breaking news
latin american countries
-
పరాయి దేశాలపై సైనిక చర్య?.. ట్రంప్ మరో సంచలన నిర్ణయం
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో సంచలన నిర్ణయం వైపు అడుగులేస్తున్నారు. లాటిన్ అమెరికా దేశాల్లో సైనిక చర్య చేపట్టే యోచనలో ఉన్నారు. డ్రగ్ కార్టెల్స్ను ఇదివరకే ఉగ్రసంస్థలుగా గుర్తించిన ఆయన.. వాటిపై ఉక్కుపాదం మోపే క్రమంలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.జనవరిలో అధ్యక్ష హోదాలో వైట్హౌజ్లో అడుగుపెట్టిన వెంటనే.. లాటిన్ దేశాలకు చెందిన పలు కార్టెళ్లను జాతీయ భద్రతా ప్రమాదంగా గుర్తించే ఎగ్జిక్యూటివ్ ఆర్డర్పై సంతకం చేశారాయన. ‘‘లాటిన్ అమెరికాలో చాలా కార్టెళ్లు ఉన్నాయి. వాటిల్లో మాదకద్రవ్యాలు ప్రవహిస్తున్నాయి. వాటి నుంచి మన దేశాన్ని ఎలాగైనా రక్షించాలి’’ అని ఆ సందర్భంలో ఆయన వ్యాఖ్యానించారాయన. ఈ క్రమంలోనే అలాంటి కార్టెళ్లను లక్ష్యంగా చేసుకుని సైనిక చర్య చేపట్టే అవకాశం ఉందని ప్రముఖ అమెరికన్ మీడియా సంస్థలు కథనాలు ఇస్తున్నాయి.2025 ఫిబ్రవరిలో మెక్సికో, వెనిజులా దేశాల్లోని ఎనిమిది డ్రగ్ కార్టెళ్లను అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థలుగా అమెరికా గుర్తించింది. ఇందులో మెక్సికో సినాలోవ్, వెనిజులా ట్రెన్ డె అరగ్వా ప్రధానంగా ఉన్నాయి. తర్వాతి రోజుల్లో వెనిజులాకే చెందిన సన్స్(Suns) అనే మరో కార్టెల్ను చేర్చింది అమెరికా. గత 20 ఏళ్లుగా ఈ కార్టెల్ నుంచే అమెరికాకు టన్నుల కొద్దీ మాదకద్రవ్యాలు అక్రమ రవాణా అవుతున్నాయని అమెరికా అంటోంది. అంతేకాదు ఈ కార్టెల్ను వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురోనే నడిపిస్తున్నారని అమెరికా ఆరోపించగా.. ఆయన ఆ ఆరోపణలను ఖండించారు కూడా. న్యూయార్క్ టైమ్స్ కథనం ప్రకారం.. ప్రత్యేక బలగాలు, ఇంటెలిజెన్స్ మద్దతుతో సైనిక చర్యకు సిద్ధమవ్వాలని.. అవసరమైతే అంతర్జాతీయ మిత్రదేశాల సహకారంతో ముందుకు వెళ్లాలని అమెరికా రక్షణ విభాగం పెంటగాన్ను ట్రంప్ ఆదేశించారు. ఇదే విషయాన్ని వాల్ స్ట్రీట్ జనరల్ సైతం ప్రచురించింది. అయితే.. అమెరికా అధ్యక్ష కార్యాలయం వైట్హౌజ్ ఈ విషయాన్ని ధృవీకరించలేదు. కానీ అధ్యక్ష భవన ప్రతినిధి అన్నా కెల్లీ మాట్లాడుతూ.. అమెరికాను రక్షించడం ట్రంప్ తొలి ప్రాధాన్యం. ఇప్పటికే పలు కార్టెల్స్ను ఉగ్రసంస్థలుగా ఆయన ప్రకటించారు. ఈ క్రమంలో సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకునేందుకు కూడా ఆయన వెనకాడరని గుర్తించాలి అని అన్నారు. సైనిక చర్యను అనుమతిస్తాయా?ఒక దేశపు సైన్యాన్ని.. మరొక దేశంలో ప్రయోగిస్తామంటే ఊరుకుంటారా?. తాజా అమెరికా సైనిక చర్య కథనాలపై మెక్సికో అధ్యక్షురాలు క్లాడియా షీన్బౌమ్ స్పందించారు. ‘‘మాదక ద్రవ్యాల కట్టడికి ఇరు దేశాలు(అమెరికా, మెక్సికో) కలిసే పని చేస్తున్నాయి. ఇప్పటికే మేం ఆ దేశానికి సహకరిస్తున్నాం కూడా. అలాంటప్పుడు సైనిక చర్య దేనికి?. ఇది స్వాగతించదగ్గ నిర్ణయం ఏమాత్రం కాదు. ఎట్టి పరిస్థితుల్లో అమెరికా సైన్యాన్ని మా దేశంలో అడుగుపెట్టనివ్వం’’ అని పేర్కొన్నారు. మెక్సికో విదేశాంగ శాఖ కూడా అమెరికా సైనిక జోక్యం కథనాలను ఖండిస్తూ.. అలాంటి చర్యలకు అనుమతించబోమని స్పష్టం చేసింది.సైనిక చర్య.. ట్రంప్ ప్లాన్ ఎలాగంటే.. విదేశీ మిత్ర దేశాలతో సమన్వయంసముద్రంలో, విదేశీ భూభాగాల్లో నేరగాళ్లపై దాడులుఈ దాడుల్లో స్పెషల్ ఫోర్సెస్, గూఢచర్య సంస్థలు పాల్గొనే ఛాన్స్అమెరికా తగ్గేదే లే..అయితే.. అమెరికా మాత్రం ఇది దేశ భద్రతకు సంబంధించిన విషయమని చెబుతోంది. అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రుబియో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. కార్టెల్స్ అనే వాటిని కేవలం మాదకద్రవ్యాల విక్రయ సంస్థలుగా కాకుండా ఆయుధాలతో కూడిన ఉగ్రవాద సంస్థలుగానే పరిగణించాలి. ఈ గుర్తింపుతోనే ఇకపై ఇది అమెరికాకు జాతీయ భద్రతా సమస్యగా మారింది. తద్వారా వాటి కార్యకలాపాలపై అమెరికా గూఢచర్య సంస్థలు, రక్షణ శాఖలను ప్రయోగించబోతున్నాం అని పేర్కొన్నారాయన. -
యూఎస్లో లాటిన్ రగడ
వలసదారుల రగడతో అమెరికా భగ్గుమంటోంది. అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపే క్రమంలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేపట్టిన చర్యలు వివాదాలకు దారితీస్తున్నాయి. మెక్సికో వంటి లాటిన్ అమెరికా దేశాల వలసదారులు వాటిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అక్రమ వలసదారులనే అభియోగాలతో లాస్ ఏంజెలెస్లో గత శుక్రవారం పదుల సంఖ్యలో లాటిన్ ప్రజలను ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ (ఐసీఈ) విభాగం అరెస్టు చేసింది. వాటిని వ్యతిరేకిస్తూ మొదలైన ఆందోళనలు చూస్తుండగానే తీవ్ర రూపు దాలుస్తున్నాయి. లాటిన్లు భారీ సంఖ్యలో రోడ్లపైకి వచ్చి నిరసనలకు విధ్వంసానికి పాల్పడుతున్నారు. జాతీయ బలగాల మోహరింపు, మూకుమ్మడి అరెస్టులతో కూడా పరిస్థితి అదుపులోకి రాలేదు. అల్లర్లు ఇతర నగరాలకూ విస్తరిస్తుండటంతో లాస్ ఏంజెలెస్లో తాజాగా కర్ఫ్యూ విధించాల్సి వచి్చంది. ఈ నేపథ్యంలో అమెరికాలో మొత్తం అక్రమ వలసదారులు, వారిలో లాటిన్ అమెరికన్లు ఎందరన్న దానిపై చర్చ జరుగుతోంది. అంతటా మెక్సికన్ జెండాలే! లాస్ ఏంజెలెస్ అల్లర్లలో పాల్గొంటున్న నిరసనకారుల్లో ఎవరి చేతుల్లో చూసినా మెక్సికో జెండాలే కన్పిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో దేశాలవారికి కలల గమ్యస్థానం అమెరికా. దాంతో అనేక దేశాల నుంచి వలసదారులు అక్కడికి సమక్రమ, అక్రమ మార్గాల్లో పోటెత్తుతూ వచ్చారు. 2022 గణాంకాల ప్రకారమే అమెరికాలో కోటి 10 లక్షల మందికి పైగా అక్రమ వలసదారులున్నారు. వారిలో ఏకంగా 77 శాతం, అంటే 79 లక్షల పై చిలుకు లాటిన్ అమెరికన్లే. వారిలోనూ ఏకంగా 41 లక్షలతో మెక్సికో తొలిస్థానంలో ఉంది. సెంట్రల్ అమెరికా దేశాల వారు 21 లక్షలు, దక్షిణ అమెరికా నుంచి 10 లక్షలు, కరీబియన్ దీవుల నుంచి 7.3 లక్షల మంది ఉన్నారు. మరోవైపు మూడేళ్లుగా అమెరికాకు వెళ్తున్న శరణార్థుల సంఖ్య కూడా బాగా పెరుగుతోంది. 2016లో 85 వేలుగా నమో దైన శరణార్థులు 2021 నాటికి 11 వేలకు తగ్గారు. కానీ 2024లో ఏకంగా లక్ష మంది పొట్ట చేతపట్టుకుని అమెరికాలో ప్రవేశించారు. వీరిలో ఆఫ్రికా, దక్షిణాసియా దేశాల వారి సంఖ్యే ఎక్కువ. – సాక్షి, నేషనల్ డెస్క్ -
Brazil and Peru: ఆ లాటిన్ అమెరికా దేశాల్లో... ‘లా’వొక్కింతయు లేదు!
దక్షిణ అమెరికాలో ముఖ్య దేశాలైన బ్రెజిల్, పెరు ఆందోళనలతో అట్టుడుకుతున్నాయి. బ్రెజిల్లో మాజీ అధ్యక్షుడే తన మద్దతుదారులను రెచ్చగొడుతూ దేశాన్ని రావణకాష్టం చేస్తుండగా, పెరులో పదవీచ్యుతుడైన అధ్యక్షునికి మద్దతుగా ప్రజలే దేశవ్యాప్తంగా భారీ సంఖ్యలో రోడ్లెక్కుతున్నారు! బ్రెజిల్లో నిరసనకారులు అధ్యక్ష భవనంతో పాటు ఏకంగా పార్లమెంటు, సుప్రీంకోర్టు వంటి రాజ్యాంగ సంస్థల భవనాలపైనే దాడికి దిగి విధ్వంసం సృష్టించారు. పెరులోనూ జనం రాజధానితో పాటు దేశమంతటా భారీగా ఆందోళనలకు దిగుతూ అట్టుడికిస్తున్నారు. వీటికి సమీప భవిష్యత్తులో కూడా తెర పడే సూచనలు కన్పించడం లేదు! బ్రెజిల్ బేజారు బోల్సొనారో అనుయాయుల అరాచకం కొత్త అధ్యక్షుడు డ సిల్వా ఆపసోపాలు దక్షిణ అమెరికాలో కొంతకాలంగా ‘గులాబి గాలి’ వీస్తోంది. చాలా దేశాల్లో ప్రధానంగా వామపక్ష భావజాలమున్న పార్టీలే అధికారంలోకి వస్తున్నాయి. ఈ ఖండంలోని అతి పెద్ద దేశమైన బ్రెజిల్లోనూ అదే జరిగింది. గత అక్టోబర్లో జరిగిన ఎన్నికల్లో రైట్ వింగ్ నాయకుడైన జెయిర్ బోల్సొనారో వెంట్రుకవాసి తేడాలో ఓటమి చవిచూశారు. 51 శాతం ఓట్లతో వామపక్ష నేత లూయిజ్ ఇనాసియో లులా డ సిల్వా నెగ్గారు. కానీ ఈ ఫలితాలను ఒప్పుకుని గద్దె దిగేందుకు బోల్సొనారో ససేమిరా అన్నారు. తనకు వ్యతిరేకంగా ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని, వాటికి సుప్రీంకోర్టు మద్దతూ ఉందని ఆరోపణలు గుప్పించారు. ఈవీఎంలపైనా అనుమానాలు వ్యక్తం చేశారు. తర్వాతి పరిణామాల్లో అజ్ఞాతంలోకి వెళ్లిన ఆయన, అవినీతి ఆరోపణలపై విచారణను తప్పించుకునేందుకు అంతిమంగా అమెరికాలో తేలారు! కానీ, ‘‘అధికారం మీ చేతుల్లోనే ఉంది. సైన్యం ఇప్పటికీ నా మాటే వింటుంది. దొంగల పాలనను కూలదోయండి’’ అంటూ అక్కడినుంచే తన మద్దతుదారులను రెచ్చగొడుతూ వస్తున్నారు. ఫలితంగా కొంతకాలంగా బ్రెజిల్ అల్లర్లు, ఆందోళనలు, గొడవలతో అట్టుడుకుతోంది. పార్లమెంటుపై దాడులు ముఖ్యంగా జనవరి 8న కరడుగట్టిన బోల్సొనారో మద్దతుదారులు ఉన్నట్టుండి వేల సంఖ్యలో అధ్యక్ష భవనం, పార్లమెంటు, సుప్రీంకోర్టు భవనాల్లోకి చొరబడి విధ్వంసం సృష్టించారు. సైన్యం తిరగబడి ఎన్నికల ఫలితాలను రద్దు చేసి బోల్సొనారోను తిరిగి అధ్యక్షున్ని చేయాలనే డిమాండ్తో అరాచకానికి దిగారు. ఆ సమయంలో భద్రతా దళాలు చేష్టలుడిగి చూస్తూ ఉండిపోయాయి. పైగా ఆందోళనలు జరుగుతుండగానే పలువురు నేతలు, అధికారులు నవ్వుతూ ఫొటోలు తీసుకుంటూ కన్పించారు! నిజానికి అప్పటికి పది వారాలుగా నిరసనకారులు ఏకంగా ఆర్మీ హెడ్ క్వార్టర్స్ ముందే టెంట్లు వేసుకుని మరీ ఆందోళనలు చేస్తున్నా వాటిని ఆదిలోనే తుంచేసేందుకు డ సిల్వా పెద్దగా ప్రయత్నాలు చేయలేదు. తిరుగులేని ప్రజాదరణ లులా డ సిల్వా సొంతమైనా కీలక సైన్యం మద్దతు ఆయనకు లేకపోవడమే ఇందుకు ప్రధాన కారణమన్న వ్యాఖ్యలు వినిపించాయి. దాంతో పరిస్థితిని ఏదోలా అదుపులోకి తెచ్చేందుకు డ సిల్వా కిందా మీదా పడుతున్నారు. ► మాజీ న్యాయ మంత్రి ఆండెర్సన్ టోరెస్తో పాటు పలువురు బోల్సొనారో సన్నిహితులను అరెస్టు చేశారు. ► సైన్యం తిరుగుబాటుకు ప్రయత్నిస్తోందన్న వార్త నేపథ్యంలో జనవరి 8 ఆందోళనలకు బాధ్యున్ని చేస్తూ ఆర్మీ చీఫ్ను తాజాగా తొలగించారు. ► అల్లర్ల వెనక బోల్సొనారో హస్తంపై విచారణ జరుపుతామని సుప్రీంకోర్టు ప్రకటించింది. ఏం జరగనుంది... పరిస్థితులను చూస్తుంటే దేశంలో అల్లర్లకు ఇప్పట్లో అడ్డుకట్ట పడే సూచనలు కన్పించడం లేదు. అవినీతి ఆరోపణలపై ఇటీవలే ఏడాదిన్నర పాటు ఊచలు లెక్కించిన డ సిల్వాకు దేశాన్ని పాలించే అర్హత లేదంటూ బోల్సొనారో మద్దతుదారులు ఇప్పటికీ దేశవ్యాప్తంగా చెలరేగిపోతూనే ఉన్నారు. సైన్యం పూర్తి మద్దతు లేకపోతే వాటికి డ సిల్వా ఏ మేరకు అడ్డుకట్ట వేయగలరన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఇప్పటికే పలుమార్లు సైనిక కుట్రలను, నియంతల పాలనలను చవిచూసిన బ్రెజిల్లో మరోసారి అలాంటి పరిస్థితులు తలెత్తుతాయో, ప్రశాంత పరిస్థితులు నెలకొంటాయో వేచి చూడాల్సిందే. పెరు.. పేదల తిరుగుబాటు అధ్యక్షురాలు బొలార్టేపై వెల్లువెత్తిన వ్యతిరేకత మాజీ అధ్యక్షుడు కాస్టిలోకు మద్దతుగా ఆందోళనలు ఆమె పేరు మార్గరిటా కొండొరీ. పెరులో ఆండీస్ పర్వత శ్రేణుల్లోని అత్యంత వెనకబడ్డ పునో ప్రావిన్స్లో స్థానిక అయ్మారా తెగకు చెందిన వృద్ధురాలు. వయోభారాన్ని కూడా లెక్క చేయకుండా రెండు రోజుల పాటు అత్యంత కఠినమైన బస్సు ప్రయాణం చేసి మరీ రాజధాని లిమా చేరుకుంది. ‘‘మేమంతా పేదరికంలో మగ్గుతున్నాం. మాపై ఉగ్రవాద ముద్ర వేసినా పర్లేదు. బొలార్టే రాజీనామా చేసేదాకా రాజధాని నుంచి కదిలే ప్రసక్తే లేదు’’ అంటూ సహచర ఆందోళనకారులతో కలిసి పెద్దపెట్టున నినదిస్తోంది. పెరులో దాదాపు ఆరు వారాలుగా ఇదే పరిస్థితి! స్థానిక తెగలకు చెందిన వామపక్ష ఫైర్ బ్రాండ్ నాయకుడు కాస్టిలోను అధ్యక్ష పదవి నుంచి కూలదోసి జైలుపాలు చేసి ఉపాధ్యక్షురాలు దినా బొలార్టే గత డిసెంబర్ 7న అధికారాన్ని చేజిక్కించుకున్నారు. అప్పటినుంచీ ఆమెకు వ్యతిరేకంగా మొదలైన ప్రజాందోళనలు నానాటికీ తీవ్ర రూపు దాలుస్తున్నాయి. దేశమంతటికీ వ్యాపించడమే గాక హింసాత్మకంగా మారుతున్నాయి. మార్గరిటా మాదిరిగా అత్యంత మారుమూల ప్రాంతాల నుంచి కూడా జనం అత్యంత వ్యయ ప్రయాసలకోర్చి మరీ లిమాకు ప్రవాహంలా వచ్చి పడుతున్నారు. బొలార్టే తప్పుకుని ఎన్నికలు ప్రకటించే దాకా దాకా ఇంచు కూడా కదిలేది లేదని భీష్మిస్తున్నారు. భద్రతా దళాలపైకి రాళ్లు రువ్వుతూ ఢీ అంటే ఢీ అంటున్నారు. ఏమిటి సమస్య? ప్రపంచంలో రెండో అతి పెద్ద రాగి ఉత్పత్తిదారు అయిన పెరులో 1990 నుంచి దశాబ్దకాలపు నియంతృత్వ పాలన అనంతరం 2000లో ప్రజాస్వామ్య పవనాలు వీచాయి. 2001 నుంచి 2014 దాకా జోరుగా సాగిన ఖనిజ నిల్వల ఎగుమతితో జీడీపీ రెట్టింపు వృద్ధి రేటుతో దూసుకుపోయింది. కార్మికుల వేతనాలూ ఇతోధికంగా పెరిగాయి. కానీ గ్రామీణ ప్రాంతాలు మాత్రం బాగా నిర్లక్ష్యానికి గురవుతూ వచ్చాయి. సంపదంతా ప్రధానంగా నగర ప్రాంతాల్లో కేంద్రీకృతమైంది. మరోవైపు అవినీతి, అవ్యవస్థ నానాటికీ పెచ్చరిల్లాయి. స్థానిక ప్రభుత్వ పెద్దలు బడ్జెట్ కేటాయింపులను ఇష్టారాజ్యంగా భోంచేయడం ప్రారంభించారు. దాంతో కొన్నేళ్లుగా దేశంలో రాజకీయ అస్థిరత రాజ్యమేలుతోంది. గత రెండేళ్లలోనే ఏకంగా ఐదుగురు అధ్యక్షులు మారారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఈ క్రమంలో లెఫ్టిస్టు అయిన కాస్టిలోపైనా పలు అవినీతి ఆరోపణలు వెల్లువెత్తాయి. విచారణల దాకా వెళ్లడమే గాక రెండుసార్లు అభిశంసన ప్రయయత్నాలూ జరిగాయి. గత డిసెంబర్లో మరోసారి అభిశంసనకు రంగం సిద్ధమవడంతో కాంగ్రెస్ను రద్దు చేసి డిక్రీ ద్వారా పాలించేందుకు కాస్టిలో విఫలయత్నం చేశారు. అదే అభియోగంపై చివరికి ఆయన్ను పదవి నుంచి దింపి ఖైదు చేసి బొలార్టే పదవిలోకి వచ్చారు. కానీ గ్రామీణ ప్రాంతాల్లో, ముఖ్యంగా పేదల్లో కాస్టిలోకు విపరీతమైన ఆదరణ ఉండటంతో ఈ పరిణామాన్ని వ్యతిరేకిస్తూ నిరసనలు మిన్నంటాయి. ఆందోళనలకు ఇప్పటిదాకా దేశవ్యాప్తంగా 50 మందికి పైగా బలయ్యారు. అల్లకల్లోలం ► ఆందోళనల దెబ్బకు దేశంలో అవ్యవస్థ రాజ్యమేలుతోంది. ఇప్పటికే ఎమర్జెన్సీ విధించారు. రోడ్డు, రైలు, విమాన తదితర రవాణా సేవలన్నీ స్తంభించాయి. ► మైనింగ్ తదితర కార్యకలాపాలకూ తీవ్ర విఘాతం కలిగింది. ► అపారమైన ఖనిజ నిల్వలున్నా పేదరికంలో మగ్గుతున్న దక్షిణ ప్రాంతాల్లో నిరసనలు బాగా జరుగుతున్నాయి. ► వీటిపై బొలార్టే బలప్రయోగానికి దిగుతున్నారు. అవసరమైతే ఉక్కుపాదం మోపుతామని ప్రకటిస్తున్నారు. ఇది మరింత అస్థిరతకు, సామాజిక విభజనకు దారి తీస్తుందని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. – సాక్షి, నేషనల్ డెస్క్ -
అబార్షన్లకు పెరిగిన డిమాండ్!
లాటిన్ అమెరికా దేశాలలో ప్రస్తుతం అబార్షన్లకు డిమాండ్ బాగా పెరిగిపోయిందట. దీనంతటికీ కారణం.. ఆ ప్రాంతాల్లో విపరీతంగా విస్తరిస్తున్న జికా వైరస్ భయం. ప్రధానంగా బ్రెజిల్ లాంటి దేశాలలో అబార్షన్లు చేయాలంటూ ముందుకొచ్చే మహిళల సంఖ్య ఇటీవలి కాలంలో రెట్టింపు అయిందట. ఇతర దేశాలలో కూడా అబార్షన్ల సంఖ్య బాగా పెరిగిందని వైద్యులు అంటున్నారు. ఈ వైరస్ కారణంగా పుట్టే పిల్లల మెదడు చాలా చిన్నగా ఉంటుందని, దాన్ని మైక్రోసెఫాలీ అంటారని.. అందువల్ల ఇప్పట్లో గర్భం దాల్చొద్దని చాలా ప్రభుత్వాలు మహిళలకు సలహాలు ఇచ్చాయి. దాంతో, ఆస్పత్రులలో అబార్షన్లతో పాటు అబార్షన్ అయ్యేందుకు ఉపయోగపడే మాత్రలను సరఫరా చేసే ఆన్లైన్ స్టోర్లకు కూడా తాకిడి పెరిగింది. 2015 నవంబర్ 17వ తేదీన అమెరికా ఆరోగ్య సంస్థ తొలిసారిగా జికా వైరస్ గురించిన హెచ్చరిక జారీచేసింది. ఆ తర్వాతి నుంచి బ్రెజిల్, ఈక్వెడార్ దేశాలలో గర్భిణులు అబార్షన్లవైపు ఎక్కువగా మొగ్గుచూపారు. కానీ ఇప్పటికీ చాలావరకు లాటిన్ అమెరికా దేశాలలో అబార్షన్లు చట్టవిరుద్ధం. దాంతో చాలామంది అనధికారికంగానే చేయించుకుంటున్నారు. -
పెరూలో భారీ భూకంపం
లీమా: దక్షిణ అమెరికా ఖండంలోని పెరూలో భారీ భూకంపం సంభవించింది. స్థానిక కాలమానం ప్రకారం మంగళవారం సాయంత్రం 5:45 గంటల నుంచి దాదాపు అరగంటపాటు భూమి కంపించింది. భూ ఉపరితలానికి 602 కిటోమీటర్ల లోతులో సంభవించిన ఈ భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 7.5 గా నమోదయింది. ప్రాణ, ఆస్తి నష్టం వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. కాగా, పెరూ భూకంపంతో లాటిన్ అమెరికా దేశాలన్నీ చిగురుటాకుల్లా వణికిపోయాయు. బ్రిజిల్, బొలీవియా, చిలీ, కొలంబియా, ఈక్వెడార్, అర్జెంటీనాల్లోనూ ప్రకంపనలు చోటుచేసుకున్నాయని స్థానిక మీడియా రిపోర్ట్ చేసింది. అయితే భూకంప కేంద్రం భూతలానికి చాలా లోతులో ఉండటం వల్ల నష్టతీవ్రత అంతగా ఉండకపోవచ్చని నిపుణులు అంచనావేస్తున్నారు.