రెండో టి20లోనూ టీమిండియా గెలుపు

Team India Win on DLS Method Against West Indies In 2nd T20 - Sakshi

మ్యాచ్‌కు వర్షం అంతరాయం

డక్‌వర్త్‌ లూయిస్‌ వర్తింపు 

22 పరుగులతో భారత్‌  విజయం

అర్ధసెంచరీతో రాణించిన రోహిత్‌ శర్మ

బౌలింగ్‌లో అదరగొట్టి తొలి టి20ని కైవసం చేసుకున్న టీమిండియా... బ్యాటింగ్‌లో రాణించి రెండో మ్యాచ్‌ను గెల్చుకుంది. పనిలోపనిగా సిరీస్‌నూ ఒడిసిపట్టింది. ఓడితే సిరీస్‌ కోల్పోయే స్థితిలోనూ ప్రత్యర్థి వెస్టిండీస్‌ ఏమంతగా పోటీ ఇవ్వలేకపోయింది. ‘హిట్‌మ్యాన్‌’ రోహిత్‌ శర్మ ధాటైన అర్ధ సెంచరీకి... బౌలర్ల సమష్టి ప్రదర్శన తోడవడంతో కరీబియన్లపై కోహ్లి సేనదే పైచేయి అయింది. భారత్‌ విజయం ఖాయమైన పరిస్థితుల్లో అనుకోని అతిథిలా పలుకరించిన వర్షం మ్యాచ్‌ను మరింత ముందుగానే ముగించింది. డక్‌వర్త్‌ లూయిస్‌ నిబంధనల లెక్కలో విజయానికి విండీస్‌ దూరంగా నిలిచిపోయింది.  

లాడర్‌హిల్‌ (అమెరికా): పెద్దగా కష్టపడకుండానే రెండో టి20 కూడా భారత్‌ వశమైంది. ఆదివారం అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రం లాడర్‌హిల్‌ వేదికగా జరిగిన మ్యాచ్‌లో కోహ్లి సేన డక్‌వర్త్‌ లూయిస్‌ పద్ధతిలో 22 పరుగుల తేడాతో వెస్టిండీస్‌పై నెగ్గింది. దీంతో మరో మ్యాచ్‌ ఉండగానే సిరీస్‌ 2–0తో మన సొంతమైంది. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 167 పరుగులు చేసింది. ఓపెనర్‌ రోహిత్‌ శర్మ (51 బంతుల్లో 67; 6 ఫోర్లు, 3 సిక్స్‌లు) టాప్‌ స్కోరర్‌. కెప్టెన్‌ కోహ్లి (23 బంతుల్లో 28; ఫోర్, సిక్స్‌), ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ కృనాల్‌ పాండ్యా (13 బంతుల్లో 20 నాటౌట్‌; 2 సిక్స్‌లు) ఫర్వాలేదనిపించారు. విండీస్‌ బౌలర్లలో థామస్‌ (2/27), కాట్రెల్‌ (2/25) రెండేసి వికెట్లు తీశారు. ఛేదనలో రావ్‌మన్‌ పావెల్‌ (34 బంతుల్లో 54; 6 ఫోర్లు, 3 సిక్స్‌లు) మెరుపులు మినహా విండీస్‌ తరఫున పెద్దగా ప్రతిఘటన లేకపోయింది. ఆఫ్‌ స్పిన్నర్‌ వాషింగ్టన్‌ సుందర్‌ (1/12), పేసర్‌ భువనేశ్వర్‌ (1/7) ప్రత్యర్థిని మొదట్లోనే దెబ్బకొట్టారు. విజయానికి 27 బంతుల్లో 70 పరుగులు అవసరమైన దశలో విండీస్‌ 98/4తో ఉన్న స్థితిలో వర్షం కారణంగా మ్యాచ్‌ను నిలిపివేశారు. డక్‌వర్త్‌ లూయిస్‌ పద్ధతి వర్తింపజేయగా... విండీస్‌ ఇంకా 22 పరుగులు వెనుకబడి ఉన్నట్లు తేలింది. మూడో టి20 మంగళవారం జరుగుతుంది. 

అనుకున్నదానికి తక్కువే... 
భారత ఇన్నింగ్స్‌ను ఓపెనర్లు రోహిత్, ధావన్‌ (16 బంతుల్లో 23; 3 ఫోర్లు) దూకుడుగా ప్రారంభించారు. థామస్, కాట్రెల్‌ ఓవర్లలో ఫోర్లతో జోరు చూపిన రోహిత్‌... కీమో పాల్‌కు సిక్స్, ఫోర్‌తో స్వాగతం పలికాడు. పవర్‌ ప్లే ముగిసేసరికి జట్టు 52/0తో నిలిచింది. మరో ఎండ్‌లో ధావన్‌ సౌకర్యంగానే ఆడినా ఎక్కువసేపు నిలవలేదు. పాల్‌ బౌలింగ్‌లో బౌల్డయి వెనుదిరిగాడు. దీంతో 67 పరుగుల తొలి వికెట్‌ భాగస్వామ్యానికి తెరపడింది. నరైన్, పియర్‌ ఓవర్లలో రోహిత్, కోహ్లి సిక్స్‌లు దంచడంతో భారీ స్కోరు ఖాయంగా కనిపించింది. అర్ధ శతకం (40 బంతుల్లో) అందుకున్నాక బ్రాత్‌వైట్‌ బౌలింగ్‌లో సిక్స్, ఫోర్‌తో రోహిత్‌ మరింత ధాటిని చూపాడు. ఇదే ఊపులో మరో భారీ షాట్‌కు యత్నించి థామస్‌కు వికెటిచ్చాడు. నాలుగో స్థానంలో దిగిన రిషభ్‌ పంత్‌ (4) మళ్లీ విఫలమయ్యాడు. కాట్రెల్‌ యార్కర్‌... కోహ్లి వికెట్లను గిరాటేసింది. పాండే (6) ఆకట్టుకోలేకపోయాడు. ఈ దశలో 16 నుంచి 19వ ఓవర్‌ మధ్య 21 పరుగులే వచ్చాయి. అయితే, కీమో పాల్‌ వేసిన చివరి ఓవర్లో కృనాల్‌ రెండు, జడేజా ఒక సిక్స్‌తో 20 పరుగులు రాబట్టి మెరుగైన స్కోరు అందించారు.  

ఛేదనలో విండీస్‌... ప్చ్‌... 
విధ్వంసక ఎవిన్‌ లూయిస్‌ (0) వరుసగా రెండో మ్యాచ్‌లోనూ భువనేశ్వర్‌ బౌలింగ్‌లో ఖాతా తెరవకుండానే ఔటవడంతో ఛేదనలో విండీస్‌కు మొదట్లోనే ఎదురుదెబ్బ తగిలింది. రెండో ఓపెనర్‌ సునీల్‌ నరైన్‌ (4)ను సుందర్‌ బౌల్డ్‌ చేశాడు. మూడు ఓవర్లకు 8/2తో నిలిచిన విండీస్‌ను నికొలస్‌ పూరన్‌ (34 బంతుల్లో 19; 1 ఫోర్‌), పావెల్‌ తిరిగి మ్యాచ్‌లోకి తెచ్చారు. మూడో వికెట్‌కు 76 పరుగులు జోడించారు. ఖలీల్, సైనీ ఓవర్లలో ధాటిగా ఆడిన పావెల్‌ 30 బంతుల్లోనే అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు. గెలుపునకు 41 బంతుల్లో 84 పరుగులు అవసరమైన స్థితిలో కృనాల్‌ వీరిద్దరినీ ఔట్‌ చేసి మలుపుతిప్పాడు. పొలార్డ్‌ (8), హెట్‌మైర్‌ (6) క్రీజులో ఉండగా మ్యాచ్‌ ఆగిపోయింది.  

