భలే రా బడి | Danda in private schools | Sakshi
Sakshi News home page

భలే రా బడి

Jun 21 2015 12:04 AM | Updated on Sep 3 2017 4:04 AM

ఏడాది మొత్తం కంటే జూన్ నెలలో ఖర్చుల బడ్జెట్ ఎక్కువ. పిల్లల విద్య కోసం తల్లిదండ్రులు ఒక ప్రణాళికను తయారు చేసుకుంటారు.

ప్రైవేట్ స్కూళ్లలో దందా
 
♦ జ్ఞానం అమూల్యం కానీ చదువుకు ‘మూల్యం’ చెల్లించాల్సిందే..
♦ ఎంత చదువు ‘కొంటే’.. జీవితంలో అంత ‘ఎదిగి’ పోవచ్చు..
♦ ఇది లోక ‘జ్ఞానం’.. అందుకే చదువులో పె‘న్నిధి’ని గుర్తించిన వారు చక్కని రా‘బడి’  పొందుతున్నారు..
 
 పాఠశాలల్లో బడి గంట మోగింది. గంట శబ్ధం విద్యార్థుల్లో కొత్త ఉత్సాహం నింపుతుండగా.. వారి తల్లిదండ్రుల్లో మాత్రం వణుకు పుట్టిస్తోంది. ప్రస్తుతం మార్కెట్‌లో అత్యంత లాభసాటి వ్యాపారాల్లో విద్య ఒకటిగా మారింది. ప్రజాప్రతినిధుల నుంచి వ్యాపారుల వరకూ అందరూ ఇందులో పెట్టుబడులు పెడుతున్నారు. ఒకవైపు కార్పొరేట్, ప్రైవేటు, ఎయిడెడ్ సంస్థలు ఫీ‘జులుం’ చూపిస్తూనే మరోవైపు ఇతర మార్గాల్లో కూడా డబ్బులు దండుకుంటున్నాయి. అడ్మిషన్ల టైంలోనే పుస్తకాలు, యూనిఫాం, బ్యాగు, షూలను విక్రయిస్తూ అదనపు ఆదాయం గడిస్తున్నాయి.. అది కూడా రెట్టింపు రేట్ల దోపిడీతో పుస్తకాల విక్రయాల ద్వారా ప్రైవేటు స్కూళ్లు సాగిస్తున్న దందాపై ఈ ‘స్కూల్ టైం’ కథనం..
 
 సూర్యాపేట : ఏడాది మొత్తం కంటే జూన్ నెలలో ఖర్చుల బడ్జెట్ ఎక్కువ. పిల్లల విద్య కోసం తల్లిదండ్రులు ఒక ప్రణాళికను తయారు చేసుకుంటారు. ఫీజులకు కొంత.. ఇలా అన్నింటికి ఓ లెక్క వేసుకుంటారు. ఫీజులు మాట అటుంచితే.. పుస్తకాల కొనుగోలు సమయంలో వాటి ధరలు తల్లిదండ్రులకు చుక్కలు చూపిస్తున్నాయి. కొర్పోరేట్ విద్యాసంస్థలు మార్కెట్ ధరలతో పోలిస్తే అదనంగా 50 శాతం అదనంగా వసూలు చేస్తూ.. వాటినే ఎంఆర్‌పీగా నమ్మిస్తూ అడ్డంగా దోచుకుంటున్నారు. ఉదాహరణకు మార్కెట్‌లో 40 రూపాయలకు దొరికే పుస్తకం.. ప్రైవేటు విద్యాసంస్థల ఆవరణలో డీలర్ 80 రూపాయల వరకు విక్రయిస్తున్నారు.

అలాగే తరగతిని బట్టి పుస్తకాల ఖరీదు మారిపోతున్నాయి. ఇంత ఖరీదు చెల్లించి పుస్తకాలు కొనుగోలుకు గంటల కొద్ది సమయం తల్లిదండ్రులు క్యూలైన్లో వేచి ఉండాల్సి వస్తోంది. విద్యాహక్కు చట్టం ప్రకారం.. స్కూల్ ఆవరణంలో విద్యార్థులకు సంబంధించిన పాఠ్యపుస్తకాలు, ఇతర వస్తువులు, యూనిఫాం అమ్మకూడదు. అమ్మకాలు నిర్వహించే పాఠశాలలపై ఎలాంటి చర్యలైనా తీసుకోవచ్చు. కార్పొరేట్, ప్రైవేటు, ఎయిడెడ్ పాఠశాలల యాజమాన్యాలు విద్యాహక్కు చట్టం ఉందనే విషయం కూడా పట్టించుకోవడం లేదు.

అందుకు పాఠశాల యాజమాన్యాలు తమకు కావాల్సిన పుస్తకాలను నేరుగా తమ వద్దకే తెప్పించుకొని విక్రయిస్తున్నారు.దీనికోసం ముందుగానే బుక్ డీలర్స్‌తో బేరం కుదుర్చుకుంటున్నారు. పిల్లలకు కావాల్సిన పుస్తకాల కోసం తల్లిదండ్రులు మార్కెట్‌లోకి వెళ్లి తెచ్చుకోవాల్సిన అవసరం లేకుండా వారి సౌకర్యార్థమే ఇలా పుస్తకాలు పాఠశాలలోనే అందిస్తున్నట్లు విద్యాసంస్థల యాజమాన్యాలు చెబుతున్నాయి.

 పాఠశాలకో సిలబస్..
 సిలబస్ విషయంలో కూడా ప్రైవేటు పాఠశాలలు తమకు నచ్చిన పద్ధతిని అవలంబిస్తున్నాయి వారి కోసం ప్రత్యేకంగా పబ్లిషర్స్‌తో మాట్లాడుకొని సిలబస్‌ని సిద్ధం చేసుకుంటున్నాయి. అది కూడా పిల్లల సామర్థ్యానికి మించిన సిలబస్‌తో పుస్తకాలు తయారుచేయిస్తూ తమ వద్దనే విక్రయిస్తున్నారు. బయట మార్కెట్‌లో పుస్తకాలు కొనుగోలు చేసుకుంటామని తల్లిదండ్రులు అంటే.. స్కూల్లో చెప్పే సిలబస్ బయట దొరకదని వారు చెబుతున్నారు. తప్పనిసరి భారం : చంద్రిక, ఓ విద్యార్థి తల్లి
 మా పిల్లల్ని ఓ ప్రైవేటు పాఠశాలలో చదివిస్తున్నాం. ఫీజులు ఎలానూ కడుతున్నాం. అదనంగా పుస్తకాలు కూడా భారం అవుతున్నాయి. ఖరీదు ఎంతైనా వారు సూచించిన పుస్తకాలే తీసుకోవాలి తప్ప.. బయట కొనేందుకు అంగీకరించడం లేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement