విరాట్‌ కోహ్లి సరికొత్త రికార్డు

Virat Kohli becomes fastest to 20000 international runs - Sakshi

మాంచెస్టర్‌: భారత క్రికెట్‌ జట్టు కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి సరికొత్త రికార్డు సాధించాడు. 20 వేల అంతర్జాతీయ పరుగుల మార్కును వేగవంతంగా సాధించిన రికార్డును కోహ్లి నమోదు చేశాడు. వన్డే వరల్డ్‌కప్‌లో భాగంగా వెస్టిండీస్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో కోహ్లి ఈ ఫీట్‌ సాధించాడు. ఈ మ్యాచ్‌కు ముందు 37 పరుగుల దూరంలో ఉన్న కోహ్లి దాన్ని అందుకున్నాడు. దాంతో 417 ఇన్నింగ్స్‌ల్లో 20 వేల అంతర్జాతీయ పరుగులు(టెస్టులు, వన్డేలు, టీ20లు) సాధించి ‘ఫాస్టెస్ట్‌ రికార్డు’ నమోదు చేశాడు. అంతకుముందు ఈ రికార్డు మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ టెండూల్కర్‌, బ్రియాన్‌ లారాల పేరిట సంయుక్తంగా ఉంది. వారిద్దరూ 20 వేల అంతర్జాతీయ పరుగుల్ని 453 ఇన్నింగ్స్‌ల్లో సాధించగా, దాన్ని కోహ్లి తాజాగా బ్రేక్‌ చేశాడు. ఈ జాబితాలో రికీ పాంటింగ్‌(464 ఇన్నింగ్స్‌లు) మూడో స్థానంలో ఉండగా, ఏబీ డివిలియర్స్‌(483) నాల్గో స్థానంలో ఉన్నాడు. రాహుల్‌ ద్రవిడ్‌(492 ఇన్నింగ్స్‌లు) ఆరో స్థానంలో ఉన్నాడు.(ఇక్కడ చదవండి: ఇదేం డీఆర్‌ఎస్‌రా నాయనా!)

విండీస్‌తో మ్యాచ్‌లో 55 బంతుల్లో 6 ఫోర్లతో కోహ్లి హాఫ్‌ సెంచరీ సాధించాడు. రోహిత్‌ శర్మ(18) తొలి వికెట్‌గా పెవిలియన్‌ చేరిన తర్వాత క్రీజ్‌లోకి వచ్చిన కోహ్లి.. సమయోచితంగా బ్యాటింగ్‌ చేశాడు. ఈ క్రమంలోనే ముందుగా తక్కువ ఇన్నింగ్స్‌ల్లో 20వేల అంతర్జాతీయ పరుగుల రికార్డును సాధించిన కోహ్లి.. ఆపై హాఫ్‌ సెంచరీ నమోదు చేశాడు. ఈ మ్యాచ్‌లో కేఎల్‌ రాహుల్‌(48) రెండో వికెట్‌గా ఔట్‌ కాగా, విజయ్‌ శంకర్‌(14) మూడో వికెట్‌గా పెవిలియన్‌ చేరాడు. ఇక కేదార్‌ జాదవ్‌(7) నిరాశపరిచాడు. దాంతో భారత జట్టు 29 ఓవర్లు ముగిసే సరికి నాలుగు వికెట్ల నష్టానికి 140 పరుగులు చేసింది.


 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top