దేశం బాగుండాలంటే ఓటేయాలి
దేశంలో సంతోషంగా జీవించాలంటే ప్రతి ఒక్కరూ ఓటుహక్కును వినియోగించుకోవాలని తన అభిమానులకు సూచించారు బాలీవుడ్ సూపర్స్టార్ షారుఖ్ఖాన్.
గుర్గావ్: దేశంలో సంతోషంగా జీవించాలంటే ప్రతి ఒక్కరూ ఓటుహక్కును వినియోగించుకోవాలని తన అభిమానులకు సూచించారు బాలీవుడ్ సూపర్స్టార్ షారుఖ్ఖాన్. ఏప్రిల్ 7 నుంచిమే 12 వరకు తొమ్మిది దశల్లో జరుగుతున్న ఈ లోక్సభ ఎన్నికల్లో ఓటు వేయడం ప్రతి ఒక్కరి బాధ్యతన్నారాయన. ఎవరికి ఓటు వేయాలి, ఎవరికి వేయగూడదనే విషయాన్ని టీవీలు, పత్రికల ద్వారా తెలుసుకుని ప్రజలు చాలా తెలివిగా ఉన్నారని అభిప్రాయపడ్డారు. రేప్పై సమాజ్వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్, బాలీవుడ్ నటి ఆయేషా టకియా మామ అబూ అజ్మీ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించగా... వాళ్లకున్న కొద్దిపాటి జ్ఞానంతో ఎన్నికల సమయంలో నేతలు తలా ఓ రకంగా మాట్లాడతారని, కానీ ప్రజలు మాత్రం తాము బలమైన నాయకుడని నమ్మినవారికే ఓటేయాలని చెప్పారు. ప్రస్తుతం ఫరాఖాన్ దర్శకత్వంలో హ్యాపీ న్యూ ఇయర్ చిత్రంలో నటిస్తున్న ఆయన బిజీ షెడ్యూల్ వల్లే ఐఫాఅవార్డులకు హాజరు కాలేకపోతున్నానని, అయితే ఆ సినిమాలో నటిస్తున్న ఇతర నటులు వెళ్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. కాగా హ్యాపీ న్యూ ఇయర్ సినిమాలో షారుఖ్తోపాటు దీపిక, అభిషేక్ బచ్చన్, బొమన్ ఇరానీ, సోనూ సూద్ కూడా నటిస్తున్నారు.