రైలు చార్జీల పెంపును తక్షణమే ఉపసంహరించుకోవాలని ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు అర్వింద్ కేజ్రీవాల్ డిమాండ్ చేశారు. ఈ విషయమై బుధవారం ఆయన ఇక్కడ మీడియాతో
న్యూఢిల్లీ: రైలు చార్జీల పెంపును తక్షణమే ఉపసంహరించుకోవాలని ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు అర్వింద్ కేజ్రీవాల్ డిమాండ్ చేశారు. ఈ విషయమై బుధవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ గ్యాస్ ధరల పెంపు యోచనను పునరాలోచించాలని కోరారు. అధికారంలోకి రాగానే ధరలను తగ్గిస్తామంటూ నరేంద్ర మోడీ ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారని, అవినీతిని నిర్మూలిస్తామని అన్నారని, అయితే గడచిన నెల రోజుల వ్యవధిలో నిత్యావసరాల ధరలు పెరిగాయని, ఇది ప్రజలను తీవ్ర ఆగ్రహానికి లోనుచేస్తోందని ఆయన విమర్శించారు. అవినీతిని నిర్మూలించడం పక్కనబెట్టి ధరల పెంపు దిశగా అడుగులు వేస్తున్నారంటూ ఎద్దేవా చేశారు.
అవినీతిని నిర్మూలించకపోతే ధరల తగ్గింపు ఎంతమాత్రం సాధ్యం కాదన్నారు. రైలు చార్జీలను పెంచడానికి బదులు ప్రయాణికులకు మెరుగైన వసతులు కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. అవినీతి నిర్మూలనకు విధిగా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతి ప్రభుత్వం ధరల పెంపును సమర్థించుకుంటోందంటూ విమర్శిం చారు. రైలు చార్జీల పెంపును కనీసం ఆరు నెల లపాటు వాయిదా వేస్తే బాగుంటుందని ఆయన హితవు పలికారు. గ్యాస్ ధరల పెంపు వల్ల అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ సంస్థ లబ్ధి పొందుతుం దని, అంతేకాకుండా ఇందువల్ల ప్రజలపై మరింత భారం పడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. అధికారంలోకి వచ్చిన తరువాత ఇలా మాట తప్పడమేమిటని ఆయన ప్రశ్నించారు. తక్షణమే పెంచిన రైలు చార్జీలను తగ్గించాలని డిమాండ్ చేశారు.
కోర్టులు అడిగితే తప్ప ఖాళీ చేయను
తన నూతన నివాసంపై తలెత్తిన వివాదం గురించి తెలియదని ఆప్ నాయకుడు అరవింద్ కేజ్రీవాల్ పేర్కొన్నారు. న్యాయపరమైన అంశాలన్నీ ఓ కొలిక్కి వచ్చేదాకా మారే ప్రసక్తే లేదన్నారు. ‘ యజమానిని (నరేన్జైన్ ) కలిసి ఇంటికి కిరాయికి తీసుకున్నా. వారి మధ్య తలెత్తిన వివాదాన్ని నరేన్జైన్ సోదరులిరువురూ పరిష్కరించుకుంటారు. ఆ ఇంట్లో ఉండొద్దని కోర్టు అంటే తప్ప ఖాళీ చేయను’ అని అన్నారు. ఇదిలాఉంచితే అద్దె ఇంటి వివాదమై ఢిల్లీ హైకోర్టులో బుధవారం వీరేంద్ర జైన్ అనే వ్యక్తి పిటిషన్ దాఖలు చేశాడు.