స్వాతంత్య్ర దినోత్సవంలో ముఖ్యమంత్రి జయలలిత | 67th Independence Day celebration in tamilnadu | Sakshi
Sakshi News home page

స్వాతంత్య్ర దినోత్సవంలో ముఖ్యమంత్రి జయలలిత

Aug 16 2013 3:29 AM | Updated on Sep 1 2017 9:51 PM

ప్రజల సంక్షేమమే తమ ధ్యేయమని ముఖ్యమంత్రి జయలలిత పేర్కొన్నారు. 67వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని సచివాలయంలో ఘనంగా జరుపుకున్నారు.

చెన్నై, సాక్షి ప్రతినిధి : ప్రజల సంక్షేమమే తమ ధ్యేయమని ముఖ్యమంత్రి జయలలిత పేర్కొన్నారు. 67వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని సచివాలయంలో ఘనంగా జరుపుకున్నారు. ముఖ్యమంత్రి జయలలిత ఉదయం 8.25 గంటలకు తన నివాసం నుంచి బయలుదేరి అమరజవానుల స్థూపం వద్దకు చేరుకుని శ్రద్ధాంజలి ఘటిం చారు. అక్కడి నుంచి సచివాలయానికి చేరుకుని 9 గంటలకు జాతీయ పతాకాన్ని ఎగురవేసి వందనం చేశారు. ఆ తరువాత పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. 
 
 అనంతరం ఆమె మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నా కేంద్ర ప్రభుత్వ పాలనలోని వైఫల్యాలు ప్రజలకు శాపాలుగా పరిణమించాయని ఆవేదన వ్యక్తం చేశారు. రూపాయి పతనంతో పెట్రోల్, డీ జిల్ ధరలు పెరిగాయన్నారు. దీంతో నిత్యావసర వస్తువుల ధరలు సామాన్య ప్రజలకు అందుబాటులో లేకుండా పోతున్నాయన్నా రు. తమిళనాడు అమలుచేస్తున్న ప్రజావినియోగ పథకాన్నే కేంద్రం ఆహార భద్రత చట్టం పేరుతో ప్రవేశపెట్టేందుకు ప్రయత్నిస్తోందని పేర్కొన్నారు. లోపభూయిష్టమైన ఆ చట్టం అమలులోకి వస్తే రేషన్‌కార్డుల ద్వారా రాష్ట్రంలో పంపిణీ చేసే బియ్యంలో లక్ష టన్నుల కోత పడుతుందని చెప్పారు. ఆహర భద్రతా చట్టంలో మార్పులు చేసిన తరువాతే అమలు చేయాలని డిమాండ్ చేశారు.
 
 పింఛను రూ.9 వేలకు పెంపు 
 స్వాతంత్య్రం కోసం ప్రాణాలను త్యాగం చేసిన నాయకులను స్మరించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ముఖ్యమంత్రి జయలలిత అన్నారు. స్వాతంత్య్ర సమరయోధులను మరోసారి గౌరవిస్తూ వారికి ఇంతవరకు అందజేస్తున్న పింఛను రూ.7 వేల నుంచి రూ.9 వేలకు పెంచుతున్నట్లు ప్రకటించారు. అలాగే కుటుంబ పోషణకు నెలనెలా ఇచ్చే మొత్తాన్ని రూ.3,500ల నుంచి రూ.4,500లకు పెంచుతున్నామని తెలిపారు. ఈ పెంపు ఆగస్టు 1వ తేదీ నుంచి అమలులోకి వస్తుందని వివరించారు. అదేవిధంగా కన్యాకుమారి జిల్లాకు చెందిన మహిళా ఉద్యోగి సుకీ ప్రమీలకు సాహస వనితలకు ఏటా ఇచ్చే కల్పనా చావ్లా అవార్డును ప్రదానం చేశారు. అవార్డుతోపాటు రూ.5 లక్షల నగదు, జ్ఞాపిక, బంగారు పతకం అందజేశారు.
 
 ‘తమిళనాడు ప్రజలే నా కుటుంబం, నా పిల్లలు, వారి సంక్షేమమే నా సంక్షేమం’ అంటూ ఆమె తన ప్రసంగాన్ని ముగించారు. ఈ కార్యక్రమంలో హైకోర్టు ప్రదాన న్యాయమూర్తి (ఇన్‌చార్జ్) రాజేష్‌కుమార్ అగర్వాల్, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి షీలా బాలకృష్ణన్, రాష్ట్ర డీజీపీ జార్జ్, దక్షిణాది రాష్ట్రాల నేవీ చీఫ్ లెఫ్టెనెంట్ జనరల్ డీకే పిళ్లై, సముద్రతీర భద్రతా దళాధికారి కమాండర్ మహదేవన్, తాంబరం వైమానిక దళం అధికారి ఏర్ కమాండర్ ఎస్ ప్రభాకరన్ , మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, స్వాతంత్య్ర సమరయోధులు పాల్గొన్నారు. సీఎం జయలలిత సచివాలయం నుంచి రాజ్‌భవన్‌కు చేరుకుని గవర్నర్ రోశయ్య ఇచ్చిన విందులో పాల్గొన్నారు.
 
 రాజ్‌భవన్‌లో...
 రాజ్‌భవన్‌లో గవర్నర్ రోశయ్య స్వాతంత్య్రదినోత్సవ సూచికగా జాతీయ పతాకంలోని త్రివర్ణ గ్యాస్ బెలూన్‌లను గాలిలోకి వదిలారు. అనంతరం వివిధ రంగాలకు చెందిన ప్రముఖులతో ఁఎట్ హోంరూ. కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జయలలిత, అసెంబ్లీ స్పీకర్ ధనపాల్, పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, చెన్నై కార్పొరేషన్ మేయర్ సైదై దురైస్వామి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి షీలా బాలకృష్ణన్, పారిశ్రామికవేత్తలు, విశ్వవిద్యాలయాల వైస్ చాన్సలర్లకు విందు ఏర్పాటుచేశారు. అనంతరం అక్కడ నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహూతులను ఆకట్టుకున్నాయి.
 
 వివిధ రాజకీయ పార్టీ కార్యాలయాల్లో..
 స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని అన్ని పార్టీల కార్యాలయాల్లో జాతీయ పతాకాన్ని ఎగురవేసి వందనం చేశారు. టీఎన్‌సీసీ ప్రధాన కార్యాలయమైన సత్యమూర్తి భవన్‌లో పార్టీ అధ్యక్షులు జ్ఞానదేశిగన్, డీఎంకే కేంద్ర కార్యాలయం అన్నా అరివాలయంలో పార్టీ ఉప ప్రధాన కార్యదర్శి వీపీ దొరస్వామి, కోయంబేడులోని డీఎండీకే కార్యాలయంలో ఆపార్టీ అధ్యక్షులు విజయకాంత్, బీజేపీ కార్యాలయంలో రాష్ట్ర అధ్యక్షులు పొన్ రాధాకృష్ణన్, సీపీఐ కార్యాలయంలో సీనియర్ నేత శంకరయ్య జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. చెన్నై కలెక్టరేట్‌లో కలెక్టర్ సుందరవల్లి పతాకాన్ని ఎగురవేసి రూ.38.38 లక్షల విలువైన పరికరాలను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఎయిర్‌పోర్టులో డెరైక్టర్ సురేష్, సదరన్ రైల్వే కార్యాలయంలో జనరల్ మేనేజర్ రాకేష్ మిశ్రా, ఇండియన్ బ్యాంకు ప్రధాన కార్యాలయంలో సీఎండీ టీఎం బాషా జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. ఆంధ్రా సోషల్ అండ్ కల్చరల్ క్లబ్ (ఆస్కా) కార్యదర్శి సాంబశివరావు, సంయుక్త కార్యదర్శి కృష్ణ తదితరులు జెండా వందనం చేశారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement