నర్సరీలకు ఎండదెబ్బ | Sunstrock to the nursery | Sakshi
Sakshi News home page

నర్సరీలకు ఎండదెబ్బ

May 1 2017 11:39 PM | Updated on Oct 4 2018 6:03 PM

నర్సరీలకు ఎండదెబ్బ - Sakshi

నర్సరీలకు ఎండదెబ్బ

మండుతున్న ఎండలకు నర్సరీల్లో మొక్కలు పూర్తిగా ఎండిపోతున్నాయి.

- ఎండుతున్న మొక్కలు
- కానరాని నీడ పందిళ్లు
- సగం కూడా దక్కడం అనుమానమే!
- వచ్చే నెల నుంచే హరితహారం
- ప్రశ్నార్థకంగా పథకం అమలు


మెదక్‌ జోన్‌: మండుతున్న ఎండలకు నర్సరీల్లో మొక్కలు పూర్తిగా ఎండిపోతున్నాయి. మరోవైపు క్షేత్రస్థాయిలో అధికారుల నిర్లక్ష్యం హరితహారం పథకం అమలుకు అడ్డంకిగా మారాయి. మరో నెలరోజుల్లో హరితహారం పథకంలో భాగంగా మొక్కలు నాటాల్సి ఉంది. కానీ అధికారుల ప్రాణాళికకు, నర్సరీల్లో పెరుగుతున్న మొక్కలకు చాలావ్యత్యాసం కనిపిస్తోంది. లక్ష్యం మేరకు మొక్కలు కానరావడంలేదు.  
ఈ సంవత్సరం జిల్లా వ్యాప్తంగా 1.48 కోట్ల మొక్కలను నాటేందుకు ప్రాణాళికను సిద్ధం చేశారు. అందుకు అణుగుణంగా 122 నర్సరీల్లో మొక్కలను పెంచుతున్నారు. గత సంవత్సరం సైతం సరైన వర్షాలు లేకపోవటంతో నర్సరీల్లో పెంచిన మొక్కలు 75 శాతం మేర అలాగే ఉన్నాయి. అందులో 50 శాతం పైగా మొక్కలు ఎండలకు ఎండిపోయాయి. గతయేడాది పెంచిన మొక్కలతో పాటు ఈయేడు మరికొన్ని మొక్కలను పెంచి మొత్తం 1.48 కోట్ల మొక్కలను నాటాలని ఫారెస్టు అధికారులు నిర్ణయించారు. కాని ఎండలు మండుతుండటంతో ఇప్పటికే 37 లక్షలకు పైగా మొక్కలు ఎండినట్టు సమాచారం.

మొత్తానికి లక్ష్యం దిశగా అధికారులు అడుగు ముందుకు వేస్తున్నారు. ఇందుకోసం మొక్కలను ఏఏ ప్రాంతాల్లో నాటాలి? ఏ ఏమొక్కలు నాటాలి? రైతులు ఏ రకమైన మొక్కలను కోరుకుంటున్నారు? రోడ్లకు ఇరువైపుల ఎన్ని లక్షల మొక్కలు నాటాలి? అనేదానిపై ఇప్పటికే కసరత్తు చేశారు. అంతే కాకుండా అడవుల్లోని గ్యాప్‌ప్లాంటేషన్‌ 425 ఎకరాల్లో నాటేం దుకు సైతం అధికారులు  ప్రాణాళికలు సిద్ధం చేసినట్లు  తెలిసింది. కానీ   ఎప్పుడు  లేని విధంగా ఈయేడు ఎండలు తీవ్ర రూపం దాల్చడంతో నర్సరీల్లోని మొక్కలు  ఎండిపోతున్నాయి. అందుకు తోడు క్షేత్రస్థాయి అధికారుల నిర్లక్ష్యం తోడైంది. దీంతో హరితహారం పథకం ఈయేడు అనుకున్న స్థాయిలో  ముందుకు సాగడం కష్టమని పలువురు భావిస్తున్నారు. 

ఎండల నుంచి నర్సరీల్లోని మొక్కలను రక్షించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం  నీడకోసం షెడ్‌ నెట్స్‌ను  పంపిణీ చేస్తే అధికారులు వాటిని చాలాచోట్లా మూలాన పడేశారు. కొన్ని గ్రామాల్లో నర్సరీ నిర్వాహకులు ఆ నెట్‌లను  మొక్కలకు  కట్టకుండా వారి ఇళ్లకు తీసుకెళ్లినట్లు విశ్వసనీయ సమాచారం. కేవలం క్షేత్రస్థాయి అధికారుల నిర్లక్షం వల్లా షెడ్‌ నెట్‌లను ఏర్పాటు చేయక పోవటంతో నర్సరీల్లోని సగానికి పైగా మొక్కలు ఎండిపోతున్నాయి. అయినా సంబంధిత అధికారులు మాత్రం అటువైపు కన్నెత్తి చూడటంలేదన్న విమర్శలు ఉన్నాయి.

బైక్‌లు సైతం ఇచ్చినా..
ఫారెస్టు అధికారులు ఎప్పుడు అలర్ట్‌గా ఉండాలనే ఉద్దేశంతో ప్రభుత్వం క్షేత్రస్థాయి అధికారులకు కోట్లాది రూపాయలను వెచ్చించి బైక్‌లను సైతం ఇచ్చింది. కానీ ఆ బైక్‌లతో సొంత పనులకే ప్రాధాన్యం ఇస్తూ అడవుల సంరక్షణను మరిచి పోయారని పలువురు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత జిల్లా ఉన్నతాధికారులు వెంటనే స్పందించి క్షేత్రస్థాయిలో మొక్కలను రక్షించేందుకు తగుచర్యలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది.    హరితహరం పథకంలో రూపొందించిన ప్రణాళిక ప్రకారం వచ్చేవర్షాకాలం సీజన్‌లో జిల్లా వ్యాప్తంగా 1.48 కోట్ల మొక్కలను నాటడం కష్టమనే చెప్పాలి.

Advertisement
 
Advertisement
Advertisement