breaking news
Anil Rachamalla
-
ఇంటర్నేషనల్ కాల్స్ వస్తున్నాయా?! ఒక్క క్లిక్తో అంతా ఉల్టా పల్టా!
ఇటీవల ఇండోనేషియా (+62), వియత్నాం (+84), మలేషియా (+60), కెన్యా (+254), ఇథియోపియా (+251).. మొదలైన దేశాల నుంచి వచ్చే ఇంటర్నేషనల్ ఫోన్కాల్స్ను తమకు తెలియకుండా అప్రయత్నంగా.. అనుకోకుండా రిసీవ్ చేసుకుంటూ ఆర్థిక మోసాల బారిన పడుతున్నారు చాలా మంది. ఈ సైబర్నేరగాళ్ల నుంచి జాగ్రత్తపడటమే కాదు మన తోటివారికీ అవగాహన కలిగించడం అవసరం. ఆఫీసుకువెళ్లే హడావిడిలో ఫోన్ మోగితే లిఫ్ట్ చేసింది గీత. ఒక లార్జ్ గ్రూప్ ద్వారా ఆన్లైన్ ఆదాయ వనరులను పరిచయం చేయబోతున్నామని, అందుకు సంబంధించిన వివరాలను ఫోన్కి పంపుతున్నామని చెప్పారు కాలర్. అందుకు ఎన్ని లెవల్స్ ఉంటాయో, ఎలా పాల్గొనవచ్చో కూడా చెప్పిన విధానం గీతకు బాగా నచ్చింది. ముందు ఫ్రీ టాస్క్లో పాల్గొని, అంతా నచ్చితే కొనసాగించమని, అందుకు సంబంధించిన వివరాల మెసేజ్ను పంపుతామని, చెక్ చేసుకోమని, గ్యారంటీ ్రపాఫిట్ అని చెప్పడంతో గీతకు ఆనందమేసింది. ఆఫీసుకు వెళ్లాక ఫోన్కి వచ్చిన వాట్సప్ మెసేజ్ చూసింది. గ్రూప్లో జాయినవమని వచ్చిన మెసేజ్ అది. ఆ గ్రూప్లో జాయిన్ అయింది. చాలా మంది ఉన్న ఆ గ్రూప్లో పెద్ద పెద్ద వాళ్లు ఉన్నారని అర్ధమైంది. ఆ గ్రూప్లో చూపించిన విధంగా తన అకౌంట్కి లాగిన్ అయి, ఫ్రీ టాస్క్లో చేరితే వెంటనే తన అకౌంట్లోకి రూ.500 వచ్చాయి. ఆనందపడుతూ వాళ్లు చెప్పిన టాస్క్ని పూర్తి చేస్తే, మరో రూ.1000 జమ అయ్యాయి. వాటిని విత్ డ్రా చేసుకున్నాక, పెయిడ్ టాస్క్కు వెళ్లి లక్ష రూపాయలు పోగొట్టుకున్నాక కానీ, అర్ధం కాలేదు గీతకు తను మోసపోయానని. విదేశీ మోసగాళ్లు వర్క్ ఫ్రమ్ హోమ్ పేరిట కూడా ఇలాంటి మోసాలకు పాల్పడుతుంటారు. ఫేక్ లైక్స్.. డీపీ లు మొత్తం ఇండియన్ అమ్మాయిల ఫొటోలు ఉంటాయి. కానీ, ఫేక్ప్రొఫైల్స్ ఉంటాయి. మనవాళ్లే కదా అని జాయిన్ అవుతాం. వాయిస్ కూడా మన ఇండియన్ స్టైల్లోనే ఉంటుంది. ఇన్స్టాగ్రామ్ లైక్స్, యూ ట్యూబ్ వ్యూస్...పెంచడం కోసం ఒక టాస్క్ ఉంటుంది. ముందు ఫ్రీ టాస్క్ల పేరుతో ఆకట్టుకుంటారు. మనకు ఎప్పుడైతే డబ్బులు వస్తాయో అప్పుడు ఆ గేమ్ పట్ల ఆసక్తి పెరుగుతుంది. నిజమైన ప్లేయర్లతో పాటు స్కామర్లు కూడా ఉంటారు. రూ. 500 వచ్చాయని, రూ.1000 వచ్చాయని స్క్రీన్ షాట్స్ షేర్ చేస్తుంటారు. కొంత టైమ్ అయ్యాక ఫ్రీ టాస్క్ పూర్తయిందని, పెయిట్ టాస్క్ ఉందని చెబుతారు. వీటిలో మళ్లీ రకరకాల గ్రూప్స్లో మనల్ని యాడ్ చేస్తారు. రూ.1000 పెడితే 1300 ఇస్తాడు. వెంటనే 300 రావడంతో ఆశ పెరుగుతుంది. 5000 పెడితే మరో 2000 అదనంగా వస్తాయని చూపుతారు. ప్రతీ టాస్క్ పై ఒత్తిడితో కూడా ప్రెజర్ ఉంటుంది.రూ. 7000 మన అకౌంట్కు ట్రాన్స్ఫర్ చేసేలోపు టైమ్ లాప్స్ అయిపోయిందని చెబుతారు. దీనిని డ్రా చేయాలంటే రూ. 10000 పెట్టమంటారు. ఇవన్నీ మల్టిపుల్ అకౌంట్స్ , ఇండియన్ అడ్రస్ ఉన్న ప్రైవేట్ బ్యాంకుల ఖాతాలు చూపుతారు. మనం నిజమే కదా అని నమ్మి వాళ్ల ట్రాప్లో పడతాం. అప్పుడు మెల్ల మెల్లగా రూ.50 నుంచి మొదలు పెట్టి పది లక్షల వరకు రూట్ మార్చుతుంటారు. ఇరవై రోజుల క్రితం 20 లక్షలు వరకు జరిగిన మోసం నిన్న 60 లక్షల రూపాయలతో సైబర్ క్రైమ్లో కేస్ నమోదైంది. స్పామ్ కాల్స్కి ఆన్సర్ చేయద్దు ♦ తెలియని ఇంటర్నేషనల్ ఫోన్ కాల్స్ని నమ్మద్దు. ఈ కాల్స్ వచ్చినప్పుడు అపనమ్మకంగానే కాదు అప్రమత్తంగానూ ఉండడటం అవసరం. ♦ కాలర్ ఐడెంటిటినీ వెరిఫై చేసుకోవాలి. ♦ ఆధార్కార్డ్, పాన్కార్డ్, బ్యాంక్ అకౌంట్ వంటి వ్యక్తిగత వివరాలను కాలర్స్కి ఇవ్వద్దు. ♦ స్పామ్ కాల్స్ని రిసీవ్ చేసుకోవద్దు. అలాంటి వాటిని ట్రూ కాలర్లో చెక్ చేసుకోండి. ♦ వాట్సప్, టెలిగ్రామ్, ట్రూ కాలర్లో అనుమానించదగిన ఫోన్కాల్స్ వచ్చినప్పుడు ఆ యాప్స్కి రిపోర్ట్ చేయడం మర్చిపోవద్దు. ఒక సింగిల్ స్టెప్ ద్వారా యూజర్ రిపోర్ట్ చేయచ్చు. ♦ ఏ కాలర్ కూడా మనల్ని డబ్బు కట్టమని అడగరు. ఇలాంటప్పుడు గ్రూప్లో నుంచి ఎగ్జిట్ అవడం లేదా హ్యాంగప్ చేయాలి. ♦ ఏం చేస్తారో చూద్దాం అనుకొని గ్రూప్లో కొందరు ఎగ్జిట్ అవక అలాగే ఉండిపోతారు. అలాంటివాళ్లే ఎక్కువ ఇన్వెస్ట్ చేసి మోసపోతారు. గ్రూప్లో అలాగే ఉండి మిగతా మెంబర్లు ‘మాకు డబ్బులు వచ్చాయి’ అని షేర్ చేసే, స్క్రీన్ షాట్లకు పడిపోవద్దు. మోసపోతే.. ♦ 1930కి కాల్ చేయాలి. ♦హెల్ప్లైన్ వాళ్లు మోసపోయిన ఆధారాల డాక్యుమెంట్స్ ఇవ్వమంటారు. ♦ మోసగాళ్లు మల్టిపుల్ అకౌంట్స్ను ఉపయోగిస్తుంటారు. మన ద్వారా వాటికి డబ్బు ట్రాన్స్ఫర్ చేయిస్తారు. వాటి ఆధారంగా ఆయా రోజుల్లో మన ఖాతాలో నుంచి ఎవరెవరికి డబ్బులు వెళ్లాయో, మన ఖాతాకు ఎవరి ద్వారా డబ్బు వచ్చిందో చూసి ఆ అకౌంట్స్ అన్నింటినీ ఫ్రీజ్ చేస్తారు. అప్పుడు కేస్ ఫైల్ చేసి, ఇన్వెస్టిగేషన్ చేస్తారు. పూర్తి ఇన్వెస్టిగేషన్ చేసి, మన డబ్బులు మనకు వచ్చేలా చేస్తారు. - ఇన్పుట్స్: అనీల్ రాచమల్ల,డిజిటల్ వెల్బీయింగ్ ఎక్స్పర్ట్, ఎండ్ నౌ ఫౌండేషన్ -
ఆన్లైన్ ట్రేడింగ్: మోసాల నుంచి తప్పించుకోండి ఇలా..
సోషల్ మీడియా ప్లాట్ఫారమ్లను స్క్రోల్ చేస్తున్నప్పుడు అనేక ప్రకటనలు పాప్ అప్ అవుతూ ఉంటాయి. కానీ, అవి ఎలాంటి రిజిస్టర్ కాని వాణిజ్య పోర్టల్స్. ఎవరైనా నమ్మి వీటిలో మెంబర్స్గా చేరితే, అధిక మొత్తంలో నష్టపోయే అవకాశాలు ఉన్నాయి. గృహిణులను లక్ష్యం చేసుకునే ఈ మోసాలు జరుగుతుంటాయి. ఆన్లైన్ ట్రేడింగ్లో పెట్టుబడులు కోసం చూస్తున్న వ్యక్తులను మోసం చేయడానికి స్కామర్లు కొత్తమార్గాలను ఎంచుకుంటుంటారు. ఇలాంటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తప్పక తెలిసుండాలి. అప్పుడే మోసాల బారిన పడకుండా ఉండగలం. ఇంటర్నెట్ ఆధారిత సమాచారం రోజు రోజుకూ పెరుగుతున్న ఈ కాలంలో ఎక్కువ మంది వ్యక్తులు తమ పెట్టుబడి నిర్ణయాలను తీసుకోవడానికి ఆన్లైన్, సోషల్ మీడియాపై అధికంగా ఆధారపడుతున్నారు. ఎందుకంటే ప్రతిదీ ఫింగర్ టిప్స్ మీద లభిస్తుండటమే కారణం. అందుకే, స్కామర్లు కూడా ఆన్లైన్ ట్రేడింగ్లో పెట్టుబడుల కోసం చూస్తున్న వ్యక్తులను మోసం చేయడానికి వేగవంతంగా కొత్త మార్గాలను అమలు చేస్తుంటారు. ► ఫ్యాన్సీ ప్రకటనలు చాలావరకు ఆన్లైన్ ప్రకటనలన్నీ ఆకర్షణీయంగా ఉంటాయి. సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ల ద్వారా సమాచారం కోసం స్క్రోలింగ్ చేస్తున్నప్పుడు అనేక ప్రకటనలు కనిపిస్తూ ఉంటాయి. అవి అలా కుప్పలు తెప్పలుగా ఆన్లైన్లోకి రావడం కూడా బ్రోకరేజీ రహితంగా ఉండటం, సులభమైన వాణిజ్య పోర్టల్, తక్షణ పరిష్కారాలు ఉండటం వల్లనే. వీటిలో చాలా ఏజెన్సీలు రిజిస్టర్ చేసి ఉండవు. కానీ ప్రముఖ అధికారిక కార్పొరేట్ ట్రేడింగ్ కంపెనీల కంటే మరింత శక్తిమంతమైన ఫ్యాన్సీ ప్రకటనలను ఉంచుతుంటారు. స్కామర్లు ఆకర్షణీయంగా ఉన్న ప్రకటనలను ఎర వేసి ఈ బోగస్ యాప్లు, వెబ్సైట్లలో తమ వివరాలతో రిజిస్టర్ చేసుకున్న వారికి మొదట్లో కొంత మొత్తంలో డబ్బులు జమ చేస్తుంటారు. ఈ విధానం ద్వారా డబ్బు సంపాదించినట్లు చెప్పుకునే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లను వీరు అనుసరిస్తారు. పాయింట్లకు బదులుగా వారు యాప్ వాలెట్లో డబ్బును డిపాజిట్ చేయమని అడుగుతారు, అది తర్వాత ట్రేడింగ్ కోసం ఉపయోగిస్తారు. మోసగాళ్లు ఉపయోగించే కొన్ని పథకాలు ► పోంజీ పథకం ఇది కొత్త పెట్టుబడిదారుల నుండి సేకరించిన డబ్బుతో చేసే మోసం. ఇప్పటికే ఉన్న పెట్టుబడిదారులకు కొంత మొత్తం చెల్లిస్తూ వారి ద్వారా మరిన్ని పెట్టుబడులను రాబట్టడం. ► పంప్, డంప్ స్కీమ్ ఇది ఒక పెట్టుబడి మోసం. ఇక్కడ సలహాదారులు పెట్టుబడిదారులను తప్పుదోవ పట్టించేలా సమాచారాన్ని అందించి, షేర్ల ధరను బంప్ చేయడానికి (పెంచడానికి) ప్రయత్నిస్తారు. అప్పుడు ఈ పెట్టుబడిదారులు సలహాదారులను నమ్మి తమ షేర్లను (అవి మంచి విలువ కలిగినప్పుడు) అమ్మేస్తారు. ► యాప్ ఆధారిత స్కీమ్లు పెట్టుబడిదారులకు మోసగాళ్లు తరచు వాలెట్ బ్యాలెన్స్ల నకిలీ చిత్రాలను చూపుతూ ఫిషింగ్ ఇ–మెయిల్స్ను పంపుతారు. సాధారణంగా క్రిప్టో కరెన్సీలు స్టాక్లు లేదా ఈ కామర్స్ ఉత్పత్తులు.. వీటిలో భాగంగా ఉంటాయి. ► తప్పుదారి పట్టించడానికి.. పెట్టుబడి పోకడలు, పరిశోధన స్టాక్లపై సమాచారాన్ని సేకరించడానికి, ఆన్లైన్ ట్రేడింగ్ ద్వారా వేగవంతంగా ఆదాయ అవకాశాలను చర్చించడానికి పెట్టుబడిదారులు ఫేస్బుక్, ట్విటర్, టీమ్ వ్యూవర్, వాట్సప్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్.. వంటి సోషల్ మీడియా ప్లాట్ఫారమ్లను ఉపయోగిస్తారు. స్కామర్లు నకిలీ సిఫారసులు చేస్తారు. అయాచిత పెట్టుబడి చిట్కాలు ఇస్తారు. వీటిలో నకిలీ గుర్తింపు లేదా తప్పుదారి పట్టించే సమాచారం ద్వారా పెట్టుబడిదారులను ఒప్పించే కొన్ని పద్ధతులు ఉంటాయి. ► పెట్టుబడిని ఎరగా వేస్తారు చాలా మంది పెట్టుబడిదారులు మొదట్లో సంస్థ నుండి కొంత రాబడిని పొందుతారు. దీంతో ఇన్వెస్టర్ల ట్రేడింగ్ విజయవంతమైందని స్కామర్లు అనుకుంటారు. స్కామర్లు ఎక్కువ పెట్టుబడి పెట్టడానికి శిష్యుడిని లేదా స్నేహితుడిని పరిచయం చేయడానికి మరింత ప్రోత్సహిస్తారు. డబ్బులు వస్తాయి కదా అని తమకు తెలిసినవారికి సదరు యాప్ లేదా వెబ్సైట్ వివరాలు ఇచ్చి వారిని కూడా చేరమని అంటారు. అయితే, చివరికి రిటర్న్లు ఆగిపోతాయి, కస్టమర్ ఖాతా సస్పెండ్ చేయబడుతుంది. డబ్బు వాలెట్లో ఇరుక్కుపోయి ఉంటుంది. సంస్థతో తదుపరి ఎలాంటి పరిచయం ఉండకపోవడంతో తాము పెట్టిన పెట్టుబడిని ఎలా పొందాలో తెలియక చాలా ఇబ్బంది పడతారు. ► అవకాశాల కోసం 7 రకాల వలలు దశ 1: ముందుగా బాధితులను వాట్సాప్ / టెలిగ్రామ్ గ్రూపుల్లో చేరమని అభ్యర్థిస్తారు. దశ 2: లింక్ల ద్వారా యాప్లను డౌన్లోడ్ చేయమని అడుగుతారు. ఈ కొత్త సభ్యులందరికీ మొదట్లో జాయినింగ్ బోనస్ లభిస్తుంది. అయితే అది వారి వాలెట్లో మాత్రమే కనిపిస్తుంది. దశ 3: ట్రేడింగ్ జరుగుతుంది (బాధితులు విధులు నిర్వర్తించమని అడుగుతారు), అంటే, షేర్ల అమ్మకం/కొనుగోలు, లేదా కొన్నిసార్లు బాధితులు ఇ–కామర్స్ ఉత్పత్తులను కొనుగోలు చేయమని లేదా విక్రయించమని అడుగుతారు. దశ 4: బాధితులను సిస్టమ్కి కొత్త వ్యక్తులను పరిచయం చేయమని అడుగుతారు. ఇది నిజమని, తమకూ కొంత పెట్టుబడి చేరుతుందన్న ఆశతో మంచి పార్టీలను పరిచయం చేస్తారు. అలా పరిచయం చేసిన వ్యక్తి ద్వారా స్కామర్లు వారి వాలెట్కి డబ్బు చేరేలా చేస్తారు. దశ 5: చేసిన పనుల ఆధారంగా వాలెట్ డబ్బును కూడగట్టుకుంటుంది. దశ 6: బాధితుడు వారి వాలెట్ల నుండి తమ ఆదాయాన్ని ఉపసంహరించుకోవడానికి ప్రయత్నించినప్పుడు వీలుపడదు. ఒక్కోసారి వీలున్నా ఆదాయపు పన్ను, ప్రాసెసింగ్ ఫీజు, జీఎస్టీ రుసుము మొదలైనవి చెల్లించాల్సి ఉంటుంది. దశ 7: కోరిన ఫీజు చెల్లించిన తర్వాత, యాప్లు పని చేయవు. అవి ఏదో ఒక సాంకేతిక లోపాన్ని చూపుతాయి. కస్టమర్ సేవను చేరుకోవడానికి చేసే ప్రయత్నాలూ ఫలించవు. మోసానికి మార్గాలు ► స్కామర్లు తాము విజయవంతమైన వ్యాపారులుగా, గ్యారెంటీ రిటర్న్ ఇస్తున్నట్టుగా, ట్రేడింగ్ సలహాలను అందిస్తున్నట్లు క్లెయిమ్ చేసుకుంటారు ∙ఇందుకోసం సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు చేసిన ఫోనీ టెస్టిమోనియల్ యూట్యూబ్ వీడియోలను ఉపయోగిస్తారు ∙‘పంప్ అండ్ డంప్‘ కార్యకలాపాలను నిరోధించడానికి ట్విట్టర్, ఫేస్బుక్ వంటి ప్లాట్ఫారమ్ల ద్వారా తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తారు ∙నకిలీ సమాచారంతో ఆన్లైన్ పెట్టుబడి చిట్కాలు, నకిలీ ఎండార్స్మెంట్లను పంపుతుంటారు ∙స్టాక్ సిఫార్సులు లేదా పెట్టుబడి సలహాలకు బదులుగా సబ్స్క్రిప్షన్ రుసుమును సేకరించేందుకు ఉద్దేశించిన స్టాక్ పోర్ట్ ఫోలియో స్క్రీన్షాట్లను ప్రదర్శిస్తుంది ∙పెట్టుబడిదారులను టెక్నికల్ అనలిస్ట్లు లేదా ట్రేడింగ్ నిపుణులను చేస్తానని నమ్మబలికి స్కామర్లు వర్క్షాప్ల కోసం రిజిస్ట్రేషన్ ఫీజులను తీసుకుంటారు కానీ వారికి హోస్ట్ చేయరు. పెట్టుబడులకు డేంజర్ సిగ్నల్స్ బాధితుల ఆశను లక్ష్యంగా చేసుకుని రూపొందించిన విభిన్న పద్ధతులతో మోసగాళ్లు వారి లక్ష్యాన్ని ఛేదిస్తారు. అలా కాకుండా మనల్ని మనం కాపాడుకోవా లంటే.. ► అసాధారణంగా అధిక హామీతో కూడిన రాబడిని వాగ్దానం చేస్తారు, గమనించాలి. ► అధిక ప్రారంభ పెట్టుబడిని అభ్యర్థిస్తారు. ► సంక్లిష్టమైన, నిలకడలేని వ్యాపార నమూనా ఉంటుంది. ► నష్టాలను తిరిగి చెల్లిస్తామని వాగ్దానం చేస్తారు. ► వెంటనే డబ్బు పెట్టుబడిగా పెట్టమని ఒత్తిడి చేయచ్చు. ► యాప్ స్టోర్ లేదా ప్లే స్టోర్లలో లిస్ట్లో లేని యాప్లలో పెట్టుబడి పెట్టమని కోరతారు. ► అధిక రాబడిని పొందినట్లు పేర్కొంటూ సోషల్మీడియా ఇన్ఫ్లుయెన్సర్ల మద్దతును కోరుతారు. ► స్కామర్ల కార్యాలయాలు మన దేశం లోపల ఉన్నాయా, వెబ్సైట్, యాప్లలో ఉండే చిరునామాలను చూపుతున్నాయా అనేది చెక్ చేసుకోవాలి. ఇన్పుట్స్: అనీల్ రాచమల్ల డిజిటల్ వెల్బీయింగ్ ఎక్స్పర్ట్, ఎండ్ నౌ ఫౌండేషన్