breaking news
Communal agenda
-
దేశ ప్రతిష్టను దెబ్బతీయడానికి కాంగ్రెస్, వామపక్షాల కుట్రలు
న్యూఢిల్లీ: కాంగ్రెస్, వామపక్షాలు మత ఛాందసవాద శక్తులతో చేతులు కలుపుతున్నాయని, సమాజాన్ని విభజించి, ప్రపంచవ్యాప్తంగా భారతదేశ ప్రతిష్టను దెబ్బతీయడానికి కుట్రలు సాగిస్తున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ మండిపడ్డారు. గురువారం కేరళలో జరిగిన బీజేపీ బూత్ స్థాయి కార్యకర్తల సమావేశంలో మోదీ వర్చువల్గా మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ గాంధేయ సిద్ధాంతాన్ని వదిలేసిందని, మావోయిస్టు ముస్లిం లీగ్ కాంగ్రెస్గా మారిపోయిందని ధ్వజమెత్తారు. ఎల్డీఎఫ్, యూడీఎఫ్లు సొంత ఎజెండా కోసం సమాజంలో మనుషుల మధ్య చిచ్చుపెడుతున్నాయని ఆరోపించారు. అదే సమయంలో మన విశ్వాసాలను దెబ్బతీస్తున్నాయని ఆగ్రహం వ్యక్తంచేశారు. అయ్యప్ప భక్తుల మనోభావాలను కించపర్చాయని విమర్శించారు. అయ్యప్ప ఆలయ బంగారం విషయంలో ఆ రెండు కూటములు నిజాయితీ లేకుండా వ్యవహరిస్తున్నాయని చెప్పారు. సహకార బ్యాంకుల్లో ఉన్న ప్రజల కష్టార్జితాన్ని దురి్వనియోగం చేస్తున్నాయని ఆక్షేపించారు. దేశాన్ని బలోపేతం చేయడమే లక్ష్యంగా తమ ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. కాంగ్రెస్ మాత్రం దేశ ప్రతిష్టను దిగజార్చడమే పనిగా పెట్టుకుందన్నారు. విదేశాల్లోని పరిస్థితుల గురించి కాంగ్రెస్ నాయకులు బాధ్యత లేకుండా మాట్లాడుతున్నారని, దానివల్ల అక్కడ నివసిస్తున్న భారతీయులు ఇబ్బంది పడాల్సి వస్తోందని మోదీ ఆందోళన వ్యక్తంచేశారు. సొంత రాజకీయ ప్రయోజనాల కోసం ఇష్టానుసారంగా మాట్లాడడం ఏమిటని ప్రశ్నించారు. కేరళలో ఇప్పటిదాకా ఎవరు అధికారంలో ఉన్నప్పటికీ ప్రజలకు ఒరిగిందేమీ లేదని విమర్శించారు. రాష్ట్రంలో అభివృద్ధి జరగాలంటే, యువత బతుకులు బాగుపడాలంటే బీజేపీ అధికారంలోకి రావాలని తేల్చిచెప్పారు. పార్టీ కార్యకర్తలు ప్రతి ఇంటికీ వెళ్లాలని, బీజేపీకి ఓటు వేసేలా ప్రజలను ప్రోత్సహించాలని ప్రధానమంత్రి సూచించారు. -
మతతత్వ ఎజెండా: సోనియా గాంధీ
బీజేపీ మేనిఫెస్టోపై సోనియా ధ్వజం న్యూఢిల్లీ/త్రిసూర్: బీజేపీ ఎన్నికల మేనిఫెస్టో మతతత్వ ఎజెండా అని, అది దేశ సమైక్యత, సమగ్రతలకు పెను ముప్పు అని కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీ విమర్శించారు. ఆమె సోమవారం కేరళలోని త్రిసూర్లో ఎన్నికల సభలో మాట్లాడుతూ.. దేశ సమైక్యతను కాపాడడం ఒక్క కాంగ్రెస్తోనే సాధ్యమని అన్నారు. కాగా, రాజకీయ ప్రయోజనాల కోసం కాషాయదళం మతాన్ని వాడుకుంటోందని, అయితే మదర్సాలకు సాయం చేస్తామని మేనిఫెస్టోలో పేర్కొనడం స్వాగతనీయమని కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్ ఢిల్లీలో అన్నారు. హిందువుల ఓట్లను దక్కించుకోవడానికే బీజేపీ రామాలయ అంశాన్ని ప్రస్తావించిందని, ఆలయ అంశంపై రాజ్యాంగానికి కట్టుబడి ఉంటామనడం కంటితుడుపు మాటని సీపీఎం నాయకుడు సీతారాం ఏచూరి విమర్శించగా, మేనిఫెస్టో ఆరెస్సెస్ ఎజెండా అని సీపీఐ పేర్కొంది. బీజేపీపై ఈసీకి కాంగ్రెస్ ఫిర్యాదు: లోక్సభ ఎన్నికల తొలిదశ పోలింగ్ అయిన సోమవారమే బీజేపీ మేనిఫెస్టో విడుదల చేయడం చట్టవిరుద్ధమంటూ కాంగ్రెస్ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. ఒకవైపు పోలింగ్ జరుగుతోంటే అయోధ్యలో రామమందిరం నిర్మిస్తామంటూ బీజేపీ ఓట్లను అడిగినందున ఆ పార్టీపై చర్య తీసుకోవాలని డిమాండ్ చేసింది.


