breaking news
Kashmir Uncertainty
-
వ్యాలీ పులికి.. పులిట్జర్!
కశ్మీర్ అందాలను చూసి తనివితీరా ఆస్వాదించాలని ప్రతి ఒక్కరికీ ఉంటుంది. అంతటి అందమైన లోయలో పుట్టిన ఓ చిన్నారికి తను చూసిన ప్రతిదృశ్యాన్నీ ఫొటో తీయడమంటే ఎంతో ఇష్టం. ఆ ఇష్టమే నేడు ఆమెకు ఎంతో ప్రతిష్టాత్మకమైన పులిట్జర్ ప్రైజ్ను తెచ్చిపెట్టింది. ఆ చిన్నారి మరెవరో కాదు 28 ఏళ్ల సనా ఇర్షాద్ మట్టూ. తాజాగా ప్రకటించిన పులిట్జర్ అవార్డుల లిస్టులో ఫీచర్ ఫొటోగ్రఫీ విభాగంలో డానిష్తోపాటు రాయిటర్స్ వార్తాసంస్థకు చెందిన ఆద్నన్ అబిది, సనా ఇర్షాద్ మట్టూ, అమిత్ దావేలను ఈ అవార్డు వరించింది. శ్రీనగర్కు చెందిన సనాకు చిన్నప్పటి నుంచి ఫొటోగ్రఫీ అంటే చాలా ఇష్టం. చుట్టుపక్కల ఏం జరిగినా వాటిని కెమెరాలో బంధించాలనుకునేది. ఆ ఆసక్తితోనే జర్నలిజంను కెరీర్గా ఎంచుకుంది. కశ్మీర్ సెంట్రల్ యూనివర్సిటీలో జర్నలిజంలో పోస్ట్గ్రాడ్యుయేషన్ చేసింది. చదువయ్యాక కశ్మీర్ మీద డాక్యుమెంటరీలు, విజువల్ స్టోరీలు తీయడం మొదలుపెట్టింది. కశ్మీర్లో చోటుచేసుకుంటోన్న అనేకరకాల పరిస్థితులపై స్పందిస్తూ ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా దాదాపు మూడేళ్లపాటు పనిచేసింది. సనా ఆర్టికల్స్ బావుండడంతో.. ఆల్జజీరా, ద నేషన్, టైమ్ టీఆర్టీ వరల్డ్, పాకిస్థాన్ టుడే, సౌత్చైనా మార్నింగ్ పోస్టు, కర్వాన్ మ్యాగజీన్ వంటి జాతీయ అంతర్జాతీయ మీడియా పబ్లికేషన్స్లో ప్రచురితమయ్యాయి. దీంతోపాటు ఆమె వివిధ అంతర్జాతీయ మీడియా సంస్థలకు ఫొటోజర్నలిస్టుగా కూడా పనిచేస్తోంది. ఈ క్రమంలోనే ఆర్టికల్ 370 రద్దు తర్వాత కశ్మీర్లో ఏర్పడిన ఉద్రిక్త పరిస్థితులపై ఆల్జజీరాకు స్టోరీలు అందించేది. క్యాలిఫోర్ని యా కేంద్రంగా పనిచేసే జుమా ప్రె ఏజెన్సీలో ‘కశ్మీరీ వాలా’.. స్థానిక వార్తలను ఇచ్చేది. సనా తీసిన అనేక ఫొటోలు జాతీయ, అంతర్జాతీయ ఎగ్జిబిషన్లలోకూడా ప్రదర్శింపబడ్డాయి. ప్రస్తుతం రాయిటర్స్లో పనిచేస్తోన్న సనా 2021లో మ్యాగ్నమ్ ఫౌండేషన్లో ‘ఫొటోగ్రఫీ అండ్ సోషల్ జస్టి్టస్ ఫెలోస్లో ఫొటో జర్నలిస్టుగా పనిచేస్తోంది. ఆడపిల్ల అయినప్పటికీ ఉద్రిక్త పరిస్థితుల్లోనూ ఎంతో ధైర్యంగా ఫొటోలు తీస్తూ, క్లిష్ట పరిస్థితులను దాటుకుంటూ ఆడపులిలా దూసుకుపోతూ మంచి ఫొటోజర్నలిస్టుగా ఎదిగింది. కాలేజీ రోజుల నుంచే.. యూనివర్సిటీలో ఉండగా సనా ఏవీ ప్రొడక్షన్లో స్పెషలైజేషన్ చేసింది. పీజీ ప్రాజెక్టులో భాగంగా ‘ద లేక్ టౌన్’ పేరిట డాక్యుమెంటరీ తీసింది. దీన్ని 2018 ముంబై అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రదర్శించారు. దీనికి కశ్మీర్ వరల్డ్ ఫిల్మ్ ఫెస్టివల్ బెస్ట్ ఫిల్మ్ అవార్డు కూడా దక్కింది. ‘ఏ గ్రేవ్ డిగ్గర్’ అనే మరో ట్రామా డాక్యుమెంటరీకి కూడా సనాకు మంచి పేరు వచ్చింది. కోవిడ్ సమయంలో కశ్మీర్ వ్యాలీలోని మారుమూల ప్రాంతంలో వ్యాక్సిన్లు ఇస్తోన్న ఫొటోలను తీసేందుకు ఆరుగంటల పాటు ట్రెక్కింగ్ చేసి మరీ ఆక్కడకు చేరుకుని ఫొటోలు తీసి పంపింది. ఇలా ఎంతో డెడికేషన్తో తీసిన ఫొటోలు ఆమెకు ఫొటోజర్నలిస్ట్ ఫీచర్ విభాగంలో పులిట్జర్ అవార్డును తెచ్చిపెట్టాయి. జర్నలిజం, లిటరేచర్, మ్యూజిక్లలో ఉత్తమ ప్రతిభ, పనితీరు కనబరిచిన వారికి ఇచ్చే పులిట్జర్ అవార్డు దక్కించుకుంది సనా ఇర్షాద్. ఈ అవార్డుని జర్నలిజంలో నోబెల్ అవార్డుగా పరిగణిస్తారు. -
కశ్మీర్ అనిశ్చితికి పాక్ కారణం
* అక్కడి యువత దేశభక్తులే.. వారిని పాక్ రెచ్చగొడుతోంది * అన్ని పార్టీలూ సహకరించాలి: లోక్సభలో హోంమంత్రి రాజ్నాథ్ న్యూఢిల్లీ: కశ్మీర్లో రెండు వారాలుగా జరుగుతున్న అల్లర్లలో యువకులు చనిపోవటం, పలువురు గాయపడటం బాధించిందని.. కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ లోక్సభలో అన్నారు. గురువారం.. కశ్మీర్పై చర్చ సందర్భంగా రాజ్నాథ్ మాట్లాడుతూ.. భారతదేశానికి వ్యతిరేకంగా కశ్మీర్ యువతను పాకిస్తాన్ రెచ్చగొడుతోందని.. అందులో సందేహమేమీ లేదన్నారు. భద్రతా బలగాలపై దాడు లు జరిగితే కొందరు సంబరాలు చేసుకోవటం దారుణమన్నారు. ‘కశ్మీరీ యువత దేశ భక్తులే. కానీ వారిని పక్కదారి పట్టించే ప్రయత్నం జరుగుతోంది. లోయలో అనిశ్చితిని పాకిస్తాన్ రెచ్చగొడుతోంది. ఇక్కడి ఉగ్రవాదానికి కూడా వారే కారణం. కశ్మీర్లో పరిస్థితి మెల్లమెల్లగా సర్దుకుంటోంది’ అని వెల్లడించారు. బుర్హాన్ వానీ ఎన్కౌంటర్కు నిరసనగా పాక్ ‘చీకటి రోజు’ జరుపుకోవటంపై రాజ్నాథ్ తీవ్రంగా మండిపడ్డారు. ‘భారతదేశంలో విధ్వంసానికి, ఉగ్రవాద కార్యక్రమాలకు పాల్పడిన వ్యక్తిని కాల్చి చంపితే పాక్కు సంబంధమేంటి?’ అని రాజ్నాథ్ ఘాటుగా విమర్శించారు. కశ్మీర్లో సాధారణ పరిస్థితులు నెలకొల్పేందుకు అన్ని పార్టీలూ సహకరించాలని.. అందరూ కలిస్తేనే పరిస్థితి అదుపులోకి వస్తుందన్నారు. నిపుణులతో కమిటీ భద్రతా బలగాలు, పోలీసులు ఉపయోగిస్తున్న పెల్లెట్ గన్లపై పలువురు సభ్యులు సభలో ఆందోళన వ్యక్తం చేశారు. అయితే.. అంతపెద్ద సంఖ్యలో ఆందోళనకారులను అదుపు చేయటంలో.. చిన్న చిన్న పొరపాట్లు జరుగుతాయని.. అవి కూడా జరగకుండా జాగ్రత్తపడాలని భద్రతాబలగాలకు సూచించామని రాజ్నాథ్ తెలిపారు. ఈ పెల్లెట్ గన్లకు బదులుగా వినియోగించాల్సిన, తీసుకోవాల్సిన ప్రత్యామ్నాయాలపై.. ఓ నిపుణుల కమిటీని ఏర్పాటుచేయనున్నట్లు తెలిపారు. కశ్మీర్లో అఖిలపక్ష భేటీ లోయలో సాధారణ పరిస్థితులు నెలకొనేలా జాతీయస్థాయిలో చొరవ తీసుకోవాలని కశ్మీర్లో జరిగిన అఖిలపక్ష సమావేశంలో నిర్ణయించారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం జాతీయస్థాయిలో రాజకీయ ఏకీకరణ జరగాలన్న ఏకాభిప్రాయానికి వచ్చారు. పీవోకేను ఖాళీ చేయండి: పాక్కు భారత్ హెచ్చరిక కశ్మీర్లో ఉగ్రవాదాన్ని రెచ్చగొడుతున్న పాకిస్తాన్.. ముందు పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే)ను విడిచి వెళ్లాలని భారత విదేశాంగ శాఖ హెచ్చరించింది. భారత్కు వ్యతిరేకంగా పాక్లో ర్యాలీలు నిర్వహించటంపై తీవ్రంగా స్పందించింది. ‘ఐక్యరాజ్యసమితి ఉగ్రవాదులుగా గుర్తించిన వారు బహిరంగంగా పాక్లో ర్యాలీలు చేస్తున్నారు. ఇస్లామాబాద్లోని భారత హై కమిషనరేట్ ముట్టడిస్తామని బెదిరింపు కాల్స్ చేస్తున్నారు. అక్కడి భారతీయ అధికారుల భద్రత భరోసా పాక్దే’ అని పేర్కొంది.