మదర్సాకు చేరిన పిల్లలు
వైద్య పరీక్షల అనంతరం తరలింపు
కొత్తగూడెంఅర్బన్: కొత్తగూడెం పట్టణ పరిధిలోని సఫాయిబస్తీకి చెందిన మదర్సా నిర్వాహకుడు అరెస్టు కావడంతో, పోలీసులు అప్పటి నుంచి నిర్వాహకుడికి సంబంధించిన అన్ని కార్యకలాపాలపై దృష్టి సారించి తనిఖీలు నిర్వహించారు. బుధవారం సఫాయిబస్తీ మదర్సాను పోలీసులు, ఐసీడీఎస్ అధికారులు తనిఖీలు చేసి అనంతరం అందులో ఉర్దూ నేర్చుకుంటున్న పిల్లలను, కొత్తగూడెంలోని శ్రీసత్యసాయి అనాథ శరణలయానికి తరలించారు. ఈ క్రమంలో ముస్లిం మతపెద్దలు ఐసీడీఎస్ అధికారులు, పోలీసులతో చర్చలు జరిపి పిల్లల బాధ్యతను తీసుకుంటామని, ఆగస్టు 1వ తేదిన పిల్లల చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ముందు ప్రవేశపెడతామని, ఈలోగా బిహార్లోని పిల్లల తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చి వారిని రప్పిస్తామని వివరించారు. దీంతో పోలీసులు, ఐసీడీఎస్ అధికారులు, మతపెద్దలతో లెటర్ రాయించుకొని పిల్లలను తిరిగి మదర్సాకు పంపించారు. ఈ కార్యక్రమంలో డిస్ట్రిక్ చైల్డ్ ప్రొటక్షన్ ఆఫీసర్ హరికుమారి, సీఐ కుమారస్వామి, ఎల్పివో శివకుమారి, కేర్ టేకర్ వినోద్, ముస్లిం మతపెద్దలు పాల్గొన్నారు.