‘బాహుబలి’ ఐదో మోటార్ వెట్రన్ సక్సెస్
సాక్షి, రామడుగు (చొప్పదండి): కాళేశ్వరం ప్రాజెక్టు–8వ ప్యాకేజీలో భాగంగా కరీంనగర్ జిల్లా రామడుగు మండలం లక్ష్మీపూర్ వద్ద నిర్మించిన సర్జిపూల్లో 5వ మోటార్ వెట్రన్ విజయ వంతమైంది. బాహుబలి మోటార్లుగా పిలుస్తున్న ఇక్కడి మోటార్లలో ఐదో మోటార్ వెట్రన్ను ఆదివారం సాయంత్రం 5.30 గంటలకు అధికారులు ప్రారంభించారు. మోటార్ ఆన్చేసిన 10 నిమిషాల తర్వాత 117 మీటర్ల ఎత్తులో ఉన్న డెలివరీ సిస్టర్న్ ద్వారా గోదావరి నీరు ఉబికి రావడంతో అధికారుల్లో ఆనందం వ్యక్తమైంది.
లక్ష్మీపూర్ వద్ద నిర్మించిన సర్జిపూల్కు ఈ నెల 5న నందిమేడారం రిజర్వాయర్ నుంచి నీరు విడుదల చేశారు. అదే రోజు రాత్రి 9 గంటల సమయంలో గోదావరి జలాలు సర్జిపూల్కు చేరుకున్నాయి. మోటార్ల టెస్టింగ్కు సరిపడా నీటిని విడుదల చేసిన అధికారులు తర్వాత నిలిపివేశారు. శనివారం వరకు టన్నెల్తోపాటు సర్జిపూల్, మోటార్లలో సాంకేతిక లోపాలన్నీ సరి చేయడంతో మళ్లీ నందిమేడారం రిజర్వాయర్ నుంచి నీటిని వదిలారు. 5వ మోటార్ వెట్రన్ విజయవంతం కావడంతో మిగతా నాలుగు మోటార్ల వెట్రన్కు కూడా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.