‘కాల్‌’తో కట్టడి | Election Commission Launches App For Help To Voters | Sakshi
Sakshi News home page

‘కాల్‌’తో కట్టడి

Nov 19 2018 9:49 AM | Updated on Nov 19 2018 9:50 AM

Election Commission Launches App For Help To Voters - Sakshi

సాక్షి, సిద్దిపేట: ఎన్నికల నియమావళికి ఆటంకం కలగకుండా ప్రశాంతంగా నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం తీవ్ర కసరత్తు చేస్తోంది. ఒక వైపు ఈవీఎంల వినియోగం, వాటిపై రాజకీయ పార్టీలకు ఉన్న అపోహలను తొలగించడంతోపాటు, వీవీ ప్యాట్‌ల గురించి వివరించడం, ఎవరికి ఓటు వేసిన విషయాన్ని ఎలా తెలుసుకోవాలో తెలుపుతున్నారు. ఇందుకోసం పోలింగ్‌ బూత్‌లో పనిచేసే అధికారులకు, ఉద్యోగులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇదంతా ఒక ఎత్తయితే ఎవ్వరి ఒత్తిడి లేకుండా, ప్రలోభాలకు గురికాకుండా స్వేచ్ఛాయుతంగా ఓటరు తమ ఓటు హక్కును వినియోగించుకునేలా సన్నాహాలు చేస్తున్నారు.

నిబంధనలు అతిక్రమించడం, అవాంఛనీయ కార్యక్రమాలకు అవకాశం ఉంటే వెంటనే అధికారులకు సమాచారం చేరవేసేలా ఒక్క కాల్‌ చేస్తే చాలు మొత్తం కట్టడి చేస్తాం అన్నట్లు అధికారులు ధీమాతో ఉన్నారు. దీనికి జిల్లాలోని నాలు నియోజకవర్గాల్లో ఫిర్యాదుల సెల్‌తోపాటు, 24 గంటలు అందుబాటులో ఉండేలా టోల్‌ ఫ్రీ నంబర్‌ను కూడా ప్రకటించారు.అదేవిధంగా కొత్తగా వచ్చిన సీ విజిల్, సమాధాన్‌ యాప్‌ల ద్వారా కూడా ఫిర్యాదులు స్వీకరిస్తున్నారు. 

కంట్రోల్‌ రూం
సిద్దిపేట          :     08457223315
హుస్నాబాద్‌   :    08721255123
 దుబ్బాక       :     08457246622
 గజ్వేల్‌         :  08454234001
టోల్‌ ఫ్రీ         : 1950

స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకునేందుకు.. 
ప్రజాస్వామ్యంలో ఓటు కీలకమైంది. ఆ ఓటు హక్కు రేటుతో ముడిపెట్టి, డబ్బులకు, ఇతర తాయిలాల ఆశతో పక్కతోవ పట్టించి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్న పరిస్థితులు నెలకొన్నాయి. ప్రధానంగా ఓటుకు రేటు కట్టి డబ్బులు పంచడం, మద్యం సీసాలు పంపిణీ చేయడం, సెంటిమెంట్‌తో ఓట్లు వేయించుకునేందుకు చీరెలు, కుంకుమ భరిణలు పంపిణీ చేయడం వంటి కార్యకలాపాలకు పలువురు అభ్యర్థులు ఇప్పటి నుండే ప్రయత్నాలు చేస్తుంటారు.

వాటిని నివారించి ఎవ్వరి ఒత్తిడి లేకుండా ప్రలోభాలకు గురికాకుండా ఓటు వేస్తే ఐదు సంవత్సరాలు సమస్యలు పరిష్కరిస్తూ పాలించే నాయకుడిని ఎన్నుకోవచ్చు. ఓటర్లును లోబర్చుకునే సంఘటనలు చోటు చేసుకుంటే వెంటనే టోల్‌ ఫ్రీ నంబర్‌కు కానీ, ఫిర్యాదుల సెల్‌కు కాని ఒక్క కాల్‌ చేస్తే చాలు వెంటనే కట్టడి చేసేందుకు అధికారులు అక్కడ వాలిపోతారు.

