breaking news
Kranti Kumar Reddy
-
ఆరాగించండి
మాగిన పండులా మేను మిలమిలలాడటం ఎలా? ఒళ్లు చేయకుండా తీగలా సాగడం ఎలా? ఆరోగ్యం కోటలో పాగా వేయడం ఎలా? రాగులతో చేసిన వంటలు తింటే చాలు! మరి... అవి వండుకోవడం ఎలా? ఏముంది మన ఫ్యామిలీ చదివితే చాలు. రాగి అంబలి కావలసినవి: రాగిపిండి - అరకప్పు; ఉల్లి తరుగు- అరకప్పు పచ్చిమిర్చి తరుగు- ఒక చెంచా; జీలకర్ర పొడి- ఒక చెంచా కరివేపాకు- ఒక రెమ్మ ; కొత్తిమీర తరుగు - ఒక కప్పు ఉప్పు- తగినంత; మజ్జిగ- రెండు కప్పులు తయారీ: రాగిపిండిలో ఒక కప్పు నీరు కలపాలి. ఈ ద్రవాన్ని అరలీటరు మరుగుతున్న నీటిలో పోసి అడుగు పట్టకుండా గరిటెతో కలుపుతూ ఐదారు నిమిషాల సేపు ఉడికించాలి. ఈ మిశ్రమం చల్లారిన తర్వాత మజ్జిగ, పచ్చిమిర్చి తరుగు, ఉప్పు, జీలకర్ర పొడి, కొత్తిమీర, కరివేపాకు కలపాలి. రుచి ఇనుమడించాలంటే కొద్దిగా నిమ్మరసం కలుపుకోవచ్చు. ఇది ఎండాకాలం వేసవి తాపాన్ని తగ్గించడానికి బాగా పనికొస్తుంది. రాగి- మెంతి రొట్టె కావలసినవి: రాగిపిండి - ఒక గ్లాసు గోధుమ పిండి- పావు గ్లాసు; ఉప్పు - తగినంత ఉల్లి తరుగు- అర కప్పు; మెంతి ఆకులు- ఒక కప్పు పచ్చిమిర్చి తరుగు- రెండు చెంచాలు అల్లం వెల్లుల్లి పేస్టు- ఒక చెంచా; జీలకర్ర- ఒక చెంచా నూనె లేదా నెయ్యి - కాల్చడానికి తగినంత తయారీ: వెడల్పాటి గిన్నెలో రాగిపిండి, గోధుమపిండి తీసుకుని అందులో ఉల్లితరుగు, ఉప్పు, పచ్చిమిర్చి తరుగు, మెంతికూర, జీలకర్ర, పసుపు, అల్లం వెల్లుల్లి ముద్ద వేసి, నీటిని పోస్తూ చపాతీల పిండిలా కలపాలి. పిండి మీద తడి వస్త్రాన్ని కప్పి 15 నిమిషాల సేపు పక్కన ఉంచాలి. ఆ తర్వాత పిండిని పెద్ద నిమ్మకాయంత గోళీలు చేసుకోవాలి. అట్ల పెనం వేడి చేయాలి. పిండి ముద్దలను రొట్టెలుగా వత్తి పెనం మీద వేసి కొద్ది కొద్దిగా నెయ్యి వేస్తూ రెండు వైపులా కాల్చాలి. వేడిగా తింటే చాలా రుచిగా ఉంటాయి. ఘాటుగా కావాలంటే చట్నీతో తినవచ్చు. గమనిక: ఈ రొట్టెలను వత్తడం చాలా నైపుణ్యంతో కూడిన పని. అరిటాకు మీద వేసి చేత్తో వత్తుకోవచ్చు. చపాతీల పీట మీద రొట్టెల కర్రతోనూ చేసుకోవచ్చు. గోధుమ పిండి లేకుండా కూడా చేసుకోవచ్చు. కానీ కేవలం రాగి పిండితో చేస్తే పెళుసుగా విరిగిపోతుంటాయి. కాబట్టి గోధుమపిండి కలుపుకుంటే రొట్టెలు విరగవు. మధుమేహంతో బాధపడే వాళ్లు ఆహారంలో ఒక పూట రాగి రొట్టెను చేర్చుకోవచ్చు. రాగిలడ్డు కావలసినవి: రాగిపిండి- ఒక కప్పు; బెల్లం- ఒక కప్పు వేయించిన నువ్వులు- అర కప్పు; నెయ్యి- మూడు చెంచాలు ఏలకుల పొడి- ఒక చెంచా; జీడిపప్పు, కిస్మిస్ - పిడికెడు తయారీ: * మందపాటి బాణలిలో రాగిపిండిని (నూనె లేకుండా) దోరగా వేయించాలి. * నేతిలో జీడిపప్పు, కిస్మిస్ వేయించి రాగిపిండిలో వేయాలి. * పావు కప్పు నువ్వులను మిక్సీలో కాస్త పలుకుగా పొడి చేసుకోవాలి. అందులోనే బెల్లం తురుము, ఏలకుల పొడి వేసి మరోసారి బ్లెండ్ చేస్తే సమంగా కలుస్తుంది. నువ్వులలోని నూనె, బెల్లంలోని తేమ కలిసి మిశ్రమం ముద్దగా అవుతుంది. ఈ మిశ్రమాన్ని రాగిపిండిలో వేసి బాగా కలపాలి. * ఇప్పుడు చేతికి నెయ్యి రాసుకుని మిశ్రమాన్ని లడ్డులుగా చేయాలి. లడ్డును వేయించిన నువ్వులలో ముంచి, నువ్వులు లడ్డుకు పట్టించాలి. గమనిక: మిశ్రమం తయారైన తర్వాత అది లడ్డు కట్టడానికి అనువుగా లేదనిపించే ప్రమాదం లేకపోలేదు. పిండి మరీ గట్టిగా ఉంటే మరిగించిన పాలను వేసి కలుపుకోవాలి. మరీ జారుడుగా ఉంటే మరి కొంత రాగిపిండిని లేదా నువ్వుల పొడిని కలుపుకోవాలి. పాలు వేసి కలిపినప్పుడు ఎక్కువ రోజులు నిల్వ చేయరాదు. రాగిజావ కావలసినవి: రాగిపిండి- ఒకకప్పు బెల్లం పొడి- ఒక కప్పు ఏలకుల పొడి- అరచెంచా బాదంపప్పు, పిస్తా- నాలుగు పలుకులు కాచిన పాలు - ఒక కప్పు తయారీ: రాగిపిండిని ఆరు కప్పుల నీటిలో వేసి కలపాలి. తర్వాత మీడియం మంట మీద పెట్టి పిండి అడుగుకు అంటకుండా గరిటెతో కలుపుతూ ఐదు నిమిషాల సేపు ఉడికించాలి. ఇందులో బెల్లం పొడి, ఏలకుల పొడి, బాదం, పిస్తా పలుకులు వేసి సన్నమంట మీద మరో మూడు నిమిషాల సేపు ఉడికించి దించేయాలి. చల్లారిన తర్వాత పాలు కలుపుకుంటే రాగి మాల్ట్ లేదా రాగి జావ రెడీ. గమనిక: మధుమేహం ఉన్న వాళ్లు రాగిమాల్ట్ బెల్లం లేకుండా చేసుకోవచ్చు. పిల్లలు మరింత తియ్యగా ఇష్టపడతారనుకుంటే బెల్లం మోతాదు పెంచుకోవచ్చు. మాల్ట్ తయారీ: రాగిమాల్ట్ తయారీకి రాగిపిండి తయారు చేసుకునే విధానం వేరుగా ఉంటుంది. రాగులను కడిగి రాత్రంతా నానబెట్టి వడబోసి నూలు వస్త్రంలో మూటగట్టాలి. మొలకలు వచ్చిన తర్వాత ఎండబెట్టి మరపట్టించాలి. మొలకెత్తిన రాగుల పిండితో చేసిన జావను మాత్రమే మాల్ట్ అనాలి. మొలకెత్తించిన ధాన్యంలో పోషకాలు పెరుగుతాయి. రాగి కుడుములు కావలసినవి: రాగిపిండి- ఒక కప్పు; బెల్లం - ఒక కప్పు కొబ్బరి కోరు- అర కప్పు; నెయ్యి - రెండు చెంచాలు ఏలకుల పొడి- అర చెంచా తయారీ: రాగిపిండిని బాణలిలో వేసి సన్నమంట మీద (నూనె లేకుండా) దోరగా వేయించాలి. అందులో కొబ్బరి కోరు కలిపి పక్కన ఉంచాలి. * బెల్లాన్ని లేతపాకం పట్టాలి. ఇప్పుడు అందులో రాగిపిండి- కొబ్బరి మిశ్రమం, ఏలకుల పొడి, నెయ్యి వేసి కలపాలి. చపాతీల పిండిలా ఉండాలి. అవసరమైతే పిండి కలిపేటప్పుడు మరికొంత వేడి నీటిని చల్లుకోవచ్చు. * చేతికి నెయ్యి రాసుకుని పిండిని నచ్చిన ఆకారంలో చేసుకుని ఇడ్లీ పాత్రలో పెట్టి ఆవిరి మీద పది నిమిషాల సేపు ఉడికించాలి. పాకం తయారీ: బెల్లంలో పావు కప్పు నీటిని పోసి కరిగిన తర్వాత వడపోయాలి. బెల్లంలో చిన్న రాయి, చెరకు పీచు వంటివి ఉంటే వేరవుతాయి. ఇప్పుడు స్వచ్ఛమైన బెల్లం నీటిని మీడియం మంట మీద కలుపుతూ ఉడికించాలి. మిశ్రమాన్ని వేళ్లతో తాకినప్పుడు వేళ్లకు అతుక్కోవాలి. షెఫ్ : రాంబాబు కర్టెసీ : క్రాంతి కుమార్ రెడ్డి, హైదరాబాద్ -
సేంద్రియ వ్యవసాయమే శరణ్యం
భారత్లో ఉన్న వైవిధ్యాన్ని బట్టి రైతులు వివిధ పంటలు పండించగలరు. కానీ కార్పొరేట్ వ్యవసాయం ఒకే రకమైన పంటను రుద్దుతోంది. ఇది మన ఆహార భద్రతకు ప్రమాదం. అనాదిగా మన రైతాంగం వృద్ధి చేసుకున్న స్వజాతీయ వంగడాలన్నీ కనుమరుగైపోతున్నాయి. జీవ వైవిధ్యం ధ్వంసమౌతున్నది. సేంద్రియ పద్ధతులతో పండించిన ఆహారోత్పత్తుల కోసం ఇప్పుడు మొత్తం ప్రపంచం ఎదురు చూస్తోంది. కానీ మన వ్యవసాయం ఏ దిశగా నడు స్తోంది? ఇక్కడ జరిగిన వ్యవసాయోత్పత్తులలో రసాయనాలు పరిమితికి మించి ఉంటున్నాయన్నది తీవ్రమైన ఆరోపణ. అందుకే మన పంట దిగుబడులను అమెరికా, యూరోపియన్ యూనియన్ నిషేధించాయి కూడా. మనం పండిస్తున్న పళ్లు, కూరగాయలలో నిషేధించిన హానికరమైన రసాయనాలు ఉన్నాయని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ జరిపిన అధ్యయనంలోనూ వెల్లడైంది. అనేక దేశాలలో నిషేధానికి గురైన సింథటిక్ పైరిత్రాయిడ్స్ను మన రైతులు వినియోగించడం వల్ల మన పొలాల నుంచి వచ్చిన పళ్లు, కూరగాయలంటే చాలా దేశాలు భయపడే పరిస్థితి వచ్చింది. ఎండోసల్ఫాన్తో జరిగిన రాద్ధాంతం కూడా మన వ్యవసాయోత్పత్తులకు ఎంతో హాని చేసింది. రెండు విధానాలకు మధ్య ఎంతో తేడా రసాయన ఎరువులు, క్రిమి సంహారక మందుల సాయంతో పండించిన ఆహారోత్పత్తులపైనా; జన్యుమార్పిడి పంటలపైనా జరిగిన అనేక అధ్యయనాలు కలత రేపే ఫలితాలను మన ముందు ఉంచాయి. అలాంటి పంటల వినియోగం వల్ల ప్రజా రోగ్యం, పర్యావరణం తీవ్రంగా నష్టపోతాయి. అందుకే విశ్వ వ్యాప్తంగా ఇలాంటి వ్యవసాయోత్పత్తుల మీద తీవ్ర వ్యతిరేకత ప్రబలుతోంది. సేంద్రియ ఉత్పత్తుల మీద న్యూకాసిల్ విశ్వవిద్యాలయం (బ్రిటన్) 343 అధ్యయనాలు జరిపి, ఆసక్తికరమైన అంశాలను బయటపెట్టింది. సేంద్రియ ఆహారంలో 69 శాతం కంటే ఎక్కువ యాంటీ ఆక్సిడెంట్లు ఉన్నాయని వారు తేల్చారు. అలాగే కేడ్మియం, లిడ్, మెర్క్యురీ వంటి భారీ లోహాలు కూడా సేంద్రియ పంటలలో తక్కువగా ఉన్నాయని తేలింది. రసాయనిక ఎరువులతో దిగుమతి అయిన వ్యవసాయోత్పత్తులతో పోల్చి చూసినపుడు సేంద్రియ పంటలలో నైట్రోజన్ 10 శాతం, నైట్రేట్లు 30 శాతం, నైట్రైట్లు 87 శాతం తక్కువగా ఉన్నాయని ఆ అధ్యయనాలు పేర్కొన్నాయి. భవిష్యత్తు సేంద్రియ పంటలదే సేంద్రియ పద్ధతులలో పండించిన పంటలకు రోజు రోజుకూ ప్రపంచ వ్యాప్తంగా డిమాండ్ పెరుగుతోంది. డెన్మార్క్లో 10 శాతం ఆహార ఉత్పత్తులన్నీ సేంద్రియ వ్యవసాయంతో పండించినవే. అమెరికాలో 5 శాతం ఆహార ఉత్పత్తులు అవే. ప్రస్తుతం దీని మార్కెట్ విలువ 60 బిలియన్ డాలర్లు. ఒక్క యూరప్లోనే వాటి మార్కెట్ విలువ 28 బిలియన్ డాలర్లు. సేంద్రియ ఉత్పత్తుల మార్కెట్ సాలీనా 20 శాతం పెరుగుతోంది. 2016 సంవత్సరానికి ఈ మార్కెట్ విలువ 104.5 బిలియన్ డాలర్లకు చేరుతోంది. ఇక 2020 కల్లా 200 బిలియన్ డాలర్లు దాటిపో తుందని అంచనా. భారతదేశంలో కూడా సేంద్రియ ఉత్పత్తుల మీద ఆసక్తి పెరుగుతోంది. కనుమరుగ వుతున్న దేశీయ విత్తన సంపద వ్యవసాయోత్పత్తులకు మార్కెట్ అవకాశాలు కల్పించవలసిన ప్రభుత్వం, వ్యవసాయాన్నే వ్యవసాయ కార్పొరేషన్లకు మార్కెట్గా తయారు చేస్తోంది. పంట విత్తిన దగ్గర నుంచి నూర్చే వరకు ఆ కార్పొరేషన్ల మీద రైతు ఆధారపడక తప్పని పరిస్థితి ఏర్పడింది. ఒక్క