నిషేధిత పాన్మసాలా, గుట్కా, పొగాకు ఉత్పత్తుల తయారీ కేంద్రాలు, కార్యాలయాలపై చెన్నై ఆదాయపు పన్నుశాఖ అధికారులు శుక్రవారం దాడులు నిర్వహించారు.
నిషేధిత పాన్మసాలా, గుట్కా, పొగాకు ఉత్పత్తుల తయారీ కేంద్రాలు, కార్యాలయాలపై చెన్నై ఆదాయపు పన్నుశాఖ అధికారులు శుక్రవారం దాడులు నిర్వహించారు. దాడుల్లో రూ.300 కోట్ల విలువైన నల్లధనం, డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. చెన్నై మండల ఆదాయపు పన్నుశాఖ డెరైక్టర్ బాలకృష్ణన్ ఉత్తర్వుల మేరకు ప్రత్యేక విభాగ అధికారులు పొగాకు ఉత్పత్తుల అమ్మకాలపై ఇప్పటికే రహస్యంగా విచారణ సాగిస్తున్నారు.
ఆహార భద్రతాధికారులు, పోలీసులు వేర్వేరుగా నిందితుల కోసం గాలిస్తున్నారు. గాలింపుల్లో అరెస్టయిన నిందితులు ఇచ్చిన సమాచారం మేరకు చెన్నై శివారు సెంగుడ్రం, గుమ్మిడిపూండి, రెడ్హిల్స్ సమీపంలోని పాలవాయల్ సోత్తుపక్కారం రోడ్డు, మాధవరం ప్రాంతాల్లోని పాన్ మసాలా, గుట్కా తయారీ కేంద్రాల్లో దాడులు జరిపారు. రైసు మిల్లులు, బియ్యం గోడౌన్ల ముసుగులో గుట్కా, పాన్ మసాలా తయారు చేస్తున్నట్లు తనిఖీల్లో తేలింది. చెన్నై అన్నానగర్లో నివసించే అంధ్రప్రదేశ్కు చెందిన వ్యక్తే గిడ్డంగుల యజమానిగా గుర్తించారు. యజమాని అందుబాటులో లేకపోవడంతో గిడ్డంగి మేనేజర్ రాజేంద్రన్ను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. ఈ దాడుల్లో సుమారు రూ.300 కోట్ల విలువైన నల్లధనం, డాక్యుమెంట్లు దొరికినట్లు తెలిసింది.