breaking news
justice verma committee
-
దిద్దుబాటు చర్యలే కీలకం
హైదరాబాద్ శివార్లలో జరిగిన ‘దిశ’ ఘటనపై సోమవారం పార్లమెంటు ఉభయ సభల్లో ఆగ్రహా వేశాలు, ఆందోళన వ్యక్తమయ్యాయి. చర్చ సందర్భంగా అన్ని పక్షాల సభ్యులూ నిందితులకు ఉరిశిక్ష పడేలా చూడాలని డిమాండ్ చేయడంతో పాటు, అత్యాచారానికి ఉరే ఏకైక శిక్షగా ఉండేలా చట్టాన్ని సవరించాలని కోరారు. ఆ ఘటన వెలుగుచూసిన నాటి నుంచీ సమాజంలో భిన్న రంగాలకు చెందిన వారు చేస్తున్న డిమాండ్ వారి గళంలో ప్రతిఫలించింది. ‘దిశ’ ఉదంతం దేశవ్యాప్తంగా నిరసనలు రగిల్చింది. వేలాదిమంది వీధుల్లోకొచ్చి నేరగాళ్లను వెను వెంటనే బహిరంగంగా ఉరి తీయాలని లేదా ఎన్కౌంటర్ చేయాలని, సత్వరం కఠిన శిక్షలు పడితేనే ఇటువంటి అఘాయిత్యాలకు అడ్డుకట్ట పడుతుందని డిమాండ్ చేస్తున్నారు. పల్లెలు, పట్టణాలు తేడా లేకుండా ఎన్నోచోట్ల ధర్నాలు, ర్యాలీలు జరుగుతున్నాయి.నేరగాళ్ల క్రూరత్వం తీవ్రత సమాజం మొత్తాన్ని తల్లడిల్లజేస్తుంది. ఏడేళ్ల క్రితం ఢిల్లీ వీధుల్లో నిర్భయను, ఆమె స్నేహితుణ్ణి మభ్యపెట్టి బస్సులో ఎక్కించుకున్న ఆరుగురు మృగాళ్లు పాశవికంగా ప్రవర్తించినప్పుడూ ఇదే తరహాలో దేశం మొత్తం భగ్గున మండింది. దాని పర్యవసానంగానే కఠినమైన నిబంధనలతో నిర్భయ చట్టం అమల్లోకి వచ్చింది. జస్టిస్ జేఎస్ వర్మ నేతృత్వంలోని త్రిసభ్య కమిటీ అలుపెరగకుండా చేసిన కృషి ఫలితంగానే ఇది సాధ్యమైంది. ఆ కమిటీ నెలరోజుల్లోనే నివేదిక అందజేయగలిగింది. దోషులకు కఠిన శిక్షపడేలా చట్టాన్ని సవరించడానికి సిద్ధంగా ఉన్నామని లోక్సభలో జరిగిన చర్చ సందర్భంగా కేంద్ర రక్షణమంత్రి రాజ్నాథ్సింగ్ హామీ ఇచ్చారు. రాజ్య సభలో చర్చను ప్రారంభించిన సభాధ్యక్షుడు వెంకయ్యనాయుడు ఇలాంటి ఉదంతాలు పునరావృతం కాకుండా ఏం చేయాలన్న అంశంపై అందరూ దృష్టిపెట్టాలని అంటూనే చట్టం ఒక్కటే ఈ సమస్యకు పరిష్కారం కాదని సరిగానే అభిప్రాయపడ్డారు. చర్చలో పాల్గొన్న సమాజ్వాదీ సభ్యురాలు జయా బచ్చన్ అయితే అత్యాచారం కేసుల్లో దోషులుగా తేలినవారిని కొట్టి చంపాలని డిమాండ్ చేసి సంచ లనం సృష్టించారు. జస్టిస్ వర్మ కమిటీ తన నివేదికలో చేసిన వ్యాఖ్యల్ని ఈ సందర్భంగా గమనంలోకి తీసుకోవాలి. దేశంలో అభద్ర వాతావరణానికి కారణం చట్టాలు లేకపోవడం వల్ల కాదనీ, వాటిని సక్రమంగా అమలు పరిచే వ్యవస్థ లేకపోవడమే ప్రధాన సమస్య అని తెలిపింది. జస్టిస్ వర్మ కమిటీ ఒక్కటే కాదు... అంత క్రితం పలు సంఘాలు కూడా ఇదే మాట చెప్పాయి. వ్యవస్థలోని వివిధ విభాగాల్లో పేరుకుపోయిన అలసత్వాన్నీ, ఉదాసీనతనూ పారదోలనంతకాలం ఎన్ని చట్టాలున్నా