breaking news
kakateeya kaluva
-
ప్రమాదకరంగా కాకతీయ కాలువ
బాల్కొండ: శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నుంచి నీటిని సరఫరా చేసే కాకతీయ కాలువ రెండు చోట్ల ప్రమాదకరంగా మారింది. అధికారులు మరమ్మతులు చేయించేందుకు చర్యలు తీసుకోకపోవడంతో రెండు చోట్ల బుంగలు ఏర్పడే అవకాశం ఉంది. ఎస్సారెస్పీ కాలనీకి నీటి సరఫరా చేసే వాటర్ సప్లయి ట్యాంకు వద్ద కాలువ ఒక చోట్ల ధ్వంసం అయ్యింది. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నుంచి కాలనీకి నీటి సరఫరా చేసేందుకు పైపులైన్ వేసి వాటర్ ట్యాంక్ నిర్మించారు. వాటర్ ట్యాంకులో నీరు శుద్ధి కాగా మిగిలిన నీటిని కాకతీయ కాలువలో మళ్లించేందుకు పైపులైన్ వేశారు. కానీ పైపు కాలువ వరకు లేక కాలువ కట్ట మధ్య వరకే పైపులైన్ ఉండడంతో మిగిలిన నీరు కాలువ కట్టలో పోస్తోంది. దీంతో కట్ట క్రమంగా కోతకు గురై బుంగ ఏర్పడే ప్రమాదం ఏర్పడింది. ఓ వైపు కోతకు గురవుతుండడం, మరోపక్క ఈ రోడ్డుపై పెద్ద వాహనాలు వెళ్తుండడంతో కట్టకు బుంగ ఏర్పడే ప్రమాదం మెండుగా ఉంది. అలాగే కాకతీయ కాలువ క్రాస్ రెగ్యులేటర్ వద్ద కూడా కాలువ ప్రమాదకరంగా ఉంది. ఈ రెండు చోట్ల కాలువ క్రమంగా కోతకు గురవుతున్న అధికారులు మరమ్మతులు చేపట్టడానికి ఎలాంటి చర్యలు చేపట్టడం లేదు. అయితే ఈ కాలువ మరమ్మతుల కోసం ప్రభుత్వం నిధులను సైతం మంజూరు చేసింది. కానీ ఇప్పటికీ మరమ్మతులకు నోచుకోలేదు. వాటర్ సప్లయి వలన కాలువకు బుంగలు ఏర్పడే ప్రమాదం ఉంది. ప్రాజెక్టు అతి సమీపంలో కాలువ దుస్థితి ప్రమాదకరంగా ఉన్నా అధికారులు స్పందించడం లేదు. బుంగ ఏర్పడితేనే మరమ్మతులు చేపడతారా అంటూ ఆయకట్టు రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రాజెక్టు అధికారులు స్పందించి వెంటనే కాలువకు మరమ్మతులు చేపట్టాలని ఆయకట్టు రైతులు డిమాండ్ చేస్తున్నారు. -
పొంచి ఉన్న సాగునీటి కష్టాలు
ఉత్తర తెలంగాణ వరప్రదాయిని శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ఆయకట్టుకు సాగునీటి కష్టాలు పొంచి ఉన్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. యాసంగి పంటకు నాలుగు లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీటిని అందిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. కానీ జలాశయంలో నీటి లభ్యత పరిమితంగా ఉన్న నేపథ్యంలో ఇప్పటి నుంచే నీటిని పొదుపుగా వాడుకోవాలని నీటి పారుదలశాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. లేనిపక్షంలో చివరి తడులకు ఇబ్బందులు ఎదురవుతాయని చెబుతున్నారు. సాక్షిప్రతినిధి, నిజామాబాద్: యాసంగికి నీటి విడుదల ప్రారంభమైన 2017 డిసెంబర్ 25 నాటికి శ్రీరాంసాగర్ ప్రాజెక్టులో 47 టీఎంసీల నీటి నిల్వ ఉంది. గత ఏడాది ఈ యాసంగి సీజను (2016 డిసెంబర్ 25) నాటికి ఎస్సారెస్పీలో 80 టీఎంసీల నీళ్లు ఉన్నాయి. గత సీజనుతో పోల్చితే ఈ ఏడాది నీటి నిల్వ సగానికి తగ్గడంతో ఆయకట్టుకు సాగునీరం దడం ప్రశ్నార్థకమవుతోంది. చివరి తడులకు ఇబ్బందులు..? ఈ యాసంగి సీజనులో ప్రాజెక్టు కింద మొత్తం నాలుగు లక్షల ఎకరాలకు సాగునీటిని విడుదల చేయాలని ప్రభుత్వం డిసెంబర్లో నిర్ణయించింది. లక్ష్మి కాలువ కింద నిజామాబాద్ జిల్లా పరిధిలో 16 వేల ఎకరాలు, నిర్మల్ జిల్లా పరిధిలోని సరస్వతి కాలువ కింద ఉన్న మరో 16,300 ఎకరాల ఆయకట్టు ఉంది. అలాగే జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల జిల్లాల పరిధిలో సుమారు 3.67 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరందించాలని భావిస్తున్నారు. కాకతీయ కాలువ పరిధిలోని ఎల్ఎండీ ఎగువ భాగం వరకు ఆయకట్టుకు సాగునీటిని అందించేలా నీటి పారుదలశాఖ ప్రణాళిక రూపొందించింది. మొత్తం ఎనిమిది తడులు నీటిని ఇవ్వాలని నిర్ణయించారు. కాకతీయ కాలువకు వారబందీ విధానంలో నీటిని విడుదల చేస్తున్నారు. మొదట్లో రోజుకు ఐదు వేల క్యూసెక్కులు నీటిని విడుదల చేశారు.అయితే చివరి ఆయకట్టుకు సాగునీరు చేరకపోవడంతో ఇప్పుడు రోజుకు ఆరు వేల క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. ఇలా ఒక్కో తడికి 4.8 టీఎంసీల చొప్పున నీరు జలాశయం నుంచి విడుదలవుతోంది. ఈ లెక్కన ఎనిమిది తడులకు సుమారు 38.4 టీఎంసీల నీళ్లు అవసరం ఉంటుంది. కానీ నీటి విడుదల ప్రారంభించే నాటికి జలాశయంలో 47 టీఎంసీలు మాత్రమే నీటి నిల్వ ఉంది. డెడ్స్టోరేజీ, ఎవాబ్రేషన్ లాస్, తాగునీటి అవసరాలు పోగా కేవలం సుమారు 33 టీఎంసీలు మాత్రమే వాడుకునేందుకు వీలుంటుంది. కానీ ఎనిమిది తడులకు 38.4 టీఎంసీల నీటి అవసరం ఉన్న నేపథ్యంలో సుమారు ఐదు టీఎంసీల నీటి కొరత ఏర్పడే అవకాశం ఉందని ప్రాజెక్టు వర్గాలు భావిస్తున్నాయి. దీంతో పంట కీలక దశ చివరి తడికి ఇబ్బంది వస్తుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ పరిస్థితుల్లో రైతులు నీటిని వృథా చేయకుండా, పొదుపుగా వాడుకోవాలని నీటిపారుదల శాఖ «అధికారులు సూచిస్తున్నారు. గత యాసంగి సీజనులో 80 టీఎంసీలు.. గతేడాది ఈ యాసంగి సీజను ప్రారంభమయ్యే నాటికి ఎస్సారెస్పీలో 80 టీఎంసీల నీటి నిల్వ ఉంది. దీంతో ఆయకట్టుకు ఎలాంటి ఇబ్బందులు రాలేదు. కానీ ఈసారి 47 టీఎంసీలే ఉండటంతో సాగునీటి ఇబ్బందులు పొంచి ఉన్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కాగా గతేడాది యాసంగి సీజను మాదిరిగానే ఈసారి కూడా ఆయకట్టు రైతులు వరి వైపే మొగ్గుచూపడంతో నీటి అవసరాలు ఎక్కువగా ఉన్నాయి. ‘‘ప్రస్తుత పరిస్థితుల్లో నీటిని వృథా చేయకుండా వినియోగించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రాజెక్టులో నీటి లభ్యత దృష్ట్యా ఇందుకు రైతులు సహకరించాలి.’’ అని ఎస్సారెస్పీ ప్రాజెక్టు పర్యవేక్షక ఇంజనీర్ శ్రీనివాస్రెడ్డి పేర్కొన్నారు. -
ఎస్సారెస్పీ నీటిని విడుదల చేయాలి
నిజామాబాద్ : శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు(ఎస్సారెస్పీ) నుంచి వెంటనే నీటిని కాకతీయ కాలువకు విడుదల చేయాలని శనివారం రైతులు ఆందోళన చేపట్టారు. శ్రీరామనవమి ఉత్సవాల్లో పాల్గొనడానికి ఎస్సారెస్పీ వచ్చిన బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డిని రైతులు అడ్డుకున్నారు. తమతో కలిసి రావాలని రైతులు కోరారు. స్పందించిన ఎమ్మెల్యే అధికారులతో మాట్లాడి నీటిని విడుదల చేయిస్తానని హామీ ఇచ్చారు. ఈ ఆందోళనలో మోర్తాడ్, కమ్మర్పల్లి, బాల్కొండ మండలాలకు చెందిన రైతులు పాల్గొన్నారు. (శ్రీరాంసాగర్)