breaking news
hanmi Reddy yeddula
-
వివరం: 2050లో... ఆకాశమే హైవే!
క్రీస్తుశకం 2050. న్యూయార్క్లో ఓ రహదారి. విలాసవంతమైన కార్లు వరుసగా దూసుకెళుతున్నాయి. ఒక్కరూ స్టీరింగ్ పట్టుకుని తిప్పడం లేదు. అయినా కార్లు చక్కగా పరుగులు పెడుతున్నాయి! లండన్లో ఓ కేబుల్ కార్ స్టేషన్. ఓ అంధుడు వచ్చి ‘జేమ్స్ స్ట్రీట్’ అన్నాడు. కారు అతడిని ఎక్కించుకుని చిటికెలో అక్కడికి చేర్చేసింది! ఢిల్లీలో ఓ బహుళ అంతస్తుల భవనం. గాలిలోంచి ఎగురుకుంటూ వచ్చి ఓ ఫ్లాట్ ముందు ద్రోన్ వాలింది. పిజ్జా డెలివరీ చేసి వెళ్లిపోయింది! ఈసారి ముంబై. ఆకాశంలో డజన్ల కొద్దీ ఫ్లయింగ్ కార్లు. ఓ పద్ధతి పకారం అటూఇటూ ఎగురుతున్నాయి. యాక్సిడెంట్లు, శబ్దాలు లేకుండానే రివ్వున గమ్యస్థానాలకు చేరిపోయాయి! ప్రస్తుతానికి ఇవన్నీ ఊహలే. కానీ 2050 నాటికి నిజం కాబోతున్నాయి. అవును. ఇవి మాత్రమే కాదు.. ‘చుక్కల మధ్య నిద్రించండి’ అంటూ కంపెనీలు పర్యాటక ప్యాకేజీలు ప్రకటిస్తాయి. అంతరిక్ష యాత్రికుల కోసం రోదసిలో హోటళ్లు వెలుస్తాయి. ఏటా లక్షలాది మంది చంద్రుడిని పలకరించి వస్తారు. జీవితంలో ఒక్కసారైనా అమెరికాకు వెళ్లాలి, అమరనాథ్ యాత్రకు వెళ్లాలి, అక్కడికి వెళ్లాలి, ఇక్కడికి వెళ్లాలి అని ఇప్పుడు చాలామంది అనుకుంటున్నట్లే.. భవిష్యత్తులో ఒక్కసారైనా చంద్రుడిని సందర్శించాలి, రోదసిలో చక్కర్లు కొట్టి రావాలని చాలామంది లక్ష్యంగా పెట్టుకుంటారు! ముందుంది.. కొత్త సాంకేతిక లోకం మోటారు వాహనాన్ని మొట్టమొదట చూసి కేరింతలు కొట్టిన మనిషి.. గాలిలో ఎగురుతున్న విమానాన్ని చూసి విస్తుపోయాడు. తెరపై కదిలే బొమ్మల్ని చూసి ఔరా! అని ముక్కున వేలేస్కున్నాడు. అసలు దూరంగా ఉన్న మనుషులతో తీగల ద్వారా మాట్లాడవచ్చన్న ఊహే ఉండేది కాదు. చందమామపై కాలుమోపుతారనీ అనుకోలేదు. కానీ అన్నీ సాధ్యమయ్యాయి. సాధారణ సంగతులు అయిపోయాయి. శాస్త్ర, సాంకేతిక రంగంలో శతాబ్దాల కృషి వల్లే ఇదంతా సాకారం అయింది. అయితే ఈ సాంకేతిక విప్లవం మరింత వేగం పుంజుకుంది. రోజుకో ప్రతిపాదన. వారానికో ఆవిష్కరణ. మనిషి జీవితం మరింత సుఖప్రదం చేసుకునేందుకు, మానవ కల్యాణం కోసం విశ్వ రహస్యాల అన్వేషణకు ప్రపంచవ్యాప్తంగా సాంకేతిక యజ్ఞాలు ఊపందుకున్నాయి. వీటిలో కొన్ని సఫలమవ్వొచ్చు. మరికొన్ని విఫలమవ్వొచ్చు. కానీ.. గతంలోంచి వర్తమానం మీదుగా భవిష్యత్తులోకి చూస్తే మాత్రం.. మనిషి భవిత దేదీప్యమానం అవుతుందని నిపుణులు జోస్యం చెబుతున్నారు. మరో మూడు దశాబ్దాల్లోనే ఈ లోకం అడుగడుగునా సాంకేతిక మాయతో నిండిపోతుందని అంటున్నారు. స్టీరింగ్ పట్టాల్సిన పనే లేదు! మనుషుల ప్రమేయం లేకుండా ఆటోమేటిక్గా నడిచే కార్లను మరో దశాబ్దంలోపే మార్కెట్లోకి విడుదల చేసేందుకు కార్ల తయారీ కంపెనీలు ప్రయత్నిస్తున్నాయి. స్టీరింగ్ పట్టుకోవాల్సిన పని లేకపోవడమే కాదు.. పార్కింగ్, గేర్లు మార్చడం, బ్రేకులు వేయడం వంటివీ కార్లే ఆటోమేటిక్గా చేసుకుంటాయని మిల్కెన్ ఇన్స్టిట్యూట్ పరిశోధకులు అంటున్నారు. 2035 నాటికే ఈ కార్ల్లు మార్కెట్లోకి వస్తాయని చెబుతున్నారు. మనిషి పరధ్యానం, తొందరపాటుతో చేసే తప్పులను డ్రైవర్లెస్ కార్లు చేయవనీ, అందువల్ల 90 శాతం కారు ప్రమాదాలు తగ్గిపోతాయనీ వారు అంటున్నారు. వైర్లెస్ కరెంటు! ఇంట్లో పైకప్పుకు ఓ బాక్స్ను అమర్చుకుంటే చాలు.. గదిలోని అన్ని ఎలక్ట్రానిక్ పరికరాలకూ వైర్లెస్ కరెంట్ సరఫరా అవుతుంది. చిన్నపెట్టెలో అమర్చే అయస్కాంతపు చుట్టకు మెయిన్ నుంచి విద్యుత్ అందుతుంది. అక్కడి నుంచి విద్యుదయస్కాంత తరంగాలు ప్రసారమై ల్యాప్టాప్, టీవీలు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాల్లో ఉండే అయస్కాంత చుట్టలను చేరతాయి. అంటే.. మనుషులకు షాక్ కొట్టకుండానే కరెంటు అందుతుందన్నమాట. 2020 నాటికే ఈ టెక్నాలజీ వాడకంలోకి వస్తుందట. వైర్లెస్ విద్యుత్ వల్ల ఆఫీసుల్లో కేబుల్స్, ఇతర పరికరాల అవసరమూ తగ్గిపోతుంది. ఫ్లయింగ్ కార్లు, ద్రోన్లదే హవా ఆకాశంలో పక్షుల్లా, రకరకాల రూపాల్లో విహరిస్తూ వాలిపోయే ద్రోన్ల వాడకం ఇప్పటికే మొదలైంది. ఒకప్పుడు అమెరికా సేనలు అఫ్తాన్లో తాలిబన్లపై బాంబులు కురిపించేందుకు, నిఘాకు ఉపయోగపడిన మానవరహిత గగన వాహనాలు (యూఏవీలు).. క్రమంగా సైజు కుదించుకుని సాధారణ ప్రజలకూ ఉపయోగపడే ద్రోన్లుగా సిద్ధమయ్యాయి. పెళ్లిళ్లు, బహిరంగ సభల్లో వీడియోల చిత్రీకరణకు ద్రోన్లను ఉపయోగించడం ఇప్పుడిప్పుడే మొదలైంది. కొరియర్లు, మందుల పార్శిళ్లు, పిజ్జాలు అందించేందుకు ప్రయోగాలూ జరిగాయి. ప్రస్తుత ద్రోన్ టెక్నాలజీయే సమీప భవిష్యత్తులో ఫ్లయింగ్ కార్ల శకానికీ నాంది పలకనుంది. రోడ్డుపై కారులా నడుపుకుంటూ వెళ్లి, అవసరమైనప్పుడు విమానంలా గాలిలో ఎగురుకుంటూ వెళ్లే రోజు త్వరలోనే వస్తుంది. భవిష్యత్తులో మహానగరాలపై ఆకాశంలో ఎటుచూసినా ఫ్లయింగ్ కార్లే కనిపించడం సాధారణమే కావొచ్చు. రోబోలూ జీవిత భాగస్వాములే! భవిష్యత్తు రోబోలు మేధోపరంగానూ మనుషులకు దీటుగా పనిచేస్తాయని అంటున్నారు కార్నెగీ మెలన్ యూనివర్సిటీ రోబోటిక్స్ ఇన్స్టిట్యూట్ పరిశోధకులు. నిత్యజీవితంలోకి రోబోల రాకతో మనుషుల జీవనశైలి కూడా మారిపోతుందని, దినచర్యలు, సామాజిక, వినోద కార్యక్రమాలు కూడా ప్రత్యేక దారిపడతాయని అంటున్నారు. అలాగే రోబోలు మనుషులకు కొత్త నేస్తాలుగా మారతాయి. మాట్లాడతాయి. చమత్కారాలు చేస్తాయి. ఆడతాయి. పాడతాయి. ఫ్యాక్టరీల్లో కార్మికులవుతాయి. ఇంట్లో పనిమనుషులవుతాయి. రోబో పిల్లులు, రోబో కుక్కలూ వస్తాయి. యుద్ధాల్లో సైతం కిల్లర్ రోబోల రూపంలో విరుచుకుపడతాయి. అంతరిక్షంలో పరిశోధనలకు సాయం చేస్తాయి. చంద్రుడు, మార్స్పై కాలనీల నిర్మాణాలకు కూలీలూ అవుతాయి. చివరికి జీవిత భాగస్వాములు కూడా అవుతాయి. అంటే ‘అన్ని’రకాలుగా భార్య లేదా భర్తలా మసలుకుంటాయి! ఆలోచిస్తే.. పనైపోద్ది! 1970లలో ల్యాండ్లైన్లు రాజ్యమేలాయి. 20 ఏళ్లు తిరిగేసరికి మొబైల్ఫోన్ల రాజ్యం వచ్చేసింది. సెల్ఫోన్లు రోజుకో రూపంలోకి మారిపోతున్నాయి. సైజును కుదించుకుంటూ నాజూగ్గా తయారవుతున్నాయి. సమీప భవిష్యత్తులో గ్రాఫీన్ ఫోన్లు వస్తాయి. కిందపడితే పగలవు. నీటిలో పడితే నానవు. కాగితంలా ఎలాపడితే అలా మడతపెట్టుకోవచ్చు కూడా. కానీ.. సెల్ఫోన్ల పరిణామం అంతటితో ఆగుతుందా? ఆ తర్వాత ఎలా మారతాయి? అంటే.. 2020 నాటికి అందుబాటులోకి వచ్చే 5జీ సేవలతో సెల్ఫోన్ల రూపురేఖలు వేగంగా మారిపోతాయి. మెదడులో అమర్చే ఎలక్ట్రోడ్లు, సెన్సర్లు, తలపై పెట్టుకునే చిన్న హెడ్సెట్ లేదా గూగుల్ గ్లాస్ వంటివే సెల్ఫోన్లు చేసే పనులు చేస్తాయి. మరో 40 ఏళ్లలో ప్రారంభమయ్యే ఈ కమ్యూనికేషన్ టెక్నాలజీ.. తర్వాత ఎన్నెన్నో వింతలు చేస్తుంది. ఎవరికైనా సందేశం లేదా ఈ-మెయిల్ చేయాలంటే ఆలోచిస్తే చాలు.. కళ్లముందు అద్దంపై అక్షరాలు ప్రత్యక్షమైపోతాయి. ఫోన్కాల్స్ చేయాలన్నా.. అనుకున్నదే తడవుగా అవతలివారితో కనెక్షన్ ఏర్పడిపోతుంది. పసిమొగ్గలు వికసిస్తాయి యూనిసెఫ్ గణాంకాల ప్రకారం... 1990-2012 మధ్య కాలంలో పుడమిపై జన్మించిన ప్రతి వెయ్యి మంది చిన్నారుల్లో కనీసం 90 మంది చనిపోయారు. కానీ 2013 నాటికి పరిస్థితి మారింది. ప్రతి వెయ్యిమందిలోనూ మృత్యువాత పడుతున్న శిశువుల సంఖ్య 48కి తగ్గింది. అయితే నిపుణుల అంచనా ప్రకారం.. 2050 నాటికి ప్రతి వెయ్యిమందిలో 31 మంది మాత్రమే మరణిస్తారు. అంటే శిశుమరణాలు గణనీయంగా తగ్గిపోతాయి. హెచ్ఐవీని తల్లి నుంచి బిడ్డకు సోకకుండా చేయడం, ఇంకా అనేక వ్యాధులకు టీకాలు అందుబాటులోకి రావడం, సూక్ష్మపోషకాలను అందించి అత్యవసర సమయాల్లో ప్రాణాలు కాపాడటం వంటి చర్యల వల్ల ఐదేళ్లలోపు చిన్నారుల మరణాలు బాగా తగ్గిపోతాయి. ఎయిడ్స్, మలేరియా పారిపోతాయి ప్రపంచవ్యాప్తంగా ఏటా 20 లక్షల మందిని బలితీసుకుంటున్న హెచ్ఐవీ మహమ్మారి వ్యాప్తిని పూర్తిగా అడ్డుకునే టీకాను మరో 20 ఏళ్లలోగా ఆవిష్కరిస్తామని పరిశోధకులు ధీమాగా చెబుతున్నారు. అలాగే మెనింజైటిస్ వంటి వ్యాధులకు టీకాలు, కేన్సర్, రుమటాయిడ్ ఆర్థ్రైటిస్, ల్యుకేమియాలకు సమర్థమైన మందులూ అందుబాటులోకొస్తాయి. వీటితోపాటు దోమలను జన్యుమార్పిడి చేయడం ద్వారా మలేరియాను ఈ భూగోళం నుంచే తరిమేయాలని శాస్త్రవేత్తలు ప్రయత్నిస్తున్నారు. శరీరంలో ప్రయాణిస్తూ కేన్సర్ను హతమార్చే నానోపార్టికల్స్ను తయారు చేయడం, రోగనిరోధక వ్యవస్థే నేరుగా కేన్సర్ కణాల భరతం పట్టేలా శిక్షణనిచ్చేందుకూ ప్రయత్నాలు జరుగుతున్నాయి. చిటికెలో ఎమ్మారై స్కానింగ్! ఇప్పుడు ఎమ్మారై తీయాలంటే పెద్ద యంత్రంలో గంటపాటు కదలకుండా పడుకోవాల్సిందే. పైగా టుక్టుక్టుక్ అంటూ భీకరంగా శబ్దాలు. భయస్తులైతే వణికిపోవాల్సిందే. కానీ 2050 నాటికి కెమెరాతో ఫొటో తీసినంత సులభంగా పనైపోతుందట. చేతితో ఆపరేట్ చేసేంత చిన్నసైజుకు ఎమ్మారై స్కానర్లు కుంచించుకుపోతాయట. చిన్నచిన్న అయస్కాంత క్షేత్రాలను సైతం పసిగట్టగలిగేలా సూపర్సెన్సిటివ్ అటామిక్ మ్యాగ్నెటోమీటర్లతో ఇవి పనిచేస్తాయట. భవిష్యత్తు మైలురాళ్లు! 2020: చీకటిలో మెరిసే హైవేలు సాధారణం అవుతాయి. 2020: ‘5జీ టెక్నాలజీ’ సేవలు ప్రారంభమవుతాయి. 2020: అమెరికా గగనతలంపై 30 వేల ద్రోన్లు గస్తీ కాస్తాయి. 2020: వీడియోగేమ్లు, గ్రాఫిక్స్ స్పష్టంగా రియలిస్టిక్ ఫొటోల్లా ఉంటాయి 2030: ఫ్లయింగ్ కార్లు మార్కెట్లోకి వస్తాయి. 2032: భారత్ జనాభా చైనాను దాటి 150 కోట్లకు చేరుతుంది 2033: మానవ సహిత అంగారక యాత్ర ప్రారంభమవుతుంది. 2035: చంద్రుడిపై స్థావరాల ఏర్పాటు, అంతరిక్ష పర్యాటకానికి నాంది. 2050: అంతరిక్షం నుంచి భూమికి విద్యుత్ సరఫరా అవుతుంది. 2050: భారత్ ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థికశక్తిగా ఎదుగుతుంది 2050: ప్రపంచ జనాభా 930 కోట్లకు చేరుతుంది. 2030: ప్రపంచంలో దాదాపు అందరూ అక్షరాస్యులు అవుతారు. 2050: 800 కోట్ల మందికి పైగా ఇంటర్నెట్ వాడతారు 2050: మనుషుల ఆయుర్దాయం 150 ఏళ్లకు పెరుగుతుంది 2059: కొన్ని వారాల ప్రయాణంతోనే అరుణగ్రహంపై వాలిపోవచ్చు. భవిష్యత్తు ఉద్యోగాలు ఇలా... అల్టర్నేటివ్ వెహికల్ డెవలపర్ (పర్యావరణ హిత వాహనాలు తయారుచేస్తారు) బాడీ పార్ట్ మేకర్ (శరీర అవయవాలను ఉత్పత్తి చేస్తారు) కై ్లమేట్ చేంజ్ రివ ర్సల్ స్పెషలిస్ట్ (వాతావరణ మార్పు ప్రభావాలు తగ్గిస్తారు) మెమరీ ఆగ్మెంటేషన్ సర్జన్ (జ్ఞాపకశక్తి పెంచే శస్త్రచికిత్సలు చేస్తారు) న్యూ సైన్స్ ఎథిసిస్ట్ (శాస్త్రీయ పరిశోధనలు, నైతిక విలువలపై సలహాలిస్తారు) స్పేస్ పైలట్/ఆర్బిటల్ టూర్ గైడ్ (అంతరిక్ష విమానాలు నడుపుతారు) వర్చువల్ లాయర్ (ఆన్లైన్లో న్యాయ సేవలు అందిస్తారు) వర్చువల్ టీచర్ (ఆన్లైన్లో బోధిస్తారు) వేస్ట్ డాటా హ్యాండ్లర్ (పేరుకుపోయిన కంప్యూటర్ డాటాను భద్రం చేస్తారు) ఏ దేశం వెళ్లినా.. ఒకే భాష స్టార్ట్రెక్ సినిమాలో మాదిరిగా.. ప్రపంచంలో ఏ భాషనైనా మనకు తెలియకుండానే మాట్లాడొచ్చు. జస్ట్ మనకు తెలిసిన భాషలో మాట్లాడితే చాలు.. అవతలివారికి వారి భాషలో మన మాటలను చెప్పడం, వారి మాటలను మన భాషలోకి అనువదించి చెప్పడం చేసే యూనివర్సల్ ట్రాన్స్లేటర్ తయారు కానుంది. ఈ పరికరంతోపాటు ఓ కళ్లజోడు లేదా మొబైల్ యాప్ను వాడటం ద్వారానే.. ఏ దేశానికి వెళ్లినా అక్కడి భాషను అనర్ఘళంగా మాట్లాడేయొచ్చు. పురుషులకూ గర్భనిరోధక మాత్రలు! ఇప్పటిదాకా స్త్రీలకే గర్భనిరోధక మాత్రలు ఉన్నాయి. 2021 నాటికి పురుషులకూ గర్భనిరోధక మాత్రలు అందుబాటులోకి వస్తాయట. తక్కువ శుక్రకణాలు, సరిగ్గా ఈదలేని శుక్రకణాలుండే వీర్యం ఉత్పత్తి అయ్యేలా చేసే మందులతో ఈ మాత్రలు తయారు చేస్తారు. అవసరమైనప్పుడు వాటిని ఆపేస్తే.. తిరిగి యథావిథిగా సంతానం పొందొచ్చు. పురుషులకు గర్భనిరోధక మాత్రలుగా హర్మోన్ మందులు ఇదివరకే వచ్చినా.. వాటివల్ల హానికర ఫలితాలు రావడంతో నిషేధించారు. స్వలింగ సంపర్కులకూ సంతానభాగ్యం! 1978లో మొదలైన కత్రిమ గర్భధారణ పద్ధతి(ఐవీఎఫ్) వచ్చే 35 ఏళ్లలో కొత్త పుంతలు తొక్కనుందనీ, అండాలు, వీర్యకణాలను సైతం మూలకణాలతో తయారు చేసేందుకు వీలుకానుందనీ ఆక్స్ఫర్డ్ వర్సిటీ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇన్విట్రో గామిటోజెనిసిస్ (ఐవీజీ) అనే ఈ కొత్త సాంకేతికత వల్ల గేలు, లెస్బియన్లు సైతం త మ మూలకణాలతో అండాలు, శుక్రకణాలను తయారు చేయించుకుని, అద్దెగర్భం(సరోగేట్) పద్ధతిలో సొంత బిడ్డలను కనేందుకూ వీలు కానుందట. అవయవాలను ముద్రించుకోవచ్చు! రోగుల మూలకణాలతోనే వారికి కావలిసిన అవయవాలను ప్రయోగశాలలో తయారు చే స్తారు. మూలకణాలతో కణజాలం, ఎముకలు, కండరాలను తయారు చేయడం ఇదివరకే సాధ్యమైంది. భవిష్యత్తులో ఊపిరితిత్తులు, మూత్రపిండాలు, రక్తనాళాలు, ముక్కు, చెవులు, గుండె వంటి అవయవాలను తయారు చేసి అమర్చడం కూడా సాధారణం అవుతుంది. డబ్బుంటే చాలు.. అవయవదాతల కోసం ఎదురుచూస్తూ ప్రాణాలను గుప్పిట్లో పెట్టుకుని బతకాల్సిన అవసరమే 2050 నాటికి ఉండకపోవచ్చు. పుట్టబోయే బిడ్డలను డిజైన్ చేసుకోవచ్చు! వాట్సన్, క్రిక్లు 1953లోనే డీఎన్ఏను కనుగొన్నా.. దానిని అవగాహన చేసుకోవడం అంత త్వరగా సాధ్యం కాలేదు. అయితే 2050 నాటికి మనకు నచ్చినట్లుగా పిల్లలను డిజైన్ చేసుకునేలా జెనిటిక్ ఇంజనీరింగ్ టెక్నాలజీ అందుబాటులోకి వస్తుంది. పుట్టబోయే బిడ్డ లింగం, ఎత్తు, చర్మం రంగు, వెంట్రుకలు, కంటి రంగును సైతం నిర్ణయించుకోవచ్చని శాస్త్రవేత్తలు అంటున్నారు. శిశువుల మెదడును ప్రభావితం చేసి వారి ఐక్యూను సైతం 10 పాయింట్లు ఎక్కువగా పెంచుకోవచ్చట. జన్యువులను నియంత్రించడం లేదా తొలగించడం ద్వారా జన్యుపరమైన వ్యాధులకూ చెక్ పెట్టవచ్చట. అలాగే ‘పీ21’ అనే జన్యువును స్విచ్ఆఫ్ చేస్తే చాలు.. పెద్దవారిలో కూడా ఆయా భాగాల కణాలు పెరిగేలా చేసి అయవాలను పునరుత్పత్తి చేసే అవకాశం ఉందట. ఉదాహరణకు.. చేతివేళ్లు కోల్పోయినవారిలో వేళ్లను తిరిగి మొలిపించవచ్చన్నమాట! పోయిన జ్ఞాపకాలు తిరిగొస్తాయ్! అల్జీమర్స్, పక్షవాతం వల్ల దెబ్బతిన్న మెదడును తిరిగి బాగుచేసే న్యూరల్ ప్రోస్థెసిస్ పరికరాలు 2030ల నాటికి అందుబాటులోకి వస్తాయి. ఫలితంగా కోల్పోయిన జ్ఞాపకాలను తిరిగి పునరుద్ధరించడం సాధ్యం అవుతుంది. మెదడులో జ్ఞాపకశక్తికి సంబంధించిన హిప్పోకాంపస్ భాగం నుంచి విడుదలయ్యే విద్యుదయస్కాంత తరహా సంకేతాలను ప్రసారం చేయడం ద్వారా ఇవి మెదడు, నాడీవ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తాయి. కృత్రిమ మాంసానికి భలే గిరాకీ..! కేవలం ఒకే ఒక్క జంతు కణంతో ప్రయోగశాలలో కొద్దిమొత్తంలో కృత్రిమ కణజాలం తయారీ ఇప్పటికే సాధ్యమైంది. 2020 నాటికే కృత్రిమ మాంసం పూర్తిస్థాయిలో అందుబాటులోకి రానుంది. 2036 నాటికి ప్రపంచవ్యాప్తంగా ఇదో పెద్ద పరిశ్రమగా ఎదగనుంది. ఈ పద్ధతిలో జంతువులను హింసించకుండానే మాంసం ఉత్పత్తి చేసుకోవచ్చు. రంగు, రుచిలో సహజంగా ఉండటమే కాదు.. చాలా పరిశుభ్రం, ఆరరోగ్యకరంగా కూడా ఉంటుందట. జంతువుల పోషణకు కావలిసిన ఖర్చుతో పోలిస్తే.. ఇది చాలా చవకగా తయారవుతుందట. అంతరిక్షం నుంచి విద్యుత్తు! 1970ల నుంచీ ప్రతిపాదనల్లో, పరిశోధనల్లో ఉన్న రోదసి విద్యుత్తు 2041 నాటికి అందుబాటులోకి వస్తుంది. భూస్థిర కక్ష్యలో భారీ ఉపగ్రహాలను మోహరించి, వాటిపై 1-3 కిలోమీటర్ల వెడలై ్పన సౌరవిద్యుత్ పలకలను అమరుస్తారు. వాటి నుంచి సౌరవిద్యుత్ను సూక్ష్మతరంగాలు లేదా లేజర్ల రూపంలో భూమికి ప్రసారం చేస్తారు. ఆ విద్యుత్ను భూమిపై ఉండే భారీ డిష్లు స్వీక రిస్తాయి. అంతరిక్షం నుంచి లేజర్ ద్వారా సమాచార ప్రసారం అనేది ఇదివరకే సాధ్యం అయింది కూడా. రోదసిలో సౌరవిద్యుత్ను భూమి మీదకన్నా 144% ఎక్కువగా తయారు చేయొచ్చట. అవసరమైతే 24 గంటలూ విద్యుత్ తయారుచేయొచ్చు. వాతావరణ కాలుష్యం అసలే ఉండదు. యుద్ధాలంటే హడల్! ప్రజలు కాదు, దేశాలు యుద్ధాలంటే వణికిపోతాయి. ఇప్పుడు పరస్పరం కత్తులు దూసుకుంటున్న శత్రుదేశాలు కూడా 2050 నాటికి యుద్ధానికి దిగే పరిస్థితే వస్తే.. ఎందుకొచ్చిన గొడవలే అని తప్పుకుంటాయి. ఎందుకంటే.. అప్పటికి యుద్ధం అనేది అంత మితిమీరిన ఖర్చుతో కూడుకున్న వ్యవహారంగా మారిపోతుంది. ఫలితంగా చాలా దేశాల మధ్య సమస్యలు సమసిపోతాయి. ఇంటర్నేషనల్ స్టడీస్ క్వార్టర్లీ ప్రకారం.. మరో 40 ఏళ్ల నాటికి యుద్ధానికి దిగి శత్రుదేశాల జనాలను చంపడమనేది తలకుమించిన భారం అయిపోతుంది. భారత్.. అగ్రదేశం! ప్రముఖ అంతర్జాతీయ బ్యాంకు హెచ్ఎస్బీసీ అంచనా ప్రకారం.. 2050 నాటికి 24.62 లక్షల కోట్ల డాలర్ల ఆర్థికవ్యవస్థతో చైనా అగ్రదేశంగా వె లుగొందుతుంది. 22.27 లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థతో ప్రస్తుత అగ్రరాజ్యం అమెరికా రెండో స్థానంలో ఉంటుంది. ఇక అప్పటికి మూడో స్థానంలోకి వచ్చే దేశం మనదే! 8.17 లక్షల కోట్ల డాలర్ల ఆర్థికవ్యవస్థతో భారత్ ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థికవ్యవస్థగా అవతరిస్తుంది. అప్పటికి మనదేశంలో పనిచేసేవారు ఎక్కువగా, రిటైర్ అయ్యేవారు తక్కువగా ఉండటం వల్ల ఆర్థిక వ్యవస్థ మరింత పరిపుష్టం అవుతుంది. అలాగే ప్రస్తుతం అభివృద్ధి చెందిన, చెందుతున్న, పేద దేశాలున్నాయి. కానీ 2035 నాటికి దాదాపుగా అన్ని దేశాలూ సంపన్నం అయిపోతాయి. మార్స్పై మన జెండా! సౌరకుటుంబంలో భూమి తర్వాత కాస్త అనుకూలంగా ఉన్న గ్రహం ఒక్క అంగారకుడే. అందుకే అగ్రదేశాలు, ప్రై వేటు కంపెనీల కన్ను ఇప్పుడు అరుణగ్రహంపై పడింది. అన్నీ సవ్యంగా సాగితే 2050 నాటికి అంగారకుడిపై మనిషి దాదాపుగా స్థిరపడతాడట. అప్పటికి భారత్ కూడా ఆర్థికంగా, సాంకేతికంగా సంపన్నదేశం అవుతుంది కాబట్టి.. మార్స్పై భారత కాలనీ ఏర్పాటుకు ప్రయత్నాలూ జరుగుతాయేమో! - హన్మిరెడ్డి యెద్దుల -
స్మార్ట్ఫోన్ ఎంచుకోవడం ఎలా?
ప్రస్తుతం ఉన్న స్మార్ట్ఫోన్ నుంచి మరో స్మార్ట్ఫోన్కు మారాలనుకుంటున్నారా? లేదా కొత్తది కొనాలనుకుంటున్నారా? అయితే ఐఫోన్, ఆండ్రాయిడ్ లేదా విండోస్ ఫోన్... ఏ ప్ల్లాట్ఫామ్ అయితే బాగుంటుంది? ఈ మూడింటినీ పరిశీలించి సరైన స్మార్ట్ఫోన్ను ఎలా ఎంపిక చేసుకోవాలి? వీటిలో ముఖ్యంగా పరిశీలించదగ్గ అంశాలేంటి? తొలిసారి స్మార్ట్ఫోన్ కొంటున్నవారికి లేదా ఒక స్మార్ట్ఫోన్ నుంచి మరో దానికి మారుతున్నవారికీ ఏ ప్లాట్ఫామ్ బెస్ట్ అన్నది మాత్రం ఓ పట్టాన అర్థం కాదు. కానీ స్మార్ట్ఫోన్లకు సంబంధించిన ఆపరేషన్ సిస్టమ్స్ (ఓఎస్)ల గురించి తెలుసుకుంటే ఏది మంచిదో సులభంగా నిర్ణయించుకోవచ్చు. ప్రస్తుతం ఉన్న ముఖ్యమైన మూడు స్మార్ట్ఫోన్ ఓఎస్లు... ఆపిల్ ఐఓఎస్, ఆండ్రాయిడ్, మైక్రోసాఫ్ట్ విండోస్ ఫోన్ల ప్లస్సులూ, మైనస్లూ తెలుసుకుందాం. ఆపిల్ ఐఓఎస్ ప్లస్లు: స్మార్ట్ఫోన్ మార్కెట్లో ఆపిల్ కంపెనీ హవా కొనసాగుతోందంటే.. అందుకు హార్డ్వేర్ కన్నా సాఫ్ట్వేరే అతి ముఖ్య కారణంగా చెప్పవచ్చు. ఆపిల్ కంపెనీ ఐఓఎస్ ఆపరేటింగ్ సిస్టమ్ ఇతర వాటికన్నా సులభంగా ఉపయోగించేలా ఉండటంతోపాటు ఆకర్షణీయంగా కూడా ఉంటుంది. వేగం మాత్రమే కాకుండా పనితీరు కూడా సమర్థంగా ఉంటుంది. అయితే ఇది ఆపిల్ ఐఫోన్ కోసం మాత్రమే తయారుచేశారు. కాబట్టి ఆపిల్ హార్డ్వేర్, ఐఓఎస్లు మాత్రమే ఒకదానితో ఒకటి కలిసి పనిచేస్తాయి. ఆపిల్ కంపెనీ ఫస్ట్ జనరేషన్ స్మార్ట్ఫోన్లు వచ్చి ఏడేళ్లు అయినా.. ఐఫోన్ కెమెరా ఇప్పటికీ బెస్ట్ మొబైల్ కెమెరాల్లో ఒకటిగా ఉండటం విశేషం. ఐట్యూన్స్ ఆప్ స్టోర్లో ఇతర ప్ల్లాట్ఫామ్లకు ఏమాత్రం తీసిపోని విధంగా అనేక అప్లికేషన్లు అందుబాటులో ఉన్నాయి. చాలా మంది తమ ఆప్స్ను మొదట ఐఫోన్ కోసమే తయారుచే స్తారంటే ఈ ఆప్ స్టోర్కు ఉన్న క్రేజ్ను అర్థం చేసుకోవచ్చు. ఆపిల్ పరికరాలు ఇతర ఆపిల్ పరికరాలతోనే బాగా పనిచేస్తాయి. ఉదాహరణకు ఇంట్లో ఎక్కువమంది ఐఫోన్లు, ఐపాడ్లు, మ్యాక్ కంప్యూటర్లు వంటివి ఉపయోగించారనుకోండి.. ఇల్లంతా ఒక ఆపిల్ ఎకోసిస్టమ్లా తయారై.. ఆయా డివైస్ల మధ్య ఆప్స్ షేర్ చేసుకోవడం నుంచి ఆడియో, వీడియో, ఇతర ఫైళ్లు పంపుకోవడం, ఇతర పనులన్నీ చకచకా వేగంగా జరిగిపోతాయి. మైనస్లు: స్థిరత్వం, ఉపయోగించేందుకు సులువుగా ఉన్నా.. ఫీచర్స్ విషయంలో మాత్రం ఆండ్రాయిడ్ తర్వాతే ఐఓఎస్. దీంట్లో కెమెరా సాఫ్ట్వేర్ ఫీచర్లు ఎక్కువగా లేకపోవడం ముఖ్యమైన లోపం. ఇక హార్డ్వేర్ విషయంలో ఆపిల్ బాగా వెనకబడిందనే చెప్పొచ్చు. ఆండ్రాయిడ్తో పనిచేసే శామ్సంగ్, హెచ్టీసీ, మోటరోలా వంటి ఫోన్లు పెద్ద పెద్ద తెరలతో రూపు మార్చుకుంటుండగా.. ఆపిల్ ఐఫోన్ స్క్రీన్ ఇంకా 4 అంగుళాల దగ్గరే ఉంది. అలాగే మిగతావాటితో పోలిస్తే సౌండ్ పెద్దగా రాకపోవడం కూడా దీనికి మైనస్సే. ఇంట్లో ఆపిల్ డివైస్ ఒకటే ఉంటే మాత్ర ం ఇతర డివైస్లతో కలిసి పనిచేయడం కొంచెం ఇబ్బందికరమే. ఆండ్రాయిడ్ ప్లస్లు: గూగుల్ కంపెనీ అభివద్ధిపర్చిన ఈ ఆపరేటింగ్ సిస్టమ్ ఒక ఓపెన్ ప్ల్లాట్ఫామ్. అంటే దీనికి కొన్ని పరిమితులు, నిబంధనలు మాత్రమే ఉన్నాయి. ఐట్యూన్స్ ఆప్స్ స్టోర్ కంటే తక్కువ ఆప్స్ ఉన్నా.. భిన్నమైన కొన్ని ప్రత్యేక ఆప్స్ కూడా గూగుల్ ప్లే స్టోర్లో ఉన్నాయి. ఫోన్ను వైఫై హాట్స్పాట్గా మార్చగలిగే ఆప్ అందులో ఒకటి. ఆండ్రాయిడ్పై పనిచేసే హ్యాండ్సెట్ల రకాలు ఎక్కువే. నచ్చిన డిజైన్ బట్టి దేన్నైనా ఎంపిక చేసుకునేందుకు అవకాశం ఉంది. శామ్సంగ్, మోటరోలా, సోని, హెచ్టీసీ వంటి చాలా కంపెనీల ఫోన్లు ఈ ఓఎస్ను సపోర్ట్ చేస్తాయి. అందువల్ల అవసరాన్ని బట్టి.. పెద్ద స్క్రీన్, డిఫరెంట్ ఫీచర్లు ఉన్న ఫోన్లను ఎంపికచేసుకునేందుకు అవకాశం ఉంటుంది. ఆండ్రాయిడ్ ఫోన్లో వీడియో, ఆడియో ఫైళ్లను స్టోర్ చేయడం, డిలీట్ చేయడం చాలా సులభం. ఐట్యూన్స్ మాదిరిగా వీటిలో ప్రత్యేకంగా మ్యూజిక్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్ అవసరం ఉండదు. విండోస్ యూజర్లకు ఐఫోన్ కన్నా ఆండ్రాయిడ్ ఫోన్లు కొంచెం ఉత్తమమే. ప్రస్తుతం కొత్త కొత్త సాఫ్ట్వేర్ ఫీచర్లు ఎక్కువగా ఆండ్రాయిడ్ పైనే వస్తున్నాయి. దీనితో నోటిఫికేషన్ల నుంచే నేరుగా కమాండ్లను కూడా యాక్టివేట్ చేయొచ్చు. మైనస్లు: ఆండ్రాయిడ్ ఓపెన్ ఫ్లాట్ఫామ్ కావడం వల్ల.. మొబైల్ తయారీదారులు, ఇతరులు కోర్ ఓఎస్ను మాత్రమే తీసుకుని దానికి మార్పులు చేర్పులు చేస్తున్నారు. కొత్త కొత్త ఫీచర్లు జతచేస్తున్నారు. దీంతో వాటి ఇంటర్ఫేస్ రూపమే మారిపోతోంది. అందువల్ల అన్ని ఆండ్రాయిడ్ ఫోన్లూ వినియోగంలో ఒకేలా ఉంటాయన్న గ్యారంటీ లేదు. ఒక హ్యాండ్సెట్ నుంచి ఇంకో హ్యాండ్సెట్కు మారేసరికి ఆపరేటింగ్ గురించి మళ్లీ కొత్తగా తెలుసుకోవాల్సిన పని పడుతోంది. ఈ మార్పుల కారణంగా ఆండ్రాయిడ్ కోసం అభివృద్ధిపర్చిన అన్ని అప్లికేషన్లు అన్ని ఆండ్రాయిడ్ ఫోన్లలో పనిచేస్తాయని కూడా చెప్పలేం. ఐట్యూన్స్ స్టోర్ మాదిరిగా ఎక్కువ ఆప్స్గానీ, బాగా పాపులర్ అయిన కొన్ని ఆప్స్ గానీ లేవు. శామ్ సంగ్ గెలాక్సీ ఎస్4, హెచ్టీసీ వన్ వంటి ఆండ్రాయిడ్ ఫోన్లలో శక్తిమంతమైన ప్రాసెసర్లు ఉన్నా.. చాలావరకూ ఐఫోన్ మాదిరిగా వేగంగా పనిచేయవు. విండోస్ ఫోన్ ప్లస్లు: ఇతర అన్ని ప్లాట్ఫామ్ల కంటే కూడా విండోస్ ఫోన్ ఇంటర్ఫేస్ బాగా ఆకర్షణీయంగా ఉంటుంది. ఎప్పటికప్పుడు సమాచారంతో అప్డేట్ అవుతూ ఉండే యానిమేటెడ్ టైల్స్ అందరినీ ఆకట్టుకుంటున్నాయి. స్క్రోలింగ్, అప్లికేషన్లను లాంచ్ చేయడంతోపాటు పనితీరు కాస్త మెరుగ్గానే ఉంటుంది. విండోస్ మొబైల్ ప్ల్లాట్ఫామ్కే పరిమితమైన నోకియా ప్రస్తుతం తక్కువ వెలుతురులోనూ నాణ్యమైన ఫొటోలు తీయగలిగే కెమెరాలను తీసుకొస్తోంది. తాజాగా నోకియా లూమియా 1020 ఫోన్లో 41 మెగాపిక్సెల్ కెమెరాను కూడా ఆ కంపెనీ జోడించింది. మైక్రోసాఫ్ట్ ఆఫీస్ నుంచి వచ్చిన పూర్తిస్థాయి మొబైల్ ప్ల్లాట్ఫామ్ నేటికీ ఇదొక్కటే. మైనస్లు: మార్కెట్లో దీనికి గడ్డుకాలమే నడుస్తోంది. మార్కెట్లోకి దిగుమతవుతున్న ఫోన్లలో విండోస్ ఫోన్ ఆధారిత ఫోన్ల వాటా చాలా తక్కువగా ఉంది. అందువల్ల కొత్త ఆప్స్కు ఈ ప్లాట్ఫామ్ అంత అనువైనది కాదని ఆప్ డెవలపర్లు భావిస్తున్నారు. ఇతర ఆప్ స్టోర్లతో పోలిస్తే.. ఈ ఆప్ స్టోర్లో అందుబాటులో ఉన్న అప్లికేషన్లు కూడా చాలా తక్కువే. - హన్మిరెడ్డి యెద్దుల