అదేవిధంగా ఓటర్లను రెచ్చగొట్టే విధంగా ప్రచారం చేయడం, ఒకరిపై ఒకరు ఉద్దేశ పూర్వకంగా విమర్శలు చేసుకోవడం, మారణాయుధాలతో ఓటర్లను భయభ్రాంతులకు గురిచేయడం, బెదిరింపులు, హింసాత్మక సంఘటనలు సృష్టించి ప్రజలను ఇబ్బందులు పెట్టడంలాంటి కార్యక్రమాలపై ఉక్కు పాదం మోపేందుకు అటు జిల్లా యంత్రాంగం, ఇటు పోలీస్‌ యంత్రాంగం అంతా అప్రమత్తంగా ఉంది.

అందుకోసం జిల్లా కలెక్టర్‌ కార్యాలయంలో నిరంతరం పనిచేసే టోల్‌ఫ్రీ నంబర్‌ 08457–223315ను ప్రకటించారు. హుస్నాబాద్‌ 08721–255123, దుబ్బాక 08457–246622, గజ్వేల్‌ 08454– 234001 నంబర్‌కు ఫోన్‌ చేస్తే వెంటనే సంబంధిత ఫిర్యాదును నమోదు చేసుకొని పరిస్థితి చక్కదిద్దడం, నిబంధనలకు విరుద్ధంగా పనిచేస్తున్న వారిపై చర్యలు తీసుకోవడం చేస్తారు. 

సీ–విజిల్‌ యాప్‌తో వంద నిమిషాల్లో పరిష్కారం
అధునాతన పరిజ్ఞానం వినియోగించుకొని ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు ప్రత్యేకంగా యాప్‌లు విడుదల చేశారు. ఇందులో భాగంగా విడుదల చేసిన సీ–విజిల్‌ యాప్‌ ద్వారా ఫిర్యాదు చేసిన వంద నిమిషాల్లో సమస్యను పరిష్కరించేలా ప్రణాళిక సిద్ధం చేశారు. కేంద్ర ఎన్నికల సం ఘం విడుదల చేసిన సీ–విజిల్‌ యాప్‌ను స్మార్ట్‌ ఫోన్లో డౌన్‌లోడ్‌ చేసుకోవాలి. మనీ, మద్యం పంపి ణీ, ఇతర హింసాత్మక కార్యక్రమాలు నిర్వహించ డం, ఓటర్లను భయ పెట్టడం, ప్రలోభాలకు గురి చేయడం వంటి సంఘటనలు 3 నుండి 10 ఫొటో లు తీసి సంఘటన జరిగిన 5 నిమిషాల లోపు యాప్‌ ద్వారా ఫిర్యాదు చేయాలి.

దీన్ని కలెక్టర్‌ కా ర్యాలయంలో ఉన్న సిస్టమ్స్‌ ద్వారా తెలుసుకొని 15నిమిషాలలో క్షేత్రస్థాయి పరిశీలనకు వెళ్తారు. 30 నిమిషాల వ్యవధిలోనే సంఘటనకు సంబంధి ంచిన దర్యాప్తు నివేదికను స్థానిక రిటర్నింగ్‌ అధికారికి అందచేస్తారు. అది చూసిన ఆర్‌ఓ 50 నిమిషాల్లో భారత ఎన్నికల సంఘం ద్వారా ఫిర్యాదు చేసిన వారి మొబైల్‌ నంబర్‌కు వివరాలు పంపిస్తారు. సమస్యను పరిష్కరిస్తారు. అదేవిధంగా మరో యాప్‌ సమాధాన్‌ ద్వారా ఫిర్యాలు చేయడం, వాటిని సంబంధించిన విచారణ చేపట్టి ఫిర్యాదు దారునికి వివరాలు అందచేస్తారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement