సన్నబియ్యం నాణ్యతపై పరిశీలన | Narrow rice quality On Observation | Sakshi
Sakshi News home page

సన్నబియ్యం నాణ్యతపై పరిశీలన

Oct 14 2015 4:51 AM | Updated on Sep 3 2017 10:54 AM

రాష్ట్రంలోని సంక్షేమ వసతి గృహాలకు, ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనానికి అందిస్తున్న సన్నబియ్యం నాణ్యత పరీక్షించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.

సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని సంక్షేమ వసతి గృహాలకు, ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనానికి అందిస్తున్న సన్నబియ్యం నాణ్యత పరీక్షించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. పౌర సరఫరాల శాఖ సరఫరా చేస్తున్న సన్నబియ్యంలో అక్రమాలు జరుగుతున్నాయని ఇటీవల ప్రతిపక్ష పార్టీలు ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న బఫర్ గోదాముల్లో ఉన్న బియ్యం శాంపిళ్లను సేకరించి నాణ్యతను పరిక్షించాలన్న ప్రభుత్వ ఆదేశాలతో ఆ మేరకు పౌరసరఫరాల శాఖ అధికారులు శాంపిళ్ల సేకరణ ప్రారంభించారు.

రాష్ట్రం లోని 3,036 సంక్షేమ వసతి గృహాల్లో ఉన్న 5.39 లక్షల మంది, 34,319 ప్రభుత్వ పాఠశాలల్లోని 29,86,010 మంది విద్యార్థులకు ప్రభుత్వం ఈ ఏడాది జనవరి నుంచి సన్నబియ్యం సరఫరా చేస్తున్న విషయం తెలిసిందే. దీని కోసం పౌరసరఫరాల శాఖ నెలకు 14 వే ల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని సరఫరా చేస్తోంది. దీంతో పాటే స్టూడెంట్ మేనేజ్‌మెంట్ హాస్టళ్లు, అనాథ శరణాలయాలను కలిపితే ఏటా రూ.642 కోట్లతో 1.92 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని సరఫరా చేస్తున్నారు. దీనిపై అధికారులు ఇప్పటికే రెండుమార్లు తనిఖీలు నిర్వహించారు.

కొద్దిరోజుల క్రితం జిల్లాకు నాలుగైదు హాస్టళ్ల చొప్పున 50 చోట్ల తనిఖీలు చేశా రు. ఎక్కడా బియ్యం నాణ్యతలో తేడాలు కాన రాలేదు. అయితే సన్నబియ్యంపై టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి ఆరోపణలు చేయడంతో దీనిపై స్పందించిన మంత్రి ఈటల అలాంటిదేమీ లేదని స్పష్టంచేశారు. ఈ విషయాన్ని రూఢీ చేసేందుకు  జిల్లాల్లోని బఫర్ గోదాముల్లో ఉన్న సన్నబియ్యం నాణ్యతను పరీక్షించాలని నిర్ణయించారు. దీనిపై ఇప్పటికే అన్ని జిల్లాల మేనేజర్లకు పౌర సరఫరాల శాఖ ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు వెళ్లినట్లుగా తెలిసింది.

Advertisement
 
Advertisement
Advertisement