-
బంగారం ఎలా ఉన్నా మెరుస్తుంది..!
ఏటా పండుగల సమయంలో బంగారం ఆభరణాలను కొనే సంప్రదాయాన్ని కొందరు అనుసరిస్తుంటారు. మరికొందరు కష్టార్జితం నుంచి ఆదా చేసుకున్న మొత్తంతో బంగారం ఆభరణాలను కొని పెట్టుకుంటారు. కొందరు అవసరం లేకపోయినా కానీ, క్లిష్ట సమయాల్లో ఆదుకుంటుందనో.. భవిష్యత్తులో తమ వారసులకు ఆస్తి రూపంలో వెళుతుందన్న ఉద్దేశంతో బంగారం ఆభరణాలను కొనుగోలు చేస్తుంటారు. ఇదంతా నాణేనికి ఒకవైపు మాత్రమే. రెండోవైపు కూడా చూడాలి. అవసరమైన మేర బంగారం ఆభరణాలను కలిగి ఉండడం తప్పుకాదు. కానీ, పరిమితికి మించి, పెట్టుబడుల కోసమని బంగారాన్ని పోగు చేసుకుంటుంటే.. దాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన రిస్క్ను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అలాగే, పెట్టిన ప్రతీ రూపాయికి తగిన విలువను ఆభరణం రూపంలో పొందుతున్నామా? అని కూడా ప్రశ్నించుకోవాల్సిందే. పెట్టుబడుల కోసం, అత్యవసర సందర్భాల్లో ఆదుకుంటుందన్న భరోసా కోసం బంగారం కొనే వారికి.. భౌతిక బంగారం కాకుండా మెరుగైన ప్రత్యామ్నాయాలు ఉన్నాయి. వాటి గురించి సమగ్రంగా తెలియజేసే ప్రాఫిట్ ప్లస్ కథనమే ఇది. గోల్డ్ ఎక్సేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ బంగారం ఈటీఎఫ్లు అన్నవి మ్యూచువల్ ఫండ్స్ సంస్థలు అందిస్తున్నవి. ఇవి ఎన్ఎస్ఈ, బీఎస్ఈల్లో స్టాక్స్ మాదిరే రోజువారీగా ట్రేడ్ అవుతుంటాయి. భౌతిక బంగారానికి ప్రత్యామ్నాయంగా.. అందుబాటులోని డిజిటల్ మార్గాల్లో ఎస్జీబీ తర్వాత అత్యంత మెరుగైన సాధనం ఇది. ఎస్జీబీలను కొనుగోలు చేసుకోవాలంటే డీమ్యాట్ ఖాతా తప్పనిసరి కాదు. కానీ, గోల్డ్ ఈటీఎఫ్లకు డీమ్యాట్ ఖాతా తప్పనిసరి. ఎందుకంటే షేర్ల మాదిరే గోల్డ్ ఈటీఎఫ్ యూనిట్లు ఇన్వెస్టర్ల ఖాతాలోకి వచ్చి చేరతాయి. డీమ్యాట్ ఖాతా కోసం కేవైసీ వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది. ఇప్పటికే డీమ్యాట్ ఖాతా ఉన్న వారికి ఇది సులభమైన మార్గం అవుతుంది. ఎస్జీబీలో మాదిరే ఇక్కడ కూడా ఒక యూనిట్ నుంచి కొనుగోలు చేసుకోవచ్చు. ఒక యూనిట్ ఒక గ్రాముకు సమానం. గరిష్ట పెట్టుబడుల పరిమితి లేదు. వ్యయాలు: స్టాక్ ఎక్సేంజ్ల్లో ట్రేడవుతాయి కనుక కొనుగోలుపై బ్రోకరేజీ, ఎక్సేంజ్ చార్జీలు ఉంటాయి. సెక్యూరిటీస్ ట్రాన్సాక్షన్ చార్జీలు ఉండవు. అలాగే, గోల్డ్ ఈటీఎఫ్లను మ్యూచువల్ ఫండ్స్ నిర్వహిస్తుంటాయి కనుక ఎక్స్పెన్స్ రేషియో ఉంటుంది. పెట్టుబడుల విలువపై దీన్ని ఫండ్స్ వసూలు చేస్తుంటాయి. ఉదాహరణకు ఎస్బీఐ ఈటీఎఫ్ గోల్డ్లో ఎక్స్పెన్స్ రేషియో 0.51 శాతంగా ఉంది. ఏ ట్రేడింగ్ రోజైనా గోల్డ్ ఈటీఎఫ్లను కొనుగోలు చేసుకోవచ్చు, విక్రయించుకోవచ్చు. ఎస్జీబీలో మాదిరే లాభాలపై పన్ను అమలవుతుంది. రిస్క్: ఇన్వెస్టర్ కొనుగోలు చేసే ప్రతీ గోల్డ్ ఈటీఎఫ్కు సరిపడా బంగారాన్ని మ్యూచువల్ ఫండ్స్ సంస్థలు కొనుగోలు చేస్తాయి. వాటిని వాల్ట్ల్లో నిల్వ చేస్తాయి. సెబీ నమోదిత కస్టోడియన్లు.. ఇలా గోల్డ్ ఈటీఎఫ్లకు సరిపడా బంగారాన్ని ఫండ్స్ సంస్థలు కొనుగోలు చేస్తుందీ, లేనిదీ పర్యవేక్షిస్తాయి. ఆడిటింగ్ కూడా ఉంటుంది. ఈ వివరాలను స్టాక్ ఎక్సేంజ్లు, సెబీకి కూడా సమర్పించాల్సి ఉంటుంది. కనుక ఇందులో రిస్క్ దాదాపుగా ఉండదు. కానీ, ఒక అంశాన్ని ఇన్వెస్టర్లు తప్పకుండా గుర్తు ంచుకోవాలి. స్టాక్స్ మాదిరే బంగారం ఈటీఎఫ్ ధరలు కూడా రోజువారీగా అంతర్జాతీయ ధరలను అనుసరించి హెచ్చు, తగ్గులకు గురవుతుంటాయి. కొనుగోలు చేసిన తర్వాత నష్టం కనిపిస్తే విక్రయిం చడం వంటి చర్యలు ఇందులో అనుకూలించవు. లిక్విడిటీ: సుమారు 13 గోల్డ్ ఈటీఎఫ్లు ఎన్ఎస్ఈలో లిస్ట్ అయి ఉండగా.. 11 గోల్డ్ ఈటీఎఫ్లు బీఎస్ఈలో అందుబాటులో ఉన్నాయి. కాకపోతే వీటి అన్నింటిలోనూ చురుకైన ట్రేడింగ్ ఉండడం లేదు. కనుక ఎంపిక చేసుకునే ఈటీఎఫ్లో ట్రేడింగ్ పరిమాణం ఆరోగ్యకర స్థాయిలో ఉన్నదీ, లేనిదీ ఇన్వెస్టర్లు ముందుగానే పరిశీలించుకోవాలి. లిక్విడిటీ ఎక్కువగా ఉన్న ఈటీఎఫ్ను ఎంపిక చేసుకుంటే విక్రయించుకోవడం సులభం అవుతుంది. నిప్పన్ ఇండియా ఈటీఎఫ్ గోల్డ్ బీస్, హెచ్డీఎఫ్సీ గోల్డ్ ఈటీఎఫ్లను ఇన్వెస్టర్లు పరిశీలించొచ్చు. వీటిల్లో ఎక్స్పెన్స్ రేషియో తక్కువగా ఉంది. అదే సమయంలో ట్రేడింగ్ కూడా ఎక్కువ పరిమాణంలో నమోదవుతుంటుంది. సార్వభౌమ బంగారం బాండ్ పసిడిని పోగు చేసుకోవాలని భావించే వారికి అందుబాటులో ఉన్న ఎన్నో మార్గాల్లో సౌర్వభౌమ బంగారం బాండ్ (ఎస్జీబీ) అత్యంత మెరుగైనది. ఇందులో పెట్టే ప్రతీ రూపాయికి భారత సర్కారు హామీ ఉంటుంది. ప్రభుత్వం తరఫున ఆర్బీఐ ఈ బాండ్లను ఏటా పలు పర్యాయాలు ఇష్యూ చేస్తుంటుంది. ఈ బాండ్ గ్రాముల రూపంలో లభిస్తుంది. కనీసం ఒక గ్రాము నుంచి కొనుగోలు చేసుకోవచ్చు. 2015 నవంబర్ నుంచి ఎస్జీబీలను ఆర్బీఐ విడుదల చేస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో నవంబర్ 29 నుంచి డిసెంబర్ 3 వరకు, జనవరి 10 నుంచి 14వరకు, ఫిబ్రవరి 28 నుంచి మార్చి 4వ తేదీ మధ్య తదుపరి ఇష్యూలు అందుబాటులోకి రానున్నాయి. ఇష్యూ సమయంలో మార్కెట్ రేటు ఆధారంగా ఒక్కో గ్రాము రేటును ఆర్బీఐ ప్రకటిస్తుంది. ఎనిమిదేళ్ల కాల వ్యవధి తర్వాత అప్పటి మార్కెట్ విలువ ఆధారంగా ఇన్వెస్టర్కు చెల్లింపులు చేస్తారు. అంతేకాదు. బంగారం పెట్టుబడి పెట్టేనాటి విలువపై 2.5 శాతం చొప్పున వార్షిక వడ్డీ ఆదాయం కూడా ఈ బాండ్లో ఇన్వెస్ట్ చేసిన వారు అందుకోవచ్చు. ఆరు నెలలకు ఒకసారి వడ్డీ ఆదాయం చెల్లిస్తారు. కొనుగోలు మార్గాలు: ఆర్బీఐ వెబ్సైట్ నుంచి కొనుగోలు చేసుకోవచ్చు. అలాగే, షెడ్యూల్డ్ వాణిజ్య బ్యాంకులు, ఎంపిక చేసిన పోస్టల్ కార్యాలయాలు, స్టాక్ హోల్డింగ్ కార్పొరేషన్ (ఎస్హెచ్సీఐఎల్) శాఖలు, క్లియరింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, స్టాక్ ఎక్సేంజ్లు బీఎస్ఈ, ఎన్ఎస్ఈల నుంచి నేరుగా, స్టాక్ ఎక్సేంజ్ల సభ్యులైన బ్రోకర్ల రూపంలోనూ కొనుగోలు చేసుకోవచ్చు. ఆర్బీఐ తాజా ఇష్యూల సమయంలో కొనుగోలు చేసుకోవచ్చు. లేదంటే క్రితం ఇష్యూలకు సంబంధించిన ఎస్జీబీలు స్టాక్ ఎక్సేంజ్ల్లో ట్రేడ్ అవుతుంటాయి. వీటిల్లో ఏ ట్రేడింగ్ రోజైనా పెట్టుబడులు పెట్టుకోవచ్చు. ఆర్బీఐ ఇష్యూలో పాల్గొనే వారు.. ఎస్జీబీల కొనుగోలుకు పాన్ తప్పనిసరిగా ఇవ్వాలి. ఎస్జీబీలను డిమ్యాట్ ఖాతాలో ఉంచుకోవాలని భావిస్తే.. అప్పుడు డీపీ ఐడీ, క్లయింట్ ఐడీని కూడా దరఖాస్తులో పేర్కొనాల్సి ఉంటుంది. చెక్కు, డీడీ లేదా ఎలక్ట్రానిక్ చెల్లింపుల సాధనాల ద్వారా చెల్లింపులు చేయవచ్చు. నగదుతోనూ కొనుగోలు చేసుకోవచ్చు. కానీ, రూ.20,000కే ఈ పరిమితి ఉంది. ఇంతకుమించి కొనుగోలు చేయాలనుకుంటే డిజిటల్ మార్గంలోనే చెల్లించాల్సి ఉంటుంది. ఒక్కో వ్యక్తి ఒక ఆర్థిక సంవత్సరంలో గరిష్టంగా 4 కిలోల వరకు బంగారం బాండ్లను కొనుగోలు చేసుకోవచ్చు. వ్యయాలు: బంగారాన్ని డెరివేటివ్ మార్గంలో కలిగి ఉండే సాధనమే ఎస్జీబీ. భౌతిక రూపానికి బదులు డాక్యుమెంట్ రూపంలో ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది. దీనివల్ల పెద్దగా వ్యయాలు ఏవీ ఉండవు. అదే బంగారం ఆభరణాలు అయితే తయారీ చార్జీలు, వెస్టేజీ చార్జీల రూపంలో కొంత నష్టపోవాలి. పైగా తిరిగి అవసరమైనప్పుడు ఆ బంగారాన్ని మార్పిడి చేసుకోవాలన్నా, విక్రయించుకోవాలన్నా మళ్లీ తరుగు తీసేస్తారు. ఈ విధంగా కొంత నష్టం. కొనుగోలు సమయంలో జీఎస్టీ చార్జీలు చెల్లించాలి. ఇటువంటివన్నీ ఎస్జీబీలు, ఇతర డిజిటల్ గోల్డ్ సాధనాల్లో ఇన్వెస్ట్ చేయడం వల్ల ఆదా చేసుకోవచ్చు. పెట్టుబడిని వెనక్కి తీసుకోవాలంటే: ఎస్జీబీ కాల వ్యవధి ఎనిమిదేళ్లు. ముందుగానే పెట్టుబడిని వెనక్కి తీసుకోవాలనుకుంటే ఐదేళ్లు పూర్తయిన తర్వాత సాధ్యపడుతుంది. ఐదో ఏట ముగిసినప్పటి నుంచి ఏడాదికోసారి ఆర్బీఐ ప్రత్యేక విండో ద్వారా ఇందుకు అవకాశం కల్పిస్తుంది. విండో ప్రారంభానికి ముందు మూడు రోజుల సగటు బంగారం మార్కెట్ ధర ఆధారంగా కొనుగోలు ధరను ఆర్బీఐ నిర్ణయిస్తుంది. ఆలోపే వైదొగాలని అనుకుంటే స్టాక్ ఎక్సేంజ్ల్లో విక్రయించుకోవచ్చు. కాకపోతే స్టాక్ ఎక్సేంజ్ల్లో ఒక్కోరోజు ట్రేడింగ్ పరిమాణం తక్కువగా ఉంటుందని గుర్తుంచుకోవాలి. పన్ను: ఎస్జీబీపై ఏటా లభించే 2.5 శాతం ఆదాయం ఇన్వెస్టర్ వార్షిక ఆదాయానికి కలిపి పన్ను రిటర్నుల్లో చూపించాలి. ఇన్వెస్టర్ ఆదాయం ఆదాయం ఏ శ్లాబు పరిధిలోకి వస్తే నిబంధనల మేరకు పన్ను చెల్లిస్తే సరిపోతుంది. ఎనిమిదేళ్ల కాల వ్యవధి ముగిసిన తర్వాత లభించే మూలధన లాభం (పెట్టుబడిపై సమకూరిన లాభం)పై పన్ను ఉండదు. ఒకవేళ ఎనిమిదేళ్లలోపే ఎస్జీబీని విక్రయిస్తే కనుక అప్పుడు పన్ను బాధ్యత వేర్వేరుగా ఉంటుంది. పెట్టబడి తేదీ నుంచి మూడేళ్లు నిండక ముందే విక్రయించితే.. లాభం స్వల్పకాలిక మూలధన లాభం అవుతుంది. ఇది ఇన్వెస్టర్ వ్యక్తిగత ఆదాయానికి కలుస్తుంది. మూడేళ్లు నిండిన తర్వాత విక్రయించిన సమయంలో వచ్చిన లాభం దీర్ఘకాలిక మూలధన లాభం అవుతుంది. అప్పుడు లాభంపై 20 శాతం పన్ను చెల్లించాల్సి ఉంటుంది. డిజిటల్ గోల్డ్ బంగారాన్ని డిజిటల్ రూపంలో ఫిన్టెక్ సంస్థలు ఆఫర్ చేస్తున్నాయి. బంగారంలో పెట్టుబడులకు కొత్తగా అందుబాటులోకి వచ్చిన సాధనం ఇది. ఎంఎంటీసీ పీఏఎంపీ, సేఫ్గోల్డ్, అగ్మాంట్ గోల్డ్ అనే మూడు సంస్థలు డిజిటల్ గోల్డ్ను నేరుగాను, ఫిన్టెక్ సంస్థల ద్వారా అందిస్తున్నాయి. కొనుగోలు చేసిన విలువకు సరిపడా డిజిటల్ గోల్డ్ ఇన్వెస్టర్ ఖాతాలో ఉంటుంది. దీనికి అంతే విలువైన భౌతిక బంగారాన్ని పైన చెప్పుకున్న మూడు సంస్థలు కొనుగోలు చేసి వాల్టుల్లో ఉంచుతాయి. ఇందులో ఉన్న సౌలభ్యం ఏమిటంటే.. ఇన్వెస్టర్ తనకు అవసరనుకుంటే బంగారాన్ని భౌతిక రూపంలోడెలివరీ తీసుకోవచ్చు. లేదంటా ఆభరణాలుగానూ మార్చుకోవచ్చు. రిస్క్: ఎస్జీబీలపై ఆర్బీఐ పర్యవేక్షణ, నియంత్రణ ఉంటుంది. అలాగే, గోల్డ్ ఈటీఎఫ్లపై సెబీ పర్యవేక్షణ, నియంత్రణ ఉంటుంది. కానీ, డిజిటల్ గోల్డ్పై ప్రస్తుతానికి నియంత్రణల్లేవు. ఇటీవలి వరకు స్టాక్బ్రోకర్లు, వెల్త్మేనేజ్మెంట్ సంస్థలు సైతం డిజిటల్ గోల్డ్ను ఆఫర్ చేశాయి. కానీ, దీనికి దూరంగా ఉండాలని సెబీ ఆదేశించింది. డిజిటల్ గోల్డ్లో క్రయ, విక్రయ లావాదేవీల సేవలు 2021 సెప్టెంబర్ 10 నుంచి అందించడానికి వీల్లేదని ఆదేశాలు జారీ చేసింది. అయితే, ఎంఎంటీసీ పీఏఎంపీ, సేఫ్గోల్డ్, అగ్మాంట్ గోల్డ్ అన్నవి ట్రస్టీలు. భౌతిక బంగారాన్ని ఇవి కొనుగోలు చేసి, నిల్వ చేస్తున్నాయా అన్న దానిపై క్రమం తప్పకుండా ఆడిట్లు నడుస్తుంటాయి. ఎస్జీబీ, గోల్డ్ ఈటీఎఫ్లతో పోలిస్తే వీటిల్లో రిస్క్ ఎక్కువ. కొనుగోళ్లు: రిస్క్ ఉన్నా ఫర్వాలేదనుకుంటే.. ఈ మూడు సంస్థల వెబ్సైట్ల నుంచి నేరుగాను, వీటితో భాగస్వామ్యం కలిగిన సంస్థల నుంచి కొనుగోలు చేసుకోవచ్చు. గూగుల్పే, అమెజాన్, ఫ్లిప్కార్ట్, కాయిన్బజార్ తదితర భాగస్వామ్య సంస్థలు సైతం డిజిటల్ గోల్డ్ను ఆఫర్ చేస్తున్నాయి. ఆయా సంస్థలకు కేవైసీ వివరాలు ఇవ్వాల్సి వస్తుంది. కొన్ని సంస్థలు, ఆధార్, పాన్ తప్పనిసరిగా అడుగుతున్నాయి. ఎస్జీబీ, గోల్డ్ ఈటీఎఫ్ల్లో ఒక గ్రాము నుంచే కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది. కానీ, డిజిటల్ గోల్డ్ అయితే రూపాయితోనూ కొనుగోలు చేసుకోగల సౌలభ్యం ఉంది. సేఫ్గోల్డ్ కనీసం రూ.10 మొత్తంతో కొనుగోలుకు అనుమతిస్తోంది. వ్యయాలు: కొనుగోలు విలువపై 3 శాతం జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుంది. అలాగే, కస్టమ్స్ డ్యూటీ, ఇతర పన్నులు కొనుగోలు ధరలో కలసి ఉంటాయి. ఎంఎంటీసీ పీఏఎంపీ అయితే 2.9 శాతం పేమెంట్ గేట్వే చార్జీలను కూడా తీసుకుంటోంది. డిజిటల్ గోల్డ్కు మొదటి ఐదేళ్లు స్టోరేజీ చార్జీలు ఉండవు. ఐదేళ్ల తర్వాత నుంచి సేఫ్గోల్డ్ అప్పటి విలువపై 0.24 శాతం, ఎంఎంటీసీ పీఏఎంపీ 0.4 శాతం చొప్పున స్టోరేజీ చార్జీలను వార్షికంగా వసూలు చేస్తున్నాయి. భౌతిక రూపంలో బంగారాన్ని డెలివరీ తీసుకోవాలంటే అందుకు తయారీ చార్జీలు, డెలివరీ చార్జీలను భరించాలి. మరో అంశం.. కొనుగోలు ధర, అమ్మకం ధర మధ్య వ్యత్యాసం ఇక్కడ సాధారణంగా అమలవుతుంటుంది. ఈ రూపంలోనూ ఇన్వెస్టర్లు కొంత నష్టపోవాల్సి ఉంటుంది. కాలవ్యవధి: ఆగ్మంట్ ఐదేళ్లు, సేఫ్గోల్డ్ పదేళ్లను మెచ్యూరిటీ పీరియడ్గా అమలు చేస్తున్నాయి. ఎంఎంటీసీ పీఏఎంపీ ఇటువంటి నిబంధన అమలు చేయడం లేదు. కాల వ్యవధి తర్వాత విక్రయించుకోవవచ్చు. లేదంటే బంగారం బార్లు, కాయిన్లు, లేదా ఈ సంస్థలో ఒప్పందం కలిగిన జ్యుయలర్స్ నుంచి బంగారం ఆభరణాల రూపంలో డెలివరీ తీసుకోవచ్చు. టాటా గ్రూపులో భాగమైన తనిష్క్.. సేఫ్గోల్డ్తో ఒప్పందం చేసుకుంది. సేఫ్గోల్డ్ వద్ద డిజిటల్ గోల్డ్ను కలిగిన వారు.. తమకు కావాలనుకున్నప్పుడు సమీపంలోని తనిష్క్ స్టోర్కు వెళ్లి ఆభరణాలుగా మార్చుకోవచ్చు. ఇందుకు తయారీ, ఇతర చార్జీలు, పన్నులు చెల్లించాల్సి ఉంటుంది. డిజిటల్ గోల్డ్లోనూ పన్ను బాధ్యత ఎస్జీబీల్లో మాదిరే ఉంటుంది. గోల్డ్ ఫండ్స్ ఇవి ఒక రకం మ్యూచువల్ ఫండ్స్. గోల్డ్ ఈటీఎఫ్ల్లో ఇన్వెస్ట్ చేస్తాయి. అందుకని వీటిని ఫండ్ ఆఫ్ ఫండ్స్ అంటారు. మ్యూచువల్ ఫండ్స్ సంస్థల పోర్టళ్ల నుంచి నేరుగా వీటిని కొనుగోలు చేసుకోవచ్చు. ఈ మార్గంలో ఇన్వెస్ట్ చేసుకుంటే ఎటువంటి అదనపు చార్జీలు ఉండవు. అలాగే, మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ల నుంచి కొనుగోలు చేసుకోవచ్చు. ఇలా అయితే డిస్ట్రిబ్యూటర్ల కమీషన్ రూపంలో అదనపు చార్జీని భరించాల్సి వస్తుంది. ఇది విడిగా ఉండదు కానీ, ఎక్స్పెన్స్ రేషియోలోనే కలుస్తుంది. వీటి కొనుగోలుకు పాన్, ఆధార్ నంబర్, చిరునామా, బ్యాంకు ఖాతా వివరాలను ఇవ్వాలి. ఏదైనా మ్యూచువల్ ఫండ్ పథకంలో ఇప్పటికే ఇన్వెస్ట్ చేసి ఉంటే తాజాగా కేవైసీ వివరాలను ఇవ్వాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే మీ పాన్, ఆధార్ వివరాల ఆధారంగా సెంట్రల్ కేవైసీ డేటాబేస్ నుంచి ఫండ్ సంస్థే వివరాలు తీసుకుంటుంది. గోల్డ్ ఈటీఎఫ్ల కొనుగోలుకు తక్కువలో తక్కువ రూ.4,000కుపైనే పెట్టుబడి అవసరం. కానీ, గోల్డ్ ఫండ్స్ పథకాల్లో రూ.100 నుంచి కూడా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. వ్యయాలు/పన్నులు: ఫండ్ ఆఫ్ ఫండ్ కనుక వ్యయాలు రెండింతలు ఉంటాయి. గోల్డ్ ఫండ్స్ తన నిర్వహణలోని పెట్టుబడులను గోల్డ్ ఈటీఎఫ్ల్లో ఇన్వెస్ట్ చేస్తాయి కనుక.. అక్కడ ఎక్స్పెన్స్ రేషియో ఒకటి అమలవుతుంది. తిరిగి గోల్డ్ ఫండ్స్ కూడా ఎక్స్పెన్స్ రేషియో వసూలు చేస్తాయి. పెట్టుబడి పెట్టిన ఏడాదిలోపు విక్రయించితే ఎగ్జిట్ లోడ్ కూడా అమలవుతుంది. మ్యూచువల్ ఫండ్స్ సంస్థల పోర్టళ్ల నుంచే కొనుగోలు, విక్రయాలు చేసుకోవచ్చు. విక్రయించిన తర్వాత మీ రిజిస్టర్డ్ బ్యాంకు ఖాతాకు ఆ మొత్తం జమ అవుతుంది. బంగారంలో పెట్టబడులు అన్నింటికీ పైన ఎస్జీబీలో చెప్పుకున్నట్టే పన్ను బాధ్యతలు వర్తిస్తాయి. గోల్డ్ ఫండ్స్లో ఉన్న ఒక అనుకూలత ఏమిటంటే.. సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్) రూపంలో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. కనీస సిప్ రూ.100 నుంచి పెట్టుకోవచ్చు. పైగా డీమ్యాట్ ఖాతా కూడా అవసరం లేదు. గోల్డ్ ఈటీఎఫ్లు స్టాక్ ఎక్సేంజ్ల్లో ట్రేడవుతాయి. కనుక విక్రయించుకునేందుకు సరిపడా వ్యాల్యూమ్ అవసరం. అదే గోల్డ్ ఈటీఎఫ్లకు ఈ విధమైన లిక్విడిటీ రిస్క్ లేదు. మీరు ఎప్పుడైనా విక్రయించుకోవచ్చు. ఫండ్స్ సంస్థలు నిబంధనలకు అనుగుణంగా మీకు చెల్లింపులు చేస్తాయి. ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ రెగ్యులర్ గోల్డ్ సేవింగ్స్ ఫండ్, ఎస్బీఐ గోల్డ్ ఫండ్లను ఈ విభాగంలో ఇన్వెస్టర్లు పరిశీలించొచ్చు. వీటిల్లో ఎక్స్పెన్స్ రేషియో 0.50 శాతం వరకు ఉంది. మ్యూచువల్ ఫండ్స్ నిర్వహణలోని పథకాలు కనుక సెబీ నియంత్రణ, పర్యవేక్షణ ఉంటుంది. -
బంగారం ఫండ్లో సిప్ చేయొచ్చా?
స్టాక్మార్కెట్ పతనాల్లో డెట్ మ్యూచువల్ ఫండ్స్పై ఏ విధమైన ప్రభావం ఉంటుంది? – అమిత్ ఈక్విటీ మార్కెట్లు పడిపోయిన సందర్భాల్లో డెట్ ఫండ్స్పై పెద్ద ప్రభావం ఉండదు. ఎందుకంటే స్థిరాదాయ పథకాల మార్కెట్ తీరుతెన్నులు భిన్నంగా ఉంటాయి. ఆర్థిక వ్యవస్థ ఆరోగ్యం, ద్రవ్యోల్బణ రేట్లు డెట్ ఫండ్స్పై ప్రభావం చూపిస్తాయి. ద్రవ్యోల్బణం పెరిగిపోతుంటే వడ్డీ రేట్లు కూడా పెరిగిపోతాయి. దీనివల్ల బాండ్ల రేట్లపై ప్రభావం పడుతుంది. వడ్డీ రేట్లు తగ్గిపోతున్న సందర్భాల్లో బాండ్లపై రాబడులు పెరుగుతాయి. క్రెడిట్ నాణ్యత లేదా ఆయా బాండ్ల క్రెడిట్ రేటింగ్లు కూడా ప్రభావం చూపిస్తాయి. బలహీన ఆర్థిక పరిస్థితుల వల్ల చాలా కంపెనీలు సమస్యలను చూస్తున్నట్టయితే.. ఆయా కంపెనీలు బాండ్లపై వడ్డీ చెల్లింపులు చేయలేని పరిస్థితులు నెలకొంటే క్రెడిట్ రేటింగ్ క్షీణించడానికి దారితీస్తుంది. అది డెట్ ఫండ్స్పై ప్రభావం చూపిస్తుంది. ఆ తర్వాత లిక్విడిటీ కూడా ముఖ్యమైన అంశం అవుతుంది. వ్యవస్థలో నగదు లభ్యత తగ్గినప్పుడు బాండ్లపై ప్రభావం ఉంటుంది. ఫిక్స్డ్ ఇన్కమ్ మార్కెట్పై ఈ అంశాలన్నీ ప్రభావం చూపిస్తాయిని తెలుసుకోవాలి. బాండ్లలో రాబడులు తక్కువగా ఉన్న సమయంలో.. రిస్క్ తీసుకోవడం వల్ల అధిక రాబడులకు ఈక్విటీల్లో అవకాశం ఉంటుంది. కనుక వడ్డీ రేట్లు తక్కువగా ఉన్నప్పుడు ఇన్వెస్టర్లు ఈక్విటీ మార్కెట్ వైపు మొగ్గు చూపుతుంటారు. ఐదేళ్ల కాలానికి బంగారం ఫండ్లో సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్(సిప్)లో ఇన్వెస్ట్ చేయవచ్చా? – కౌశిక్ సాధారణంగా చెప్పుకోవాలంటే బంగారం ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయకూడదు. దీర్ఘకాలానికి బంగారాన్ని పెట్టుబడి సాధనంగా ఎంపిక చేసుకోకూడదు. ఎందుకంటే నిల్వ ఉండే విలువే కానీ.. పెట్టుబడిని వృద్ధి చేసేది కాదు. బాండ్స్ లేదా స్థిరాదాయ సాధనాల్లో ఇన్వెస్ట్ చేసినప్పుడు ఒకరికి మీరు రుణం ఇచ్చినట్టు అవుతుంది. దానిపై మీకు ఊహించతగిన రాబడులు వస్తాయి. ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేసినప్పుడు కంపెనీలో ఆ మేరకు వాటాలు పొందినట్టు అవుతుంది. కంపెనీ లాభాలు, డివిడెండ్లలో ఆ మేరకు వాటా లభిస్తుంది. బంగారంలో ఇన్వెస్ట్ చేయడం వల్ల వచ్చేదేమీ లేదు. ఇది ఉత్పాదకత సాధనం కాదు. అందుకనే దీర్ఘకాల పెట్టుబడుల విషయంలో బంగారానికి దూరంగా ఉండాలి. బంగారాన్ని ఈటీఎఫ్ల రూపంలో కలిగి ఉండడం మరో మార్గం. కానీ, దీనిపై ఎక్స్పెన్స్ రేషియో రూపంలో వ్యయాలను భరించాల్సి ఉంటుంది. పైగా డీమ్యాట్ ఖాతా లేకుంటే వీటిని కొనుగోలు చేసుకోవడం కుదరదు. సులభంగా కొనుగోలు చేసుకోవడానికి ఇదొక అడ్డంకి. గోల్డ్ ఈటీఎఫ్ల్లో ఇన్వెస్ట్ చేసే బంగారం ఫండ్స్ కూడా ఉన్నాయి. కానీ, వీటిల్లో ఈటీఎఫ్ల కంటే ఎక్కువ చార్జీలుంటాయి. సౌర్వభౌమ బంగారం బాండ్ల (ఎస్జీబీలు) రూపంలో బంగారాన్ని కలిగి ఉండడం చక్కని మార్గం అవుతుంది. దేశీయ ఇన్వెస్టర్లకు ఇదొక ఆకర్షణీయమైన సాధనం. కొనుగోలు చేసుకోవడం సులభంగా ఉంటుంది. బ్యాంకు ద్వారా ప్రభుత్వం నుంచి నేరుగా ఎస్జీబీలను కొనుగోలు చేసుకోవచ్చు. సెకండరీ మార్కెట్లోనూ అందుబాటులో ఉంటాయి. ఎస్జీబీలపై.. వార్షికంగా 2.5 శాతం వడ్డీ రాబడి లభిస్తుంది. బంగారం ధరల వృద్ధి, క్షీణతతో సంబంధం లేకుండా వడ్డీ చెల్లింపులు ఉంటాయి. బంగారం ధరల్లో మార్పునకు ఈ వడ్డీ రాబడి అదనం. కనుక దేశీయ ఇన్వెస్టర్లు బంగారంపై ఇన్వెస్ట్ చేసుకోవాలంటే అందుకు ఎస్జీబీ ఒక్కటే మెరుగైన సాధనం అవుతుంది. - ధీరేంద్ర కుమార్, సీఈవో, వాల్యూ రీసెర్చ్ -
ఈక్విటీలే ముద్దు.. గోల్డ్ ఈటీఎఫ్లు వద్దు
న్యూఢిల్లీ: ఈక్విటీలవైపు మొగ్గు చూపుతున్న ఇన్వెస్టర్లు .. క్రమంగా పసిడి ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ (ఈటీఎఫ్) నుంచి వైదొలుగుతున్నారు. ఏప్రిల్లో 14 గోల్డ్ లింక్డ్ ఈటీఎఫ్ల నుంచి మరో రూ. 54 కోట్ల పెట్టుబడులను ఉపసంహరించుకున్నారు. దీంతో గోల్డ్ ఫండ్స్ నిర్వహణలోని అసెట్స్ విలువ రూ. 4,802 కోట్లకు తగ్గింది. మరోవైపు, ఈక్విటీలు, ఈక్విటీ ఆధారిత సేవింగ్స్ స్కీముల్లో రూ. 12,400 కోట్ల పెట్టుబడులు నమోదయ్యాయి. అటు లిక్విడ్ ఫండ్స్లోకి రూ.1.16 లక్షల కోట్లు చేరాయి. అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ (యాంఫీ) విడుదల చేసిన తాజా గణాంకాల్లో ఈ అంశాలు వెల్లడయ్యాయి. మార్చిలో గోల్డ్ ఈటీఎఫ్ల నుంచి ఇన్వెస్టర్లు రూ. 62 కోట్ల పెట్టుబడులు ఉపసంహరించుకున్నారు. మొత్తం మీద ఏప్రిల్లో మ్యూచువల్ ఫండ్ స్కీముల్లోకి రూ. 1.4 లక్షల కోట్లు వచ్చి చేరాయి. దీంతో గత నెలాఖరు నాటికి ఫండ్ నిర్వహణలోని ఆస్తుల విలువ రూ. 21.36 లక్షల కోట్ల నుంచి రూ. 23.25 లక్షల కోట్లకు చేరింది. గడిచిన అయిదేళ్లుగా గోల్డ్ ఈటీఎఫ్లలో ట్రేడింగ్ ఒక మోస్తరుగానే ఉంటోంది. 2012–13లో రూ. 1,414 కోట్ల మేర పెట్టుబడులు చూసిన గోల్డ్ ఈటీఎఫ్ల్లో ఆ తర్వాత నుంచి ఉపసంహరణలే ఎక్కువగా ఉంటున్నాయి. 2005 నుంచి క్రమంగా పెరుగుతూ వచ్చి, 2011–12లో రికార్డు స్థాయిలకు చేరిన పసిడి .. 2012లో క్షీణించింది. అప్పట్నుంచి ఔన్సుకి (31.1 గ్రాములు) 1,100–1,400 డాలర్ల శ్రేణిలో తిరుగాడుతోందని మార్నింగ్స్టార్ మేనేజర్ రీసెర్చ్ డైరెక్టర్ కౌస్తుభ్ బేలాపుర్కర్ తెలిపారు. ఒకవైపు పసిడి ఇలా ఒకే శ్రేణిలో తిరుగాడుతుండటం, మరోవైపు ఈక్విటీలు మెరుగ్గా రాణిస్తుండటం తదితర అంశాల కారణంగా దేశీ ఇన్వెస్టర్లు .. గోల్డ్ ఈటీఎఫ్లకు దూరంగా ఉంటున్నారని ఆయన వివరించారు. -
గోల్డ్ ఈటీఎఫ్ల్లో అమ్మకాలు
న్యూఢిల్లీ: గోల్డ్ ఈటీఎఫ్ల పట్ల ఇన్వెస్టర్లలో అనాసక్తి కొనసాగుతూనే ఉంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి రెండు నెలలు ఏప్రిల్, మేలో రూ.137 కోట్ల విలువ మేర గోల్డ్ ఈటీఎఫ్లను ఇన్వెస్టర్లు విక్రయించి తమ పెట్టుబడులను వెనక్కి తీసేసుకున్నారు. మ్యూచువల్ ఫండ్స్ అసోసియేషన్ గణాంకాల ప్రకారం ఏప్రిల్ నెలలో 14 గోల్డ్ ఈటీఎఫ్లలో రూ.66 కోట్ల మేర, మే నెలలో రూ.71 కోట్ల మేర విక్రయాలు జరిగాయి. గోల్డ్ ఈటీఎఫ్లలో రాబడులు తీసికట్టుగా ఉండడం, అదే సమయంలో ఈక్విటీల్లో మెరుగైన రాబడుల నేపథ్యంలో ఈ విక్రయాలు చోటు చేసుకోవడం గమనార్హం. ఎందుకంటే ఇదే కాలంలో ఈక్విటీ, ఈక్విటీ లింక్డ్ సేవింగ్ స్కీమ్లలో నికర పెట్టుబడులు రూ.20,000 కోట్లుగా ఉన్నాయి. గత నాలుగు ఆర్థిక సంవత్సరాలుగా గోల్డ్ ఈటీఎఫ్లకు అనాదరణే ఎదురవుతోంది. 2013–14లో రూ.2,293 కోట్లు, 2014–15లో రూ.1,475 కోట్లు, 2015–16లో రూ.903 కోట్ల మేర గోల్డ్ ఈటీఎఫ్లలో నికర విక్రయాలు చోటు చేసుకున్నాయి. 2016–17లో మాత్రం అమ్మకాలు కొంచెం నెమ్మదించాయి. గోల్డ్ ఫండ్స్లో పెట్టుబడుల విలువ ఈ ఏడాది మే నెల చివరికి రూ.5,298 కోట్లకు తగ్గాయి. అంతర్జాతీయంగా బంగారం ధరలు ఔన్స్కు (31.10 గ్రాములు) 2012–13లో గరిష్ట స్థాయి 1,900 డాలర్లు నుంచి క్షీణించిన తర్వాత 1,050 – 1,350 డాలర్ల మధ్యలోనే స్థిరపడినట్టు మార్నింగ్ స్టార్ ఫండ్ రీసెర్చ్ హెడ్ కౌస్తభ్ బేలపుర్కార్ తెలిపారు. ‘‘ధరలు క్షీణించడం, రూపాయి బలపడడానికి తోడు ఈక్విటీ మార్కెట్లు మెరుగ్గా రాణిస్తున్నాయి. గోల్డ్ ఫండ్స్, ఈటీఎఫ్లు ఇన్వెస్ట్మెంట్ పరంగా అంతగా ప్రాచుర్యం పొందిన ఆప్షన్లు కావు. ఇన్వెస్టర్లు తాజా పెట్టుబడులను గోల్డ్ ఈటీఎఫ్లకు కేటాయించకపోగా, క్రమంగా తమ పెట్టుబడులను ఉపసంహరించుకుంటున్నారు’’ అని బేలపుర్కార్ వివరించారు. -
గోల్డ్ ఫండ్స్.. ఇప్పుడొద్దు!
శ్రీధర్కు ఈ మధ్యే పెళ్లి కుదిరింది. అవసరం కాబట్టి కొంత బంగారాన్ని కొనాలనుకున్నాడు. బంగారం ధరలు కూడా కొంచెం తగ్గాయి కదా!! కొనుగోలుకు ఇదే మంచి సమయమనుకున్నాడు. కాకపోతే అదే సమయంలో పేపర్లో ఓ వార్త చదివాడు. బంగారం ధరలు మరింత తగ్గుతాయన్నది ఆ వార్త సారాంశం. దీంతో శ్రీధర్ సందిగ్ధంలో పడ్డాడు. బంగారంపై ఇప్పుడు ఇన్వెస్ట్ చేద్దామా? వద్దా? అనే విషయమై ఒక నిర్ణయానికి రాలేకపోయాడు. చివరికి ఈ వ్యవహారాల్లో అనుభవం ఉన్న స్నేహితుడితో విషయం చెప్పగా... ‘‘బంగారాన్ని భౌతికంగా కొనటమే కాదు! గోల్డ్ ఈటీఎఫ్లు, ఫండ్ ఆఫ్ ఫండ్స్, బంగారం బాండ్లు వంటి సాధనాల ద్వారా కూడా కొనుగోలు చేయొచ్చు’’ అని చెప్పాడాయన. కాకపోతే పేపర్ గోల్డ్ పథకాలుగా కూడా పిలిచే గోల్డ్ ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్లు (ఈటీఎఫ్లు) కొన్నాళ్ల కిందటివరకూ బాగా ప్రాచుర్యం పొందాయని, ఇపుడు మాత్రం చాలామంది వాటికి దూరంగా ఉంటున్నారని కూడా చెప్పాడు. ఆ వివరాలే ఈ ప్రత్యేక కథనం... ఏడాది కాలంలో2-8% మేర తగ్గిన రాబడి ⇒ బంగారం ధరలు పడితే పరిస్థితి మరింత దారుణం! ⇒ 2013 నుంచి సగానికి క్షీణించిన ఈటీఎఫ్ నిర్వహణ విలువ ⇒ రెండేళ్లలో ఈటీఎఫ్ల నుంచి రూ.3,900 కోట్ల ఉపసంహరణ ⇒ కొన్నాళ్లపాటు బంగారానికి దూరంగా ఉండమంటున్న నిపుణులు తగ్గిన గోల్డ్ ఈటీఎఫ్ల రాబడి గోల్డ్ ఈటీఎఫ్లు బాగా ప్రాచుర్యం పొందటానికి కారణం బంగారం ధరలే. ఈ ధరలు ఎగిసే కొద్దీ గోల్డ్ ఈటీఎఫ్ల డిమాండ్ పెరుగుతుంది. కానీ కొంతకాలంగా బంగారం ధరలు తగ్గుతూ వస్తున్నాయి. గడిచిన ఏడాది కాలంలో గోల్డ్ ఈటీఎఫ్ల రాబడి దాదాపు 2-8 శాతం మేర తగ్గింది. దీంతో అందులో ఇన్వెస్ట్ చేసిన చాలా మందికి చక్కని రాబడి రాలేదు. దీంతో చాలా మంది ఇన్వెస్టర్లు వారి డబ్బులను గోల్డ్ ఈటీఎఫ్ల నుంచి విత్డ్రా చేసుకుంటున్నారు. మ్యూచ్వల్ ఫండ్స్ అసోసియేషన్ (యాంఫీ) గణాంకాల ప్రకారం.. ఇన్వెస్టర్లు గడిచిన రెండేళ్లలో మొత్తంగా రూ.3,900 కోట్లను విత్డ్రా చేసుకున్నారు. దీనిపై సీఎల్ఎస్ఏ చీఫ్ స్ట్రాటజిస్ట్, మేనేజింగ్ డెరైక్టర్ క్రిస్ వుడ్ మాట్లాడుతూ... ఫెడరల్ రిజర్వు వడ్డీ రేట్లను పెంచిన నేపథ్యంలో ఔన్స్ బంగారం ధర 1,000 డాలర్ల దిగువకు వస్తుందన్నారు. ఒకవేళ బంగారం ధర తగ్గితే గోల్డ్ ఈటీఎఫ్ రాబడి కూడా తగ్గుతుంది. ఈటీఎఫ్లలో ఆగని ఉపసంహరణ ... గోల్డ్ ఈటీఎఫ్ల నుంచి తరలివెళ్లే పెట్టుబడుల ఉపసంహరణకు అడ్డుకట్ట పడటం లేదు. పెట్టుబడుల ఉపసంహరణ వరుసగా 28 నెలలుగా కొనసాగుతోంది. గోల్డ్ ఈటీఎఫ్ల నుంచి ఇన్వెస్టర్లు నికరంగా 2013-14లో రూ.2,293 కోట్లను, 2014-15లో రూ.1,475 కోట్లను, ఈ ఏడాది జవనరి-నవంబర్ వరకూ రూ.845 కోట్లను ఉపసంహరించుకున్నారు. దీంతో గోల్డ్ ఈటీఎఫ్ల మొత్తం నిర్వహణ విలువ మే నెలలో రూ.6,688 కోట్లకు, ఆగస్ట్లో రూ.6,226 కోట్లకు, నవంబర్లో రూ.5,830 కోట్లకు పడిపోయింది. 2007 మార్చిలో గోల్డ్ ఈటీఎఫ్ల నిర్వహణ విలువ (ఏయూఎం) రూ.96 కోట్లుగా ఉంది. అలా అలా పెరుగుతూ... 2013 మార్చిలో గరిష్టంగా రూ.11,648 కోట్లకు చేరింది. అప్పటి నుంచి ఉపసంహరణల దెబ్బకు తగ్గటం మొదలైంది. అప్పటి నుంచి చూస్తే సగం మేర తగ్గిపోయింది. ఆకర్షణ తగ్గిందెందుకు? గోల్డ్ ఈటీఎఫ్లకు ఇన్వెస్టర్లు దూరమవుతుండటానికి ప్రధానంగా రెండు కారణాలు కనిపిస్తున్నాయి. ఒకటేమో ఈక్విటీ మార్కెట్ మంచి రాబడిని అందిస్తుండటం. ఎందుకంటే గడిచిన రెండేళ్లలో బీఎస్ఈ ఇండెక్స్ 5 శాతంమేర బలపడింది. రెండవదేమో బంగారం ధరల్లో తీవ్ర ఒడిదుడుకులుండటం. పెపైచ్చు ఈ ఏడాది కూడా బంగారం ధరలు అంత ఆశాజనకంగా ఉండవనేది మార్కెట్ నిపుణుల మాట. ఫెడ్ వడ్డీ రేట్లు పెరిగితే బంగారం ధరలు తగ్గుతాయని ఇన్వెస్టర్లు కూడా నమ్ముతున్నట్లు తెలుస్తోంది. ఇండియా రేటింగ్ అండ్ రీసెర్చ్ సంస్థ... ఫెడ్ వడ్డీ రేట్లను పెంచితే 10 గ్రాముల బంగారం ధర దేశీయంగా రూ.20,000-రూ.24,000కు తగ్గే అవకాశముందని అంచనా వేసింది. వచ్చే ఏడాది జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికలతో పాటు... యూకేలో యూరో రెఫరెండమ్, చైనా ఆర్థిక వ్యవస్థ మందగమనం వంటి పలు అంశాల వల్ల కూడా బంగారం, వెండి ధరలు కొత్త సవాళ్లను ఎదుర్కొంటాయనేది నిపుణుల అంచనా. అంతర్జాతీయంగా అగ్రస్థానంలో ఉన్న 8 గోల్డ్ ఈటీఎఫ్ల పెట్టుబడులు కూడా మే నెలలో ఐదేళ్ల కనిష్ట స్థాయికి చేరటం గమనార్హం. దూరంగా ఉండటమే బెటర్! ఇన్వెస్ట్మెంట్లు, రాబడి పరంగా చూస్తే గోల్డ్ ఈటీఎఫ్ల పనితీరు బాగులేదు. ఈ ఏడాది భవిష్యత్తు కూడా ఆశాజనకంగా లేదు కనక బంగారం సంబంధిత ఇన్వెస్ట్మెంట్లకు దూరంగా ఉండటం మంచిదంటున్నారు నిపుణులు. ఇటీవల ప్రారంభించిన గోల్డ్ బాండ్ల పథకం కూడా గోల్డ్ ఈటీఎఫ్కు పోటీ అయింది. గోల్డ్ బాండ్స్కు ప్రభుత్వం 2.75% వార్షిక వడ్డీని అందిస్తోంది. ఈ సౌకర్యం ఈటీఎఫ్ల లో లేదు. మార్కెట్లను బట్టి ఈటీఎఫ్ ధర నిర్ణయం జరుగుతుంది. గోల్డ్ బాండ్స్ కొన్నాక బంగారం ధర పెరిగితే గోల్డ్ బాండ్ల ధర కూడా పెరుగుతుంది. డీ మ్యాట్ రూపంలో గోల్డ్ బాండ్లను కొనొచ్చు. బాండ్లపై రుణమూ తెచ్చుకోవచ్చు. ఒడిదుడుకుల్లో బంగారం ధర బంగారం ధరల పతనం 2013 నుంచి కొనసాగుతోంది. ఏడాది ప్రారంభంలో రూ.28,000 మైలురాయిని తాకిన బంగారం ధర... జనవరి మధ్యలో రూ.28,215 స్థాయిక్కూడా చేరింది. అంతర్జాతీయ పరిణామాలు, వినియోగపు భయాల నేపథ్యంలో జులైలో రూ.24,590 వద్దకు పతనమైంది. ఇది 2011 తరవాత కనిష్ఠ స్థాయి. 2013 ఆగస్ట్ 28 నాటి ఆల్టైం గరిష్ట స్థాయి ధర రూ.33,790తో పోలిస్తే ప్రస్తుతం బంగారం ధర 25 శాతం దిగువన ఉంది. ప్రస్తుతం రూ.25,000 శ్రేణిలో కదలాడుతోంది.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
సాక్షి కార్టూన్ 02-05-2024
Lok sabha elections 2024: ఓటేస్తే డైమండ్ రింగ్
Pallavi Dempo: సంపన్న పల్లవి..రాజకీయ వంట కుదిరేనా!
దీనికి జవాబు లేదా బాబూ?
ప్రభుత్వ ఉద్యోగులతో మరో మాట!
సత్యానికి సవాల్!
సీఎస్కేకు బిగ్ షాకిచ్చిన పంజాబ్.. 7 వికెట్ల తేడాతో ఘన విజయం
చరిత్ర సృష్టించిన రుతురాజ్.. ధోని ఆల్టైమ్ రికార్డు బద్దలు
నేహా కుటుంబానికి అండగా అమిత్షా..
ఆ టాలీవుడ్ హీరోతో కలిసి పని చేయాలని ఉంది: అల్లరి నరేశ్
తప్పక చదవండి
- సీఎం రేవంత్పై ’ఈసీ‘కి బీఆర్ఎస్ ఫిర్యాదు
- కాస్మొటిక్ సర్జీలు : యాక్టర్స్ విషాద మరణాలు (ఫొటోలు)
- రిలీజైన ఏడాది తర్వాత తెలుగులో పీరియాడికల్ చిత్రం!
- కేసీఆర్పై ఈసీ చర్యలు, ఎన్నికల ప్రచారంపై 48 గంటల నిషేధం
- తెలుగులో స్ట్రీమింగ్ అవుతోన్న భారీ బడ్జెట్ వెబ్ సిరీస్..!
- నా కుమారుడు వరల్డ్కప్ జట్టుకు ఎంపికవుతాడని స్వీట్లు, టపాసులు తెచ్చా: రింకూ తండ్రి ఆవేదన
- సుల్తాన్పూర్ లోక్సభ స్థానానికి మేనకా గాంధీ నామినేషన్ దాఖలు
- ‘దిశ’ ఎన్కౌంటర్ కేసు.. సిర్పూర్ కర్ కమిషన్ రిపోర్ట్పై స్టే
- జనసేన నేతలకు అవమానం.. టీడీపీ ప్రచార రథంపై నుంచి గెంటేసి..
- రాయ్బరేలీ, అమేథి స్థానాలపై 24 గంటల్లో తుది నిర్ణయం
Advertisement