breaking news
Green cement
-
పర్యావరణహితంగా సిమెంట్ పరిశ్రమ..
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఉద్గారాలను తగ్గిస్తూ, పర్యావరణహితంగా కార్యకలాపాల నిర్వహణను మెరుగుపర్చుకునే దిశగా సిమెంటు పరిశ్రమ కృషి చేస్తోందని అంబుజా సిమెంట్స్ ఎండీ, గ్రీన్ సిమెంటెక్ 2025 చైర్మన్ అజయ్ కపూర్ తెలిపారు. ఇందుకోసం ప్రత్యామ్నాయ ఇంధనాలు, పునరుత్పాదక విద్యుత్, సాంకేతికత మొదలైన వాటిని వినియోగించుకోవడంపై మరింతగా దృష్టి పెడుతున్నట్లు వివరించారు. బొగ్గు స్థానంలో ఘన వ్యర్ధాలు, ప్లాస్టిక్లాంటి ప్రత్యామ్నాయ ఇంధనాల వినియోగం ప్రస్తుతం సగటున సుమారు ఆరు–ఏడు శాతం స్థాయిలో ఉన్నట్లు చెప్పారు. సిమెంట్ తయారీ సంస్థల అసోసియేషన్తో (సీఎంఏ) కలిసి పరిశ్రమల సమాఖ్య సీఐఐ నిర్వహిస్తున్న సీఐఐ గ్రీన్ సిమెంటెక్ 21వ ఎడిషన్ ప్రారంభం సందర్భంగా ఆయన ఈ విషయాలు తెలిపారు. కర్బన ఉద్గారాలను తగ్గించేందుకు వినూత్న వ్యూహాలు, కార్యక్రమాలపై ప్రధానంగా ఫోకస్తో ఇది రెండు రోజుల పాటు సాగుతుంది. గత కొన్నేళ్లుగా కర్బన ఉద్గారాలు గణనీయంగా తగ్గినట్లు సాగర్ సిమెంట్స్ జాయింట్ ఎండీ ఎస్. శ్రీకాంత రెడ్డి తెలిపారు. తటస్థ ఉద్గారాల స్థాయికి ప్రభుత్వం నిర్దేశించిన గడువుకు పదేళ్లు ముందుగానే లక్ష్యాన్ని సాధించేందుకు సంస్థలు ప్రయత్నిస్తున్నాయని వివరించారు. సరి్టఫై చేసిన హరిత ఉత్పత్తులు, ప్రోత్సాహకాల కారణంగా పర్యావరణహిత భవంతుల నిర్మాణం పుంజుకుంటోందని ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ జాతీయ వైస్ చైర్మన్ శేఖర్ రెడ్డి తెలిపారు. -
మార్కెట్లోకి ‘భారతి అల్ట్రాఫాస్ట్’ సిమెంట్
సాక్షి, హైదరాబాద్: ‘భారతి అల్ట్రాఫాస్ట్’పేరుతో సరికొత్త ‘గ్రీన్ సిమెంట్’ను భారతి సిమెంట్ అందుబాటులోకి తీసుకొచ్చింది. రోబోటిక్ టెక్నాలజీతో తయారయ్యే ఈ సిమెంట్.. కాంక్రీట్ అనువర్తనాల్లో ఎంతో ఉపయోగపడుతుందని సంస్థ మార్కెటింగ్ డైరెక్టర్ ఎం.రవీందర్రెడ్డి వెల్లడించారు. ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న ఓపీసీ 53 సిమెంట్ వల్ల కలిగే ప్రయోజనాలన్నీ అల్ట్రాఫాస్ట్ ద్వారా లభిస్తాయని చెప్పారు. ఈ సిమెంట్ వల్ల తేమ వాతావరణంలోనూ ప్రీ కాస్టింగ్ పని సులువవుతుందని, చాలా తొందరగా కాంక్రీట్ గట్టిపడుతుందని తెలిపారు. అల్ట్రాఫాస్ట్తో నిర్మితమైన కాంక్రీట్ స్లాబులు, పిల్లర్లు దృఢంగా, ఎక్కువ కాలం మన్నికగా ఉంటాయని, ఎక్కువ బరువును తట్టుకోగలవని వివరించారు. అల్ట్రాఫాస్ట్ తక్కువ వేడిని విడుదల చేస్తుందని, కాబట్టి వేడి ద్వారా వచ్చే పగుళ్లు తగ్గుతాయని.. కాంక్రీట్కు నష్టం జరగదన్నారు. సిమెంట్ ఇటుకల తయారీకి అల్ట్రాఫాస్ట్ ఎంతో అనువైనదని చెప్పారు. -
సెసా స్టెరిలైట్ నుంచి గ్రీన్ సిమెంట్
కాలుష్య రహితం.. ఇసుక అవసరం లేదు.. అతి తక్కువ ఖర్చు రాయగడ (ఒడిశా): ఇసుక అవసరం లేదు.. కాలుష్యానికి తావులేదు.. అతి తక్కువ నీటి వినియోగం, తక్కువ వ్యయంతో నిర్మాణాలు చేపట్టేందుకు వీలుగా వేదాంత గ్రూప్ కంపెనీ సెసా స్టెరిలైట్ శ్రీకారం చుట్టింది. పరిశోధనలు ముగించుకుని మార్కెట్లోకి రావడానికి సిద్ధమవుతున్న గ్రీన్ సిమెంట్ గురించి సెసా స్టెరిలైట్ సంస్థ సీఈవో డాక్టర్ ముకేశ్ కుమార్ వినియోగం గురించి వివరించారు. రాయగడ, కలహండి జిల్లాల సరిహద్దులో గల లంజిగడలోని సెసా స్టెరిలైట్ కంపెనీ ఐఎంఎంటీ, భువనేశ్వర్ సాంకేతిక సహకారంతో గ్రీన్ సిమెంట్కు రూపకల్పన చేసింది. దీని తయారీకి ఇనుము తయారీ కంపెనీల్లో వృథాగా ఉండే రెడ్మార్ట్ మెటీరియల్ తో పాటు పలు కంపెనీల్లో నిరర్థక పదార్థమైన బూడిదను వినియోగించారు. ఇందులో 90 శాతం బూడిద, ఒక శాతం సున్నం, మూడు శాతం కెమికల్ ఉన్నాయని ముకేశ్ తెలిపారు. ప్రస్తుతం సిమెంట్ కాంక్రీట్ పనుల్లో 21 రోజులు వాటరింగ్ చేస్తుండగా, గ్రీన్సిమెంట్తో చేపట్టే కాంక్రీట్ పనులకు ఒక్కసారి మాత్రమే నీటిని వినియోగిస్తారు. దీని వినియోగంలో నీరు వృథా కాదని తెలిపారు. సాధారణ సిమెంట్ కన్నా 30 శాతం ఖర్చు తక్కువని తెలిపారు. దీని వినియోగానికి ఇసుక అవసరం లేదని చెప్పారు. మరో 8 నెలల్లో దీనిని మార్కెట్లోకి తీసుకురానున్నట్లు ముకేశ్ తెలిపారు.