బాసర ఆలయ ఏఈవోపై వేటు
బాసర, న్యూస్లైన్ : పవిత్ర పుణ్యక్షేత్రమైన బాసర శ్రీ జ్ఞానసరస్వతీ ఆలయంలో ఏఈవోగా విధులు నిర్వహించి ఇటీవలే బదిలీ అయిన గంగా శ్రీనివాస్పై ఎట్టకేలకు సస్పెన్షన్ వేటు పడింది. సుప్రసిద్ధమైన దేవాలయంలో తిష్టవేసి ఏళ్ల తరబడిగా అన్నీతానై వ్యవహరిస్తున్న ఆయన ఆగడాలు ఎట్టకేలకు పరాకాష్టకు చేరాయి. సుమారు 15 ఏళ్ల క్రితం బాసర ఆలయంలో క్రింది స్థాయి ఉద్యోగిగా చేరింది మొదలు అక్రమమార్గంలో ఏఈవో స్థాయికి ఎదిగాడంటూ ఆయనపై ఆరోపణలు ఉన్నాయి. ఆలయ ఆదాయం మొదలుకుని అభివృద్ధి పనులకు కేటాయించే నిధుల వినియోగం వరకు అన్నీ ఆయన కనుసన్నల్లో జరిపించిన ఆయనపై చివరకు సస్పెన్షన్ వేటు పడటం చర్చనీయాంశంగా మారింది.
బాసర ఆలయంలో ఈవోగా ఉన్నతస్థాయి అధికారులున్నా, ఏఈవోగా చక్రం తిప్పిన శ్రీనివాస్ ఇటీవలే హైదరాబాద్ దేవాదాయ ధర్మాదాయ శాఖ కార్యాలయానికి డెప్యూటేషన్పై వెళ్లారు. హైదరాబాద్లో డెప్యూటేషన్పై వెళ్లిన ఆయన సొంత అవసరాల పేరిట సెలవు పెట్టారు. ఇదే క్రమంలో ఆయన బాసరకు చెందిన ఓ వివాహితను తీసుకెళ్లాడంటూ ఆమె భర్త పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు. ఈ క్రమంలో గంగా శ్రీనివాస్పై పోలీసులు 497, 498 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఈ వ్యవహారం జిల్లాలో వ్యాపించగా పత్రికా కథనాలపై స్పందించిన ఉన్నతాధికారులు విచారణ నిర్వహించారు.
ఈ నేపథ్యంలో దేవాదాయ, ధర్మాదాయశాఖ కమిషనర్ గంగా శ్రీనివాస్ను సస్పెండ్ చేస్తూ శుక్రవారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేశారని ఆలయ ఈవో ముత్యాలరావు తెలిపారు. తన భార్యను తీసుకెళ్లాడన్న ఓ వ్యక్తి పోలీసుస్టేషన్లో శ్రీనివాస్పై ఫిర్యాదు చేయడం, ఆయనపై కేసులు నమోదు కావడం వల్ల ఆలయ ప్రతిష్టకు భంగం కలగడంతో సస్పెండ్ చేసినట్లు ప్రకటించారు. అదే విధంగా కాంట్రాక్టు కంప్యూటర్ ఆపరేటర్గా బాసర దేవాలయంలో పనిచేస్తున్న రజినిని కూడా విధుల నుంచి తొలగించినట్లు ఆలయ ఈవో తెలిపారు. కాగా మొదటి నుంచి వివాదాల్లో చిక్కుకున్న శ్రీనివాస్ సస్పెన్షన్ ఆలయవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.