
'అలా చేస్తే వేర్పాటువాదానికి దారి తీస్తుంది'
ప్రభుత్వ సంస్థలన్నీ ఒకే చోట ఏర్పాటు చేస్తే అనర్థమని... అలా చేస్తే వేర్పాటువాదానికి దారి తీస్తుందని టీడీపీ ప్రభుత్వానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు సూచించారు.
హైదరాబాద్ : ప్రభుత్వ సంస్థలన్నీ ఒకే చోట ఏర్పాటు చేస్తే అనర్థమని... అలా చేస్తే వేర్పాటువాదానికి దారి తీస్తుందని టీడీపీ ప్రభుత్వానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు సూచించారు. ఈ నేపథ్యంలో ముందు చూపుతో వ్యవహరించాలని ఆయన టీడీపీ ప్రభుత్వానికి హితవు పలికారు. ఆదివారం హైదరాబాద్లో ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో ధర్మాన ప్రసాదరావు విలేకర్లతో మాట్లాడుతూ.... అన్ని ప్రభుత్వ కార్యాలయాలు రాజధాని ప్రాంతంలో ఏర్పాటు చేసేందుకు టీడీపీ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలపై ధర్మాన స్పందించారు.
రాష్ట్రంలో అభివృద్ధిని వికేంద్రీకరించాలని ఆయన అభిప్రాయపడ్డారు. అభివృద్ధి అంతా రాజధాని ప్రాంతంలో కేంద్రీకృతమయితే మళ్లీ సమస్యలుపునరావృతమయ్యే అవకాశం ఉందని ఆయన ఆందోళన చెందారు. అభివృద్ధి అంతా ఓ ప్రాంతంలోనే కేంద్రీకృతం చేస్తే... మిగిలిన ప్రాంతాల పరిస్థితి ఏమిటని ధర్మాన ఆవేదన వ్యక్తం చేశారు. విభజనతో పాఠాలు నేర్చుకోలేదా ? అని చంద్రబాబును ఈ సందర్భంగా ధర్మాన సూటిగా ప్రశ్నించారు.
రాజధాని పేరుతో 60 నుంచి 70 వేల ఎకరాలు సేకరించారని గుర్తు చేశారు. ప్రైవేట్ సంస్థల డబ్బుతో రాజధాని నిర్మిస్తే అది ప్రజల రాజధాని అవుతుందా అని టీడీపీ ప్రభుత్వాన్ని నిలదీశారు. రాష్ట్రంలో ఆర్థిక లోటు గత ఆరు నెలల్లో రూ. 3 వేల కోట్లు ఉందని స్వయంగా ఆర్థిక మంత్రే విన్నవించారని ఈ సందర్భంగా ధర్మాన తెలిపారు. కొత్త రాజధాని కోసం నిధులు ఎక్కడి నుంచి తీసుకువస్తారో చెప్పాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.