india-france deal
-
కలిసి నడుద్దాం.. కలిమి సాధిద్దాం
పారిస్: వ్యాపారం, వాణిజ్యం, పెట్టుబడులతోపాటు కీలక రంగాల్లో భారత్, ఫ్రాన్స్ మధ్య సంబంధ బాంధవ్యాలను మరింత బలోపేతం చేసుకోవాలని భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మానుయేల్ మాక్రాన్ నిర్ణయించుకున్నారు. ఇండో–పసిఫిక్ ప్రాంతంతోపాటు అంతర్జాతీయ వేదికలపై ఇరు దేశాల నడుమ పరస్పర సహకారాన్ని పెంపొందించుకోవాలని నిర్ణయానికొచ్చారు. ఇరుదేశాలు కలిసికట్టుగా ముందుకు సాగుతూ బలీయమైన శక్తులుగా ఎదగాలన్నదే తమ ఆశయమని పేర్కొన్నారు. ప్రజా బాహుళ్యానికి సామాజికంగా, ఆర్థికంగా లబ్ధి చేకూర్చడానికి, పర్యావరణ పరిరక్షణకు కృత్రిమ మేధ(ఏఐ)ను సవ్యదిశలో ఉపయోగించుకొనేలా చర్యలు తీసుకోవడానికి తాము కట్టుబడి ఉన్నామని ఇద్దరు నేతలు ఉద్ఘాటించారు. నరేంద్ర మోదీ, ఇమ్మానుయేల్ మాక్రాన్ బుధవారం సమావేశమయ్యారు. ఇరువురు నేతలు ఫ్రాన్స్ రాజధాని పారిస్ నుంచి మాసే నగరానికి విమానంలో వెళ్తూ చర్చల్లో పాల్గొన్నారు. భారత్, ఫ్రాన్స్ మధ్య సుదృఢమైన సంబంధాలే లక్ష్యంగా విస్తృత స్థాయిలో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. అనంతరం ఒక ఉమ్మడి ప్రకటన విడుదల చేశారు. ద్వైపాక్షిక అంశాలతోపాటు కీలక ప్రాంతీయ, అంతర్జాతీయ వ్యవహారాలు సైతం ఈ చర్చల్లో ప్రస్తావనకు వచ్చాయి. ఈ ఏడాది ద్వైపాక్షిక సహకారం విషయంలో డిజిటల్ హెల్త్, యాంటీ–మైక్రోబియల్ రెసిస్టెన్స్, రెండు దేశాల మధ్య ఆరోగ్య నిపుణుల మార్పిడిని ప్రాధాన్య అంశాలుగా గుర్తించారు. 2026లో ‘ఇండియా–ఫ్రాన్స్ ఇయర్ ఆఫ్ ఇన్నోవేషన్’ ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో తక్షణమే సంస్కరణలు చేపట్టాల్సిన ఆవశ్యకత ఉందని మోదీ, మాక్రాన్ తేల్చి చెప్పారు. ఈ అంశంతోపాటు అంతర్జాతీయ వ్యవహారాలపై పరస్పరం సమన్వయంతో పని చేయాలని అంగీకారానికి వచ్చారు. భద్రతా మండలిలో భారత్కు శాశ్వత సభ్యత్వం కల్పించాలన్న డిమాండ్కు గట్టిగా మద్దతు ఇస్తున్నామని మాక్రాన్ ఈ సందర్భంగా స్పష్టంచేశారు. భారత్, ఫ్రాన్స్ మధ్య బంధం గత 25 ఏళ్లుగా నానాటికీ బలపడుతోందని, బహుముఖ భాగస్వామ్యంగా రూపాంతరం చెందుతోందని ఇరువురు నేతలు హర్షం వ్యక్తంచేశారు. రెండు దేశాల వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ఉన్నత శిఖరాలకు చేర్చడానికి కట్టుబడి ఉన్నామని తెలిపారు. రక్షణ, పౌర అణు ఇంధనం, అంతరిక్షం వంటి కీలక వ్యూహాత్మక రంగాల్లో భారత్, ఫ్రాన్స్ మధ్య సహకారాన్ని మోదీ, మాక్రాన్ సమీక్షించారు. వచ్చే సంవత్సరాన్ని ‘ఇండియా–ఫ్రాన్స్ ఇయర్ ఆఫ్ ఇన్నోవేషన్’గా జరుపుకోబోతున్న నేపథ్యంలో నవీన ఆవిష్కరణల్లో పరస్పర సహకారానికి అత్యధిక ప్రాధాన్యం ఉందని వారు అభిప్రాయపడ్డారు. ప్రధాని మోదీ గౌరవార్థం అధ్యక్షుడు మాక్రాన్ మాసే సమీపంలోని కసీస్ పట్టణంలో రాత్రి విందు ఇచ్చారు. త్వరలో భారత్లో పర్యటించాలని మాక్రాన్ను మోదీ ప్రత్యేకంగా ఆహ్వానించారు. ఉమ్మడిగా అణు రియాక్టర్ల అభివృద్ధి ఇంధన భద్రత, కర్బన రహిత ఆర్థిక వ్యవస్థకు అణు విద్యుత్ ఉత్పత్తి చాలా ముఖ్యమని నరేంద్ర మోదీ, ఇమ్మానుయేల్ మాక్రాన్ అభిప్రాయపడ్డారు. అత్యాధునిక న్యూక్లియర్ రియాక్టర్లను ఉమ్మడిగా అభివృద్ధి చేసుకోవడానికి వారు అంగీకారానికి వచ్చారు. ఈ మేరకు స్మాల్ మాడ్యులర్ రియాక్టర్లు(ఎస్ఎంఆర్), అడ్వాన్స్డ్ మాడ్యులర్ రియాక్టర్లు(ఏఎంఆర్)ల అభివృద్ధికి లెటర్ ఆఫ్ ఇంటెంట్పై ఇరుదేశాల ప్రతినిధులు సంతకాలు చేశారు. భారతీయ జవాన్లకు నివాళులు మాసే సిటీకి చేరుకున్న మోదీ, మాక్రాన్లకు ప్రవాస భారతీయులు ఘన స్వాగతం పలికారు. అనంతరం మాసేలోని చరిత్రాత్మక మజర్గిస్ శ్మశాన వాటికను మోదీ, మాక్రాన్ సందర్శించారు. 1914 నుంచి 1918 వరకు జరిగిన మొదటి ప్రపంచయుద్ధంలో ప్రాణత్యాగాలు చేసిన భారతీయ సైనికులకు ఘనంగా నివాళులరి్పంచారు. ఇక్కడి ఇండియన్ మెమోరియల్ వద్ద పుష్పగుచ్ఛాలు ఉంచారు. సావర్కర్కు మోదీ నివాళులు భారత స్వాతంత్య్ర సమరయోధుడు వినాయక్ దామోదర్ సావర్కర్కు మాసే సిటీలో ప్రధాని నరేంద్ర మోదీ నివాళులరి్పంచారు. సముద్ర తీరప్రాంత నగరమైన మాసే నుంచే సావర్కర్ సాహసోపేతంగా తప్పించుకొనేందుకు ప్రయత్నించారని వెల్లడించారు. ఈ మేరకు ‘ఎక్స్’లో పోస్టు చేశారు. సావర్కర్ను బ్రిటిషర్ల కస్టడీకి అప్పగించవద్దంటూ అప్పట్లో మాసే ప్రజలు, ఫ్రెంచ్ కార్యకర్తలు ఉద్యమించారని వివరించారు. వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని ఉద్ఘాటించారు. సావర్కర్ ధైర్యసాహసాలు తరతరాలకు స్ఫూర్తినిస్తూనే ఉన్నాయని కొనియాడారు. 1910 జూలై 8న మాసేలో బ్రిటిషర్ల ఓడలో బందీగా ఉన్న సావర్కర్ అక్కడి నుంచి తప్పించుకొనేందుకు ప్రయత్నించారు. కానీ, ఫ్రెంచ్ అధికారులు ఆయనను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. మళ్లీ బ్రిటిషర్లకు అప్పగించారు. తర్వాత సావర్కర్కు బ్రిటిష్ పాలకులు జీవిత ఖైదు విధించారు. అండమాన్ నికోబార్ దీవుల్లోని సెల్యులార్ జైలుకు తరలించారు. ఇండియన్ కాన్సులేట్ ప్రారంభం ప్రధాని మోదీ, అధ్యక్షుడు మాక్రాన్ బుధవారం మాసే సిటీలో భారత నూతన కాన్సులేట్ను సంయుక్తంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి భారతీయులు, ఫ్రాన్స్ పౌరులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. తమ దేశ జాతీయ జెండాలు చేతబూని సందడి చేశారు. మా యువ శక్తిపై పందెం కాయొచ్చు ప్రధాని మోదీ పారిస్లో గూగుల్ సంస్థ సీఈఓ సుందర్ పిచాయ్తో సమావేశమయ్యారు. కృత్రిమ మేధ(ఏఐ)తో భారత్కు లభించే అవకాశాలపై వారు చర్చించారు. ఇండియాలో డిజిటల్ పరివర్తన కోసం గూగుల్, ఇండియా ఎలా కలిసి పని చేయాలన్నదానిపై మాట్లాడుకున్నారు. మోదీతో సమావేశమైన ఫొటోలను సుందర్ పిచాయ్ ‘ఎక్స్’లో పోస్టు చేశారు. దీనిపై మోదీ ప్రతిస్పందించారు. ప్రజా ప్రయోజనాల కోసం కృత్రిమ మేధను సమర్థంగా ఉపయోగించుకొనే విషయంలో ఇండియా వేగంగా ముందుకు సాగుతోందని పేర్కొన్నారు. అవకాశాల గనిగా మారిన భారత్లో పెట్టుబడులు పెట్టేందుకు వ్యాపారవేత్తలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ‘‘మా యువ శక్తిపై మీరు పందెం కాయొచ్చు’’ అని పెట్టుబడిదారులకు సూచించారు. అమెరికాకు పయనమైన మోదీ ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం ఫ్రాన్స్ పర్యటన ముగించుకొని అమెరికాకు బయలుదేరారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో ఆయన సమావేశం కానున్నారు. మెర్సియిల్ ఎయిర్పోర్టులో మోదీకి మాక్రాన్ వీడ్కోలు పలికారు. ‘థాంక్యూ ఫ్రాన్స్’ అంటూ మోదీ సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఫ్రాన్స్ పర్యటన ఫలవంతంగా జరిగిందన్నారు. -
ఫ్రాన్స్లో మోదీకి రెడ్కార్పెట్
పారిస్: ప్రధాని నరేంద్ర మోదీకి ఫ్రాన్స్ రాజధాని పారిస్లో రెడ్కార్పెట్ స్వాగతం లభించింది. రెండు రోజుల పర్యటన నిమిత్తం గురువారం ఆయన పారిస్ చేరుకున్నారు. ఫ్రాన్స్ ప్రధానమంత్రి ఎలిజబెత్ బార్నీ ఎయిర్పోర్ట్లో మోదీకి పూర్తి అధికారిక లాంఛనాలతో స్వాగతం పలికారు. శుక్రవారం ఫ్రెంచ్ నేషనల్ డే వేడుకల్లో మోదీ ముఖ్య అతిథిగా మోదీ పాల్గొంటారు. అధ్యక్షుడు ఇమ్మానుయేల్ మాక్రాన్తో సమావేశమవుతారు. ‘‘పారిస్ చేరుకున్నా. భారత్–ఫ్రాన్స్ మధ్య మరింత సంబంధాలు బలపడేందుకు నా పర్యటన దోహదపడుతుందని భావిస్తున్నా’’ అంటూ మోదీ ట్వీట్ చేశారు. ఫ్రాన్స్లోని భారతీయులతో భేటీ కాబోతున్నానని వెల్లడించారు. వారంతా ఆయన బస చేసిన హోటల్ బయట గుమికూడి ‘భారత్ మాతాకీ జై’ అంటూ నినాదాలు చేశారు. వారితో మోదీ ముచ్చటించారు. ప్రవాస భారతీయులు తమ నైపుణ్యాలు, కష్టించే తత్వంతో ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చుకుంటున్నారని ప్రశంసించారు. ఈ పర్యటన నాకెంతో ప్రత్యేకం భారత్–ఫ్రాన్స్ ద్వైపాక్షిక వ్యూహాత్మక భాగస్వామ్యానికి తన పర్యటనతో మరింత ఊపొస్తుందని మోదీ ఆశాభావం వెలిబుచ్చారు. ఫ్రాన్స్ బయల్దేరే ముందు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. అధ్యక్షుడు మాక్రాన్తో భేటీ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నానని తెలిపారు. రక్షణ భాగస్వామ్యంతోపాటు కీలక అంశాలపై ఆయనతో చర్చించబోతున్నానని వివరించారు. రాబోయే పాతికేళ్లలో ఇరు దేశాల బంధాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలో చర్చిస్తామన్నారు. ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై మాక్రాన్తో కలిసి పనిచేస్తామన్నారు. ఫ్రాన్స్ పర్యటన తనకెంతో ప్రత్యేకమని ఉద్ఘాటించారు. నేషనల్ డే పరేడ్లో 269 మంది జవాన్ల భారత బృందం పాలుపంచుకోనుంది. తర్వాత మోదీ శనివారం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ)లోని అబూదాబీలో పర్యటిస్తారు. 26 రఫేల్ జెట్లు, 3 స్కారి్పన్ సబ్మెరైన్లు న్యూఢిల్లీ: నావికా దళం కోసం 26 రఫేల్ యుద్ధ విమానాలు, 3 స్కార్పిన్ జలాంతర్గాములను ఫ్రాన్స్ నుంచి కొనుగోలు చేసే ప్రతిపాదనలకు రక్షణ శాఖ గురువారం ఆమోద ముద్ర వేసింది. రక్షణ మంత్రి రాజ్నాథ్సింగ్ నేతృత్వంలోని రక్షణ ఆయుధాల సేకరణ మండలి (డీఏసీ) ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఈ ప్రాజెక్టుల విలువ రూ.85,000 కోట్ల దాకా ఉంటుందని అంచనా. వీటి రాకతో నావికాదళం మరింత బలోపేతం కానుంది. ప్రధాని మోదీ శుక్రవారం ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్తో భేటీఅలో ద్వైపాక్షిక వ్యూహాత్మక, రక్షణ సంబంధాల బలోపేతంలో భాగంగా రఫేల్, స్కారి్పన్ కొనుగోలు ఒప్పందం కుదుర్చుకుంటారని సమాచారం. వైమానిక దళం కోసం ఫ్రాన్స్ నుంచి 36 ఫైటర్ జెట్లను భారత్ ఇప్పటికే కొనుగోలు చేసింది. -
మళ్లీ రాజుకున్న రఫేల్ గొడవ
న్యూఢిల్లీ: ఫ్రాన్స్కు చెందిన దసాల్ట్ సంస్థ నుంచి భారత్ 36 రఫేల్ యుద్ధవిమానాల కొనుగోలు వ్యవహారంలో భారీ కుంభకోణం జరిగిందన్న అంశం మళ్లీ తెరమీదకొచ్చింది. యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందంపై ఫ్రాన్స్లో తాజాగా న్యాయ విచారణ మొదలైనట్లు ఫ్రెంచ్ పరిశోధక వెబ్సైట్ ‘మీడియాపార్ట్’ వెల్లడించింది. విచారణకు నేతృత్వం వహించడానికి ఫ్రాన్స్ ప్రభుత్వం ప్రత్యేకంగా ఒక న్యాయమూర్తిని నియమించినట్లు ఆ వెబ్సైట్ పేర్కొంది. దాదాపు రూ.59 వేల కోట్ల విలువైన ఫైటర్ జెట్ల కొనుగోలు ఒప్పందంలో పెద్ద ఎత్తున అవినీతి, అక్రమాలు జరిగాయని, కమీషన్ల రూపంలో కోట్లాది రూపాయల సొమ్ము చేతులు మారిందని ఆరోపణలు వెల్లువెత్తడం తెల్సిందే. దసాల్ట్ ఏవియేషన్ కంపెనీ తయారు చేసిన 36 రఫేల్ ఫైటర్ జెట్లను ఇండియాకు విక్రయించేందుకు ఫ్రాన్స్ ప్రభుత్వం గతంలో ఓకే చెప్పింది. ఇందుకు సంబంధించి ఇరు దేశాల ప్రభుత్వాల మధ్య 2016 సెప్టెంబర్లో ఒప్పందం కుదిరింది. ఇప్పటికే కొన్ని ఫైటర్ జెట్లను దసాల్ట్ సంస్థ తయారుచేసి భారత్కు పంపించింది. ఈ ఒప్పందంలో అవినీతి ఆరోపణలు ఇరుదేశాల్లోనూ రాజకీయ ప్రకంపనలు రేపాయి. ఈ నేపథ్యంలో వివాదాస్పద రఫేల్ డీల్పై ఫ్రాన్స్లో ‘నేషనల్ ఫైనాన్షియల్ ప్రాసిక్యూటర్ ఆఫీస్(పీఎన్ఎఫ్)’ ఆదేశాల మేరకు గత నెల 14న న్యాయ విచారణ అధికారికంగా ప్రారంభమైనట్లు మీడియాపార్ట్ పేర్కొంది. అత్యంత భారీ ఆర్థిక, వాణిజ్య నేరాల విచారణ కోసం ఫ్రాన్స్ ప్రభుత్వం.. పీఎన్ఎఫ్ను 2013 ఏడాదిలో ఏర్పాటుచేసింది. భారత మధ్యవర్తికి రూ.8.84 కోట్లు రఫేల్ ఒప్పందంలో అవినీతి, అవకతవకలపై ‘షెర్పా’ అనే ప్రభుత్వేతర స్వచ్ఛంద సంస్థ(ఎన్జీవో) ఫిర్యాదు చేసిందని, ఆర్థిక నేరాల గుట్టును రట్టు చేయడంలో ఈ సంస్థ దిట్ట అని మీడియాపార్ట్ గతంలో పేర్కొంది. డీల్ కుదిర్చినందుకు దసాల్ట్ .. భారత్లోని ఓ మధ్యవర్తికి 10 లక్షల యూరోలు(దాదాపు రూ.8.84 కోట్లు) కమీషన్ కింద చెల్లించినట్లు వెబ్సైట్ పేర్కొంది. అయితే, ఈ ఆరోపణలను దసాల్ట్ కంపెనీ కొట్టిపారేసింది. రఫేల్ ఒప్పందంలో నిబంధనల ప్రకారమే నడుచుకున్నట్లు చెప్పింది. రఫేల్ డీల్ లో కమీషన్ల బాగోతంపై వచ్చిన మొదటి ఫిర్యాదును 2019లో అప్పటి పీఎన్ఎఫ్ చీఫ్ ఎలియానీ హూలెట్ తొక్కిపెట్టారని మీడియాపార్ట్ వెబ్సైట్ పాత్రికేయుడు యాన్ ఫిలిప్పిన్ ఆరోపించారు. ప్రత్యర్థి కంపెనీల ఏజెంట్ రాహుల్: బీజేపీ కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ ప్రత్యర్థి రక్షణ కంపెనీల ఏజెంట్గా వ్యవహరిస్తున్నారని, ఆయన ఆయా కంపెనీ చేతుల్లో పావుగా మారారని బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్రా శనివారం మండిపడ్డారు. రఫేల్ ఒప్పందంపై కాంగ్రెస్తోపాటు రాహుల్ గాంధీ పసలేని ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. అసత్య ప్రచారానికి కాంగ్రెస్ పార్టీ పర్యాయపదంగా మారిపోయిందన్నారు. రఫేల్ డీల్లో సోనియా గాంధీ కుటుంబానికి కమీషన్లు ముట్టలేదని, ఆ అక్కసుతో ఎన్డీయే ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. రఫేల్ ఒప్పందంలో ఎలాంటి అక్రమాలు జరగలేదని ‘కాగ్’, సుప్రీంకోర్టు తేల్చిచెప్పాయని సంబిత్ గుర్తుచేశారు. ఫైటర్ జెట్ల కొనుగోలు విషయంలో కాంగ్రెస్ పార్టీ ఎన్ని ఆరోపణలు చేసినా ప్రజలు విశ్వసించలేదని, 2019 లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి మళ్లీ పట్టం కట్టారని అన్నారు. జేపీసీ దర్యాప్తునకు ఆదేశించాలి: కాంగ్రెస్ రఫేల్ ఒప్పందంపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ(జేపీసీ) దర్యాప్తు జరపాలని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి రణదీప్ సూర్జేవాలా శనివారం డిమాండ్ చేశారు. దేశ రక్షణకు సంబంధించిన ఫైటర్ల జెట్ల కొనుగోలులో గోల్మాల్ను నిగ్గుతేల్చడానికి ఇదొక్కటే మార్గమని చెప్పారు. ప్రధాని మోదీ వెంటనే స్పందించాలని, జేపీసీ దర్యాప్తునకు ఆదేశించాలని సూర్జేవాలా డిమాండ్చేశారు. ‘ఒప్పందంలో అవినీతి జరిగినట్లు ఫ్రెంచ్ ప్రభుత్వం అంగీకరించింది. న్యాయ విచారణ ప్రారంభించింది. అలాంటప్పుడు ఈ అవినీతికి మూలకేంద్రమైన భారత్లో జేపీసీ దర్యాప్తు ఎందుకు జరపకూడదు?’ అని సూర్జేవాలా ప్రశ్నించారు. ఇది కాంగ్రెస్, బీజేపీ మధ్య రాజకీయ పోటీ అంశం కాదని, దేశ భద్రత, అవినీతికి సంబంధించిన అంశమన్నారు. రఫేల్ డీల్ సుప్రీంకోర్టు పరిధిలోకి రాదని తెలిపారు. -
‘రఫేల్’లో కమీషన్ల బాగోతం
పారిస్/న్యూఢిల్లీ: భారత్–ఫ్రాన్స్ మధ్య కుదిరిన రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందంలో భారీగా డబ్బు చేతులు మారినట్లు ఫ్రెంచ్ ఆన్లైన్ ఇన్వెస్టిగేటివ్ జర్నల్ ‘మీడియాపార్ట్’ సంచలనాత్మక కథనాన్ని ప్రచురించింది. ఫ్రాన్స్కు చెందిన దసాల్ట్ కంపెనీ రఫేల్ ఫైటర్ జెట్లను తయారుచేస్తోంది. వీటిని కొనేందుకు భారత్ 2016లో ఫ్రాన్స్తో ఒప్పందంచేసుకుంది. ఈ డీల్ కుదరడానికి సహకరించినందుకు భారత్లోని మధ్యవర్తులకు(సుశేన్ గుప్తా) దసాల్ట్ 1.1 మిలియన్ యూరోలు(రూ.9.5 కోట్లకుపైగా) కమీషన్లుగా చెల్లించినట్లు ‘మీడియాపార్ట్’ ప్రచురించింది. ఫ్రాన్స్ అవినీతి నిరోధక శాఖ ఏజెన్సీ ఫ్రాంకాయిస్ యాంటీ కరప్షన్(ఏఎఫ్ఏ) ఆడిటింగ్లో ఈ విషయం తేలిందని వెల్లడించింది. 2017 నాటికి దసాల్ట్ ఖాతాలను ఏఎఫ్ఏ పరిశీలించగా అవకతవకలు బయటపడ్డాయంది. ‘గిఫ్ట్ టు క్లయింట్స్’ కింద భారీగా ఖర్చును దసాల్ట్ చూపించినట్లు వివరించింది. ‘మీడియాపార్ట్’ కథనాన్ని దసాల్ట్ ఖండించింది. తాము ఎవరికీ ముడుపులు చెల్లించలేదని, 50 రఫేల్ ఫైటర్జెట్ల ప్రతిరూపాలను(రెప్లికా) తయారు చేయించడానికి ఈ సొమ్మును వెచ్చించినట్లు తేల్చిచెప్పింది. సుశేన్ గుప్తా నేతృత్వంలోని డిఫెన్స్ కంపెనీ ‘డెఫ్సిస్ సొల్యూషన్స్’కు ఆర్డర్ ఇచ్చి, ఈ నమూనాలను తయారు చేయించామని తెలిపింది. అగస్టా–వెస్ట్ల్యాండ్ హెలికాప్టర్ల కుంభకోణంలో సుశేన్ గుప్తా సీబీఐ, ఈడీ దర్యాప్తును ఎదుర్కొంటున్నాడు. డెఫ్సిస్ సొల్యూషన్స్ సంస్థ దసాల్ట్ సంస్థకు భారత్లో సబ్ కాంట్రాక్టర్. 50 రఫేల్ నమూనాలను తయారీకి 1.1 మిలియన్ యూరోలను భారతీయ కంపెనీకి చెల్లించినట్లు దసాల్ట్ చెబుతున్నప్పటికీ, అందుకు ఆధారాలు చూపలేదని ఏఎఫ్ఏ నివేదించిందని ‘మీడియాపార్ట్’ తెలిపింది. ఒక్కో రఫేల్ నమూనా తయారీకి 20,357 యూరోలు ఖర్చయిందని దసాల్ట్ చెబుతోంది. సొంత ఎయిర్క్రాఫ్ట్ మోడల్ను తయారు చేయడానికి ఒక భారతీయ కంపెనీకి ఆర్డర్ ఇవ్వాల్సిన అవసరం ఏమొచ్చింది? ఈ ఖర్చును ‘గిఫ్ట్ టు క్లయింట్’ కింద ఎందుకు చూపారు? అయినా నమూనాల తయారీకి అంత సొమ్ము ఎందుకు? ఒక్కొక్కటి ఒక కారు పరిమాణంలో తయారు చేశారా? ఏఎఫ్ఏ అధికారులు ప్రశ్నల వర్షం కురిపించగా, దసాల్ట్ సంస్థ సమాధానం చెప్పలేకపోయిందని, కనీసం ఒక్క డాక్యుమెంట్ చూపించలేకపోయిందని ఏఎఫ్ఏ నివేదికను ఉటంకిస్తూ ‘మీడియాపార్ట్’ వెల్లడించింది. ప్రధాని సమాధానం చెప్పాలి: కాంగ్రెస్ మీడియాపార్ట్ కథనం రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. డీల్పై దర్యాప్తు జరపాలని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి రణదీప్ సూర్జేవాలా డిమాండ్ చేశారు. ఈ వ్యవహారంపై ప్రధాని మోదీ దేశ ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. నైతిక స్థైర్యాన్ని దెబ్బతీయొద్దు: బీజేపీ రఫేల్ డీల్పై మీడియాపార్ట్ కథనాన్ని బీజేపీ తోసిపుచ్చింది. అవి ఆధారాల్లేని ఆరోపణలని పేర్కొంది. రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలుపై దర్యాప్తు అవసరం లేదని సుప్రీంకోర్టు గతంలోనే తేల్చిచెప్పిందని కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ గుర్తుచేశారు. తప్పుడు ఆరోపణలపై మన సైనిక బలగాల నైతిక స్థైర్యాన్ని దెబ్బతీయొద్దని కాంగ్రెస్కు రవిశంకర్ హితవు పలికారు. -
భారత్–ఫ్రాన్స్ మధ్య 14 ఒప్పందాలు
న్యూఢిల్లీ: భారత్–ఫ్రాన్స్ మధ్య ద్వైపాక్షిక సంబంధాలు బలపడే దిశగా ఇరు దేశాలు అడుగులు వేశాయి. అత్యంత కీలకమైన రక్షణ, భద్రత, అణు ఇంధనం, రహస్య సమాచార రక్షణతో పాటు మొత్తం 14 అంశాలపై భారత్–ఫ్రాన్స్ కీలక ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. ఇండో–పసిఫిక్ రీజియన్లో సహకారాన్ని విస్తృతం చేయాలని, ఉగ్రవాదం కట్టడికి ఉమ్మడి చర్యలను పెంచాలని నిర్ణయించాయి. శనివారం ఢిల్లీలో ప్రధాని మోదీ, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయేల్ మాక్రాన్ మధ్య ద్వైపాక్షిక చర్చల తర్వాత ఇరు దేశాల ఉన్నతాధికారులు ఒప్పందాలపై సంతకాలు చేశారు. ఒప్పందాల్లో సాయుధ దళాల పరస్పర సహకారం, రహస్య సమాచార రక్షణ, జైతాపూర్ అణు విద్యుత్ ప్రాజెక్టు, రైల్వేలు, సౌరశక్తి, సముద్రతీర అవగాహన, మాదక ద్రవ్యాల నియంత్రణ మొదలైనవి ఉన్నాయి. రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలుకు సంబంధించి జరిగిన వేల కోట్ల రూపాయల విలువైన ఒప్పందం వివరాలను భారత్ వెల్లడించలేదు. 2016లో భారత్–ఫ్రాన్స్ మధ్య 36 రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలుకు ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం విలువ సుమారు రూ.58 వేల కోట్లు. ఒప్పందానికి సంబంధించిన వివరాలు వెల్లడించాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోంది. మోదీ ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందం కంటే దీని విలువ తక్కువే ఉంటుందని ఆరోపించింది. మరోవైపు సాయుధ దళాల పరస్పర సహకార ఒప్పందం ప్రకారం ఒకరి మిలిటరీ బేస్లను మరొకరు వాడొచ్చు. అత్యంత నమ్మకమైన రక్షణ భాగస్వామి ఫ్రాన్స్ అనంతరం సంయుక్తంగా నిర్వహించిన మీడియా సమావేశంలో ప్రధాని మోదీ, మాక్రాన్ మాట్లాడారు. ‘మా రక్షణ సహకారం పటిష్టమైనది. భారత్కు అత్యంత నమ్మకమైన రక్షణ భాగస్వామి ఫ్రాన్స్’ అని మోదీ అన్నారు. ఇరు దేశాల సాయుధ దళాల మధ్యా పరస్పర లాజిస్టిక్ సహకారం రక్షణ సంబంధాల్లో కొత్త శకమన్నారు. ప్రాంతీయ సుస్థిరత, శాంతికి హిందూ మహా సముద్రం కీలకపాత్ర పోషించనుందని స్పష్టం చేశారు. రక్షణ సంబంధాల్లో నూతన శకం.. స్కార్పీన్ జలాంతర్గాముల ప్రాజెక్టు, ఫైటర్ జెట్ల ఒప్పందం నేపథ్యంలో ఇరుదేశాల మధ్యా రక్షణ సంబంధాల్లో నూతన శకం ఆరంభమైందని మాక్రాన్ అన్నారు. యుద్ధ విమానాల ఒప్పంద పురోగతిని తాము స్వయంగా పర్యవేక్షిస్తానని, ఈ ప్రాజెక్టు కొనసాగాలని తాము భావిస్తున్నామని, ఇరు దేశాలకు లబ్ధి చేకూర్చే దీర్ఘాకాలిక ఒప్పందం ఇదని చెప్పారు. భారత్ తమ మొదటి వ్యూహాత్మక భాగస్వామి కావాలని ఆశిస్తున్నట్టు చెప్పారు. సముద్ర తీరాలు ఆధిపత్యపోరాటానికి వేదికలు కాదని, పరోక్షంగా చైనాను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఏటా రక్షణ రంగానికి సంబంధించి మంత్రుల స్థాయిలో చర్చలు జరపాలని ఇరు దేశాలు నిర్ణయించాయి. రక్షణ మంత్రి సీతారామన్, ఫ్రాన్స్ రక్షణ మంత్రి పార్లే చర్చించారు -
రఫెల్ జెట్ లతో చైనాకు చెక్!
న్యూఢిల్లీ: రఫెల్ జెట్ విమానాల కొనుగోలుకు భారత్-ఫ్రాన్స్ ల మధ్య ఒప్పందం కుదిరింది. మొత్తం 36 ఫైటర్ విమానాలను 7.87 బిలియన్ యూరోలకు భారత్ కొనుగోలు చేయనుంది. భారత వాయుదళంలో రఫెల్ జెట్స్ చేరండంతో ప్రపంచంలో అత్యంత శక్తిమంతమైన ఎయిర్-టు-ఎయిర్ మిస్సైల్ 'మెటిఓర్' భారత అమ్ములపొదిలో చేరనుంది. దాదాపు 100 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరంలో ఉన్న ప్రత్యర్ధుల ఫైటర్ జెట్లను మెటిఓర్ ను ఉపయోగించి ధ్వసం చేయొచ్చు. దీంతో దక్షిణ ఆసియాలో మిస్సైల్ టెక్నాలజీ కలిగిన తొలి దేశంగా భారత్ అవతరించనుంది. పాకిస్తాన్, చైనాలకు ఈ కోవకు చెందిన మిస్సైల్ టెక్నాలజీ అందుబాటులో లేదు. మెటిఓర్ తో పాటు ఎయిమ్-120డీ అనే అమెరికన్ మిస్సైల్ కు మాత్రమే 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న శత్రువుల జెట్ లను చేధించే సామర్ధ్యం ఉంది. అయితే, మెటిఓర్ కలిగివున్న 'నో ఎస్కేప్ జోన్' టెక్నాలజీ ఎయిమ్-120డీలో లేదు. నో ఎస్కేప్ జోన్ అంటే ఏంటి? మెటిఓర్ మిస్సైల్లో ఉన్న మరో సదుపాయం 'నో ఎస్కేప్ జోన్'. శత్రు ఫైటర్ పై మిస్సైల్ ను ప్రయోగించే ముందు.. నో ఎస్కేప్ జోన్ ను యాక్టివేట్ చేయడం వల్ల శత్రువుల ఫైటర్ మిస్ అవకుండా నాశనం చేయవచ్చు. మెటిఓర్ దాడి నుంచి తప్పించుకోవాలంటే శత్రువుల ఫైటర్లు మిస్సైల్ ను జామ్ చేయగలగాలి. అంటే మిస్సైల్ రాడార్ పై దాడి చేసి నాశనం చేయాలి. కాగా, ప్రస్తుతం భారత్-ఫ్రాన్స్ దేశాల మధ్య రఫాలే జెట్ల కొనుగోలు కాంట్రాక్ట్ పై విస్తృతంగా చర్చలు జరుగుతున్నాయి. ఢిల్లీలో ఉన్న ఫ్రెంచ్ టీం కాంట్రాక్ట్ కు సంబంధించిన పత్రాలను క్షుణ్ణంగా పరిశీలిస్తోంది. పరిశీలన అనంతరం ఒప్పంద పత్రాలు ఆమోదం కోసం కేబినెట్ కమిటీ ముందుకు రానున్నాయి. 2019లో భారత్ ఫ్రాన్స్ నుంచి రఫెల్ ఫైటర్లను అందుకోనుంది. గత ఏడాది ఏప్రిల్ లో ఫ్రాన్స్ పర్యటనకు వెళ్లిన ప్రధానమంత్రి నరేంద్రమోదీ రఫెల్ జెట్ కొనుగోలుపై ప్రకటన చేసిన విషయం తెలిసిందే.