
జెడ్పీ ఎన్నికల ప్రక్రియ షురూ..
జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించేం దుకు అధికార యంత్రాంగం శరవేగంగా ముందుకువెళ్తోంది. ఎన్నికల నిర్వహణపై సుప్రీం కోర్టు ఆదేశాలు ఏవిధంగా ఉన్నా.. తాము మాత్రం ఎన్నికల కమిషన్ షెడ్యూల్ ప్రకారం ముందుకు వెళ్తామని స్పష్టం చేస్తున్నారు.
నల్లగొండ, న్యూస్లైన్: జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించేం దుకు అధికార యంత్రాంగం శరవేగంగా ముందుకువెళ్తోంది. ఎన్నికల నిర్వహణపై సుప్రీం కోర్టు ఆదేశాలు ఏవిధంగా ఉన్నా.. తాము మాత్రం ఎన్నికల కమిషన్ షెడ్యూల్ ప్రకారం ముందుకు వెళ్తామని స్పష్టం చేస్తున్నారు. ఇదిలా ఉండగా వరుస ఎన్నికలు జరుగుతున్నందున స్థానిక ఎన్నికలకు పోలీస్ బందోబస్తు కష్టసాధ్యమవుతుందన్న కారణంతో ఎన్నికల తేదీల్లో పలు మార్పులు చేయాలని కోరుతూ ఎన్నికల కమిషన్ సుప్రీం కోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది.
కానీ వివిధ కారణాల దృష్ట్యా కోర్టు తీర్పు 24 తేదీకి వాయిదా పడింది. దీంతో షెడ్యూల్ ప్రకారం ఈ నెల 17 తేదీ నుంచి జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు నామినేషన్లు స్వీకరిస్తామని జెడ్పీ సీఈఓ దామోదర్రెడ్డి ‘న్యూస్లైన్’కు తెలిపారు. ఎన్నికల నిర్వహణలో భాగంగా శనివారం నల్లగొండలోని జిల్లా పరిషత్ కార్యాలయంలో ఉదయం 10 గంటలకు వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహిస్తున్నట్లు చెప్పారు.
అడుగడుగునా ఉత్కంఠ..
ఎన్నికల షెడ్యూల్ జారీ అయిన నాటి నుంచి జెడ్పీ ఎన్నికలకు అడుగడుగునా ఆటంకాలు ఎదురవుతూనే ఉన్నాయి. ఎన్నికలపై సుప్రీం కోర్టు తీర్పు వాయిదా పడడం, అధికారులు మాత్రం నామినేషన్లు స్వీకరిస్తామని చెబుతుండడంతో రాజకీయ నాయకులకు ఏటూ పాలుపోవడం లేదు. షెడ్యూల్ ప్రకారం ఈ నెల 17 తేదీ నుంచి నామినేషన్ల స్వీకరణ మొదలై 20వ తేదీ సాయంత్రం 5 గం టలకు ముగుస్తుంది.
21న నామినేషన్ల పరిశీలన, 22న అభ్యంతరాల స్వీకరణ ఉంటుంది. 23న అభ్యంతరాల పరిష్కారం, 24న నామినేషన్ల ఉపసంహరణ అనంతరం అదే రోజు అభ్యర్థుల తుది జాబితా ప్రకటిస్తారు. ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ నామినేషన్ల పర్వం ముగిసిన తర్వాత ఎన్నికలు వాయిదా పడితే తమ పరిస్థితి ఏమిటన్నది రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చనీయాంశమైంది. అయితే ఎన్నికల షెడ్యూల్లో మార్పులు జరుగుతాయి తప్పా వాయిదా పడే అవకాశం లేదని అధికారులు పేర్కొంటున్నారు. సిబ్బంది కొరతను దృష్టిలో పెట్టుకుని వీలైతే రెండు విడతల్లో ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉందని వారు పేర్కొంటున్నారు.