గుంటూరు జిల్లాలోనే పదివేల మంది విత్తన, ఎరువులు, పురుగు మందుల డీలర్లు ఉన్నట్టు అంచనా. హరిత విప్లవంతో మొదలైన కార్పొరేట్ పారిశ్రామిక వ్యవసాయంతో రైతుల ఆత్మహత్యలు, వాతావరణ కాలుష్యం వంటి దుష్పలితాలు సంభవించాయి. ప్రపంచ ఆహార సంస్థ అంచనా ప్రకారం ఒక్క ఆసియాలోనే 50 కోట్ల మంది రైతులు అర్ధాకలితో గడుపుతున్నారు. భారత్లో ఉన్న వైవిధ్యాన్ని బట్టి రైతులు వివిధ పంటలు పండించగలరు. కానీ కార్పొరేట్ వ్యవసాయం ఒకే రకమైన పంటను రుద్దుతోంది. ఇది మన ఆహార భద్రతకు ప్రమాదం. అనాదిగా మన రైతాంగం వృద్ధి చేసుకున్న స్వజాతీయ వంగడాలన్నీ కనుమరుగైపోతున్నాయి. జీవ వైవిధ్యం ధ్వంసమౌతున్నది. బీటీ పత్తి వచ్చిన కొద్దికాలానికే దేశీయమైన పత్తి విత్తనాలన్నీ కనుమరుైగైనాయి. ఇప్పుడు బీటీ తప్ప ఇతర పత్తిని పండించే అవకాశమే లేదు. ఇలాంటి దుస్థితి ఇతర పంటలకు పట్టకుండా చూడాలి. ఇప్పటికైనా మన పాలకులు స్పృహలోకి వచ్చి స్వజాతి విత్తనాలను అభివృద్ధి పరచాలి. రైతులు ఇతర విత్తనాల కోసం పడిగాపులు కాచే పరిస్థితి నుంచి విముక్తం చేసి, వారే విత్తనాలను ఎగుమతి చేయగల స్థితికి తీసుకురావాలి. రైతుకు అనుకూలమైన విత్తన చట్టాన్ని తీసుకురావాలి. మేధో సంపత్తి హక్కులను రైతులకు అనుకూలంగా మలచవలసిన అవసరం ఉంది. ప్రభుత్వం ప్రోత్సహిస్తేనే సాధ్యం సేంద్రియ వ్యవసాయం విస్తరించాలన్నా, ఆ ఉత్పత్తులకు మార్కెట్ అవకాశాలు మెరుగుపడాలన్నా ప్రభుత్వ చొరవతోనే సాధ్యమవుతుంది. ప్రభుత్వం వ్యవసాయ రంగానికి ఇస్తున్న రాయితీలన్నీ రసాయన ఎరువుల, క్రిమి సంహారక మందుల కంపెనీలకే అందుతున్నాయి. జాతీయ ఉద్యానవన మిషన్ సేంద్రియ వ్యవసాయానికి ఇచ్చే రాయితీ రూ. 22 వేలు. ఇందులో అధిక భాగం రసాయన ఎరువులు, క్రిమి సంహారకాలకే పోతోంది. ఇదే సంస్థ సేంద్రియ వ్యవసాయానికి ఇచ్చే సబ్సిడీ హెక్టార్కు ఏడు వేల నుంచి పదివేల రూపాయలు. ఇది చాలదన్నట్టు సేంద్రియ వ్యవసాయ సబ్సిడీ పథకాలన్నీ వ్యవసాయ కమతాన్ని ఒక యూనిట్గా కాకుండా ఒక పంటను యూనిట్గా తీసుకుంటున్నాయి. ఇది వ్యవసాయ విధానానికే విరుద్ధం. ఇంకా ప్రభుత్వ సాయంతో సేంద్రియ వ్యవసాయం చేయాలంటే ఆర్గానిక్ సర్టిఫికేషన్ కావాలి. ఈ సర్టిఫికేషన్ కోసం రైతులు కంపెనీలకు పెద్ద మొత్తంలో