నిట్‌ విద్యార్థికి లుకేమియా | Please help a student suffering from acute leukemia from NIT student | Sakshi
Sakshi News home page

నిట్‌ విద్యార్థికి లుకేమియా

Sep 16 2017 3:22 AM | Updated on Sep 19 2017 4:36 PM

నిట్‌ విద్యార్థికి లుకేమియా

నిట్‌ విద్యార్థికి లుకేమియా

వరంగల్‌ నిట్‌ విద్యార్థి తేజావత్‌ మంగీలాల్‌ లుకేమియా వ్యాధి బారిన పడగా వైద్య ఖర్చుకు డబ్బు లేకపోవడంతో ప్రభుత్వం, దాతలు ఆదుకో వాలని తల్లిదండ్రులు వేడుకుంటున్నారు.

వైద్యానికి రూ.40 లక్షలు.. ఆదుకోవాలని తల్లిదండ్రుల వేడుకోలు

గార్ల(ఇల్లందు)/కాజీపేట అర్బన్‌: వరంగల్‌ నిట్‌ విద్యార్థి తేజావత్‌ మంగీలాల్‌ లుకేమియా వ్యాధి బారిన పడగా వైద్య ఖర్చుకు డబ్బు  లేకపోవడంతో ప్రభుత్వం, దాతలు ఆదుకో వాలని తల్లిదండ్రులు వేడుకుంటున్నారు. మహబూబా బాద్‌ జిల్లా గార్ల మండలం పుల్లూరు జీపీ పరిధి చిన్నబంజారకి చెందిన తేజావత్‌ మంచ, రంగీ దంపతులు నిరుపేద కూలీలు. వారి కుమారుడు మంగీలాల్‌ వరంగల్‌ నిట్‌లో ఇంజనీరింగ్‌ సెకండియర్‌ చదువుతున్నాడు. ఎలాంటి కోచింగ్‌కు వెళ్లకుండా, ఇంటి వద్దే చదివి నిట్‌లో సీటు సాధించాడు.

గతేడాదే మంగీలాల్‌ ఈ వ్యాధి బారిన పడ్డాడు. అదే గ్రామానికి చెందిన బంజార సేవా సమితి రాష్ట్ర అధ్యక్షుడు తేజావత్‌ జోగిరాం రూ.80 వేలు, ట్రైబల్‌ సోషల్‌ వెల్ఫేర్‌ కమిషనర్‌ ద్వారా రూ.1.50 లక్షల వరకు ఆర్థికసాయం అందించి వైద్యం చేయించారు. ఆరు నెలల తర్వాత వ్యాధి మళ్లీ తిరగబడింది. హైదరాబాద్‌ లోని కేన్సర్‌ ఆస్పత్రి వైద్యులు పరీక్షలు చేసి లుకేమియా వ్యాధి సోకిందని, వైద్యం కోసం రూ.40 లక్షలు ఖర్చవుతాయని చెప్పారు. వైద్యం చేయించకపోతే మంగీలాల్‌ 3 నెలలపాటు మాత్రమే బతుకుతాడని తేల్చిచెప్పారు.

తల్లిదండ్రులు సీఎం రిలీఫ్‌ ఫండ్‌ కోసం ప్రగతిభవన్‌కు పలుమార్లు వెళ్లగా సెక్యూరిటీ గార్డులు రానివ్వడం లేదని వాపోయారు.  తమ కుమారుడిని ప్రభుత్వం, దాతలు ఆదుకోవాలని వేడుకుంటు న్నారు.  తేజావత్‌ మంగీలాల్, ఎస్‌బీఐ అకౌంట్‌ నంబరు 353909 59584(సీఐఎఫ్‌ కోడ్‌: 88787660820, ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్‌: ఎస్‌బీఐఎన్‌ 0007167), వడ్డేపల్లి బ్రాంచ్, హన్మకొండలో విరాళాలు జమచేయాలని, 94400 64623 సెల్‌ నంబర్‌లో సంప్రదిం చాలని కోరుతున్నారు. కాగా, నిట్‌ విద్యార్థులు, స్నేహితులు మిలాప్‌ యాప్‌ ద్వారా  రూ.11 లక్షలు సేకరించారు. ఇవి కేవలం కీమోథెరపీకి మాత్రమే సరిపోతాయని, బోన్‌మ్యారో చికిత్స కోసం డబ్బులు కావాలని  విద్యార్థులు చెబుతున్నారు.

వైద్యం చేయిస్తాం: కలెక్టర్‌
మహబూబాబాద్‌: మంగీలాల్‌కు మెరుగైన వైద్యం చేయిస్తామని మహబూబాబాద్‌ జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ప్రీతిమీనా అన్నారు. ఈ విషయాన్ని అధికారులు కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లగా ఆమె సానుకూలంగా స్పందించి నిమ్స్‌ డైరెక్టర్‌కు లేఖ రాశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement