ఎదురుచూపులు | farmers waiting for debt waiver | Sakshi
Sakshi News home page

ఎదురుచూపులు

May 30 2014 2:12 AM | Updated on Aug 17 2018 2:53 PM

అతివృష్టి, అనావృష్టితో పంట నీటమునిగి నష్టాల ఊబిలో కూరుకుపోయిన అన్నదాతలు ఇప్పుడు రుణమాఫీ కోసం ఎదురు చూస్తున్నారు.

సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : అతివృష్టి, అనావృష్టితో పంట నీటమునిగి నష్టాల ఊబిలో కూరుకుపోయిన అన్నదాతలు ఇప్పుడు రుణమాఫీ కోసం ఎదురు చూస్తున్నారు. విత్తనాలు, ఎరువుల ధరలు పెరగడం, దిగుబడి తగ్గడం, తీసుకున్న అప్పులు చెల్లించలేని పరిస్థితుల్లో రైతులు ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీ మేరకు రుణమాఫీపై కోటి ఆశలు పెట్టుకున్నారు. ఖరీఫ్, రబీ సీజన్‌లలో జిల్లాలో సుమారు 3.26 లక్షల మంది రైతులు రూ.1,671 కోట్ల మేరకు రుణాలు తీసుకున్నారు. ఈ రుణాలు తీసుకున్న రైతుల్లో ఎక్కువ భాగం చిన్న, సన్నకారు రైతులే ఉన్నారు. కాగా ఎన్నికల సందర్భంగా అన్ని ప్రధాన పార్టీలు రుణమాఫీ పథకాన్ని అమలు చేస్తామని ప్రకటించాయి. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు.. కొలువుదీరనున్న నూతన సర్కారు.. ఈ నేపథ్యంలో రుణమాఫీ అంశం ప్రాధాన్యత సంతరించుకుంది.

 నష్టాల ఊబిలో అన్నదాతలు
 ప్రకృతి ప్రకోపానికి అన్నదాతలు విలవిల లాడారు. ఖరీఫ్ ఆరంభంలో కురిసిన అధిక వర్షాలు, అతివృష్టి కారణంగా మొలక దశలోనే పంటలు నీట మునిగాయి. పలు మండలాల్లో పత్తి, సోయా పంటలను రెండు సార్లు విత్తుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. పెరిగిన ఎరువుల, విత్తనాలు ధరలతో సాగు వ్యయం పెరిగింది. దిగుబడి మాత్రం ఆశించిన మేరకు రాలేదు. చేతికందిన పంటను విక్రయించేందుకు మార్కెట్ యార్డులకు, కొనుగోలు కేంద్రాలకు తరలించగా, అక్కడ కూడా అకాల వర్షాలు అన్నదాతలను వదల లేదు. చాలా చోట్ల ధాన్యం తడిసి రంగు మారింది.

 రంగు మారిన ధాన్యాన్ని కొనుగోలు చేయడంలో సర్కారు చేతులెత్తేయడంతో అన్నదాతలు దిక్కుతోచని పరిస్థితుల్లో మునిగిపోయారు. నాణ్యతా లోపం పేరుతో దళారులు, ప్రైవేటు వ్యాపారులు ధరలో భారీగా కోత విధించారు. దీంతో రైతులకు పెట్టిన పెట్టుబడులు కూడా రాక తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయారు. ముఖ్యంగా చిన్న, సన్నకారు రైతులు పంట రుణాలను చెల్లించలేని పరిస్థితుల్లో ఉన్నారు. ఈ నేపథ్యంలో రుణమాఫీ అన్నదాతలను ఊరిస్తోంది. ఇచ్చిన హామీపై కొత్తగా ఏర్పడనున్న సర్కారు నిర్ణయం ఎప్పుడు తీసుకుంటుందా అని ఎదురు చూస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement