breaking news
Ananthauram
-
‘మమ్మల్నే అడిగే దానివయ్యావా...నిన్ను రేప్ చేస్తా’
కొత్తచెరువు : ‘‘ఐదేళ్లుగా మా గురించి పట్టించుకోలేదు.. ఎన్నికల వేళ మళ్లీ మాకే ఓటేయండంటూ అడుగుతున్నారు.. అసలు మీకు ఎందుకు ఓటెయ్యాలి’’ అని టీడీపీ నేతలను ఓ మహిళ నిలదీసింది. దీన్ని అవమానంగా భావించిన వారు ఆమెను అసభ్యపదజాలంతో దూషించడమే కాకుండా బెదరింపులకు దిగారు. దీంతో సదరు మహిళ వారిపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. వివరాల్లోకి వెళితే...అనంతపురం జిల్లా కొత్త చెరువు మండల కేంద్రంలోని బీసీ కాలనీలో నంజమ్మ నివసిస్తోంది. ఎన్నికల వేళ స్థానిక టీడీపీ నాయకుడు ఈ నెల ఒకటోతేదీన ఆమె ఇంటి వద్దకు వెళ్లి సైకిల్ గుర్తుకు ఓటెయ్యాలని కోరాడు. దీంతో ఆమె ‘‘ఐదేళ్లుగా మా కుటుంబానికి ఏం సాయం చేశారో చెప్పండి..అప్పుడు ఓటేస్తా’’ అని టీడీపీ నేతలను నిలదీసింది. దీన్ని అవమానంగా భావించిన స్థానిక టీడీపీ నాయకుడు ప్రసాద్ ఆమెను అసభ్యపదజాలంతో దూషించాడు. ‘‘మమ్నల్నే అడిగే దానివయ్యావా...నిన్ను రేప్ చేస్తా’’ అంటూ దూషించాడు. స్థానికులు సర్ది చెప్పడంతో వివాదం సద్దుమణిగింది. మంగళవారం, బుధవారం ఉదయమే నంజమ్మ ఇంటివద్దకు వస్తున్న టీడీపీ నేతలు.. కావాలనే ఆమెతో ఘర్షణకు దిగుతున్నారు. నంజమ్మ కులానికి చెందిన వారిని ఆమెపై ఉసిగొలుపుతున్నారు. బాధితురాలు బుధవారం పోలీస్స్టేషన్కు వెళ్లి టీడీపీ నేతలపై ఫిర్యాదు చేసింది. దీంతో టీడీపీ నేతలు కూడా ఆమెపై తమను దూషించిందని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇరువర్గాల ఫిర్యాదు మేరకు విచారణ జరిపి చర్యలు తీసుకోనున్నట్లు ఎస్సై తెలిపారు. -
ధోని కేసు ఆగస్టు 1కి వాయిదా
అనంతపురం లీగల్ : భారత క్రికెట్ జట్టు కెప్టెన్ ధోనిని మహావిష్ణువుగా చిత్రీకరిస్తూ బిజినెస్ టుడే కవర్పేజీపై ప్రచురించిన కేసులో అనంతపురం షెడ్యూల్డ్ కులాలు, తెగల ప్రత్యేక న్యాయ స్థానంలో శుక్రవారం విచారణ ప్రారంభమైంది. మేగజైన్ తరఫు న్యాయవాది యజ్ఞదత్ తన సమాధానాలను లిఖితపూర్వకంగా దాఖలు చేయడంతో.. వీటిపై స్పందించేందుకు పిటిషనర్ శ్యాం సుందర్ తరఫు న్యాయవాది గడువు కోరారు. దీంతో న్యాయమూర్తి ఈ కేసు విచారణను ఆగస్టు 1కి వాయిదా వేశారు. ఈ కేసులో ధోని తరఫు న్యాయవాదులు కూడా హాజరయ్యారు. -
దర్జాగా రూ.22.21 కోట్ల దోపిడీ!
సాక్షి ప్రతినిధి, అనంతపురం: ఈపీసీ(ఇంజనీరింగ్ ప్రొక్యూర్మెంట్ అండ్ కన్స్ట్రక్షన్) నిబంధనలకు కొత్త భాష్యం చెబుతూ అనంతపురం-భోగసముద్రం ఫోర్లేన్ రోడ్డు పనులను మొత్తం 12 శాతం కమీషన్పై ప్రధాన కాంట్రాక్టర్.. సబ్ కాంట్రాక్టు ఇచ్చేశారు. ఉత్తి పుణ్యాన రూ.22.21 కోట్లు గుడ్విల్గా నొక్కేశారు. తొలుత ఈ పనులపై అనంతపురం జిల్లాకు చెందిన ఓ మంత్రి, మాజీ మంత్రి కన్నేశారు. ఇద్దరి మధ్య పోటీ వల్ల రెండు సార్లు టెండర్లు రద్దయ్యాయి. 2012 ఫిబ్రవరి 29న మూడవ సారి రూ.192.70 కోట్ల అంచనా వ్యయంతో తిరిగి టెండర్ నోటిఫికేషన్ జారీ చేశారు. మళ్లీ గొడవ కావడంతో పంచాయితీ ప్రభుత్వ పెద్ద వద్దకు వెళ్లింది. ఆ పెద్ద వైఎస్సార్ జిల్లాలో తన సమీప బంధువైన టీడీపీ మాజీ ఎమ్మెల్యే రమేష్రెడ్డికి లబ్ధి చేకూర్చాలని భావించారు. రమేష్రెడ్డికి చెందిన ఆర్కే కన్స్ట్రక్షన్స్కు పనులు దక్కేలా చేసి.. ఆ సంస్థ నుంచి మాజీ మంత్రికి రూ.7.50 కోట్లు, మంత్రికి రూ.3.50 కోట్లు ఇప్పించేలా ఒప్పందం కుదిర్చారు. టెండర్ ఇలా దక్కింది.. ఆర్కే కన్స్ట్రక్షన్స్తో పాటు టెండరు దాఖలు చేసిన రాఘవ కన్స్ట్రక్షన్స్పై ట్రాక్ రికార్డు సరిగా లేదనే సాకుతో అప్పటి ఎస్ఈ వైఆర్ సుబ్రమణ్యం అనర్హత వేటు వేశారు. ఈ క్రమంలో ఆర్కే కన్స్ట్రక్షన్స్ ట్రాక్ రికార్డు కూడా బాగోలేదని బాధిత సంస్థ ఎస్ఈకి ఫిర్యాదు చేసింది. దీంతో ఆయన టెండర్ ప్రక్రియను పక్కన పెట్టా రు. ప్రభుత్వ పెద్ద ఆగ్రహంతో సీన్ మారిపోయింది. సుబ్రమణ్యంపై బదిలీ వేటు వేసి ఆయన స్థానంలో వేణుగోపాల్రెడ్డిని నియమించారు. ఆయన 2012 జూలై 18న ప్రైస్బిడ్ ను తెరిచి, 3.99 శాతం తక్కువ ధర(రూ.185.10 కోట్ల)కు కోట్ చేసిన ఆర్కే కన్స్ట్రక్షన్స్కు టెండర్ దక్కేలా చేశారు. అక్రమాలు ఇలా.. ఈపీసీ నిబంధనల మేరకు ప్రధాన కాంట్రాక్టర్ 50 శాతం పనులను మాత్రమే సబ్ కాంట్రాక్ట్ ఇచ్చుకునే వెసులుబాటు ఉంది. అయితే ప్రభుత్వ పెద్ద అండ చూసుకుని మొత్తం పనులను 12 శాతం కమీషన్పై ద్వారకా కన్స్ట్రక్షన్స్కు సబ్ కాంట్రాక్టు ఇచ్చేశారు. కమీషన్ రూపంలో రూ.22.21 కోట్లు దండుకుని ముందస్తు ఒప్పందం మేరకు మాజీ మంత్రికి రూ.7.50 కోట్లు, మంత్రికి రూ.3.50 కోట్లు వాటాలు పంపిణీ చేసినట్లు సమాచారం. తక్కిన రూ.11.21 కోట్లు ప్రధాన కాంట్రాక్టర్కు గిట్టుబాటైంది. దీంతో సబ్కాంట్రాక్టర్ నాణ్యతకు తిలోదకాలిచ్చి పనులు చేస్తున్నాడు. కాగా, ఈ విషయంపై ఆర్ఆండ్బీ ఎస్ఈ వేణుగోపాల్రెడ్డిని ‘సాక్షి’ సంప్రదించగా.. సబ్ కాంట్రాక్ట్కు ఇచ్చిన విషయం తమకు తెలియదని చెప్పారు.