breaking news
Cookery page
-
చికెన్ పెప్పర్ రసం చేయడం వచ్చా..
వింటర్లో వంటిల్లూ ఔషధాలగనిలా ఉండాలి. తక్షణ శక్తినిచ్చేవి, రోగనిరోధక శక్తిని పెంచే వంటకాల జాబితాను సిద్ధం చేసుకోవాలి. జింజర్ వెజిటబుల్ సూప్, క్వినోవా రోస్టెడ్ వెజిటబుల్, చికెన్ పెప్పర్ రసం.. వంటకాలతో నేటి వంటిల్లు.చికెన్ పెప్పర్ రసంకావలసినవి:మిరియాలు: ఒకటిన్నర టేబుల్ స్పూన్లు; బోన్ లెస్ చికెన్ – 250 గ్రా.లు; జీలకర్ర – టీ స్పూన్; ఆవాలు – అర టీ స్పూన్; ధనియాలు – టీ స్పూన్; కరివేపాకు – 2 రెమ్మలు; టొమాటో – 3; పసుపు – అర టీస్పూన్; నూనె – 3 టేబుల్ స్పూన్లు; వెల్లుల్లి రెబ్బలు – 8; ఎండుమిర్చి – 2; పచ్చిమిర్చి – 2 (నిలువుగా కట్ చేయాలి); ఉప్పు – రుచికి తగినంత; చింతపండు – నిమ్మకాయ పరిమాణం (నీళ్లలో నానబెట్టి, రసం తీయాలి); నీళ్లు – 4 కప్పులు; కొత్తిమీర తరుగు – 2 టేబుల్ స్పూన్లు;తయారీ: ⇒ బాణలి వేడయ్యాక అందులో మిరియాలు, జీలకర్ర, ధనియాలు, ఒక రెమ్మ కరివేపాకు వేసి, సన్నని మంట మీద దోరగా వేయించుకుని, పూర్తిగా చల్లారిన తర్వాత మెత్తని పొడి చేసుకోవాలి ⇒ టొమాటో ముక్కలు, పసుపు వేసి మెత్తటి గుజ్జులా గ్రైండ్ చేసుకోవాలి ⇒ వెడల్పాటి గిన్నె స్టౌ పై పెట్టి, నూనె వేసి వేడి చేయాలి. నూనె కాగిన తర్వాత ఆవాలు, జీలకర్ర, దంచిన వెల్లుల్లి, ఎండు మిర్చి, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి, వేయించాక శుభ్రం చేసుకున్న చికెన్ ముక్కలు, పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసి, బాగా కలపాలి ⇒ చికెన్ రంగు మారే వరకు ఐదు నిమిషాలు వేయించిన తర్వాత, ముందుగా సిద్ధం చేసుకున్న పొడిని వేసి కలపాలి. దీంట్లో టొమాటో గుజ్జు, చింతపండు రసం పోసి కలపాలి ⇒ అవసరమైనన్ని నీళ్లు పోసి, మూత పెట్టి చికెన్ మెత్తగా ఉడికేంతవరకు సన్నని మంట మీద ఉంచాలి. నూనె పైకి తేలుతూ, ఘుమఘుమలాడే వాసన వస్తుండగా చివరగా కొత్తిమీర చల్లి, వేడి వేడిగా వడ్డించాలి.జింజర్ వెజిటబుల్ సూప్రోగనిరోధక శక్తిని పెంచుతుంది, జలుబు చేసినప్పుడు ఈ సూప్ మంచి రిలీఫ్నిస్తుంది.కావలసినవి: ఆలివ్ ఆయిల్ – టేబుల్ స్పూన్; అల్లం ముక్క – సన్నగా తరగాలి; పసుపు – పావు టీ స్పూన్; క్యారెట్ – 1 (సన్నగా తరగాలి); బంగాళదుంప – 1 ( సన్నగా తరగాలి); పాలకూర తరుగు – కప్పు; నీళ్లు – 4 కప్పులు; ఉప్పు – రుచికి తగినంత; మిరియాల పొడి – పావు టీ స్పూన్.తయారీ: ⇒ కడాయిలో ఆలివ్ ఆయిల్ వేడి చేసి, అల్లం వేసి వేగుతుండగానే దీంట్లో కూరగాయల తరుగు, పసుపు వేసి 2–3 నిమిషాలు వేయించాలి ⇒ నీళ్లు పోసి, కూరగాయలు మెత్తబడే వరకు ఉడికించాలి. ఉప్పు వేసి కలపాలి ⇒ చివరగా పాలకూర వేసి, 5 నిమిషాలు ఉడికించి, మిరియాల పొడి చల్లి, వేడి వేడిగా సర్వ్ చేయాలి.క్వినోవా రోస్టెడ్ వెజిటబుల్ ఈ వంటకం ద్వారా ప్రొటీన్లు, ఫైబర్ సమృద్ధిగా లభిస్తుంది.కావలసినవి: క్వినోవా (ఉడికించినది) – కప్పు; క్యారెట్ – 1; చిలగడదుంప – 1; క్యాప్సికమ్ – 1; ఆలివ్ ఆయిల్ – 2 టేబుల్ స్పూన్లు; ఉప్పు – తగినంత; జీలకర్ర – పావు టీ స్పూన్; నల్ల మిరియాలు – 6; పనీర్ క్యూబ్స్ – 4–6; నిమ్మరసం – పావు టీ స్పూన్;తయారీ: ⇒ కూరగాయలను సన్నని ముక్కలుగా కట్ చేసి, వేయించి, పక్కనుంచాలి ⇒ అదే బాణలిలో ఆలివ్ ఆయిల్ వేసి, జీలకర్ర, మిరియాలు వేసి కలపాలి. దీంట్లో కూరగాయల ముక్కలు, వండిన క్వినోవా, పనీర్ క్యూబ్స్ వేసి కలపాలి ⇒ చివరగా నిమ్మరసం కలిపి, వడ్డించాలి. చదవండి: మైండ్ఫుల్ కిచెన్ మూమెంట్ -
70 ఏళ్ల వయసులో యూట్యూబ్ సెన్సేషన్
అందమైన తెలంగాణ భాషతో మన దగ్గర గంగవ్వ యూట్యూబ్ స్టార్ అయ్యింది. మహారాష్ట్రలో 70 ఏళ్ల వయసులో గత ఆరు నెలల్లో సుమన్ ధమానే భారీ యూట్యూబ్ స్టార్గా మారింది. ‘ఆప్లీ ఆజీ’ (మన అవ్వ) పేరుతో ఆమె మొదలెట్టిన వంటల యూట్యూబ్ చానల్కు 6 లక్షల మంది సబ్స్క్రయిబర్లు సిద్ధమయ్యారు. ఇప్పటివరకూ ఆమె చానల్కు 7 కోట్ల వ్యూస్ వచ్చాయి. కొంచెం సంప్రదాయ కారం, కాసింత అనుభవాల ఉప్పు, చిటికెడు దేశీయ నైపుణ్యం, గుప్పెడు ఆత్మీయ అలంకారంతో ఆమె చేసే వంటకు అభిమానులు కొల్లలు. ఇదంతా జనవరి, 2020లో మొదలయ్యింది. మహారాష్ట్రలోని అహమద్ నగర్కు పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉండే ‘సరోలా కసర్’ అనే ఊరిలో వ్యవసాయ పనులు చేసుకునే 70 ఏళ్ల సుమన్ ధమానేతో ఇంటర్ చదువుతున్న ఆమె మనవడు ఆ రోజు ‘పావ్ భాజీ’ చేసి పెట్టమన్నాడు. ఎలా చేయాలో యూ ట్యూబ్లో కొన్ని వీడియోలు చూపెట్టాడు. వాటిని చూసిన ధమానే ‘పిచ్చోడా. నేను వాళ్ల కంటే బాగా చేస్తాను చూడు’ అని పావ్ భాజీ చేసి పెట్టింది. ‘ఆమె ఏమి నూరిందో, ఏమి కలిపిందో తెలియదుగాని ఆ రుచి మాత్రం అద్భుతం’ అని మనవడు, ఇంట్లో వాళ్లు లొట్టలేసుకుంటూ తిన్నారు. అప్పుడే మనవడికి ఎవరో చేసిన వీడియోలు నేను చూడటం ఎందుకు, మా నానమ్మ చేసే వీడియోలనే అందరికీ చూపిద్దాం అని అనిపించింది. కాని రెండు నెలలు పని ముందుకు జరగలేదు. ఈలోపు లాక్డౌన్ వచ్చింది. ఎవరూ బయటకు కదలడానికి లేదు. ‘మనం వంటలు చేద్దామా నానమ్మా’ అని అడిగాడు మనవడు. కాకర కాయ కూర ఎవరైనా ముందు తీపితో మొదలెడతారు. కాని సుమన్ ధమానే చేదుతోనే మొదలెట్టింది. మనవడు ఒక వంట చేసి చూపించు, వీడియో అప్లోడ్ చేస్తాను అంటే మొదట కాకర కాయ కూర వండింది. ఆమె ఏమీ చదువుకోలేదు. ఎప్పుడూ కెమెరాను ఫేస్ చేయలేదు. కాని ఆమె వేళ్లకు వంట భాష తెలుసు. ఆ భాషతోనే మాట్లాడింది. నవ్వుతూ ఉన్న ముఖంతో సుమన్ ధమానే చేసిన కాకరకాయ కూర మార్చి, 2020లో మొదటిసారి యూట్యూబ్లో వీడియోగా ప్రత్యక్షమైనప్పుడు వెంటనే దానికి లైకులు పడ్డాయి. అందరూ చూడటం మొదలెట్టారు. ఆ మరుసటి వీడియోను ‘పల్లీల చట్నీ’గా చేసి పెట్టింది. దానికీ బోలెడన్ని వ్యూస్ వచ్చాయి. ఇక ఆమె బండి ఆగలేదు. అడ్డంకులు దాటి ఇంటర్ చదివే మనవడు ఒక్కడే మొత్తం కథా స్క్రీన్ ప్లే డైరెక్షన్ ఎడిటింగ్ చేశాడు. చేస్తున్నాడు. కొత్తల్లో టెక్నికల్ విషయాల అడ్డంకి, నెట్ ప్రాబ్లమ్, ధమానె బెరుకు ఇవన్నీ ఇబ్బంది పెట్టాయి. కాని మెల్లమెల్లగా అవ్వా మనవడు తాము ఏం చేయాలో తెలుసుకున్నారు. వరుస పెట్టి వంటలు చేశారు. ధమానే ఏం చేసిందంటే అప్పటికప్పుడు ఇంట్లో నూరుకునే పదార్థాలతో ఆ వంటలు చేసి చూపెట్టింది. మహారాష్ట్ర ప్రజలు మర్చిపోయిన పాత వంటలను చేసి పెట్టింది. లాక్డౌన్ వల్ల ఇళ్లల్లో ఉంటున్న స్త్రీ పురుషులందరూ ఇవాళ కొత్తగా ఏం ట్రై చేద్దాం అని ధమానె వీడియోలు చూడసాగారు. నాలుగు నెలల్లో ధమానేకు 6 లక్షల మంది సబ్స్క్రయిబర్స్ అయ్యారు. ఇప్పటికి ధమానె 140 వీడియోలు పెట్టింది. సాబూదానా కిచిడి, మసాలే భాత్, బటాటా వడ, పానిపూరి, రగ్డా... ఇవన్నీ ఆమె ఎలా చేసిందో వీడియోలు ఉన్నాయి. వీటన్నింటికి కలిపి దాదాపు 7 కోట్ల వ్యూస్ వచ్చాయి. ఇది సామాన్యమైన విషయం కాదు. అసలైన వంటవాళ్లు టీవీలలో వంటల ప్రోగ్రామ్స్ను ‘క్వాలిఫైడ్ చెఫ్స్’ చేస్తుంటారు. కాని భారతదేశంలో అమ్మమ్మలు, నానమ్మలకు మించిన క్వాలిఫైడ్ చెఫ్స్ ఉండరు. వీరికి నిన్నమొన్నటి వరకు టీవీలలో ప్రవేశం ఉండేది కాదు. కాని యూ ట్యూబ్ పుణ్యమా అంటూ వీరి వంట ప్రావీణ్యం లోకానికి తెలుస్తూ ఉంది. 70 ఏళ్ల వయసులో ఏ పని చేయగలం అని చాలామంది అనుకోవచ్చు. కాని సుమన్ ధమానె ఈ వయసులోనే స్టార్ అయ్యింది. ఆమె చేస్తున్న వంటలకు యూ ట్యూబ్ నుంచి మంచి పారితోషికం కూడా అందుతోంది. వేలల్లో ఆదాయం గడిస్తోంది. వంట తెలిసిన అవ్వలు ఎందరో. ఇక చేయాల్సింది కెమెరా ఎదురుగా గరిటె అందుకోవడమే. అవ్వ మసాలాలు ‘ఆప్లీ ఆజీ’ యూట్యూబ్ చానల్లో సుమన్ ధమానే వంట చేస్తూ వాడుతున్న మసాలాలకు డిమాండ్ ఏర్పడింది. అవి మా ఊళ్లల్లో అంత స్వచ్ఛంగా దొరకడం లేదు... మీరు పంపితే కొంటాం అని చాలామంది అడుగుతుంటే ధమానేనే బ్రాండ్ అంబాసిడర్గా మసాలాల విక్రయం కూడా మొదలైంది. ఆమె మసాలాలకు ఆర్డర్ పెడుతున్నవారు ఇప్పుడు వేలల్లో ఉన్నారు. – సాక్షి ఫ్యామిలీ -
రీడర్స్ కిచెన్
ఇంతవరకూ సాక్షి ‘ఫ్యామిలీ’ అందించిన వైవిధ్యభరితమైన వంటకాలను చూశారు, నేర్చుకున్నారు, వండుకుని ఆస్వాదించారు. ఇక ఇప్పుడు మీ రుచులను అందరికీ అందించే సమయం ఆసన్నమైంది. ప్రతివారం మేము అడిగే ప్రధాన దినుసుతో మీదైన వంటకాన్ని వివరంగా రాసి, దాని ఫొటోను, మీ ఫొటోను జతచేసి మాకు పంపించండి. కూర, వేపుడు, స్వీట్, స్నాక్ ఏదైనా సరే... మీరు పంపే వంటకం వినూత్నంగా, వైవిధ్యంగా ఉంటే దాన్ని కుకరీ పేజీలో ప్రచురిస్తాం. అయితే ప్రతివారం బుధవారానికల్లా మీ వంటకం మాకు అందాలి.ఈ వారం తెలుగువారికి ఎంతో ఇష్టమైన ‘వంకాయ’తో ఓ వెరైటీ వంటకాన్ని పంపించండి. అది కచ్చితంగా మీరు కనిపెట్టిన వంటకమై ఉండాలన్న విషయం మర్చిపోకండి.