ఫలితం ఉండదని లా కమిషన్ నివేదిక సైతం 2000 సంవత్సరంలో హెచ్చరించింది. పన్నెండేళ్లలోపు బాలికలపై అత్యాచారం లేదా సామూహిక అత్యాచారం చేసే నేరగాళ్లకు ఉరిశిక్ష విధించేలా 2018లో భారతీయ శిక్షాస్మృతిని సవరించారు. ఇది చరిత్రాత్మకమైనదని అందరూ ప్రశంసించారు. ఆ సవరణ ఫలితం నిరుడంతా కనబడింది. అత్యాచారం కేసుల్లో నేరగాళ్లకు 2000 సంవత్సరం తర్వాత అత్యధికంగా మరణశిక్షలు పడటం ఇదే తొలిసారని ఢిల్లీలోని జాతీయ న్యాయ విశ్వవిద్యాలయం ఈ ఏడాది మొదట్లో విడుదల చేసిన నివేదికలో తెలియజేసింది. 2018లో అత్యాచారం కేసుల్ని విచారించిన దిగువ కోర్టులు మొత్తం 162మంది నిందితులకు మరణశిక్షలు విధించాయి. అంతక్రితం ఈ సంఖ్య 108. కింది కోర్టులు విధించే ఉరిశిక్షలను హైకోర్టులు ధ్రువీకరించాల్సి ఉంటుంది. 2018లో 23మంది ఉరిని మాత్రమే హైకోర్టులు ఖరారు చేశాయి. 58 కేసుల్లో యావజ్జీవ శిక్షగా మార్చాయి. దాదాపు 25 కేసుల్లో నిందితులు నిర్దోషులని తీర్పునిచ్చాయి. సుప్రీంకోర్టు నిరుడు మొత్తం 12 కేసుల్లో అప్పీళ్లను విచారించింది. వీటిల్లో 2017నాటివి, అంతక్రితం కేసులూ కూడా ఉన్నాయి. 11 కేసుల్లో దోషులకు యావజ్జీవశిక్ష విధించింది. ఒక్క కేసులో మాత్రమే ముగ్గురు నేరగాళ్లకు ఉరిశిక్ష ఖరారు చేసింది. అది నిర్భయ కేసు! వీరికి తక్షణం మరణశిక్ష అమలు చేయాలని దాఖలైన పిటిషన్ను నిరుడు సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. ప్రస్తుతం ఆ హంతకులు దాఖలు చేసిన రివ్యూ పిటిషన్ పెండింగ్లో ఉంది. వాస్తవానికి అంతకుముందున్న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తులు జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ జేఎస్ కేహార్లతో పోలిస్తే ఈమధ్యనే రిటైరైన జస్టిస్ రంజన్ గొగోయ్ తన పదవీకాలంలో మరణశిక్షల కేసులను సాధ్యమైనంత త్వరగా తేల్చాలన్న సంకల్పాన్ని ప్రదర్శించారు. ముగ్గురేసి న్యాయమూర్తు లుండే నాలుగు ధర్మాసనాలను ఇందుకోసం ఏర్పాటుచేశారు. ఈ ధర్మాసనాలు ఆరువారాలపాటు ప్రత్యేకించి ఈ కేసులను మాత్రమే విచారించాయి. ఒక నేరాన్ని మరణశిక్ష పరిధిలోకి తెస్తే ఇంత సుదీర్ఘ ప్రక్రియ సాగుతుంది. ఇప్పుడు పార్లమెంటులోనూ, వెలుపలా వెల్లువెత్తిన డిమాండ్ల పర్యవ సానంగా చట్టాన్ని మరింత కఠినం చేయడానికి సిద్ధమని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది గనుక ఈ ప్రక్రియను వేగవంతం చేయడానికి ఎలాంటి సూచనలొస్తాయో చూడాలి. అయితే అంతకన్నా ముందు సమాజంలో అన్ని స్థాయిల్లోనూ పేరుకుపోయిన పురుషాధిక్య భావనను కూకటివేళ్లతో పెకిలించాలి. కుటుంబాలతో మొదలుపెట్టి