సొమ్ము చెల్లించవలసి రావడం మరో విషాదం. సేంద్రియ వ్యవసాయం విస్తరించాలంటే ఈ సర్టిఫికేషన్ విధానం తొలగించాలి. పంటల వారీగా కాకుండా వ్యవసాయ కమతాన్ని లేదా గ్రామాన్ని యూనిట్గా తీసుకోవాలి. వైవిధ్యమైన పంటలు, పంట మార్పిడి, సమగ్ర సస్యరక్షణ, వ్యవసాయానుబంధ రంగాలు పశుపోషణ, పంచగావ్య, జీవామృతం వంటి సేంద్రియ ఎరువుల తయారీ వంటివాటన్నింటికి ప్రోత్సాహం ఇవ్వాలి. అపోహలను తొలగించాలి సేంద్రియ వ్యవసాయం ప్రపంచ ఆహార సమస్యకు పరిష్కారం కాదనీ, ఆకలి తీర్చలేదనీ ప్రచారం ఉంది. ఈ పద్ధతితో దిగుబడులు తగ్గుతాయన్న దుష్ర్పచారం కూడా ఉంది. కానీ ఇవన్నీ అబద్ధాలని పరిశోధనలు చెబుతున్నాయి. రసాయన ఎరువులతో చేసే సేద్యంలో కంటే సేంద్రియ వ్యవసాయం వల్ల దిగుబడులు పెరుగుతాయని, భూసారం కూడా వృద్ధి అవుతుందని బ్రిటన్కు చెందిన బ్రాడ్ బాక్ పరిశోధనలో తేలింది. ఆ రెండు వ్యవసాయ పద్ధతులలో ఏది మేలు అన్న అంశం మీద బ్రాడ్ బాక్ 50 ఏళ్ల నుంచి పరిశోధనలు చేస్తోంది. అమెరికాలో ఆరు విశ్వవిద్యాలయాలలో జరిగిన పరిశోధనలు కూడా ఇదే అంశాన్ని ఏకగ్రీవంగా వెల్లడించాయి. బీహార్లోని నలందా జిల్లాలో ఇద్దరు రైతులు శ్రీవరి సాగులో సేంద్రియ ఎరువులను ఉపయోగించి హెక్టార్కు 120 క్వింటాళ్లు దిగుబడి సాధించారు. ఇది ప్రపంచ రికార్డు కూడా. భాస్కర్ సావే వంటి ఆదర్శ రైతులు సేంద్రియ విధానాల ద్వారా అధిక దిగుబడులను సాధిస్తూనే ఉన్నారు. సుభాష్ పాలేకర్ వ్యాప్తిలోకి తెచ్చిన గోవు ఆధారిత వ్యవసాయానికి కూడా మంచి స్పందన లభించింది. మన రాష్ట్రంలో కూడా ఎందరో రైతులు దేశీయ ఆవుల సాయంతో సేంద్రియ వ్యవసాయాన్ని మొదలు పెట్టారు. ఈ నేపథ్యంలో కూడా రసాయన ఎరువులతో చేసే సేద్యానికి ఇస్తున్న సబ్సిడీలో సేంద్రియ వ్యవసాయానికి దక్కుతున్న సబ్సిడీ 1 శాతమే. ఈ బడ్జెట్లో కూడా దీనికి నిధులు అంతంత మాత్రమే ఇచ్చారు. అది కూడా ఈశాన్య రాష్ట్రాలకు రూ. 100 కోట్లు కేటాయించారు. ఈ ధోరణి మారాలి. సేంద్రియ వ్యవసాయంతో సామాజిక ఆర్థిక లక్ష్యాలు నెరవేడంతో పాటు, ఆహార భద్రత, ఆహార సార్వభౌమాధికారాన్ని కూడా సుసాధ్యం చేసుకోవచ్చు. అదే నిజమైన హరిత విప్లవం. (వ్యాసకర్త జాతీయ ఆయిల్పామ్ రైతు సంఘం ప్రధాన కార్యదర్శి) - డా॥ కె. క్రాంతి కుమార్ రెడ్డి