స్కోరు వివరాలు
భారత్‌ ఇన్నింగ్స్‌: రోహిత్‌ శర్మ (సి) హెట్‌మైర్‌ (బి) థామస్‌ 67; ధావన్‌ (బి) కీమో పాల్‌ 23; కోహ్లి (బి) కాట్రెల్‌ 28; పంత్‌ (సి) పొలార్డ్‌ (బి) థామస్‌ 4; మనీశ్‌ పాండే (సి) పూరన్‌ (బి) కాట్రెల్‌ 6; కృనాల్‌ పాండ్యా (నాటౌట్‌) 20; రవీంద్ర జడేజా (నాటౌట్‌) 9; ఎక్స్‌ట్రాలు 10; మొత్తం (20 ఓవర్లలో 5 వికెట్లకు) 167. 
వికెట్ల పతనం: 1–67, 2–115, 3–126, 4–132, 5–143. 
బౌలింగ్‌: థామస్‌ 4–0–27–2, కాట్రెల్‌ 4–0–25–2, నరైన్‌ 4–0–28–0, కీమో పాల్‌ 4–0–46–1, బ్రాత్‌వైట్‌ 2–0–22–0, పియర్‌ 2–0–16–0. 

వెస్టిండీస్‌ ఇన్నింగ్స్‌: నరైన్‌ (బి) సుందర్‌ 4; లూయిస్‌ (సి అండ్‌ బి) భువనేశ్వర్‌ 0; పూరన్‌ (సి) మనీశ్‌ పాండే (బి) కృనాల్‌ పాండ్యా 19; పావెల్‌ (ఎల్బీడబ్ల్యూ) (బి) కృనాల్‌ పాండ్యా 54; పొలార్డ్‌ (నాటౌట్‌) 8; హెట్‌మైర్‌ (నాటౌట్‌) 6; ఎక్స్‌ట్రాలు 7; మొత్తం (15.3 ఓవర్లలో 4 వికెట్లకు) 98. 
వికెట్ల పతనం: 1–2, 2–8, 3–84, 4–85.  
బౌలింగ్‌: సుందర్‌ 3–1–12–1, భువనేశ్వర్‌ 2–0–7–1, ఖలీల్‌ అహ్మద్‌ 3–0–22–0, నవదీప్‌ సైనీ 3–0–27–0, కృనాల్‌ పాండ్యా 3.3–0–23–2, రవీంద్ర జడేజా 1–0–6–0.   

1 అంతర్జాతీయ టి20 క్రికెట్‌లో అత్యధిక సిక్స్‌లు కొట్టిన బ్యాట్స్‌మన్‌గా రోహిత్‌ శర్మ (107) రికార్డు సృష్టించాడు. క్రిస్‌ గేల్‌ (విండీస్‌–105) పేరిట ఉన్న రికార్డును రోహిత్‌ బద్దలు కొట్టాడు. 

1 అంతర్జాతీయ టి20 క్రికెట్‌లో అత్యధిక ఫోర్లు కొట్టిన బ్యాట్స్‌మన్‌గా విరాట్‌ కోహ్లి (225) రికార్డు నెలకొల్పాడు. దిల్షాన్‌ (శ్రీలంక–223) పేరిట ఉన్న రికార్డును కోహ్లి అధిగమించాడు. 

1 టి20 ఫార్మాట్‌లో అత్యధిక పరుగులు చేసిన భారత క్రికెటర్‌గా సురేశ్‌ రైనా (8,392) పేరిట ఉన్న రికార్డును కోహ్లి (8,416) సవరించాడు. 

12 రెండు లేదా అంతకంటే ఎక్కువ మ్యాచ్‌లు ఉన్న ద్వైపాక్షిక టి20 సిరీస్‌లను భారత్‌ 12 సార్లు సొంతం చేసుకుంది. 

57 అంతర్జాతీయ టి20ల్లో విండీస్‌కిది 57వ ఓటమి. అత్యధిక పరాజయాలు పొందిన జట్ల జాబితాలో శ్రీలంక, బంగ్లాదేశ్‌ జట్ల సరసన విండీస్‌ చేరింది.  

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top