సింగరేణిలో మెగా యోగా

Mega yoga in Singareni - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: సింగరేణిలో సంస్థ లక్షా 26 వేల మందితో మెగా సామూహిక యోగా కార్యక్రమం నిర్వహించి సరికొత్త రికార్డు సృష్టించింది. గురువారం జరిగిన ప్రపంచ యోగా డే సందర్భంగా గత రికార్డులను తిరగరాసింది. దేశంలోని ఏ ఇతర ప్రభుత్వ రంగ సంస్థ నిర్వహించని స్థాయిలో 6 జిల్లాల్లోని, 11 ఏరియాల్లోని బొగ్గు గనులు, కార్యాలయాలు, స్టేడియాల్లో లక్షా 26 వేల మందితో ఈ మెగా సామూహిక యోగా కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించింది.

2016లో సింగరేణి వ్యాప్తంగా 60 వేలమందితో సామూహిక యోగా నిర్వహించి లిమ్కా నేషనల్‌ రికార్డును సాధించింది. మొదటగా లక్షా 21 వేల మందితో యోగా నిర్వహించాలని అనుకొన్నప్పటికీ కార్మికులు, వారి కుటుంబ సభ్యుల నుంచి అనూహ్యమైన స్పందన రావడంతో అనుకున్న దానికంటే ఎక్కువగా విజయవంతమైనట్లు నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమం విజయ వంతం కావడం పట్ల సింగరేణి సీఎండీ ఎన్‌.శ్రీధర్‌ స్పందిస్తూ అంతర్జాతీయ యోగా దినోత్సవంలో పాల్గొన్న వారికి అభినందనలు తెలిపారు.

యోగాను ఒక దైనందిన కార్యక్రమంగా పాటిస్తూ ఆరోగ్యం పెంపొందించుకోవాలని పిలుపునిచ్చారు. హైదరాబాద్‌లో జరిగిన యోగా ’డే’లో మైనింగ్‌ అడ్వయిజర్‌ డి.ఎన్‌ ప్రసాద్, ఈడీ బి.కిషన్‌రావు, జీఎం ఆంథోని రాజా, జీఎం(ఫైనాన్స్‌) సి.వి.నర్సింహమూర్తి, చీఫ్‌ సెక్యూరిటీ ఆఫీసర్‌ ప్రేమ్‌కుమార్‌ పాల్గొన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top