breaking news
Gurdaspur SP
-
ఎస్పీకి పాలిగ్రాఫ్ పరీక్షలు?
పఠాన్కోట్ ఉగ్రదాడి విషయంలో గురుదాస్పూర్ ఎస్పీ సల్వీందర్ సింగ్కు పాలిగ్రాఫ్ టెస్టు నిర్వహించే అవకాశం కనిపిస్తోంది. ఆయన నుంచి నిజాలు రాబట్టాలంటే ఈ టెస్టు చేయాలని ఎన్ఐఏ భావిస్తోంది. పాకిస్థాన్కు చెందిన ఆరుగురు ఉగ్రవాదులు తన కారును హైజాక్ చేసి, తనను కొట్టి పారేశారని ఆయన చెప్పిన విషయం తెలిసిందే. వాళ్లు తన సెల్ఫోన్ కూడా లాక్కోవడంతో తనకు ఏం చేయాలో అర్థం కాలేదని అన్నారు. తాను తరచు పఠాన్కోట్లోని గురుద్వారాకు వెళ్తుంటానని, అలా వెళ్లి వస్తుంటేనే తన కారును హైజాక్ చేశారని సల్వీందర్ చెప్పారు. అయితే, గురుద్వారా కేర్టేకర్ సోమరాజ్ మాత్రం, ఆయనను తొలిసారి డిసెంబర్ 31నే చూశానని అన్నారు. సల్వీందర్ గతంలో లైంగిక వేధింపుల కేసు నమోదైంది. దానిపై ఐజీ స్థాయి అధికారి ప్రస్తుతం విచారణ జరుపుతున్నారు. ఇప్పుడు కూడా సల్వీందర్ చెబుతున్న విషయాలకు ఒకదానికి, మరోదానికి పొంతన కుదరడం లేదు. అందుకే ఆయనను బెంగళూరు లేదా ఢిల్లీ తీసుకెళ్లి పాలిగ్రాఫ్ టెస్టు చేయించాలని భావిస్తున్నట్లు ఎన్ఐఏకు చెందిన ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. అయితే.. అందుకు సల్వీందర్ తన అంగీకారం తెలిపారా లేదా అన్న విషయం మాత్రం ఇంతవరకు తెలియలేదు. తన వ్యక్తిగత వాహనానికి నీలిరంగు సైరన్ లైటు పెట్టుకోకూడదని తెలిసినా, ఆయన ఎందుకు పెట్టుకున్నారన్న అంశంపై కూడా ఎన్ఐఏ విచారణ చేస్తోంది. ఆ వాహనంలోనే ఉగ్రవాదులు పోలీసు చెక్పోస్టులను ఎలాంటి ఇబ్బంది లేకుండా దాటేశారు. ఈ కేసు గురించి తనకేమీ తెలియదని.. తాను కూడా వాళ్ల బాధితుడినేనని మాత్రమే ఇంతవరకు సల్వీందర్ చెబుతూ వస్తున్నారు. సల్వీందర్ను సస్పెండ్ చేయలేదని మాత్రం పంజాబ్ డీజీపీ సురేష్ అరోరా చెప్పారు. -
ఆ ఎస్పీ తీరుపై అనుమానాలు!
పఠాన్కోట్: పఠాన్కోట్ ఎయిర్బేస్పై ఉగ్రవాద దాడి ఘటనలో గురుదాస్పుర్ ఎస్పీ సల్వీందర్సింగ్ తీరుపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో ఆయనను అదుపులోకి తీసుకొని విచారించాలని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) భావిస్తోంది. పఠాన్కోట్ ఉగ్రవాద దాడిపై ఎన్ఐఏ బుధవారం అధికారికంగా దర్యాప్తు ప్రారంభించింది. ఈ దాడి విషయంలో సల్వీందర్ సింగ్ తీరు అసబద్ధంగా ఉందని ఎన్ఐఏ డీజీ శరద్కుమార్ అభిప్రాయపడ్డారు. పఠాన్కోట్ ఎయిర్బేస్పై దాడికి ముందు ఎస్పీ సల్వీందర్ సింగ్ ప్రయాణిస్తున్న అధికారిక వాహనాన్ని ఉగ్రవాదులు అడ్డగించారు. అందులో ఉన్న ఎస్పీతోపాటు ఉన్న అతని స్నేహితుడు రాజేశ్వర్మ, వంటమనిషిని తాడుతో కట్టేసి చితకబాదారు. ఆ తర్వాత ఎస్పీ అధికారిక వాహనాన్ని హైజాక్ చేసి.. తమతోపాటు వర్మను బంధించి తీసుకెళ్లారు. ఉగ్రవాదుల నుంచి తప్పించుకున్న ఈ ముగ్గురు ఘటన గురించి తరచూ భిన్నమైన ప్రకటనలు చేస్తుండటం, ముఖ్యంగా ఎస్పీ సల్వీందర్ సింగ్ వైఖరి తరచూ మారుతుండటంతో ఆయన ఉగ్రవాదులకు సహకరించారా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఎస్పీ సల్వీందర్ సింగ్తోపాటు రాజేశ్వర్మ, వంటమనిషిని అదుపులోకి తీసుకొని ప్రశ్నించాలని ఎన్ఐఏ భావిస్తోంది.