ఎట్టకేలకు... | Development funds salvation finally | Sakshi
Sakshi News home page

ఎట్టకేలకు...

Sep 17 2014 4:05 AM | Updated on Sep 2 2017 1:28 PM

వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి నిధులకు ఎట్టకేలకు మోక్షం లభించనుంది. కొంతకాలంగా వివిధ కారణాల దృష్ట్యా వాయిదాపడుతూ వస్తున్న జిల్లా ప్రణాళిక కమిటీ సమావేశం(డీపీసీ)

 నీలగిరి :వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి నిధులకు ఎట్టకేలకు మోక్షం లభించనుంది. కొంతకాలంగా వివిధ కారణాల దృష్ట్యా వాయిదాపడుతూ వస్తున్న జిల్లా ప్రణాళిక కమిటీ సమావేశం(డీపీసీ) బుధవారం జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో ఉదయం 10గంట లకు నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో బీఆర్‌జీఎఫ్‌లకు సంబంధించి గ్రామ, మండల, జిల్లాస్థాయిలో గుర్తించి పంపిన ప్రతి పాదనలపై సభ్యులు చర్చించి ఆమోదిస్తారు. జెడ్పీచెర్మన్ నేనావత్ బాలునాయక్ అధ్యక్షతన జరిగే ఈ సమావేశానికి ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, జెడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలు హాజరుకానున్నారు. ఈ ఆర్థిక సంవత్సరానికిగాను బీఆర్‌జీఎఫ్ కింద జిల్లాకు 33 కోట్ల రూపాయలు కేటాయించారు.  
 
 అభివృద్ధికి పెద్దపీట
 బీఆర్‌జీఎఫ్ పథకం ఏడేళ్లుగా అమలవుతోంది. ఈ పథకం కింద ఇప్పటి వరకు జిల్లాకు రూ. 190 కోట్లు కేటాయించారు. అయినా ప్రభుత్వం అనుకున్న లక్ష్యం పూర్తికాకపోవడంతో ఈ ఆర్థిక సంవత్సరంలో కూడా రూ.33 కోట్లు కేటాయించారు. ఈ నిధులతో గ్రామ, మండల పరిషత్, జెడ్పీల నుంచి అంగన్‌వాడీ భవనాలు, మురికికాల్వలు, అంతర్గత రోడ్లు, తాగునీటి సౌకర్యం, పశువైద్యశాలల  మిగులు పనులు, పాఠశాలల అదనపు తరగతి గదులు, మండల పరిషత్ భవనాల మిగులు పనులు, గ్రామ పంచాయతీ భవనాల మిగులు పనులుతో కలిపి ప్రణాళిక రూపొందించారు. అంతేగాక మండల పరిషత్, గ్రామ పంచాయతీలకు చెందిన సొంత నిధులు రూ.3.50 కోట్లతో ప్రతిపాదనలు రూపొందించారు. ఈ విషయమై జెడ్పీ సీఈఓ దామోదర్‌రెడ్డి మాట్లాడుతూ... ‘‘బీఆర్‌జీఎఫ్ పనులకు డీపీసీ ఆమోదం పొందిన తర్వాత రాష్ర్టస్థాయిలో జరిగే సమావేశానికి కూడా పంపిస్తాం. అక్కడా ఆమోదం లాంఛనమే. అదే రోజున 14 స్టేట్ ఫైనాన్స్ కమిషన్ మీటింగ్ కూడా ఉంది. ఈ సమావేశానికి జెడ్పీచైర్మన్ హాజరవుతారు. జిల్లాకు సంబంధించి సీపీడబ్ల్యూఎస్ పథకాలపై చైర్మన్ సలహాలు, సూచనలు ఇస్తారు.’’
 
 నిధుల పంపకం..
 బీఆర్‌జీఎఫ్‌లో భాగంగా జిల్లాపరిషత్ కోటా రూ.6 కోట్ల నుంచి ప్రజాప్రతినిధులకు వాటాలు కేటాయించారు. ఎంపీలకు 10 లక్షల రూపాయలు, ఎమ్మెల్యేలకు 5 లక్షల రూపాయలు, జెడ్పీటీసీలకు 7 లక్షల రూపాయలు, మాజీ ప్రజాప్రతినిధులందరికీ 20 లక్షల రూపాయల నిధులు పంపిణీ చేస్తారు. ఈ నిధులను ఆయా ప్రజాప్రజానిధులు తమ ప్రాంతాల పరిధిలో అభివృద్ధి పనులకు ఖర్చు చేయాల్సి ఉంటుంది.
 

Advertisement
 
Advertisement
Advertisement