breaking news
Cancer treatments
-
చిట్కాలున్నా... చికిత్సే ముఖ్యం!
సోషల్ మీడియా వచ్చాక ఓ ఉత్పాతమూ వచ్చిపడింది. ‘పాత పేషెంట్ కొత్త డాక్టర్తో సమాన’మంటూ అప్పట్లో ఓ సామెత లాంటి వాడుక ఉండేది. దాన్ని నిజం చేస్తూ పాత పేషెంట్లూ అంతకుమించి పాపులర్ సెలిబ్రిటీలైన సోనాలీ బెంద్రే, మనీషా కోయిరాలా, క్రికెట్ దిగ్గజం యువరాజ్ సింగ్, హాలీవుడ్ మోడల్ లీజా రే వంటి జనాల్లో మంచి క్రేజ్ ఉన్న వ్యక్తులు... ‘ఆటోఫేజీ’ అనే ఓ సైంటిఫిక్ పదాన్ని... ఇటీవలి పాపులర్ చిట్కా మంత్రా పదమైన ‘వెల్నెస్ చికిత్స’తో కలగలిపి ‘వెల్నెస్’ అద్భుతాల తాలూకు ప్రభావాలను సోషల్ మీడియా ప్రచారం చేస్తున్నారు. ఉపవాసాలూ, డీటాక్స్ విధానాల్లాంటివే అద్భుత మాయా–మంత్రాలంటూ ప్రజలకు ఇంపుగా ప్రజెంట్ చేస్తున్నారు. అసలు అన్నం కంటే పక్కన అంచుకుపెట్టుకుని నంజుకునే చిరుతిండినే నిజభోజనంగా వర్ణిస్తున్నారు. వాళ్ల మాటల మాయల్లో పడుతున్న జనాలు... అసలు వాస్తవాల కంటే అద్భుతాలనే ఎక్కువగా నమ్ముతున్నారు. ఫలితంగా ఈ ‘మిరాకిల్స్ థెరపీ’లను ఎక్కువగా నమ్ముతూ ఉండే అదే క్యాన్సర్కు అద్భుత చికిత్సేమోనంటూ అమాయక ప్రజలు అసలుకే మోసం తెచ్చుకుంటున్నారు. ఈ విషయంపై క్యాన్సర్ నిపుణులైన డాక్టర్ల మాటేమిటో చూద్దాం.వాళ్లు క్యాన్సర్ను జయించిన యోధులే. అద్భుత మనోబలంతో క్యాన్సర్ మహమ్మారిని ఎదుర్కొన్న మహామహులే. తాము క్యాన్సర్ను అధిగమించాక తాము అనుసరించిన చిట్కాలను వెల్లడిస్తూ వాళ్లు చెబుతున్న కొన్ని మాటలేమిటో చూద్దాం. → ఇంటర్మిట్టెంట్ ఫాస్టింగ్ (రోజుకు నియమిత వేళల్లోనే తిని... మిగతా సమయమంతా ఉపవాసంలో గడపడం), యాంటీ ఇన్ఫ్లమేషన్ డైట్ తీసుకోవడం, కొద్దిపాటి వ్యాయామంతో తాను క్యాన్సర్నుంచి బయటపడ్డానంటోంది ప్రముఖ బాలీవుడ్– టాలీవుడ్ ఫేమ్ సోనాలి బెంద్రే. → క్లీన్ ఈటింగ్ ప్రాసెస్ చేయని, రిఫైన్ చేయని, పొట్టుతీయని ముడి ధాన్యాలతో వండిన భోజనం)తో పాటు యోగా, ప్రాణాయామం వంటి వాటితో క్యాన్సర్ను జయించానన్నది ప్రముఖ నటి మనీషా కోయిరాలా మాట. → కీమోతో పాటు... క్రమశిక్షణతో కూడిన జీవనమూ భోజనమూ, దేహంలోని విషాలను శుభ్రపరిచే డీ–టాక్స్ ఆహార విహారాలూ తననుంచి క్యాన్సర్ను దూరం చేశాయంటాడు క్రికెటర్ యూవీ (యువరాజ్ సింగ్). → శాకాహారంతో కూడిన భోజనం, ధ్యానం (మెడిటేషన్), యోగా ఆయుర్వేద మార్గాల పయనం వల్లనే తనకు క్యాన్సర్ నయమయ్యిందంటోంది ప్రముఖ మోడల్, లీజా రే. ఇక్కడ ఈ ప్రముఖులు చెప్పిన చిట్కాలన్నీ ‘ఆటోఫేజీ’ అనే ప్రక్రియను వేగవంతం చేశాయనీ... అందువల్లనే తమకు క్యాన్సర్ వేగంగా, ప్రభావపూర్వకంగా నయమైందంటూ చెబుతున్న సోషల్ మీడియా వేదికగా చెబుతున్న మాటలు సాధారణ ప్రజల మెదళ్లలోకి తేలిగ్గా ఎక్కుతున్నాయి. వాళ్ల మనసుల్లోకి సులువుగా వెళ్తున్నాయి. అయితే జీవనశైలిలో ఆరోగ్యకరమైన మార్పులైన ఆ వెల్నెస్ మార్గాలు మంచివే. కానీ అవే క్యాన్సర్ను పూర్తిగా నయం చేయలేవని అంటున్నారు. ‘ఆటోఫేజీ’ అనే ఇటీవలి సైంటిఫిక్ పరిభాషకు చెందిన ఆ పదం అర్థం ఏమిటో తెలుసుకోవాల్సిన అవసరం ఎక్కువగా ఉందన్నది వైద్యప్రముఖుల మాట. దాంతోపాటు ‘అపాప్టోసిస్’, ‘ ప్రోటీయోజోమ్’ అనే పదాలకు అర్థాలు వాటి వెనక పరమార్థాలూ తెలుసుకుంటే కేవలం అద్భుతాలనిపించే చికిత్సప్రక్రియలు... (మిరాకిల్ రెమిడీలు) మాత్రమే కాకుండా వాస్తవ చికిత్సలకు తోడుగా... ఈ అనుబంధ మార్గాలూ జతగూడినప్పుడే అసలు ఫలితాలు వస్తాయంటున్న డాక్టర్ల మాటల ఆంతర్యాలను తెలుసుకుందాం...అసలు ‘ఆటోఫేజీ’ అంటే ఏమిటి? దేహంలో ఎప్పటికప్పుడు కణాలు పుడుతూ, చనిపోతూ ఉంటాయి. అందులో చనిపోయిన కణాలతో పాటు కొన్ని నిరర్థకమైనవీ, వ్యర్థమైనవీ ఉంటాయి. మన దేహంలోని శుభ్రం చేసే వ్యవస్థ ఇలాంటి మృతకణాలూ, నిరర్థక, వ్యర్థకణాలను తొలగిస్తూ ఉంటుంది. ఇలా ఆరోగ్యకరమైన కణాల మనగడను సుగమం చేస్తూ, ఈ మృత, వ్యర్థ, నిరర్థక కణాలను తినేసే ప్రక్రియనే ‘ఆటోఫేజీ’ అంటారు. ఈ సెలిబ్రిటీల మాటేమిటంటే... పైన చెప్పిన ఉపవాసాలూ, ప్రాణాయామ ధ్యానాలూ, డీటాక్స్ ప్రక్రియల వంటి వెల్నెస్ మార్గాల ద్వారా మన ఆరోగ్యకరమైన కణాలన్నీ ‘క్యాన్సర్ కణాలనే’ తినేస్తే? అప్పుడు క్యాన్సర్ హరించుకుపోయి ఆరోగ్యం దక్కుతుందనేలా వారి సోషల్ మీడియా సందేశాలు ప్రజలకు చేరుతున్నాయి. అంతకంటే సంక్లిష్టమైనది ఆటోఫేజీ...నిజానికి ‘క్యాన్సర్ బయాలజీ’లో ఆటోఫేజీ ప్రక్రియ అంతకంటే చాలా సంక్లిష్టమైనది అంటున్నారు ఆధునిక వైద్యచికిత్సకులు. ఒకసారి అదేమిటో చూద్దాం. ∙కణంలో మరిన్ని సూక్షమైన అంతర్గతమైన భాగాలు (ఆర్గనెల్స్) దెబ్బతిన్నప్పుడు ఆ కణం మనుగడ కష్టం. అది చనిపోయే ప్రక్రియలో దేహం దాన్ని శుభ్రం చేసి తొలగిస్తుంది. అందులోని ప్రోటీన్ శిథిలాలను ఒకచోట చేర్చి ఊడ్చేస్తుంది. అలా చనిపోయిన లేదా బలహీనపడి నిరర్థకం కాబోతున్న కణాలను దేహం తొలగించివేస్తుంది. దీన్నే ‘ఆటోఫేజీ’ అంటారు.