వివిధ ప్రభుత్వ విభాగాల వరకూ అన్నిచోట్లా అంతర్లీనంగా ఉంటున్న ఈ చీడను వదలగొట్టకపోతే సమస్య పరిష్కారం కాదు. ఇంట్లోనూ, బయటా మహిళల్ని గౌరవించడం విషయంలో సమాజం ఆలోచనను మార్చకుండా కఠిన చట్టాల వల్ల ఒరిగేదేమీ ఉండదని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ భానుమతి ఒక సందర్భంలో చేసిన వ్యాఖ్య గమనించదగ్గది. అత్యాచార కేసులు నమోదు చేయడంలో ఉదాసీనత ప్రదర్శించే పోలీసు అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని జస్టిస్ జేఎస్ వర్మ కమిటీ చెప్పింది. అసలు అత్యా చార కేసుల్ని విచారించే తీరు మారాలని సూచించింది. ఇలాంటి అంశాలన్నిటినీ సమగ్రంగా పరిశీ లించి దిద్దుబాటు చర్యలు తీసుకోనంతకాలం ఎన్ని కఠిన చట్టాలు తీసుకొచ్చినా వృధా అవుతాయని గుర్తించాలి. -
డీఈడీ 4, బీఈడీ 2 ఏళ్లు
-
డీఈడీ 4, బీఈడీ 2 ఏళ్లు
జస్టిస్ వర్మ కమిటీ సిఫారసుల అమలుకు సన్నాహాలు.. సాక్షి, హైదరాబాద్: ఉపాధ్యాయ విద్యా కోర్సుల్లో సమూల సంస్కరణలు రాబోతున్నాయి. కోర్సుల కాలపరిమితులతో పాటు నాణ్యతకు సంబంధించి పెద్ద ఎత్తున్న మార్పులు రాబోతున్నాయి. జస్టిస్ వర్మ కమిటీ చేసిన సిఫారసులను వచ్చే ఏడాది నుంచే అమలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం దృష్టిపెట్టింది. ప్రస్తుతం ఇంటర్మీడియట్ విద్యార్హతతో రెండేళ్ల డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ (డీఈడీ) కోర్సు అందుబాటులో ఉండగా.. ఇకపై దీనికి బదులుగా ఇంటిగ్రేటెడ్ టీచర్ ఎడ్యుకేషన్ కోర్సులను అందుబాటులోకి తేనున్నారు. పదో తరగతి ఉత్తీర్ణులైన వెంటనే ఈ కోర్సులో చేరొచ్చు. అలాగే ప్రస్తుతం డిగ్రీ అర్హతతో ఏడాది కాలపరిమితి గల బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ (బీఈడీ) కోర్సు అందుబాటులో ఉంది. ఇక ఈ కోర్సు కాలపరిమితిని రెండేళ్లకు పెంచనున్నారు. 2015-16 విద్యా సంవత్సరం నుంచి ఈ కోర్సులను అమలుచేయనున్నారు. అలాగే ఎంఈడీ కోర్సును ప్రస్తుత కాలపరిమితి ఏడాది నుంచి రెండేళ్లకు పెంచనున్నారు. దీనిలో స్పెషలైజేషన్ బ్రాంచి ఎంచుకునే అవకాశం కల్పించనున్నారు. ఇది వచ్చే విద్యా సంవత్సరంలోనే అమలుకానుంది. యూజీసీ, ఎన్సీటీఈలు ఈ కోర్సుల అమలు బాధ్యతను తీసుకోనున్నాయి. జస్టిస్ వర్మ కమిటీ మొత్తం 30 సిఫారసులను చేసింది. వీటన్నింటినీ 2014-15 విద్యాసంవత్సరం నుంచే అమలుచేయాలని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. అమలుకు వర్సిటీలను సన్నాహ పరిచేందుకు గురువారం ఎంహెచ్ఆర్డీ కార్యదర్శి ఆర్.భట్టాచార్య, సహాయక కార్యదర్శి డాక్టర్ అమర్జిత్సింగ్, ఉపాధ్యాయ విద్య జాతీయ మండలి (ఎన్సీటీఈ) చైర్మన్ సంతోష్పండా రాష్ట్ర సచివాలయం నుంచి అన్ని వర్సిటీల ఉపకులపతులతో వర్మ కమిటీ సిఫారసులపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చర్చించనున్నారు. పెరగనున్న ప్రభుత్వ కళాశాలలు... ఇప్పటివరకు ఉపాధ్యాయ విద్యా కోర్సులైన డీఈడీ, బీఈడీ కోర్సులను అందిస్తున్న కళాశాలల్లో 97 శాతం ప్రైవేటు కళాశాలలే. మన రాష్ట్రంలో 647 బీఈడీ కళాశాలలు ఉండగా.. వీటిలో ప్రభుత్వ, ఎయిడెడ్ కళాశాలలు కేవలం 20 మాత్రమే ఉండగా వీటిలో 2,499 సీట్లు ఉన్నాయి. మొత్తం సీట్లలో వీటి వాటా కేవలం 3.6 శాతం మాత్రమే. ఇక ప్రైవేటు స్కూళ్లలో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు సరైన శిక్షణ కూడా లేదు. రాష్ట్రం మొత్తంలో 22 శాతం ప్రైవేటు స్కూళ్లు ఉండగా.. రాష్ట్రంలోని మొత్తం ఉపాధ్యాయుల్లో 38 శాతం మంది ప్రైవేటు పాఠశాలల్లో పనిచేస్తున్నారు. జస్టిస్ వర్మ కమిటీ ఉపాధ్యాయ కోర్సులు అందించేందుకు ప్రభుత్వం తగిన పెట్టుబడులు పెట్టాలని, ప్రభుత్వ కళాశాలలు పెంచాలని సిఫారసు చేసింది. దీనిపై ఇప్పటికే కేంద్రం రాష్ట్రాల నుంచి ప్రతిపాదనలు కోరింది. అలాగే కొత్త కళాశాలలన్నీ విభిన్న కోర్సుల సంకలనంగా ఉండాలని కమిటీ సిఫారసు చేసింది. ఉపాధ్యాయ కోర్సులన్నింటినీ ఇకపై ఉన్నత విద్య పరిధిలోకి తేవాలని కూడా ప్రతిపాదించింది. ఉపాధ్యాయ విద్య జాతీయ పాఠ్యప్రణాళిక ఫ్రేమ్ వర్క్ 2009-10 కి అనుగుణంగా ఉపాధ్యాయ విద్యా కోర్సులన్నింటినీ సమూలంగా నవీకరించాలని ప్రతిపాదించింది. అనుబంధంగా బోధన పాఠశాల.. ప్రతి ఉపాధ్యాయ విద్యా శిక్షణ సంస్థకు అనుబంధంగా ఒక పాఠశాల ఉండాలని జస్టిస్ వర్మ కమిటీ ప్రతిపాదించింది. దీని ద్వారా ఉపాధ్యాయ శిక్షణ పొందుతున్న విద్యార్థులకు ప్రాక్టికల్ అనుభవం పెరుగుతుందని, సృజనాత్మక ప్రయోగాలకు వీలుపడుతుందని సిఫారసు చేసింది. ఈ విధానం మార్చి 2014 నుంచే ప్రారంభం కానుంది. అలాగే ఉపాధ్యాయ విద్యలోని తొలి కోర్సులన్నీ కచ్చితంగా తరగతి గది ద్వారానే ఉండాలని, దూర విద్య కోర్సులు కేవలం సర్వీసులో ఉన్న టీచర్లకు మాత్రమే అందుబాటులోకి తేవాలని కమిటీ సిఫారసు చేసింది. సర్వీసులో ఉన్న టీచర్లకు, ముఖ్యంగా సెకండరీ స్కూల్ టీచర్లకు ఎప్పటికప్పుడు వృత్తిపరమైన అభివృద్ధి ఉండేలా తగిన శిక్షణ అందించాలని, ఉపాధ్యాయ విద్యా కోర్సుల నియంత్రణకు ఒక జాతీయ స్థాయి యంత్రాంగం ఏర్పాటుచేయాలని సూచించింది. దీనిపై కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఉపాధ్యాయుల పనితీరును అంచనా వేసేందుకు తగిన యంత్రాంగం ఉండాలని సూచించింది.