పాకిస్తాన్ కాల్పుల విరమణ ఒప్పందం ఉల్లంఘనలు ఎప్పటికప్పుడు పెరిగిపోతూనే ఉన్నాయి. తాజాగా పాక్ సైన్యం జరిపిన
జమ్మూ/శ్రీనగర్: పాకిస్తాన్ కాల్పుల విరమణ ఒప్పందం ఉల్లంఘనలు ఎప్పటికప్పుడు పెరిగిపోతూనే ఉన్నాయి. తాజాగా పాక్ సైన్యం జరిపిన కాల్పుల్లో ఒకరు.. ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకుంటూ మరొకరు.. మొత్తం ఇద్దరు జవాన్లు గురువారం ప్రాణత్యాగం చేశారు. బుధవారం రాత్రి నుంచి జమ్మూ కశ్మీర్లోని బాలకోట్, మన్కోట్ ఆర్ఎస్ పురా, ఆర్నియా సెక్టార్లలోని 30 సరిహద్దు ఔట్పోస్ట్లు, 35 గ్రామాలపై పాక్ సైనికులు మోర్టార్ బాంబులు వేసి, తుపాకులతో భారీగా కా ల్పులు జరి పారు.
ఈ దాడుల్లో బీఎస్ఎఫ్కు చెందిన ఒక జవాను మృతి చెందగా, 9 మంది పౌరులు గాయపడ్డారు. ప్రతీకారంగా భారత్ గురువారం మధ్యాహ్నం ఆర్ఎస్ పురా, ఆర్నియా సెక్టార్లలోని అంతర్జాతీయ సరిహద్దు వెంబడి కాల్పులు జరపగా పాక్కు చెందిన ఒక జవాను హతమయ్యాడు. మరో జవానుకు తీవ్ర గాయాలయ్యాయి. సుందర్బానీ సెక్టార్లోనూ పాకిస్తాన్ సైన్యం గురువారం కాల్పు ల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. పీఓకేలోని ఉగ్ర స్థావరాలపై భారత్ దాడులు చేసిన సెప్టెంబరు 29 నుంచి ఇప్పటివరకు మొత్తం 55 సార్లు పాక్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది.
చొరబాటు భగ్నం: నియంత్రణ రేఖ వెంబడి కశ్మీర్లోని తంగ్ధర్ సెక్టార్లో ఉగ్రవాదులు గురువారం చొరబాట్లకు ప్రయత్నించగా భారత సైన్యం అడ్డుకుంది. ఆ పోరులో ఉగ్రవాదులు, భారత సైన్యానికి మధ్య జరిగిన కాల్పుల్లో ఒక సైనికుడు మృతి చెందాడు.