సూపర్‌స్పెషాలిటీ సీట్ల కౌన్సెలింగ్‌ నిలిపివేత | Supervisory Seat Counseling Discontinued | Sakshi
Sakshi News home page

సూపర్‌స్పెషాలిటీ సీట్ల కౌన్సెలింగ్‌ నిలిపివేత

Aug 18 2017 12:56 AM | Updated on Aug 31 2018 8:34 PM

కాళోజీ నారాయణరావు, ఎన్టీఆర్‌ వైద్య విశ్వ విద్యాలయాల పరిధిలోని ఎంసీహెచ్, డీఎం సూపర్‌స్పె షాలిటీ కోర్సుల సీట్ల భర్తీ కౌన్సెలింగ్‌ను నిలిపివేయాలని ఉమ్మడి హైకోర్టు ఆదేశించింది.

సాక్షి, హైదరాబాద్‌: కాళోజీ నారాయణరావు, ఎన్టీఆర్‌ వైద్య విశ్వ విద్యాలయాల పరిధిలోని ఎంసీహెచ్, డీఎం సూపర్‌స్పె షాలిటీ కోర్సుల సీట్ల భర్తీ కౌన్సెలింగ్‌ను నిలిపివేయాలని ఉమ్మడి హైకోర్టు ఆదేశించింది. రాజ్యాంగంలోని 371(డి) అధికరణం అమల్లో ఉన్నందున కౌన్సెలింగ్‌ నిర్వహించ రాదని న్యాయమూర్తులు జస్టిస్‌ వి.రామసుబ్రమణియన్, జస్టిస్‌ టి.రజనిల ధర్మాసనం గురువారం మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. విచారణను ఈ నెల 23కు వాయిదా వేసింది.

 తెలుగు రాష్ట్రాల్లోని సూపర్‌స్పెషాలిటీ కోర్సులకు సీట్ల భర్తీని జాతీయ కౌన్సెలింగ్‌ విధానంలో చేయాలని కేంద్ర ఆరోగ్య శాఖ ఇచ్చిన ఆదేశాలను వైద్యుడు బి.సతీశ్‌కుమార్‌ హైకోర్టులో సవాల్‌ చేశారు. దీనిపై ధర్మా సనం విచారణ జరిపింది. సమైక్య ఆంధ్రప్రదేశ్‌లో ప్రాంతీ య అసమానతల తొలగింపునకే 371(డి) అధికరణం ఉందని, ఇతర రాష్ట్రాల్లోని అసమానతల్ని తొలగింపునకు కాదని ధర్మాసనం వ్యాఖ్యానించింది.

అందుకే సీట్ల భర్తీ కౌన్సెలింగ్‌ను నిలిపివేయాలని  ఉత్తర్వులిస్తున్నట్టు పేర్కొంది. తమ వాదనలతో కౌంటర్‌ పిటిషన్లు దాఖలు చేయాలని కేంద్రంతోపాటు ప్రతివాదుల్ని ఆదేశించింది. అడ్మిషన్లపై సుప్రీంకోర్టు విధించిన నిర్ధిష్ట వ్యవధిలోగా ఈ కేసును పరిష్కరిస్తామని వెల్లడించింది.  కాగా, తెలుగు రాష్ట్రాల్లోని సీట్లను జాతీయ కౌన్సెలింగ్‌ ద్వారా భర్తీ చేయడానికి వీల్లేదని పిటిషనర్‌ తరఫు సీనియర్‌ న్యాయవాది సరసాని సత్యంరెడ్డి కోర్టుకు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement