2014 రైతన్నలకు ఏమాత్రం కలిసి రాలేదు.
2014 రైతన్నను నిండా ముంచింది. వర్షాభావం వెంటాడి పంట చేలు ఎండిపోయాయి. ఖరీఫ్ సాంతం కష్టాలతోనే సాగింది. రబీపై ఆశలూ సన్నగిల్లుతున్నా యి. అరకొర వర్షాలకు అంతంతమాత్రంగా సాగు చేసిన పంటలు సరైన దిగుబడి రాక.. ఆ కొద్ది పంటలకూ గిట్టుబాటు ధరలేక.. పెట్టుబడులు కూడా పూడని పరిస్థితుల్లో జిల్లాలో పలువురు రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు.
ఖమ్మం వ్యవసాయం: 2014 రైతన్నలకు ఏమాత్రం కలిసి రాలేదు. వర్షాభావ పరిస్థితులు వెంటాడటంతో నిత్యం కష్టాలతోనే కలిసి సాగారు. సకాలంలో వర్షాలు కురవకపోవడంతో సరైన సమయానికి పంటలు వేయలేకపోయారు. వ్యవసాయశాఖ ఒకటి తలిస్తే..అందుకు భిన్నమైన పరిస్థితులు ఎదురయ్యాయి. పంటల సాగు విస్తీర్ణం గణనీయంగా తగ్గింది.
జలాశయాల్లోకి నీరు చేరకపోవడంతో ప్రధాన పంటల్లో ఒకటైన వరి సాగు విస్తీర్ణం పడిపోయింది. అరకొరగా పండిన పంటలకు సరైన ధర కల్పించడంలోనూ ప్రభుత్వం విఫలమైంది. రుణమాఫీ ప్రకటించిన ప్రభుత్వం స్వల్పమొత్తం..అది కూడా సకాలంలో ఇవ్వకపోవడంతో రైతులు అప్పులపాలయ్యారు. ప్రైవేట్ వడ్డీలకు తెచ్చి ప్రాణాలమీదకు తెచ్చుకున్నారు. అటు పంటలు కలిసిరాక..ఇటు అప్పులు కావడంతో గుండెచెదిరిన రైతులు బలవణ్మరణానికి పాల్పడ్డారు.
కన్నీటి‘వర్షం’
ఈ ఏడాది ఖరీఫ్ ఆరంభం నుంచి వర్షాలు అనుకూలంగా కురవలేదు. సాధారణ వర్షపాతం కన్నా తక్కువ వర్షాలు కురిశాయి. తొలకరి నెల జూన్లో సాధారణ వర్షపాతం 132 మి.మీ కాగా కేవలం 29.7 మి.మీ వర్షపాతం నమోదైంది. అంటే -77.5 మి.మీ వర్షపాతం తక్కువగా కురిసింది. జూలైలో 314 మి.మీ వర్షపాతానికి గాను 241.6 మి.మీ, ఆగస్టులో 280 మి.మీలకు 188.1 మి.మీలు, సెప్టెంబర్లో 164 మి.మీలకు 179 మి.మీ, అక్టోబర్లో 106 మి.మీలకు 96.8 మి.మీలు, నవంబర్లో 21 మి.మీలకు 14 మి.మీల వర్షపాతం మాత్రమే కురిసింది. మొత్తంగా ఖరీఫ్ (జూన్ నుంచి సెప్టెంబర్)లో కేవలం 53 రోజులు మాత్రమే వర్షాలు కురిశాయి. మొత్తం 890 మి.మీ వర్షపాతానికి గాను 638 మి.మీ అంటే - 252 మి.మీ తక్కువ వర్షపాతం నమోదైంది.
కష్టాల ‘సాగు’
తొలకరి నుంచి వర్షాలు అనుకూలించపోవడంతో ఈ ఏడాది పంటల విస్తీర్ణం బాగా తగ్గింది. ఖరీఫ్ సీజన్లో సాగు సాధారణ విస్తీర్ణం 3,51,257 హెక్టార్లుగా వ్యవసాయ శాఖ నిర్ణయించింది. కేవలం 3,31,494 హెక్టార్లలో మాత్రమే పంటలు వేసినట్లు గుర్తించింది. వరి సాధారణ సాగు విస్తీర్ణం 1,32,727 హెక్టార్లు కాగా కేవలం 1,12,461 హెక్టార్లలో మాత్రమే సాగు చేశారు. పత్తి 1,62,402 హెక్టార్లకు గాను 1,68,232 హెక్టార్లు, మొక్కజొన్న 14,305 హెక్టార్లకు 14,692, పెసర 8,883 హెక్టార్లకు 6,248 హెక్టార్లు, కంది 6,977 హెక్టార్లకు 3,726, వేరుశనగ 357 హెక్టార్లకు 183, మినుము 261 హెక్టార్లకు 16, మిరప 20,135 హెక్టార్లకు 20,875, చెరకు 3,978 హెక్టార్లకు 4,545, పసుపు 372 హెక్టార్లకు 109 హెక్టార్లలో మాత్రమే సాగు చేశారు. వర్షాభావ ప్రభావం రబీ పంటలపైనా పడింది. రబీ వరి సాగు విస్తీర్ణం 36,481 హెక్టార్లకు 2,343 హెక్టార్లు, జొన్న 1937 హెక్టార్లకు 208, మొక్కజొన్న 19,021 హెక్టార్లకు 7,187, పెసర 4,527 హెక్టార్లకు 4,197, మినుము 3,779 హెక్టార్లకు 1,858, వేరుశనగ 5,873 హెక్టార్లకు 3,329, మిరప 8,465 హెక్టార్లకు 5,603, పొగాకు 2,914 హెక్టార్లకు 1,544 హెక్టార్లలో మాత్రమే సాగు చేశారు. రబీలో 87,178 హెక్టార్ల సాగు విస్తీర్ణానికి గాను ఇప్పటి వరకు కేవలం 27,180 హెక్టార్లలో మాత్రమే పంటలు వేశారు.
పెట్టుబడులు మోత
వర్షాభావ పరిస్థితులతో పెట్టుబడులు కూడా పెరిగాయి. వర్షాలు అనుకూలించకపోవటంతో పత్తి విత్తనాలను మూడు సార్లు వేశారు. వరి నార్లు రెండు సార్లు పోశారు. పెసర, మొక్కజొన్న తదితర విత్తనాలను కూడా రెండు సార్లు వేశారు. విత్తనాలు వేసినప్పుడల్లా దుక్కులు చేయాల్సి వచ్చింది.ఎరువులు వేయక తప్పలేదు. ఇలా పెట్టుబడులు అధికమయ్యాయి. పత్తి ఎకరానికి దాదాపు రూ. 25 వేల వరకు, వరికి రూ.20 వేల వరకు, మొక్కజొన్నకు రూ.15వేల వరకు, పెసర, మినుము పంటలకు రూ.10 వేలు, మిరపకు దాదాపు రూ.80 నుంచి రూ.లక్ష వరకు పెట్టుబడులు పెట్టారు.
ఎండిన పైరు..
వర్షాభావ పరిస్థిలు, కరెంట్ కోతలతో పలుచోట్ల పంటలు ఎండిపోయాయి. బయ్యారం, ఇల్లెందు, గుండాల, టేకులపల్లి, కారేపల్లి, కామేపల్లి, గార్ల, పాల్వంచ, కొత్తగూడెం, ముల్కలపల్లి, మధిర, వైరా, ఎర్రుపాలెం, బోనకల్లు, చింతకాని తదితర మండలాల్లో మొక్కజొన్న ఎండిపోయింది. కంకి దశకు వచ్చిన సమయంలో వర్షం లేకపోవటంతో దెబ్బతింది. తిరుమలాయపాలెం, ఖమ్మం రూరల్, ఖమ్మం అర్బన్, గార్ల, కారేపల్లి, కామేపల్లి, గుండాల తదితర మండలాల్లో పలు చోట్ల బావులు, బోర్ల కింద వేసిన వేసిన వరి, ఇతరత్ర పంటలూ ఎండిపోయాయి.
దిగుబడులూ అంతంతే..
వేసిన పంటలకు సరైన నీటి యాజమాన్యం లేకపోవటంతో పంట దిగుబడులు గణనీయంగా తగ్గిపోయాయి. ఎకరానికి 12 నుంచి 15 క్వింటాళ్ల వరకు దిగుబడులు రావల్సిన పత్తి కేవలం 3 నుంచి 5 క్వింటాళ్లకు మించి రాలేదు. వర్షాలు లేకపోవటానికి తోడు తెగుళ్లు ఆశించటం దిగుబడులపై ప్రభావం పడింది. వరి ఎకరాకు 32 నుంచి 35 బస్తాల వరకు దిగుబడి రావల్సి ఉండగా సగటున 20 నుంచి 25 బస్తాల వరకే వచ్చింది. మొక్కజొన్న 25 నుంచి 30 బస్తాల వరకు దిగుబడులు రావల్సి ఉండగా 10 బస్తాలకు మించలేదు. ఇలా అన్ని పంటల దిగుబడులూ తగ్గాయి.
భారీగా నష్టం..
రైతులు భారీగా నష్టపోయారు. కొందరు రైతులకు కనీసం పెట్టుబడులు కూడా రాలేదు. పత్తి ఎకరాకు రూ.25 వేల పెట్టుబడి కాగా సగటున 4 క్వింటాళ్ల దిగుబడి మాత్రమే వచ్చింది. దాదాపు రూ.16 వేలు నష్టం వాటిల్లింది. వరికి 20 వేలు పెట్టుబడి పెట్టగా 14 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. రూ.4 వేల వరకు నష్టం. మొక్కజొన్నకు 15 వేలు పెట్టుబడి కాగా 10 క్వింటాళ్లు దిగుబడి వచ్చింది. 6వేల మేరకు నష్టం వాటిల్లింది. పెసర, మినుము విషయంలోనూ రూ.4వేలు నష్టపోవాల్సి వచ్చింది.
గిట్టుబాటు కాని ధరలు
ఈ ఏడాది పండిన పంటలకు కనీసం గిట్టుబా టు ధరలు కూడా రాలేదు. దిగుబడులు తగ్గినా ధరలు ఆశాజనకంగా ఉంటే పెట్టుబడులు అయినా పూడేవి అని రైతులు అభిప్రాయపడుతున్నారు. పత్తికి కేంద్రం క్వింటాలుకు రూ.4,050 ప్రకటించగా వ్యాపారులు రూ.3,000 నుంచి రూ.3,500 మాత్రమే ధర చెల్లించారు. చివరికి సీసీఐని రంగంలోకి దించినా ఉపయోగం లేకుండా పోయింది. సీసీఐ కేంద్రాల్లోనూ వ్యాపారుల హవానే కొనసాగింది.
మార్క్ఫెడ్ కేంద్రాల్లో మక్కల కొనుగోలు విషయంలోనూ ఇదే చోటు చేసుకుంది. మొక్కజొన్నలకు ప్రభుత్వం రూ.1,310 ధర నిర్ణయించగా వ్యాపారులు కేవలం రూ.800 నుంచి రూ.900 మాత్రమే కొనుగోలు చేశారు. వరి, మిర్చిది కూడా ఇదే పరిస్థితి. నవంబర్ నెల చివరి వరకు క్వింటాలు రూ.10వేలున్న మిర్చి ధర పంట చేతికి వస్తున్న ప్రస్తుత తరుణంలో రూ.6,000కు పడిపోయింది.
పంట రుణాలు పావలొంతే..
తొలిసారి ఏర్పాటైన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వందశాతం వ్యవసాయ రుణాల మాఫీ అని ప్రకటించింది. కేవలం 25 శాతం రుణాలను మాత్రమే మాఫీ చేసింది. అది కూడా సకాలంలో జరగకపోవడం, సరైన కాలంలో ఖరీఫ్ రుణాలు ఇవ్వకపోవడంతో రైతులు ప్రైవేట్గా అధిక వడ్డీలకు అప్పులు తీసుకున్నారు. రుణమాఫీలో భాగంగా రైతులకు అందాల్సిన రుణాల్లో ఇప్పటి వరకు చాలామంది రైతుల ఖాతాల్లో జమకాలేదు. రూ.1,700 కోట్ల పంట రుణాలను రుణమాఫీ కింద గుర్తించగా వాటిలో రూ.427 కోట్లను మొదటి విడతగా ప్రభుత్వం మంజూరు చేసింది.
ఆగని ఆత్మహత్యలు..
అటు పంటలు పండక, ఇటు అప్పులు తీర్చే మార్గం లేక రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డా రు. పాల్వంచ, కారేపల్లి, ఇల్లెందు, బయ్యారం, గార్ల, టేకులపల్లి, కొత్తగూడెం, మధిర , తిరుమలాయపాలెం, బోనకల్లు తదితర మండలాల్లో రైతులు ఆత్మహత్యలకు పాల్పడిన సంఘటనలు ఉన్నాయి. పంటల రుణాలు పూర్తిగా మాఫీగాక, కొత్త రుణాలు అందక రైతులు ప్రవేటుగా అప్పులు చేశారు. ఆ అప్పులు తీర్చలేక పలువురు రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు.