breaking news
Chamari Atapattu
-
చమరి చమక్
శ్రీలంక కెప్టెన్ చమరి ఆటపట్టు అజేయ సెంచరీతో విజృంభించింది. మహిళల టి20 వరల్డ్కప్లో భాగంగా గత మూడు మ్యాచ్ల్లో పెద్దగా ఆకట్టుకోలేకపోయిన లంక సారథి ఐర్లాండ్పై విరుచుకుపడింది. సాధించాల్సిన లక్ష్యం 131 పరుగులే ఉన్నా... అందులోనే అజేయ సెంచరీతో అదరగొట్టింది. మొదట లంక బౌలర్ల క్రమశిక్షణకు ఐర్లాండ్ స్వల్ప స్కోరుకే పరిమితం కాగా... చమరి మెరుపులతో శ్రీలంక సునాయాసంగా గెలుపు తీరం దాటింది. లంకకు ఇది రెండో విజయం కాగా... ఐర్లాండ్ ఆడిన నాలుగో మ్యాచ్లోనూ పరాజయం మూటగట్టుకుంది. బ్రిస్టల్: మహిళల టి20 ప్రపంచకప్లో శ్రీలంక రెండో విజయం నమోదు చేసుకుంది. గ్రూప్–2లో భాగంగా మంగళవారం జరిగిన పోరులో లంక 9 వికెట్ల తేడాతో ఐర్లాండ్ను చిత్తుచేసింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్కు దిగిన ఐర్లాండ్ మహిళల జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 130 పరుగులు చేసింది. కెప్టెన్ గాబీ లూయిస్ (50 బంతుల్లో 59; 8 ఫోర్లు) అర్ధశతకంతో మెరవగా... లీ పాల్ (27 బంతుల్లో 20; 1 ఫోర్), అలీస్ టెక్టర్ (21 బంతుల్లో 28 నాటౌట్; 3 ఫోర్లు) తలా కొన్ని పరుగులు చేశారు. లంక బౌలర్ల ధాటికి 19 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన ఐర్లాండ్ జట్టును కెప్టెన్ గాబీ ఆదుకుంది. అయితే ఆమె ఆశించినంత వేగంగా ఆడలేకపోవడంతో భారీ స్కోరు సాధ్యం కాలేదు. వరుస విరామాల్లో వికెట్లు పడగొట్టిన లంక బౌలర్లు ప్రత్యర్థి భారీ స్కోరు చేయకుండా కట్టడి చేశారు. మిథాలీ అయోధ్య, సుగంధిక, చమరి, నీలాక్షిక తలా ఒక వికెట్ పడగొట్టారు. అనంతరం లక్ష్యఛేదనలో శ్రీలంక 15.3 ఓవర్లలో ఒక వికెట్ మాత్రమే కోల్పోయి 134 పరుగులు చేసి విజయం సాధించింది.‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ చమరి ఆటపట్టు (61 బంతుల్లో 106 నాటౌట్; 17 ఫోర్లు, 2 సిక్స్లు) అజేయ సెంచరీతో ఆకట్టుకుంది. మరో ఓపెనర్ ఇమేషా దులానీ (27 బంతుల్లో 20; 3 ఫోర్లు) కెప్టెన్కు సహకారం అందించింది. వీరిద్దరూ తొలి వికెట్కు 12 ఓవర్లలో 98 పరుగులు జోడించడంతోనే లంక గెలుపు ఖాయమైంది. బౌండరీల వరద.. గత మ్యాచ్ అనంతరం సారథిగా విఫలమయ్యానని చెప్పిన చమరి... ఇన్నింగ్స్ తొలి బంతికే ఫోర్ కొట్టి తన ఉద్దేశాన్ని చాటింది. అక్కడి నుంచి మొదలుకొని మ్యాచ్ ముగిసే వరకు బౌండరీల వరద పారించింది. మూడో, నాలుగో ఓవర్లలో రెండేసి ఫోర్లు కొట్టిన చమరి... ఐదో ఓవర్లో మూడు ఫోర్లు అరుసుకుంది. ఏడో ఓవర్లో మరో ఫోర్తో 30 బంతుల్లో అర్ధశతకం పూర్తి చేసుకుంది. గత మూడు మ్యాచ్ల్లో వరుసగా 2, 27, 4 పరుగులు చేసిన చమరి... ఈసారి పూర్తి సాధికారికతతో బ్యాటింగ్ చేసింది. బౌలర్తో సంబంధం లేకుండా తన ధాటిని కొనసాగించింది. హాఫ్సెంచరీ అనంతరం మరింత వేగంగా ఆడిన చమరి చూస్తుండగానే లక్ష్యాన్ని కరిగించింది. 13వ ఓవర్లో 4, 6, 4 కొట్టిన చమరి... అదే జోరులో 58 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకుంది. చమరికి ఇది నాలుగో అంతర్జాతీయ టి20 శతకం కావడం విశేషం. ఆమె దూకుడుతో లంక జట్టు మరో 27 బంతులుండగానే లక్ష్యాన్ని ఛేదించి రన్రేట్ను కాస్త మెరుగు పరుచుకుంది. గ్రూప్–2లో ఇంగ్లండ్, వెస్టిండీస్ ఆడిన మూడు మ్యాచ్ల్లోనూ విజయాలతో చెరో 6 పాయింట్లు సాధించి తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి. న్యూజిలాండ్ (0.122 రన్రేట్) 2 విజయాలు, 2 పరాజయాలతో 4 పాయింట్లు సాధించి మూడో స్థానంలో కొనసాగుతుండగా... ఇప్పుడు రెండో విజయంతో లంక జట్టు కూడా 4 పాయింట్లు సాధించింది. అయితే నెట్ రన్రేట్ (–0.973)లో వెనుకబడి పట్టిక నాలుగో ‘ప్లేస్’లో నిలిచింది. తమ తదుపరి మ్యాచ్లో శుక్రవారం స్కాట్లాండ్తో లంక తలపడనుంది. -
చమరి అటపట్టు సూపర్ సెంచరీ
ఆసియా కప్ మహిళల టి20 క్రికెట్ టోర్నీలో భాగంగా దంబుల్లాలో సోమవారం మలేసియాతో జరిగిన గ్రూప్ ‘బి’ లీగ్ మ్యాచ్లో శ్రీలంక 144 పరుగుల తేడాతో గెలిచింది. ముందుగా శ్రీలంక 20 ఓవర్లలో 4 వికెట్లకు 184 పరుగులు చేసింది. కెప్టెన్ చమరి అటపట్టు (69 బంతుల్లో 119 నాటౌట్; 14 ఫోర్లు, 7 సిక్స్లు) తన టి20 కెరీర్లో మూడో సెంచరీ సాధించింది. మలేసియా 19.5 ఓవర్లలో 40 పరుగులకే కుప్పకూలింది. -
లంక కెప్టెన్ విధ్వంసకర శతకం.. 13 ఫోర్లు, 9 సిక్సర్లు, చారిత్రక విజయం
3 వన్డేలు, 3 టీ20ల సిరీస్ల కోసం న్యూజిలాండ్ మహిళల క్రికెట్ జట్టు శ్రీలంకలో పర్యటిస్తుంది. వన్డే సిరీస్లో భాగంగా నిన్న (జులై 3) జరిగిన నిర్ణయాత్మక మూడో వన్డేలో చమారీ ఆటపట్టు (శ్రీలంక కెప్టెన్) విధ్వంసకర శతకంతో (80 బంతుల్లో 140 నాటౌట్; 13 ఫోర్లు, 9 సిక్సర్లు) విరుచుకుపడటంతో శ్రీలంక మహిళా జట్టు చారిత్రక విజయం సాధించింది. ఈ గెలుపుతో 2-1 తేడాతో సిరీస్ కైవసం చేసుకున్న శ్రీలంక.. న్యూజిలాండ్పై తొలి ద్వైపాక్షిక సిరీస్ విజయాన్ని సొంతం చేసుకుంది. అలాగే, 2008లో వెస్టిండీస్పై 3-2 తేడాతో విజయం సాధించిన తర్వాత దాదాపు 15 ఏళ్లలో ఏ ప్రత్యర్థిపైనైనా ఒకటి కంటే ఎక్కువ మ్యాచ్ల ద్వైపాక్షిక సిరీస్లో గెలవడం లంకేయులకు ఇది తొలిసారి. ఈ ఏడాది ఆరంభంలో బంగ్లాదేశ్పై 3 మ్యాచ్ల సిరీస్లో విజయం సాధించినప్పటికీ, అది 1-0 తేడాతో గెలిచింది (2 మ్యాచ్లు వర్షం కారణంగా రద్దయ్యాయి). కాగా, వర్షం అంతరాయాల నడుమ సాగిన మూడో వన్డేలో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్.. 31 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 127 పరుగులు చేసింది. బేట్స్ (63 నాటౌట్), కెప్టెన్ సోఫీ డివైన్ (38 నాటౌట్) రాణించారు. ఈ సమయంలో వర్షం మొదలుకావడంతో అంపైర్లు శ్రీలంకకు 29 ఓవర్లలో 196 పరుగుల లక్ష్యాన్ని నిర్ధేశించారు. మూడు మ్యాచ్ల్లో రెండు శతకాలు బాదిన లంక కెప్టెన్.. ఛేదనలో ఆది నుంచే దూకుడుగా ఆడిన లంక కెప్టెన్ చమారీ కేవలం 60 బంతుల్లోనే శతక్కొట్టింది. మహిళల వన్డే క్రికెట్లో ఇది నాలుగో వేగవంతమైన సెంచరీ కాగా.. చమారీకి ఈ ఫార్మాట్లో ఇది 8వ శతకం. చమారీకి జతగా నిలక్షి డిసిల్వ (48 నాటౌట్) రాణించడంతో శ్రీలంక మరో 13 బంతులు మిగిలుండగానే లక్ష్యాన్ని ఛేదించింది. ఇదే సిరీస్ తొలి మ్యాచ్లో కూడా సెంచరీ (108 నాటౌట్) సాధించిన చమారీకి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్తో పాటు ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డు కూడా లభించింది. ఇరు జట్ల మధ్య టీ20 సిరీస్ జులై 8 నుంచి ప్రారంభం కానుంది. -
కివీస్కు షాకిచ్చిన శ్రీలంక.. 9 వికెట్ల తేడాతో ఘన విజయం
3 వన్డేలు, 3 టీ20ల సిరీస్ల కోసం న్యూజిలాండ్ మహిళా క్రికెట్ జట్టు శ్రీలంకలో పర్యటిస్తుంది. సిరీస్లో భాగంగా గాలే వేదికగా నిన్న (జూన్ 27) తొలి వన్డే జరిగింది. వర్షం కారణంగా 28 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్లో శ్రీలంక డక్వర్త్ లూయిస్ పద్దతిలో 9 వికెట్ల తేడాతో న్యూజిలాండ్ను మట్టికరిపించింది. లంక కెప్టెన్ చమారి ఆటపట్టు (83 బంతుల్లో 108; 10 ఫోర్లు, 5 సిక్సర్లు) అద్భుత శతకంతో తమ జట్టును విజయతీరాలకు చేర్చింది. ఆమెకు విష్మి గుణరత్నే (50) సహకరించింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్.. 28 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 170 పరుగులు చేసింది. మెలీ కెర్ర్ (40) టాప్ స్కోరర్గా నిలువగా.. మ్యాడీ గ్రీన్ (39), బేట్స్ (28), ప్లిమ్మర్ (22 నాటౌట్) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. కివీస్ బౌలర్లలో సుగంధిక కుమారి, కవిష దిల్హరి, రణవీర తలో వికెట్ పడగొట్టారు. అనంతరం 171 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన శ్రీలంక.. చమారి ఆటపట్టు (108 నాటౌట్), విష్మి గుణరత్నే (50) చెలరేగడంతో 27 ఓవర్లలో కేవలం ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయి అలవోకగా విజయం సాధించింది. ఫలితంగా 3 మ్యాచ్ సిరీస్లో 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. తొలి శ్రీలంక క్రికెటర్గా చమారి రికార్డు.. ఈ మ్యాచ్లో సెంచరీతో విజృంభించిన లంక కెప్టెన్ చయారి ఓ అరుదైన రికార్డు సాధించింది. శ్రీలంక తరఫున మహిళల క్రికెట్లో 3000 పరుగులు పూర్తి చేసిన తొలి బ్యాటర్గా రికార్డుల్లోకెక్కింది. 49 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద ఆమె ఈ మైలురాయిని చేరుకుంది. చమారి 93 వన్డేల్లో 33.61 సగటున 3059 పరుగులు సాధించింది. ఓవరాల్గా మహిళల వన్డే క్రికెట్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ల జాబితాలో టీమిండియా మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్ 7805 పరుగులతో అగ్రస్థానంలో ఉంది. -
టీమిండియాకు షాక్.. మూడో టీ20లో శ్రీలంక ఘన విజయం
మూడు మ్యాచ్ల టీ20 సిరీస్లో భాగంగా భారత మహిళల జట్టుతో ఇవాళ (జూన్ 27) జరిగిన ఆఖరి టీ20లో ఆతిధ్య శ్రీలంక 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. టీమిండియా ఇదివరకే 2-0 తేడాతో సిరీస్ను కైవసం చేసుకోవడంతో నామమాత్రంగా సాగిన ఈ మ్యాచ్లో లంక కెప్టెన్ చమారి ఆటపట్టు (48 బంతుల్లో 80 నాటౌట్; 14 ఫోర్లు, సిక్స్) ఆకాశమే హద్దుగా చెలరేగి తన జట్టుకు అద్భుత విజయాన్ని అందించింది. ఫలితంగా శ్రీలంక ఈ సిరీస్లో బోణీ కొట్టడంతో పాటు భారత ఆధిక్యాన్ని 2-1కి తగ్గించింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 138 పరుగులు చేయగా.. లంక మరో 18 బంతులు మిగిలుండగానే 3 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. చామరి సహా నిలాక్షి డిసిల్వా (28 బంతుల్లో 30; 4 ఫోర్లు) రాణించడంతో శ్రీలంక సునాయస విజయం సాధించింది. భారత బౌలర్లలో రాధా యాదవ్, రేణుక సింగ్ తలో వికెట్ పడగొట్టారు. అంతకుముందు హర్మన్ప్రీత్ కౌర్ (39 నాటౌట్), జెమీమా రోడ్రిగెస్ (33) ఓ మోస్తరుగా రాణించడంతో టీమిండియా ఈ మాత్రం స్కోరైనా సాధించగలిగింది. ఈ పర్యటనలో టీమిండియా జులై 1, 4, 7 తేదీల్లో వన్డేలు ఆడనుంది. చదవండి: IND VS IRE 1st T20: భువీ ఖాతాలో అరుదైన రికార్డు -
2 పరుగులతో గెలిచిన భారత్
బ్రిస్బేన్: విమెన్స్ టి20 వరల్డ్ కప్లో భాగంగా మంగళవారం వెస్టిండీస్తో జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్లో భారత మహిళల జట్టు 2 పరుగుల తేడాతో విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 107 పరుగులు చేసింది. షఫాలి వర్మ 12, దీప్తి శర్మ 21, శిఖా పాండే 24, పూజ వస్త్రకర్ 13, హర్మన్ప్రీత్ కౌర్ 11 పరుగులు సాధించారు. జెమీమా రోడ్రిగ్స్ పరుగులేమి చేయకుండానే వెనుదిరిగింది. తర్వాత బ్యాటింగ్కు దిగిన వెస్టిండీస్ 20 ఓవర్లలో 7 వికెట్లు 105 పరుగులు చేసింది. భారత బౌలర్లలో పూనమ్ యాదవ్ 3 వికెట్లు పడగొట్టింది. శిఖా పాండే, దీప్తి శర్మ, హర్మన్ప్రీత్ కౌర్ తలో వికెట్ దక్కించుకున్నారు. (చదవండి: ఆల్ ద బెస్ట్ హర్మన్) అదరగొట్టిన ఆటపట్టు ఇంగ్లండ్తో జరిగిన మ్యాచ్లో శ్రీలంక 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. శ్రీలంక కెప్టెన్ చమరి ఆటపట్టు బ్యాటింగ్తో అదరగొట్టింది. 50 బంతుల్లో 8 ఫోర్లు, 5 సిక్సర్లతో 78 పరుగులు చేసి అజేయంగా నిలిచింది. ఆమెకు హాసిని పెరీరా(29) అండగా నిలిచింది. అంతకుముందు బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 122 పరుగులు చేసింది. శ్రీలంక 12.3 ఓవల్లో వికెట్ కోల్పోకుండా 123 పరుగులు సాధించి విజయాన్ని అందుకుంది. ఎక్స్ట్రాల రూపంలో 16 పరుగులు రావడం విశేషం. మరో మ్యాచ్లో దక్షిణాఫ్రికాపై ఆస్ట్రేలియా 4 వికెట్ల తేడాతో గెలిచింది. -
విధ్వంసకర ఆటపట్టు అవుట్..
డెర్బీ: శ్రీలంక డేంజరేస్ బ్యాట్ ఉమెన్ చమరి ఆటపట్టు (25) అవుటైంది. పూనమ్ యాదవ్ వేసిన 17 ఓవర్ నాలుగో బంతికి క్లీన్ బౌల్డ్ గా పెవిలియన్ చేరింది. ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్లో ఏకంగా 22 ఫోర్లతో 178 పరుగులు సాధించి రికార్డు నెలకొల్పిన విషయం తెలిసిందే. 233 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంకకు ఆదిలో పెరారా(10) వికెట్ కోల్పోయి ఎదురు దెబ్బ తగిలింది. అనంతరం క్రీజులోకి వచ్చిన ఆటపట్టు మరో ఓపెనర్ హన్సిక తో ఆచూతూచి ఆడుతూ ఇన్నింగ్స్ను ముందుకు నడిపించింది. వీలు చిక్కినప్పుడల్లా బౌండరీలు బాదుతూ 47 పరుగుల భాగస్వామ్యంతో క్రీజులో పాతుకుపోతున్న ప్రమాదకరంగా మారుతున్న ఈ జంటను పూనమ్ చక్కటి బంతితో వీడదీసింది. ఇక క్రీజులో హన్సిక (23) సిరి వర్దనే (4) క్రీజులో ఆడుతున్నారు. 21 ఓవర్లు ముగిసేసరికి శ్రీలంక మహిళలు 2 వికెట్లు కోల్పోయి 64 పరుగులు చేశారు. ఇక భారత బౌలర్లలో గోస్వామి, పూనమ్ యాదవ్ చెరో వికెట్ దక్కించుకున్నారు. -
22 ఫోర్లు, 6 సిక్సర్లతో విజృంభణ
బ్రిస్టల్: జట్టు మొత్తం విఫలమైనా ఒక్క క్రీడాకారిణి మాత్రం ఎదురునిలిచారు. డిపెండింగ్ చాంపియన్ బౌలర్ల ధాటికి తోటి ప్లేయర్లు పెవిలియన్కు వరుస కట్టినా లెక్కచేయకుండా విజృభించారు. ప్రత్యర్థి బౌలర్లను దీటుగా ఎదుర్కొని జట్టుకు గౌరవ ప్రదమైన స్కోరు అందించారు. ఆమె శ్రీలంక మహిళా క్రికెట్ ప్లేయర్ చామరి ఆటపట్టు. మహిళా వన్డే వరల్డ్కప్లో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న మ్యాచ్లో అజేయ సెంచరీతో ఆమె వీరవిహారం చేశారు. 143 బంతుల్లో 22 ఫోర్లు, 6 సిక్సర్లతో 178 పరుగులు సాధించారు. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ దిగిన శ్రీలంక 50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 257 పరుగులు చేసింది. జట్టులోని మిగతా క్రీడాకారిణులు అంతా కలిసి 60 పరుగులు చేస్తే చామరి ఆటపట్టు ఒకరే 178 పరుగులు చేయడం విశేషం. ఆటపట్టు సాధించిన పరుగుల్లో 124 బౌండరీల ద్వారానే వచ్చాయంటే ఆమె విజృంభణ ఏ స్థాయిలో సాగిందో అర్థం చేసుకోవచ్చు. ఆసీస్ బౌలర్లు 19 ఎక్స్ట్రాలు సమర్పించుకున్నారు. ఏడుగురు ఆస్ట్రేలియా బౌలర్లు బౌలింగ్ చేసినా ఆటపట్టును అవుట్ చేయలేకపోయారు. వన్డేల్లో మూడో అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన క్రికెట్ బ్యాట్స్వుమన్గా చామరి ఆటపట్టు నిలిచారు. వుమన్ వన్డే వరల్డ్కప్లో సెంచరీ చేసిన తొలి శ్రీలంక క్రీడాకారిణిగా ఘనత సాధించారు. వన్డేల్లో ఆమె మొత్తం మూడు సెంచరీలు బాదారు. చామరి ఆటపట్టు మినహా వన్డేల్లో ఇప్పటి వరకు శ్రీలంకకు చెందిన మరో క్రీడాకారిణి సెంచరీ సాధించలేదు.