అదీ మరచిపోతున్న ముప్పు... ఇదీ చేస్తున్న తప్పు... ఇక్కడ సెలిబ్రిటీలు ఒక విషయం మరచిపోతున్నారు. తమకున్న పరిమితమైన వైద్యపరిజ్ఞానంతో అసలు విషయాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారు. ఉపవాసాలు చేస్తున్నప్పుడు తన జీవక్రియల కోసం దేహంలోని కణాలు తమకు కావాల్సిన ఆహారం కోసం మృత/వ్యర్థకణాలనూ, క్యాన్సర్ కణాలనూ తినేస్తాయని భావిస్తున్నారు. కానీ ఇక్కడ వారు ఒక ముప్పును విస్మరిస్తున్నారు. క్యాన్సర్ కణం కూడా ఒక కణమే. దానికీ ఆహారం కావాలి. ఉపవాసం ద్వారా దానికి అవసరమైన ఆహారాలు అందనప్పుడు అది కూడా ఆరోగ్యకరమైన కణాలనూ తినేయడం మొదలుపెట్టేందుకు అవకాశాలు ఎక్కువ. అంతేకాదు... మామూలు కణం కంటే కూడా అది మరింత చురుగ్గా, మరింత వేగంగా ఆరోగ్యకరమైన కణాలను కబళించవచ్చు. పైగా ఆహారం అందకపోవడంతో దేహాన్ని రక్షించుకునే వ్యాధి నిరోధక వ్యవస్థ మరింత బలహీనపడితే క్యాన్సర్ కణజాలాలే మామూలు ఆరోగ్యవంతమైన కణాలను తినేయడం ప్రారంభిస్తే అది మొదటికే మోసం వచ్చే పరిస్థితి! అంటే ఉపవాసం వల్ల క్యాన్సర్ ఎండిపోవడానికి (ఫాస్టింగ్ స్టార్వ్స్ క్యాన్సర్) బదులుగా తామే ఆకలితో మాడాల్సి వస్తుందని తెలిసినప్పుడు క్యాన్సర్ కణాలు ఇంకా ఇంకా కుతంత్రాలతో (కన్నింగ్గా) ఆరోగ్యవంతమైన కణాలను తినేయడం మొదలుపెట్టే ప్రమాదలెన్నో పొంచి ఉంటాయి.ఆటోఫేజీ లాంటిదే ఆటాప్టోసిస్... సెలిబ్రిటీలు ఆటోఫేజీ గురించి సోషల్ మీడియాలో మాట్లాడటం వల్ల దాని గురించి మామూలు ప్రజలకు తెలియరావచ్చు. కానీ... ఈ రంగంలో ఇలా ఆటోఫేజీలా పనిచేస్తూ క్యాన్సర్ కణాలను తినేసేందుకు దోహదపడే పరిశోధనలూ, అలాంటి పరిజ్ఞానాలూ, పరిభాషా... ఇలాంటివి వాళ్లకు తెలియని అంశాలెన్నో ఇంకా ఉన్నాయి. ఉదాహరణకు అటాప్టోసిస్, యూబిక్విటిన్– ప్రోటియోజోమ్ సిస్టమ్ వంటివి. ఉదాహరణకు అటాప్టోసిస్ అంటే ఏమిటో చూద్దాం. ఎవరినైనా బాగా కించపరిచి, కోలుకోలేనంతగా నిందిస్తే వాళ్లేం చేస్తారు? తట్టుకోలేక ఆత్మహత్యకూ ఒడిగట్టవచ్చు కదా! అచ్చం అపాప్టోసిస్ ప్రక్రియలో కూడా అలాంటిదే జరుగుతుంది.యుబిక్విటిన్ – ప్రోటియోజోమ్ సిస్టమ్ అంటే... యుబిక్విటిన్ అనేది ఏ ప్రోటీన్కు అంటుకుంటుందో దాన్ని కాలపరిమితి ముగిసిపోయిన లేదా చెడిపోయిన / లోపభూయిష్టమైన ప్రోటీన్గా గుర్తించవచ్చు. అది కణంలో ఉన్నప్పుడు కణం సమతౌల్యాన్ని దెబ్బతీస్తుంది. అందుకే యుబిక్విటిన్ ప్రోటీన్ కణం నుంచి తొలగిపోవాలి. అప్పుడే కణం చురుగ్గా నార్మల్ కణంగా ఉంటుంది. అలా కణం నుంచి యుబిక్విటిన్ను తొలగించడానికి తోడ్పడేందుకు ఉద్దేశించిన వ్యవస్థ... అంటే యుబిక్విటిన్ ప్రోటీన్ను ధ్వంసం చేసేందుకు తోడ్పడే వ్యవస్థే ప్రోటియోజోమ్ వ్యవస్థ. అంటే ప్రోటియోజోమ్ అన్నది ప్రోటీన్ డిస్ట్రక్షన్ సిస్టమ్ అన్నమాట. ఈ యుబిక్విటిన్ అనేది అలాగే ఉంటే అది చెడిపోయిన కణానికి అమరత్వం ఇస్తుంది. ఒకవేళ ఆ చెడిపోయిన కణాలకు అమరత్వం ఉంటే అవి తొలగిపోవు. కాబట్టి ఈ ప్రోటియోజోమ్... తన డబుల్ నెగెటివ్ మార్గంలో వాటిని గుర్తించి ధ్వంసం చేస్తుంది. అలా చెడుకణాలూ లేదా దెబ్బతిన్న/లోపభూయిష్టమైన కణాలను తొలగిస్తుంది. ఇతి జరిగేందుకు దోహదపడేదే ‘యుబిక్విటిన్ – ప్రోటియోజోమ్ వ్యవస్థ’గా చెబుతారు.కొన్ని మందులతో ప్రోటీయోజోమ్ ప్రక్రియను అడ్డుకుని క్యాన్సర్ను తగ్గించడం ఇలా... ఈ యుబిక్విటిన్– ప్రోటియోజోమ్ ప్రక్రియను గుర్తించిన వైద్య శాస్త్రవేత్తలు ‘బార్టెజోమిబ్’ అలాగే ‘కార్ఫిల్జోమిబ్’ వంటి ప్రోటియోజోమ్ ఇన్హిబిటర్లను తయారు చేసి ప్రయోగించారు. ఈ మందులతో ‘మైలోమా’ అనే క్యాన్సర్ నయం కావడం మొదలైంది. ఇలాంటి మందులను ( ప్రోటియోజోమ్ ఇన్హిబిటర్స్ను) మరిన్ని కనుగొనడం ద్వారా అనేక రకాల క్యాన్సర్లను తగ్గించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇలా చూసినప్పుడు ఆటోఫేజీ, అపాప్టోసిస్, ప్రోటీయోజోమ్ అనేవి చాలా సంక్లిష్టమైన ప్రక్రియలు. అవి కొనసాగే మార్గాలను (పాత్ వేస్) అనేక మందుల సహాయంతో నిర్వహితమయ్యేలా చేయడం వల్ల క్యాన్సర్ కణం తనంతట తాను మటుమాయమయ్యే పరిస్థితి ఉంటుంది. ఇప్పటికి ఇది ‘మైలోమా’లోనే సఫలీకృతమైంది. కానీ ఇంకా కొన్ని క్యాన్సర్ల (సాలిడ్ ట్యూమర్స్) విషయంలోనూ, మరిన్ని క్యాన్సర్లలోనూ విజయవంతం కావాల్సి ఉంది. ఇందుకోసం రకరకాల కాంబినేషన్లలో అపాప్టోసిస్ మాడ్యులేటర్లు, ఇమ్యూనో, టార్గెట్ థెరపీ ప్రక్రియలూ, ప్రోటియోజోమ్ ఇన్హిబిటర్లు రూపొందించడంలో వైద్యశాస్త్రజ్ఞులు నిమగ్నమై ఉన్నారు.ఆ అపోహలన్నీ అలా ఆవిర్భవించినవే... ఎన్నో ఏళ్లుగా అటాప్టోసిస్ ప్రక్రియను క్యాన్సర్ను జయించేందుకు ఒక ప్రత్యామ్నాయ ‘నేచర్ క్యూర్’ ప్రక్రియగా జనం అపోహపడుతున్నారు. కొన్ని ఆహారాల ద్వారా క్యాన్సర్ లాంటి లోపభూయిష్టమైన కణాలు తమంతట తామే తమ మరణశాసనం రాసుకునేలా చేయడం (యాక్టివేటెడ్ / ప్రోగ్రామ్డ్ సెల్ డెత్)గా చాలామంది పొరబడుతుంటారు. కానీ అది పొరబాటు. క్యాన్సర్ కణాలు ఎంత జిత్తులమారివి అంటే... అవి ‘అటాప్టోసిస్’నూ తప్పించుకోగలవు. అదెలాగంటే... సెల్ను అపాప్టోసిస్కు గురిచేసే ప్రక్రియలో క్యాన్సర్ కణంలోని పవర్హౌజ్ అయిన మైటోకాండ్రియాను దెబ్బతీసే ప్రయత్నం జరుగుతుంది. అదే సమయంలో ‘బీసీఎల్–2’ అనే కుటంబానికి చెందిన మరో ప్రోటీన్ విడుదలై అది యాంటీ అపాప్టోటిక్ ప్రక్రియ ద్వారా క్యాన్సర్ కణంలోని మైటోకాండ్రియాలోకి రసాయనాలు వెళ్లకుండా చేయడం ద్వారా తనను తాను రక్షించుకుంటుంది.చివరగా... ప్రస్తుతానికి అందుబాటులో ఉన్న ప్రభావవంతమైన క్యాన్సర్ చికిత్సలు రేడియోథెపీ, కీమోథెరపీ, శస్త్రచికిత్సలే. వీటి తర్వాతే ఉపవాసాలూ, యోగా, ధ్యానం, డీ–టాక్స్ యాంటీ ఇన్ఫ్లమేటరీ ఆహారాలూ, పోషకాహారాలూ, నేచురోథెరపీలను అనుబంధంగా ఉపయోగించుకోవాలి. ఏ సెలిబ్రిటీలు చెప్పినా అవి ప్రత్యామ్నాయ చిట్కాలే తప్ప ప్రధాన చికిత్సలు కావని అందరూ తెలుసుకోవాలంటున్నారు డాక్టర్లు.అపాప్టోసిస్ అంటే... క్యాన్సర్ అంటేనే అది చెడిపోయిన / నార్మల్గా ఉండని కణం అన్న విషయం తెలిసిందే. ఏవైనా రసాయనాల ద్వారా ఓ చెడిపోయి దెబ్బతిన్న కణాన్ని మరింతగా అవమానించేలా చేస్తే అది బాగా కుంగి కుచించుకుపోయి నశించిపోయే పరిస్థితే ‘అపాప్టోసిస్’ అని చెప్పవచ్చు. నిజానికి చాలా సంక్లిష్టమైన జీవరసాయన పద్ధతికి ఇక్కడ చెప్పినది మామూలు ప్రజానీకానికి అర్థమయ్యేలా చెప్పేందుకు ఇదో సింపుల్ వివరణ అనుకోవచ్చు. అంటే కొన్ని రసాయనాలను ఉపయోగించి ఓ కణాన్ని అవమానించడం ద్వారా దాని మరణాన్ని అదే తెచ్చుకునే ‘ ప్రోగ్రామ్డ్ సెల్ డెత్’ కార్యక్రమం ఈ అపాప్టోసిస్.నిర్వహణ: యాసీన్ -
నా పారితోషికాన్ని విరాళంగా ఇచ్చేశాను
హిందీ ‘రామాయణ’ చిత్రంలో తాను నటిస్తున్న విషయాన్ని అధికారికంగా తెలిపారు వివేక్ ఓబెరాయ్. రామాయణం ఆధారంగా నితీష్ తివారి దర్శకత్వంలో హిందీలో రెండు భాగాలుగా ‘రామాయణ’ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఇందులో రాముడిగా రణ్బీర్ కపూర్, సీతగా సాయిపల్లవి, లక్ష్మణుడిగా రవి దుబే, హనుమంతుడిగా సన్నీ డియోల్, రావణుడిగా యశ్ నటిస్తున్న సంగతి తెలిసిందే. కాగా, ఈ చిత్రంలో వివేక్ ఓబెరాయ్ కూడా నటిస్తున్నారు. ఈ విషయం గురించి ఆయన మాట్లాడుతూ– ‘‘రామాయణ’ సినిమాలో నటిస్తున్నందుకు సంతోషంగా ఉంది. ఈ చిత్రంతో నిర్మాత నమిత్ మల్హోత్రా భారతీయ సినిమాను అంతర్జాతీయ వేదికపైకి తీసుకు వెళ్తున్నారు. ఇది నచ్చి, ఈ సినిమా చేయాలనుకున్నాను. అలాగే ఈ సినిమాకు సంబంధించిన నా పారితోషికం మొత్తాన్ని క్యాన్సర్ బాధిత పిల్లల చికిత్స కోసం విరాళంగా ఇచ్చేశాను. ఇక ‘రామాయణ’ సినిమా కోసం రెండు రోజులు షూటింగ్లో పాల్గొనాల్సి ఉంది. నితీష్, నమిత్, రకుల్లతో వర్క్ చేయడం బాగుంది’’ అని చెప్పుకొచ్చారు వివేక్ ఓబెరాయ్. ఇదిలా ఉంటే... ఈ చిత్రంలో శూర్పణఖగా రకుల్ప్రీత్ సింగ్ నటిస్తున్నారని, ఆమె భర్త విద్యుజ్జీహ్యుడుగా వివేక్ ఓబెరాయ్ నటిస్తున్నారని సమాచారం. ‘రామాయణ’ తొలి భాగాన్ని 2026 దీపావళికి, ‘రామాయణ: పార్టు 2’ని 2027 దీపావళికి రిలీజ్ చేయనున్నట్లుగా మేకర్స్ ఆల్రెడీ ప్రకటించిన సంగతి తెలిసిందే. -
గత ఏడాది అత్యంత క్లిష్టమైంది!
లండన్: తన జీవితంలో 2024 సంవత్సరం అత్యంత కఠినమైనదని ప్రిన్స్ విలియం వ్యాఖ్యానించారు.గత ఏడాది విలియం భార్య కేట్, ఆయన తండ్రి కింగ్ చార్లెస్–3 ఇద్దరూ క్యాన్సర్ చికిత్స చేయించుకున్నారు. ఈ నేపథ్యంలోనే లెవీ నిర్వహిస్తున్న ’ది రెలుక్టెంట్ ట్రావెలర్’ షోలో విలియం ఈ విషయాలు పంచుకున్నారు. ’షిట్స్ క్రీక్’ నటుడు యూజీన్ లెవీ నిర్వహిస్తున్న ఆపిల్ టీవీ+ ఎపిసోడ్కు సంబంధించిన ప్రివ్యూలో విలియం మాట్లాడుతూ.. ‘2024 నా జీవితంలోనే అత్యంత కఠినమైన సంవత్సరం అని నేను చెబుతాను. జీవితం మమ్మల్ని పరీక్షించాలని నిర్ణయించుకుంది.. ఆ పరీక్షను అధిగమించగలిగినప్పుడే మనమేమిటో తెలుస్తుంది.’ అని వ్యాఖ్యానించారు. అక్టోబర్ 3న ప్రసారం కానున్న ఈ ఎపిసోడ్ ప్రివ్యూలో విలియం.. లెవీని విండ్సర్ కోట చుట్టూ తిప్పుతూ చూపించడం, వారిద్దరూ ఒక పబ్లో బీరు పంచుకుంటూ కబుర్లు చెప్పుకుంటున్న దృశ్యాలున్నాయి. కేట్ జనవరిలో తనకు క్యాన్సర్ నయమైందని ప్రకటించారు. ఇటీవల ఆమె అనేక బహిరంగ కార్యక్రమాలలో పాల్గొన్నారు. ఈ నెల ప్రారంభంలో, అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యూకే పర్యటనలో.. ఆయనకు రాజ మర్యాదలతో ఆహ్వానం పలకడంలో ఆమె, విలియం కీలక పాత్ర పోషించారు. కింగ్ చార్లెస్ కూడా గత సంవత్సరం చికిత్స కోసం నెలల పాటు విరామం తీసుకున్న తర్వాత దైనందిన జీవితంలో పాల్గొంటున్నారు. కానీ కింగ్ చార్లెస్–3, కేట్లు ఇద్దరూ తాము ఏ రకమైన క్యాన్సర్కు చికిత్స చేయించుకున్నారనే విషయాన్ని మాత్రం వెల్లడించలేదు. -
కేన్సర్ కణాలపై అణువుల సుత్తి!
కేన్సర్... పేరు చెప్పగానే మరణం ఖాయమన్న ఆలోచనలు అందరిలోనూ మెదులుతాయి. అయితే అత్యాధునిక టెక్నాలజీ, పరిశోధనల పుణ్యమా అని ఇప్పుడు కేన్సర్ వ్యాధి నిర్వహణ ఎంతో సులువైంది. కాకపోతే ప్రస్తుతం అనుసరిస్తున్న వైద్య పద్ధతులు మూడింటితోనూ బోలెడన్ని సమస్యలు, దుష్ప్రభావాలైతే ఉన్నాయి. అందుకే అతితక్కువ దుష్ప్రభావాలున్న చికిత్స పద్ధతి కోసం శాస్త్రవేత్తలు చాలా చోట్ల పరిశోధనలు చేస్తున్నారు. తాజాగా రైస్ యూనివర్శిటీ Rice University శాస్త్రవేత్తలు విజయం సాధించారు కూడా. ప్రత్యేకమైన కాంతి, కొన్ని అణువుల సాయంతో 99 శాతం కేన్సర్ కణాలను చంపేయవచ్చునని వీరు నిరూపించారు. ప్రస్తుతం కేన్సర్ చికిత్సకు ప్రధానంగా మూడు రకాల పద్ధతులను ఉపయోగిస్తుంటారు. ► శస్త్రచికిత్స కణితిని తొలగించేందుకు చేసే శస్త్రచికిత్స(సర్జరీ) ఇది శరీరాన్ని బలహీన పరిచే ప్రక్రియ. ►ఇక రెండోది కీమో థెరపీ ఇందులో రేడియోధార్మిక రసాయనాల సాయంతో శరీరంలోని కేన్సర్ కణాలను నాశనం చేసేందుకు ప్రయత్నిస్తారు. జుట్టు ఊడిపోవడం, వాంతులు, విరేచనాలు, అలవిగాని అలసట.. ఇలా రకరకాల దుష్ప్రభావాలు తప్పవు. ► మూడో పద్ధతి.. రేడియో థెరపీ రేడియో ధార్మిక పదార్థాలతో నేరుగా కణితులను నాశనం చేసేందుకు వాడే పద్ధతి ఇది కీమోథెరపీతో వచ్చే ఇబ్బందులే ఇక్కడ కూడా కనిపిస్తాయి ఇటీవలి కాలంలో అందుబాటులోకి వచ్చిన ప్రిసిషన్ థెరపీ, ఇమ్యూనోథెరపీ టార్గెటెడ్ థెరపీ వంటివి మునుపటి పద్ధతుల కంటే కొంత మెరుగ్గా ఉన్నా... శాస్త్రవేత్తలు వీటిపై మరింత పట్టు సాధించాల్సిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే రైస్ యూనివర్శిటీ శాస్త్రవేత్తల సరికొత్త పరిశోధనకు ప్రాధాన్యం ఏర్పడింది. కొత్తగా ఏం చేశారంటే.. చాలా సింపుల్. అమైనో సయనైన్ అణువులు కొన్నింటిని తీసుకున్నారు. పరారుణ కాంతి కిరణాల ద్వారా వాటిని ఉత్తేజపరిచారు. ఫలితంగా ఈ అణువులు కంపించడం మొదలుపెట్టాయి. ఇలా కంపిస్తున్న అణువులను దగ్గరగా ఉంచడం ద్వారా కేన్సర్ కణాల పైపొరలు విచ్ఛిన్నమై నాశనమయ్యేలా చేశారు. అంతే!! ఈ అమైనో సయనైన్ అణువులను శరీరం లోపలి అవయవాల ఫొటోలు తీసేందుకు ఒక రకమైన రంగు మాదిరిగా ఇప్పటికే ఉపయోగిస్తున్నారు. పరారుణ కాంతి పడినప్పుడు వీటిల్లోని అణువులు ఉత్తేజితమై ప్లాస్మాన్లుగా మారుతున్నాయి. అణువు లోపలే కంపిస్తూ ఉంటాయి. ఈ కంపనాలు కాస్తా కేన్సర్ కణాల పైపొరలు ఛిద్రమయ్యేందుకు కారణమవుతున్నాయి. పరారుణ కాంతి వినియోగానికీ ప్రాముఖ్యత ఉంది. ఈ కాంతి శరీరం లోపలికి దృశ్యకాంతి కంటే లోతుగా చొచ్చుకుపోగలదు. శరీరం లోపలి అవయవాలు మాత్రమే కాకుండా.. ఎముకలకు వచ్చే కేన్సర్లకు కూడా ఈ కాంతి ద్వారా చికిత్స అందించడం సాధ్యమవుతుందన్నమాట. ఈ పద్ధతి పనితీరుపై రైస్ యూనివర్శిటీ రసాయన శాస్త్రవేత్త జేమ్స్ టూర్ మాట్లాడుతూ.. కంపనాలన్నీ క్రమ పద్ధతిలో ఒకేలా ఉండేలా చేయడం వల్ల కేన్సర్ కణాల పైపొరలు ఛిద్రమవుతున్నాయని తెలిపారు. ‘‘నిజానికి ఈ పద్ధతిని కేన్సర్పై అణువుల సుత్తి దెబ్బ’’ అనాలి అంటారు ఆయన. ఎలుకల్లో కేన్సర్ మాయం.. రైస్ యూనివర్శిటీ శాస్త్రవేత్తలు తమ పరిశోధనల్లో భాగంగా గాజు పాత్రలో కేన్సర్ కణాలను ఉంచి అమైనో సైనైన్ అణువులను ప్రయోగించారు. ఆశ్చర్యకరమైన రీతిలో 99 శాతం వరకూ కేన్సర్ కణాలు నశించిపోయాయి. మెలనోమా కేన్సర్ కణితులున్న ఎలుకలపై వాడినప్పుడు కూడా కొంత కాలం తరువాత దాదాపు సగం ఎలుకల్లో కేన్సర్ కణాలన్నవి లేకుండా పోయాయి. ఈ పరిశోధనల్లో రైస్ యూనివర్శిటీతోపాటు టెక్సస్ ఏ అండ్ ఎం, యూనివర్శిటీ ఆఫ్ టెక్సస్లు కూడా భాగస్వాములుగా ఉన్నాయి. ఏతావాతా చెప్పొచ్చేది ఏమిటంటే... నేడో రేపో.. ప్రాణాంతక కేన్సర్ను ఎలాంటి దుష్ప్రభావాలు, శస్త్రచికిత్సల అవసరం లేకుండానే నయం చేసుకోవచ్చునన్నమాట!!! -
AP: ఉద్యోగులకు గుడ్న్యూస్.. వైద్యారోగ్యశాఖ కీలక ప్రకటన
సాక్షి, అమరావతి: ఏపీలో ఉద్యోగులకు మేలు కలిగేలా వైద్య ఆరోగ్యశాఖ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఉద్యోగుల హెల్త్ స్కీమ్లోకి అదనంగా 46 రకాల క్యాన్సర్ చికిత్సలను శాశ్వతంగా చేరుస్తూ వైద్య ఆరోగ్యశాఖ ఉత్తర్వులు ఇచ్చింది. ఇక, ప్రతీ ఏటా రెన్యువల్ చేయాల్సిన అవసరం లేకుండా శాశ్వతంగా 46 రకాల క్యాన్సర్ చికిత్సలు అందేలా ఉత్తర్వులు జారీ చేసింది. కాగా, రెగ్యులర్ ఉద్యోగులతో పాటు పదవీ విరమణ పొందిన ఉద్యోగులకు ఈ చికిత్సలు అందేలా చర్యలు తీసుకోవాలని ఆరోగ్యశ్రీ ట్రస్ట్ సీఈవోకు ఆదేశించారు. -
క్యాన్సర్ చికిత్సలు
క్యాన్సర్ చికిత్సలు వయసు, క్యాన్సర్ దశ, గ్రేడింగ్, వారి ఇతర ఆరోగ్య లక్షణాలు ఇలా అనేక విషయాలపై ఆధారపడి ఉంటాయి. కొన్ని క్యాన్సర్లు... మందులకు, రేడియేషన్కు అదుపులోకి వస్తే, మరికొందరిలో అవేవీ పనిచేయకపోవచ్చు. బ్రెస్ట్ క్యాన్సర్, ప్రోస్టేట్ క్యాన్సర్ వంటి వాటికి సర్జరీ, రేడియేషన్, కీమో థెరపీలతో పాటు హార్మోన్ థెరపీ వంటి వాటికి ప్రాధాన్యం ఉంటుంది. వీటితో పాటు క్యాన్సర్కు నేడు సెల్ టార్గెటెడ్ థెరపీ, లేజర్ థెరపీ, మాలిక్యులార్ టార్గెటెడ్ థెరపీ వంటి అనేక కొత్త చికిత్స ప్రక్రియలు అందుబాటులోకి వస్తున్నాయి. క్యాన్సర్ను చాలా ఆలస్యంగా అడ్వాన్స్డ్ దశలో కనుగొన్నప్పుడు కొంతవరకు నొప్పీ, బాధ తగ్గడానికి (పాలియేటివ్ కేర్) కూడా ఉపయోగిస్తూ ఉంటారు. క్యాన్సర్ చికిత్స తీసుకునేవారికి గుండె, కిడ్నీలు, కాలేయం పనితీరు సరిగ్గా ఉండటం చాలా ముఖ్యం. ముందే ఇలాంటి సమస్యలతో బాధపడుతూ ఉన్నప్పుడు వారు క్యాన్సర్ మందులు వాడాల్సి వస్తే ఇంకా ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. క్యాన్సర్ చికిత్స జరుగుతున్నప్పుడు ఆ మందుల ప్రభావం వల్ల చుట్టూ ఉండే ఇతర అవయవాల తాలూకు ఆరోగ్యకరమైన కణాలపై ఉండే అవకాశం ఉంది. అందుకే ఆ దుష్ప్రభావాన్ని వీలైనంతగా తగ్గించేందుకు పరిశోధనలు విస్తృతంగా జరుగుతున్నాయి. వాటి ఫలితంగా నేడు క్యాన్సర్ కణాల మీద మాత్రమే పనిచేసే సెల్ టార్గెటెడ్ థెరపీలు, ఇతర అవయవాల మీద ప్రభావం పడకుండా చేసే వీఎమ్ఏటీ రేడియేషన్ థెరపీలు, వీలైనంత తక్కువ కోతతో చేయగలిగే కీహోల్ సర్జీల వంటివి అందుబాటులోకి వచ్చాయి. ఇంకా క్యాన్సర్ చికిత్సల గురించి వివరంగా తెలుసుకుందాం. శస్త్రచికిత్స: రక్తానికి సంబంధించిన క్యాన్సర్ తప్పితే మిగతా ఏ క్యాన్సర్లోనైనా శస్త్రచికిత్సకు ప్రాధాన్యం చాలా ఎక్కువ. చాలా సందర్భాల్లో క్యాన్సర్ను నయం చేయడానికి వీటిని నిర్వహించడంతో పాటు కొన్ని సందర్భాల్లో ముందే క్యాన్సర్ వచ్చే అవకాశాలను తెలుసుకొని, అవి రాకుండా నివారించడానికి కూడా సర్జరీలు చేయాల్సిన సందర్భాలుంటాయి. ఇతర ఏ భాగాలకూ వ్యాపించని దశలో క్యాన్సర్ను కనుగొంటే సర్జరీ వల్ల క్యాన్సర్ను పూర్తిగా నయం చేయవచ్చు. ఈ సర్జరీలను నేడు చాలా చిన్న కోతతోనే, ఒక్కోసారి ఆరోజే రోగి ఇంటికి వెళ్లేలా డే–కేర్ ప్రొసిజర్గా చేయగలుగుతున్నారు. ఆ సందర్భాలివే... ప్రివెంటివ్ సర్జరీ: పెద్దపేగు చివరిభాగం (కోలన్)లో పాలిప్ కనిపించినప్పుడు ఎటువంటి క్యాన్సర్ లక్షణాలు లేకున్నా సర్జరీ చేసి తొలగిస్తారు. కుటుంబ చరిత్రలో రక్తసంబంధీకులకు రొమ్ముక్యాన్సర్ వచ్చిన సందర్భాలు ఎక్కువగా ఉంటే బీఆర్సీఏ1, బీఆర్సీఏ2 వంటి జీన్ మ్యుటేషన్ పరీక్షలతో క్యాన్సర్ వచ్చే ముప్పును ముందే తెలుసుకొని రొమ్మును (మాసెక్టమీ) తొలగిస్తారు. పాప్స్మియర్ పరీక్షలో తేడాలున్నప్పుడు హిస్టరెక్టమీ చేసి గర్భాశయాన్ని తీసివేస్తారు. క్యూరేటివ్ సర్జరీ: క్యాన్సర్ను తొలిదశలో కనుగొన్నప్పుడు ముందు రేడియేషన్, కీమో లేదా సర్జరీ తర్వాత ఇతర థెరపీలతో కలుపుకుని, దాన్ని పూర్తిగా నయం చేయడానికి చేసే సర్జరీలివి. ఒక్కోసారి సర్జరీ చేస్తున్నప్పుడే రేడియేషన్ కూడా ఇస్తారు. పాలియేటివ్ సర్జరీ: క్యాన్సర్ను చాలా ఆలస్యంగా, చివరి దశలో కనుగొన్నప్పుడు ఆ కణితి పరిమాణాన్ని తగ్గించి, కొంతవరకు ఇబ్బందిని తగ్గించడానికి ఈ సర్జరీలను చేస్తుంటారు. రిస్టోరేటివ్ (రీకన్స్ట్రక్టివ్) సర్జరీ: క్యాన్సర్ చికిత్సలో చేసే సర్జరీలలో క్యాన్సర్ వచ్చిన భాగంతో పాటు, చుట్టూ ఉన్న లింఫ్నోడ్స్నీ, ఇతర కణజాలాన్నీ తొలగిస్తారు. రొమ్ము, హెడ్ అండ్ నెక్ క్యాన్సర్లలో నోటికి సంబంధించిన భాగాల్ని తొలగించినప్పుడు, బాధితుల్లో ఆత్మన్యూనతను నివారించడానికి దేహంలోని ఇతర భాగాల నుంచి కణజాలాన్ని సేకరించి రీకన్స్ట్రక్టివ్ సర్జరీలను చేస్తారు. కీమోథెరపీ: క్యాన్సర్ చికిత్స అనగానే సర్జరీ కంటే కీమోథెరపీకి ఎక్కువగా భయపడుతూ ఉంటారు. వాంతులు, వికారం, బరువు తగ్గడం, అలసట, కనురెప్పలతో పాటు జుట్టంతా రాలిపోవడం... ఇలాంటి లక్షణాలవల్ల కీమో అంటే అందరికీ భయం. ఈ దుష్ప్రభావాలన్నీ కేవలం తాత్కాలికమే. కొత్త టార్గెటెడ్ థెరపీలతో కొంతవరకు సైడ్ఎఫెక్ట్స్ తగ్గినా ఇవి అందరికీ అందుబాటులో లేకపోవడం బాధాకరం. రేడియేషన్ థెరపీ: వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న రేడియేషన్ థెరపీలో అనేక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. వీటివల్ల అరగంటపైగా సాగే చికిత్స ఇప్పుడు కొద్ది నిమిషాల్లోనే పూర్తవుతుంది. కొన్ని కొన్ని క్యాన్సర్కు రేడియేషన్తో మాత్రమే చికిత్స కొనసాగుతుంది. రోగిని ఏమాత్రం కదిలించకుండా కొనసాగే త్రీ–డైమన్షనల్, స్టిరియోటాక్టిక్, బ్రాకీథెరపీ వంటి అనేక కొత్త చికిత్స వల్ల తక్కువ వ్యవధిలోనే చికిత్స పూర్తవ్వడమే కాకుండా, దుష్ప్రభావాలు కూడా చాలావరకు తగ్గాయి. ఇటీవలి పురోగతితో అధునాతన చికిత్సలు: స్టెమ్సెల్ థెరపీ, సర్జరీలలో లేజర్ ఉపయోగించడం, లైట్ను ఉపయోగించి చేసే ఫోటో డైనమిక్ థెరపీలు, అతివేడి లేదా అతి చల్లటి ఉష్ణోగ్రతలను ఉపయోగించి చేసే చికిత్సలు, మన రోగనిరోధకశక్తిని బలపరచి క్యాన్సర్ కణాల మీద దాడి చేసేటట్లు చేసే ఇమ్యూనో థెరపీలు, మాలిక్యులార్ టార్గెటెడ్ థెరపీలు క్యాన్సర్ చికిత్స రంగంలో విప్లవాత్మకమైన మార్పులు తెచ్చాయని చెప్పవచ్చు. -డా. సీహెచ్. మోహన వంశీ చీఫ్ సర్జికల్ ఆంకాలజిస్ట్, ఒమెగా హాస్పిటల్స్, హైదరాబాద్ ఫోన్ నంబరు 9849022121 -
రౌడీ క్యాన్సర్లను రఫ్ఫాడించేద్దాం రండి!
సమాజంలో రకరకాల మనుషులుంటారు. దేహంలో కణాలూ అంతే. వాటిల్లో ఎన్నెన్నో రకాలు. సమాజంలోని వ్యక్తులంతా సమాజం విధించిన నియమ నిబంధనలను పాటిస్తూ, చట్టాన్ని గౌరవిస్తూ ఉంటారు. దేహంలోని కణాలూ అంతే. జీవక్రియల విషయంలో తమకు అస్పగించిన విధులను నిర్వర్తిస్తూంటాయి. అయితే సమాజంలోని కొందరు వ్యక్తులు మాత్రం సామాజిక నియమనిబంధనలను లెక్కచేయరు. వారెంతో బలంగా మారతారు. ఎవరికీ లొంగరు. తమ బలం తో చట్టాలను అతిక్రమిస్తారు. వారినే ‘రౌడీ‘లనీ, సంఘవ్యతిరేక శక్తులనీ అంటాం. సమాజంలో వారెలాగో... కణాల్లోనూ జీవక్రియల నియమ నిబంధనలను అతిక్రమించే రౌడీకణాలే క్యాన్సర్ కణాలనుకోవచ్చు. ఈరోజు ‘వరల్డ్ క్యాన్సర్ డే’ సందర్భంగా క్యాన్సర్ అంటే ఏమిటో చాలా తేలిగ్గా అర్థం చేసుకునేందుకు... క్యాన్సర్ను సమాజం లోని సంఘవిద్రోహశక్తులతో పోలుస్తూ ఇస్తున్న ప్రత్యేక కథనమిది. రోడ్డు మీద అందరూ ఎడమపక్కనే నడవాలి. రెడ్లైట్ పడితే ఆగాలి. గ్రీన్లైట్ పడ్డప్పుడు జీబ్రాక్రా సింగ్ దగ్గర రోడ్డు దాటాలి. ఇవి సామాజిక నియమాలు. వీటిని పాటిస్తే ప్రమాదాలే జరగవు. రౌడీ కుర్రాళ్లు రెడ్లైట్ పడ్డాక కూడా బైక్ను దాటిస్తారు. జీబ్రాక్రాసింగ్ వద్ద జనాలు వెళ్తున్నప్పుడే వాళ్ల మీదికి వాహనాన్ని తీసుకెళ్తారు. ఏమాత్రం నియమ నిబంధనలను పాటించరు. అచ్చం ఇలాగే దేహంలోని క్యాన్సర్ కణం కూడా. నిశ్చితంగా ఒకేవిధంగా విభజితం కావాల్సిన కణాలు అలా కావు. నిర్దిష్టంగా పెరగాల్సిన ఒకవేపునకు పెరగవు. ఇష్టం వచ్చినట్లు దేహమంతా పాకేస్తాయి. ఆరోగ్య కణాలమీదికి దాడి చేస్తాయి. దోపిడీలూ, కబ్జాలు చేసే రౌడీ క్యాన్సర్ కణాలు M. G. Naga Kishore Chief Surgical Oncologist, Omega Hospitals, Guntur Ph: 0863 2223300 సమాజంలో మామూలు వ్యక్తులు దొంగతనాలు చేయగలరా? దోపిడీలకు పాల్పడగలరా? కబ్జాలు చేయగలరా? వారికా ధైర్యం ఉంటుందా? ఉండదు. కేవలం రౌడీతనంతో వ్యవహరించే వారే ఈ పనులన్నీ చేయగలరు కదా. అలాగే కణాల్లోనూ రౌడీ కణాల్లాంటి ఈ క్యాన్సర్ కణాలు దోపిడీలూ, కబ్జాలూ, మోసాలు చేస్తాయి. అదెలాగో చూద్దాం. దేహకణాల మనుగడకు ఆహారం, ఆక్సిజన్ కావాలి. ఇది రక్తం ద్వారా అందుతుంది. ఏ కణానికి ఎంత అవసరమో ఆయా కణాలు అంతే తీసుకుంటాయి. కానీ క్యాన్సర్ కణాలు తమకు కావాల్సిన ఆహారం, ఆక్సిజన్ కోసం రౌడీయిజమ్ చేస్తాయి! కబ్జా చేస్తాయి!! అదెలాగంటే... తమవైపు ఎక్కువగా రక్తం ప్రవహించేందుకు వీలుగా... మరిన్ని ఎక్కువ రక్తనాళాలను ఏర్పాటు చేసుకుని ఆహారాన్ని కబ్బా చేస్తాయి. సాధారణ కణాలు అన్ని కణాలకూ రక్తం అందేందుకు రక్త రవాణా వ్యవస్థను ఒక నిర్దిష్టమైన క్రమపద్ధతిలో నిర్మించుకుంటాయి. దానిపేరే ‘యాంజియోజెనెసిస్’. సాధారణంగా రక్తనాళంలోని లోపలి పొర అయిన ఎండోథీలియమ్ నుంచి ఈ రహదారులు ఏర్పడుతుంటాయి. ఇలా ప్రతి సాధారణ కణానికి రక్తనాళాలు ఏర్పడే ప్రక్రియను ‘నార్మల్ యాంజియోజెనెసిస్’ అంటారు. కానీ రౌడీలు దారిదోపిడీ చేసినట్లుగానూ, సామాన్యుల ఆస్తులను కబ్జా చేసినట్లుగానూ వ్యవహరింస్తూ ఆహార కబ్బాలకోసం అనుసరించే మార్గాన్ని వైద్యపరిభాషలో ట్యూమర్ యాంజియోసిస్ అంటారు. ఈ ‘ట్యూమర్ యాంజియోజెనెసిస్’ మార్గంలో పొరుగు ఆరోగ్యకణాలపై రౌడీయిజం చేసి, వాటిని ఎలా కొల్లగొట్టి కబ్జా చేస్తాయో కాస్త విపులంగా చూద్దాం. సాధారణ కణాలూ తమలోకి రక్తం ప్రవహించేందుకు రహదారి పడేలా సిగ్నల్స్ పంపుతాయి. సరిగ్గా అలాంటి సిగ్నల్స్నే ఈ క్యాన్సర్ కణాలు కూడా పంపుతాయి. అంతేకాదు.. పక్కన ఉండే హెల్దీ కణాలకు అందే రక్తం కూడా తమకే అందేలా ఆరోగ్యకరమైన కణం మీద దౌర్జన్యం చేస్తాయి. అలా పొరుగుకణాన్ని నాశనం చేస్తాయి. మోసాల... దొంగవేషాల కేడీలివి... Dr. Y Venkata Rami Reddy Medical Director, Omega Hospitals Kurnool, +91 6281066155 క్యాన్సర్ కణాలు చేసే మోసాల తీరు అచ్చం మన సమాజంలోని కేడీలు చేసినట్లుగానే ఉంటాయి. అదెలాగో చూడండి. సాధారణంగా మన దేహంలో నాలుగు ప్రధాన రకాల కణాలుంటాయి. అవి ఎపిథీలియల్, కనెక్టివ్, కండర (మజిల్ టిష్యూ), నాడీకణజాలాలు (నర్వ్ టిష్యూ). సాధారణంగా ఏ అవయవానికైనా... పైవైపున ఉండే కణజాలం ఎపిథీలియల్ కణాలనే కణజాలంతో నిర్మితమై ఉంటుంది. క్యాన్సర్గడ్డకు పైభాగంలో ఉండే ఎపిథీలియల్ కణజాలం కూడా తాను వ్యాధినిరోధక వ్యవస్థ నుంచి తప్పించుకునేందుకు ఒక దొంగవేషంతో మోసం చేస్తుంది. అదేలాగంటే... క్యాన్సర్ కణపు ఎపిథీలియమ్ కణజాలం కాస్తా... అకస్మాత్తుగా కనెక్టివ్ టిష్యూగా మారిపోతుంది. అంటే ఇక్కడ ఎపిథీలియన్ కణాలన్నీ కనెక్టివ్ కణాలుగా మారువేషం వేస్తాయన్నమాట. చాలా సంక్లిష్టంగా జరిగే ఆ ప్రక్రియను కాస్త మనకు అర్థమయ్యే తేలిక భాషలో చెప్పుకుందాం. ఓ పామును పట్టుకుంటే అది తన పైకుబుసాన్ని మన చేతిలో వదిలేసి, కింద కొత్త కుబుసంతో తప్పించుకుని జారిపోయినంత తేలిగ్గా ఈ పని జరుగుతుంది. దీన్నే నిపుణులు ‘ఇన్యాక్టివేషన్ ఆఫ్ మాలెక్యులార్ స్విచ్’ అంటారు. రౌడీలకు మద్యంలా ... క్యాన్సర్కు చక్కెర మన సినిమాల్లో రౌడీవిలన్లు ఎప్పుడూ చేతిలో మద్యం గ్లాసు పట్టుకుని కనిపిస్తుంటారు కదా. వారికి మద్యం ఎలా ఇష్టమో రౌడీక్యాన్సర్ కణానికి చక్కెర అలా ఇష్టం. వాటి పెరుగుదలకు శక్తి కావాలి. మిగతాక ణాల నుంచి కబ్జా చేసి పొందే ఆ శక్తి గ్లూకోజ్ రూపంలో క్యాన్సర్ కణాలకు అందుతుంటుంది. అనేక పోషకాలూ గ్లూకోజ్, ఆక్సిజన్తో కలిసి అందే ఆ శక్తిని పొందే చర్యంతా ‘సెల్ రెస్పిరేషన్’ అనే పేరున్న సంక్లిష్ట ప్రక్రియలో జరుగుతుంది. ఈ శక్తి (ఎనర్జీ)ని అందుకున్న క్యాన్సర్ కణం దాన్ని ఉపయోగించుకొని, మరింత అనియంత్రితంగా పెరుగుతుంది. ఇందుకు అవసరమైన గ్లూకోజ్ (చక్కెర) కోసం అది రౌడీలు మద్యం కోసం వెంపర్లాడినంతగా అన్నమాట! సాధారణ ఆరోగ్యకరమైన కణజాలాలు తమకు అందే గ్లూకోజ్ నుంచి ‘గ్లైకాలసిస్’ అనే ప్రక్రియ ద్వారా శక్తిని తయారు చేసుకుంటాయి. కానీ క్యాన్సర్ కణం ఇలా గ్లైకాలసిస్ను నమ్ముకోదు. పైన చెప్పిన ప్రక్రియ కారణంగా క్యాన్సర్ కణంలోని మైటోకాండ్రియా దెబ్బతింటుంది. Dr. Ch. Mohana Vamsy Chief Surgical Oncologist Omega Hospitals, Hyderabad Ph: 98480 11421, Kurnool 08518273001 మద్యం తాగిన వాడు ఆ మత్తులో ఎవరినీ లెక్క చేయడు. ఆ మద్యం ప్రభావంతో ఒక్కోసారి పోలీసులనూ ఎదిరిస్తుంటాడు కదా. అలాగే పైన చెప్పిన అక్రమ ప్రక్రియలో మద్యంలా ఎనర్జీ ని తాగేసి పుంజుకున్న బలంతో ఈ క్యాన్సర్ రౌడీ కణాలు... తమ పాలిటి పోలీస్ అయిన కీమోథెరపీని సైతం ధిక్కరిస్తూ ఉంటాయి. ఆరోగ్యకరమైన సమాజంలో రౌడీలూ, ఉగ్రవాదులు ఉండరు. సమాజం ఆరోగ్యకరంగా లేనప్పుడే అలాంటి సంఘవిద్రోహులు పుట్టుకొస్తారు. అలాగే దేహం ఆరోగ్యంగా లేనప్పుడూ ఆరోగ్యకరమైన క్యాన్సర్ కణంగా మారేందుకూ... వాటి నుంచి మరిన్ని క్యాన్సర్ కణాలు ఉద్భవించేందుకు ఆస్కారం ఉంది. అందుకే సమాజంలాగే దేహాన్నీ ఆరోగ్యంగా ఉంచుకోవాలి. అందుకోసం మనం ఆరోగ్యకరమైన జీవనశైలితో, మంచి ఆహారాన్ని తీసుకుంటూ ఉండాలి. కాలుష్యపూరితమైన వాతావరణానికి దూరంగా ఉండాలి. ప్రతిరోజూ ఎంతో కొంతసేపు దేహశ్రమ, వ్యాయామం చేస్తూ వ్యాధినిరోధకశక్తిని పెంచుకోవాలి. మన దేహం బాగుంటే మనందరమూ ఆరోగ్యంగా ఉంటే సమాజమూ బాగుంటుంది. అందరూ హాయిగా, హ్యాపీగా ఉంటారు. సాధారణ కణానికీ... రౌడీ కణానికీ తేడా చూద్దామా! సాధారణ జీవకణాలన్నీ కొన్ని నియమాలను పాటిస్తుంటాయి. అవి నిర్ణీత క్రమంలో విభజితమై పెరుగుతుంటాయి. కణజాలంలోని ఒక కణానికీ, మరో కణానికీ మంచి కమ్యూనికేషన్స్తో ఉంటాయి. ప్రోటీన్ల రూపంలో ఉండే సెల్కెమికల్స్ ద్వారా సిగ్నల్స్తో పలకరించుకుంటూ, పరస్పరం సహకరించుకుంటూ ఉంటాయి. ఇలా గుండెలో ఉండేవి అక్కడి విధులూ, మెదడు కణాలు వాటి విధులూ, కాలేయకణాలు తమకు నిర్దేశించిన పనులూ చేసుకుంటూ ఉంటాయి. అవి ఎంత క్రమశిక్షణతో వ్యవహరిస్తుంటాయంటే... తమ పనులు తాము చేసుకుంటూ ఉండటమే కాదు... ఒక్కోసారి ఒకవేళ తమకు ఏదైనా కారణంగా అనారోగ్యం కలిగితే.. తమ జబ్బు తమకు మాత్రమే పరిమితం చేసుకునేందుకూ, పక్క కణాలకు అంటకూడదని ‘సెల్డెత్’ పేరిట తమను తాము నాశనం చేసుకుంటాయి. అచ్చం సమాజంలోని ఆరోగ్యకరమైన వ్యక్తులు క్వారంటైన్లో ఉండి తమ వ్యాధి ఇతరులకు పాకకుండా ఉన్నట్లుగా అవీ వ్యవహరిస్తాయి. కానీ క్యాన్సర్ పూర్తిగా భిన్నంగా వ్యవహరిస్తుంది! ఉదాహరణకు మన చర్మంలోని కణాలు నిత్యం కొత్తవి పుడుతూ పాతవి చనిపోతూ ఉంటాయి. అలా కొత్తవి పుట్టినప్పటికీ చర్మం ఎప్పటిలా ఒకేలా ఉంటుంది. కానీ క్యాన్సర్ కణాలు పుడుతున్న కొద్దీ ఇష్టమొచ్చినట్టు పెరుగుతూ పోతాయి. అసహ్యకరమైన గడ్డల్లా అడ్డదిడ్డంగా పెరుగుతాయి. అవే క్యాన్సర్ ట్యూమర్లు. దొంగదారుల్లో దాక్కునే ఉగ్రవాదులాంటివి... సమాజంలోని రౌడీలు దొంగదారులు తొక్కుతారు. పోలీసులను తప్పించుకునేందుకు దొంగవేషాలు వేస్తారు. అచ్చం ఇలాగే ఈ క్యాన్సర్ కణాలూ దొంగవేషాలు వేస్తాయి. మన దేహంలో ఉండే వ్యాధినిరోధక వ్యవస్థ ఓ పోలీస్ వ్యవస్థలాంటిదే. రౌడీలూ, దొంగలూ పోలీసులను తప్పించుకునేందుకు అండర్ గౌండ్స్లో దాక్కోవడం, మారువేషాలతో మోసాలు చేయడం చూస్తుంటాం కదా. రౌడీ క్యాన్సర్ కణాలూ ఇలాగే చేస్తుంటాయి. అదెలాగో చూద్దాం. మన దేహంలో మనకు మేలు చేసే లింఫ్నోడ్స్ ఒక ప్రోటీన్ను రూపొందించుకుంటాయి. ఈ ట్యూమర్ కణాలు కూడా అచ్చం అలాంటి ప్రోటీన్నే రూపొందించుకుంటాయి. ఇది ఎలా ఉంటుందంటే... ఒక్కోసారి దొంగలే పోలీస్ డ్రస్సులతో వచ్చి వారిని బోల్తా కొట్టించినట్లుగా అవి కూడా తప్పించుకుంటాయి. తమపైని ప్రోటీన్ను... అచ్చం ఓ దొంగ ఐడీ కార్డులా, నకిలీ ఫోర్జరీ డాక్యుమెంట్ లా సృష్టించి వాడుకుంటాయి. ఆరోగ్యాన్ని కాపాడే ఈ వ్యాధినిరోధక వ్యవస్థ ఆ ఐడీలను చూసి ఆ కణాలు కూడా తమలాంటి ‘లింఫ్ టిష్యూ’లేమోనని పొరబడి వాటిని వదిలేస్తాయి. అలా రోగనిరో«ధక శక్తుల్లాంటి పోలీస్ వ్యవస్థ కనుగప్పి తప్పించుకోవడమే గాకుండా... క్యాన్సర్లన్నీ ఒంట్లో వివిధ ప్రదేశాలకూ, వేర్వేరు అవయవాలకూ పాకి.... అక్కడా ఆహారం, ఆక్సిజన్లాంటి వనరుల కబ్జా, దోపిడీలకు మళ్లీ పాల్పడుతుంటాయి. ఇదొక సైకిల్ కొనసాగుతూ ఇలా నిరంతరం జరిగిపోతుంటుంది. చికిత్సను తప్పించుకోడానికి రౌడీలు, ఉగ్రవాదులు ఒక్కోసారి కూంబింగ్ ఆపరేషన్స్నుంచి తప్పించుకునేందుకు... తాము ఉండటానికి ఎవరూ అనుమానించని చోటికి వెళ్లి దాక్కుంటారు. బయట సమాజంలో దాన్ని సేఫ్ షెల్టర్ జోన్ గా అంటుంటారు. అలాగే ఈ మోసకారి కణాలు కూడా సేఫ్ జోన్లలాంటి పక్క కణజాలాల్లోకి దూరిపోయి అక్కడ షెల్టర్ తీసుకుంటూ ఉంటాయి. ఉదాహరణకు కొన్ని రకాల లూకేమియాలకు కీమోథెరపీ చికిత్స తో ‘కూంబింగ్’ చేసే సమయంలో ఈ ఉగ్ర–క్యాన్సర్ కణాలు పక్కనే ఉండే ఎముకల్లోకి దూరిపోయి తమను తాము రక్షించుకుంటుంటాయి. -
బియ్యం కన్నా చిన్న కంప్యూటర్
వాషింగ్టన్: ప్రపంచంలోనే అత్యంత చిన్న కంప్యూటర్ను అమెరికాలోని మిషిగాన్ యూనివర్సిటీ పరిశోధకులు తయారుచేశారు. 0.3 మిల్లీమీటర్ల మందం ఉన్న ఇది బియ్యం గింజ కన్నా చాలా చిన్నది. ‘మిషిగాన్ మైక్రో మోట్’గా పిలుస్తున్న ఈ చిట్టి కంప్యూటర్ పనిచేసే విధానం కూడా కాస్త భిన్నంగా ఉంది. సంప్రదాయ కంప్యూటర్లను ఆఫ్ చేసిన తరువాత కూడా వాటిలోని సమాచారం అలాగే భద్రంగా ఉంటుంది. కానీ ఈ కంప్యూటర్ను ఒకసారి స్విచాఫ్ చేస్తే అంతకు ముందు చేసిన ప్రొగ్రామింగ్, డేటా అంతా అదృశ్యమవుతుంది. ఈ సూక్ష్మ కంప్యూటర్లో ర్యామ్, కాంతి విద్యుత్ ఘటాలతో పాటు ప్రాసెసర్లు, వైర్లెస్ ట్రాన్స్మిటర్లు, రిసీవర్లను అమర్చారు. పరిమాణంలో చిన్నవి కావడంతో వీటిలో ఆంటెనాకు బదులుగా కాంతి సాయంతో సమాచార మార్పిడి జరిగే వ్యవస్థను ఏర్పాటుచేశారు. ఈ కంప్యూటర్ను కేన్సర్ కణతుల పరిశీలన, చికిత్సలో ఉపయోగించొచ్చని పరిశోధకులు వెల్లడించారు. -
క్యాన్సర్ వాక్సిన్పై అవగాహన పెంచాలి: స్టాన్లీమార్క్స్
సాక్షి, హైదరాబాద్: అమెరికా వంటి అభివృద్ధి చెందిన దేశాల్లో పదిహేనేళ్ల వయసువారు సైతం విధిగా క్యాన్సర్ పరీక్షలు చేయించుకుంటున్నారని, కానీ భారత్లో మాత్రం క్యాన్సర్ వ చ్చిందని తెలిసినా చికిత్సను నిర్లక్ష్యం చేస్తున్నారని ప్రిన్స్బర్గ్ ఆంకాలజీ వర్సిటీ చైర్మన్, ప్రముఖ గైనిక్ క్యాన్సర్ వైద్య నిపుణుడు డాక్టర్ స్టాన్లీమార్క్స్ ఆందోళన వ్యక్తం చేశారు. క్యాన్సర్ వ్యాక్సిన్పై దేశంలో అవగాహన పెంచాల్సిన అవసరం ఉందన్నారు. స్థానిక ఓ హోటల్లో శుక్రవారం అమెరికన్ ఆంకాలజీ ఇనిస్టిట్యూట్ మెడికల్ డెరైక్టర్ డాక్టర్ బాబయ్యతో కలిసి స్టాన్లీమార్క్స్ విలేకరులతో మాట్లాడారు. విదేశాల్లో రొమ్ము క్యాన్సర్ ఎక్కువగా ఉందని, భారత్లో గర్భాశయ ముఖద్వారం క్యాన్సర్ ఎక్కువ ఉందని తెలిపారు. అమెరికాలో 75 శాతం మంది ముందస్తుగా వ్యాక్సిన్ వేయించుకుంటే, భారత్లో ఒక్కశాతం కూడా లేరని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితి ఇకనుంచైనా మారేలా చర్యలు చేపట్టాలన్నారు.


