనవారిపై మాత్రమే కేసులు పెడతాం. గజ్వేల్, మెదక్లోని రెస్టారెంట్లు, దాబాల్లో అక్రమ మద్యం వ్యవహారంలో పనివారిపై కేసులు పెట్టిన విషయంపై పరిశీలన చేస్తాం. -డేవిడ్ రవికాంత్, అసిస్టెంట్ కమిషనర్, మెదక్ జిల్లా