breaking news
Aghakhan Trust for Culture
-
ఆచార్యునిగా కూలీ బిడ్డ!
సాక్షి, ఒంగోలు మెట్రో: మనో వికాసం కలిగించే గొప్ప మార్గం ‘నాటకం’ అంటున్నారు డాక్టర్ ఇండ్ల చంద్రశేఖర్. ఇప్పుడు ప్రకాశం జిల్లా రంగస్థల ప్రతిభ పుణే ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ దాకా చేరింది. అంతేకాదు. వందలాదిమంది కళాకారులను రంగస్థలం మీద మెరిపిస్తూనే, ‘థియేటర్’ను ఉపాధి జెండాగా కూడా ఎగరేస్తున్నారు. ప్రపంచ యవనిక మీద షేక్స్పియర్ నాటకాలు ఆడి, అట్నుంచటు హైద్రాబాద్ తెలుగు విశ్వవిద్యాలయంలో థియేటర్స్ ఆర్ట్స్ ప్రొఫెసర్గా ఎదిగిన ప్రకాశం జిల్లా ఒంగోలుకు సమీపంలోని కందులూరు గ్రామానికి చెందిన ఇండ్ల చంద్రశేఖర్ గురించిన కథనం... డాక్టర్ ఇండ్ల చంద్రశేఖర్ ’మట్టిమనుషుల జీవితంలోని అనేక కరుణాత్మక సంఘటనల గురించి గొప్ప కథలు రాశారు. అదే సమయంలో నాటకాలు రాసి అనేక చోట్ల ప్రదర్శించి జాతీయ స్థాయి ప్రతిభ చూపారు. ఔత్సాహిక నటులకు రంగస్థలంలో శిక్షణ ఇస్తున్నారు. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ద్వారా ఫెలోషిప్ పొంది హైద్రాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో థియేటర్లో స్నాతకోత్తర విద్యను పూర్తి చేసిన డాక్టర్ చంద్రశేఖర్ ప్రతిష్టాత్మక ఆగాఖాన్ అకాడెమీలో థియేటర్ విద్యార్థులకు ఐదేళ్లపాటు పాఠాలు చెప్పే ఆచార్యుడయ్యారు. వందలాదిమంది విద్యార్థులను థియేటర్లో రాణింపజేస్తున్న చంద్రశేఖర్ పలు పోటీల్లో తన నాటకాలు, దర్శకత్వం ద్వారా అవార్డులు పొందారు. కంప్యూటర్ సైన్స్లో డిగ్రీ చేసిన చంద్రశేఖర్ తర్వాత కాలంలో హెచ్సీయూ ఎంట్రన్స్ రాసి థియేటర్లో పీజీ చేశారు. ఈ క్రమంలో యూజీసీ ఉత్తీర్ణుడై ఇప్పుడు విశ్వవిద్యాలయ ఆచార్యుడిగా వ్యవహరిస్తున్నారు. తల్లిదండ్రులు కూలీలు.. ఆయన తల్లిదండ్రులు రోజు కూలీలు. అక్కా చెల్లెళ్లు పచ్చాకు పనిచేస్తారు. తెలుగు కథా సాహిత్యంలో వెంటనే గుర్తొచ్చే పేరుగా ఉన్న చంద్రశేఖర్కు ప్రఖ్యాత రచయిత కె.ఎన్వై.పతంజలి అంంటే చాలా ఇష్టం. ట్రాజిక్ కామెడీలో ఉండే ’ మిస్ మీనా‘ అనే నాటకం ఇప్పటికి 100కి పైగా పరిషత్లలో ప్రదర్శించి బహుమతులు స్వీకరించారు. థియేటర్ రంగం మీద అనేక పరిశోధనా పత్రాలతో అంతర్జాతీయ సదస్సుల్లో ఆయన రాణించాడు. అనేకచోట్ల కళాపరిషత్లలో ఆయన దర్శకత్వం వహించిన నాటకాలు కోసం అవార్డులు ఎదురుచూశాయి. 2017లో అమరావతి జాతీయ నాటకోత్సవాల్లో ఆయన దర్శకత్వంలోని నాటకాలు ప్రదర్శించి ప్రశంసలందుకున్నాయి. ’యాక్టింగ్, కమ్యూనికేషన్, కాన్ఫిడెన్స్, క్రియేటివిటీ, సృజనాత్మక ఆలోచనలతో విద్యార్థులను రంగస్థలం ఉన్నతంగా తీర్చిదిద్దుతుంద‘నే చంద్రశేఖర్ ఇప్పటికి పలు గొప్ప కథలతో కథానిక సాహిత్యంలో పేరు తెచ్చుకున్నారు. పాండిచ్చేరి యూనివర్సిటీలో నాటకరంగం మీద పరిశోధన చేస్తున్న సమయంలో తమిళనాడుకు చెందిన ఎజిల్మతిని ప్రేమించి పెళ్లాడారు. తెలుగు నాటక,సినీ ప్రముఖులు అనేకమందికి చిరపరిచితమే కాక, అనేకమందిని సినీ రంగానికి కూడా పరిచయం చేసిన ఇండ్ల చంద్రశేఖర్ రాణించేలా చేస్తుందంటున్నారు. ప్రకాశం జిల్లా మాండలికాన్ని తన కథల్లో ప్రతిఫలిస్తూ, ప్రకాశం జిల్లా జీవితాన్ని తన రంగస్థల పాఠాల ద్వారా ఉద్దీపితం చేస్తూ ప్రపంచ నాటక రంగ అధ్యాపనంలో తన మేధోశక్తితో రాణిస్తున్న చంద్రశేఖర్ అనేకమంది విద్యార్థుల ఉన్నత భవిష్యత్తుకు బాటలు వేస్తున్నారు. సంప్రదాయ కోర్సులతో నిరుద్యోగులుగా కుదేలయ్యే అనేకమంది మార్గాన్ని మార్చి జీవనోపాధులతో తీర్చిదిద్దుతున్నారు. కథకుడిగా, నాటక రచయిత, దర్శకుడిగా, ఆచార్యుడిగా రాణిస్తున్న చంద్రశేఖర్ అభినందనీయుడు. -
‘రాజవంశా’నికి ప్రాణప్రతిష్ఠ!
కుతుబ్షాహీల సమాధులకు కళాత్మక నగిషీలు - అంతర్జాతీయ ప్రమాణాలతో పునరుద్ధరణ పనులు చేపట్టిన విదేశీ సంస్థ - అద్భుత ఫలితాలు సాధిస్తున్న ‘ఆగాఖాన్ ట్రస్ట్ ఫర్ కల్చర్’ - రూ.100 కోట్ల వ్యయంతో భారీ ప్రాజెక్టు - అణువణువూ శోధించి.. లేజర్ స్కానింగ్, 3డీ స్కానింగ్ ద్వారా డాక్యుమెంటేషన్ - శిథిలమైన చోట పూర్వపు ఆకృతిలో నిర్మాణం.. వాటికి కళాత్మక నగిషీలు అద్ది పాత రూపం తీసుకొచ్చేందుకు కృషి - ఇరాన్ సహా వివిధ దేశాల నుంచి నిపుణుల రాక - ఇప్పటి వరకు 15 కట్టడాల పునరుద్ధరణ 400 ఏళ్లు పైబడిన భాగ్యనగర చరిత్రలో అడుగడుగునా అపూర్వ కట్టడాలెన్నో..! చార్మినార్, గోల్కొండ.. ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతిదీ ఓ కళాఖండమే. భాగ్యనగరాన్ని సుసంపన్నం చేసిన కుతుబ్షాహీ పాలకుల టూంబ్స్ అందులో ప్రధానమైనవి. మొన్నటి వరకు ఆలనాపాలన లేక శిథిలావస్థకు చేరిన ఆ రాజవంశ సమాధులకు ఓ విదేశీ సంస్థ ప్రాణ ప్రతిష్ఠ చేస్తోంది. వాడిపోయిన ఉద్యానవనం శతాబ్దాల తర్వాత విరబూసేలా చేస్తోంది. మన చరిత్రకు సాక్షిగా నిలిచిన దక్కన్ పార్కు ఇప్పుడిక శిథిల చిరునామా కాబోదు. కళాత్మక నగిషీలతో ముస్తాబైన సుందర వనం.. సాక్షి, హైదరాబాద్: అసలే ఎండాకాలం.. భాగ్యనగరం భగభగమంటోంది. 42 డిగ్రీల ఉష్ణోగ్రత ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ‘బాబోయ్ ఇంతటి ఎండల్లో రోజులు గడపడమెలా..?’అని జెనీవా నుంచి వచ్చిన 15 మంది ఆర్కిటెక్టులు గాబరాపడిపోయారు. తిరిగి తమ దేశానికి వెళ్లిపోవటమే మంచిదని అనుకున్నారు. కానీ ఒక్కసారి ఆ నిర్మాణాలను చూసిన తర్వాత అభిప్రాయాన్ని మార్చుకున్నారు. ఓ సామ్రాజ్యాన్ని ఏలిన పాలకుల సమాధులన్నీ ఒకేచోట కొలువుదీరిన చారిత్రక ప్రాంతాన్ని కళ్లారా చూసిన తర్వాత అన్నీ మరిచిపోయారు. రోజులు గడిచాయి.. ఆ అద్భుత నిర్మాణాలకు సంబంధించి 2 వేల 3డీ చిత్రాలతో డాక్యుమెంట్లు రూపొందాయి. వందల ఏళ్లనాటి కట్టడాలు.. ఇప్పుడే నిర్మించారా అన్నంత గొప్పగా రూపొందించే గొప్ప ప్రాజెక్టుకు అవి మూలమయ్యాయి. తొలుత హుమాయున్ సమాధి పునరుద్ధరణ తొలుత ఢిల్లీలోని మొఘల్ చక్రవరి హుమయూన్ సమాధి ఉన్న 300 ఎకరాల ప్రాంతాన్ని దాదాపు రూ.300 కోట్ల వ్యయంతో అంతర్జాతీయ స్థాయిలో ‘ఆగాఖాన్ ట్రస్ట్ ఫర్ కల్చర్’తీర్చిదిద్దింది. ఇండో ఇరానీ శైలి నిర్మాణం కనిపిస్తే చాలు దాన్ని భావితరాలకు అందించే ఉద్దేశంతో పునరుద్ధరించాలన్న తపనతో ముందుకుపోతోంది. రెండో పునరుద్ధరణ ప్రాజెక్టు కోసం హైదరాబాద్ వచ్చింది. భాగ్యనగరాన్ని నిర్మించి ఏలిన కుతుబ్షాహీ రాజులు శాశ్వత విరామం తీసుకుంటున్న దక్కన్ పార్కును ప్రపంచంలోనే అద్భుత పర్యాటక ప్రదేశంగా తీర్చిదిద్దాలని సంకల్పించింది. 