నిరాశతోనే అలా మాట్లాడుతున్నారు | Sakshi
Sakshi News home page

నిరాశతోనే అలా మాట్లాడుతున్నారు

Published Tue, May 5 2015 2:07 AM

నిరాశతోనే అలా మాట్లాడుతున్నారు

- రాష్ట్ర ఆహార, పౌరసరఫరాల శాఖ మంత్రి   దినేష్ గుండూరావ్

బెంగళూరు: రాజకీయ అస్థిత్వాన్ని జేడీఎస్ పార్టీ రాష్ట్రంలో పూర్తిగా కోల్పోయిందని రాష్ట్ర ఆ హార, పౌర సరఫరాల శాఖ మంత్రి దినేష్ గుండూరావ్ విమర్శించారు. ఈ పరిణామంతో జేడీఎస్ పార్టీ నేత హెచ్.డి.కుమారస్వామి నిరాశలో కూరుకుపోయారని, అందుకే ప్రభుత్వంపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని దినేష్ గుండూరావ్ ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో నేపాల్ భూకంప బాధితులను ఆదుకునేందుకు ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ప్రారంభిం చిన అనంతరం ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అన్నభాగ్య పథకం రాష్ట్రంలోని లక్షలాది మంది పేదలకు మూడు పూటలా భోజనం చేసే అదృష్టాన్ని కల్పించిందని అన్నారు.

కుమారస్వామి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రాష్ట్ర ప్రజల కోసం ఏమీ చేయలేదని, అందుకే ప్రజలు ఆయన్ను అధికారం నుంచి దించేశారని విమర్శించారు. ఇక కుమారస్వామి తనపై చేసిన వ్యాఖ్యలపై దినేష్ గుండూరావ్ స్పందిస్తూ....‘నేను అవినీతికి పాల్పడినట్లు, అందుకు సంబంధించిన ఆధారాలు ఆయన వద్ద ఉన్నాయని ఎన్నో ఏళ్లుగా కుమారస్వామి చెబుతూనే ఉన్నారు. అయితే కుమారస్వామి ఎప్పుడూ ఆ ఆధారాలను బయటపెట్టలేదు. ఎందుకంటే అసలు నేను అవినీతి చేసి ఉంటే, అందుకు సంబంధించిన ఆధారాలు ఉండేది, వాటిని బయటపెట్టగలిగేది. ఇదంతా ప్రజలను మభ్యపెట్టేందుకు కుమారస్వామి చేస్తున్న వ్యాఖ్యలు మాత్రమే’ అని పేర్కొన్నారు.  
 
 

Advertisement
Advertisement