106 ఎకరాల విస్తీర్ణం.. 75 చారిత్రక కట్టడాలున్న ప్రాంతాన్ని దాదాపు రూ.100 కోట్లతో అంతర్జాతీయ స్థాయిలో పునరుద్ధరిస్తోంది. అణువణువూ శోధించి, పూర్వపు నిర్మాణం ఎలా ఉందో హై రిసల్యూషన్ ఫొటోగ్రఫీ ద్వారా గుర్తించి, లేజర్ స్కానింగ్, 3డీ స్కానింగ్ ద్వారా డాక్యుమెంటేషన్ చేసి, ఆ తర్వాత డంగు సున్నం, కరక్కాయ, బెల్లం, కోడిగుడ్డు సొన, రాతి పొడిలాంటి సంప్రదాయ మిశ్రమాలను వినియోగించి.. శిథిలమైన చోట పూర్వపు ఆకృతి వచ్చేలా నిర్మించి, దానికి వెంట్రుక మందం మొదలు భారీ ఆకృతుల వరకు కళాత్మక నగిషీలు అద్ది పూర్వపు రూపం వచ్చేలా చేస్తోంది. ఇందుకోసం ఇరాన్ సహా వివిధ దేశాల నుంచి నిపుణులు వచ్చి స్థానిక సంప్రదాయ పని తెలిసిన మేస్త్రీల సాయంతో పనులు కొనసాగిస్తున్నారు. ఇప్పటి వరకు 15 కట్టడాలను పునరుద్ధరించారు. యునెస్కో గుర్తింపునకు అవకాశం చార్మినార్, గోల్కొండ, కుతుబ్షాహీ సమాధులకు యునెస్కో ప్రపంచ వారసత్వ హోదా కోసం గతంలో ప్రభుత్వం ప్రయత్నించింది. కానీ వాటికి అతి చేరువగా ఆక్రమణలుండటంతో యునెస్కో తిరస్కరించింది. ఇప్పుడు కుతుబ్షాహీ సమాధులున్న ప్రాంతాన్ని సమూలంగా అభివృద్ధి చేస్తున్నందున ఆ ప్రాంతం యునెస్కో గుర్తింపు పొందటం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. అదే జరిగితే ప్రపంచ పర్యాటక పటంలో ఈ ప్రాంతం సగర్వంగా గుర్తింపు పొందుతుంది. విదేశీ పర్యాటకులు రెక్కలు కట్టుకుని వాలేలా చేస్తుంది. ఇది దాదాపు 60 అడుగుల లోతున్న భారీ దిగుడుబావి. కుతుబ్షాహీ పాలకులు దీన్ని నిర్మించారు. గోల్కొండ పరిసరాల్లో వ్యవసాయానికి సాగు నీరందించేందుకు ఏర్పాటు చేసిన ఆరు నీటి వనరుల్లో ఇదీ ఒకటి. పేరుకు అది మామూలు బావి. కానీ చుట్టూ కళాత్మక ఒరలు.. దానికి నగిషీలు.. లోపలికి దిగేందుకు అందమైన మెట్లు.. వెరసి అదో అద్భుత కట్టడం. కానీ దాని ఆలనాపాలన సరిగా లేకపోవటంతో 2013లో భారీ వర్షాలకు ఓ వైపు గోడ కూలి బావిని కప్పేసింది. మళ్లీ నాలుగేళ్ల తర్వాత 2017లో అది పూర్వ వైభవాన్ని సంతరించుకుంది. బావిని కూరుకుపోయేలా చేసిన శిథిలాలను వందలారీల మేర తొలగించటమే కాకుండా నగిషీలు పూర్వపు సొగసులద్ది ఇలా రూపొందించారు. ఇప్పుడు 30 లక్షల లీటర్ల నీటి సామర్థ్యంతో ఆ బావి కనువిందు చేస్తోంది. మహ్మద్ కులీ కుతుబ్షా సమాధి... పునరుద్ధరణకు ముందు, తర్వాత...