మీరెవరూ క్రీడల్లోకి రాకండి: నీషమ్‌ ఆవేదన | Neeshams Heartbreaking Message Post World Cup Defeat | Sakshi
Sakshi News home page

మీరెవరూ క్రీడల్లోకి రాకండి: నీషమ్‌ ఆవేదన

Jul 15 2019 12:54 PM | Updated on Jul 15 2019 12:58 PM

Neeshams Heartbreaking Message Post World Cup Defeat - Sakshi

లండన్‌: వన్డే వరల్డ్‌కప్‌లో ఇంగ్లండ్‌ విశ్వ విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. .ఆదివారం అర్థరాత్రి వరకు కొనసాగిన ఉత్కంఠ పోరులో మ్యాచ్‌ టై కాగా, ఆపై నిర్వహించిన సూపర్ ఓవర్‌ కూడా టైగానే ముగిసింది. దీంతో బౌండరీలను( సూపర్‌ ఓవర్‌తో సహా ఫోర్లు, సిక్సర్లు) లెక్కలోకి తీసుకున్న ఇంగ్లండ్‌నే వరల్డ్‌ చాంపియన్‌గా ప్రకటించారు. ఇది ఆతిథ్య ఇంగ్లండ్‌కు అనుకూలంగా మారగా, గెలుపు తలుపు వరకు వెళ్లి వచ్చిన న్యూజిలాండ్ జట్టు ఆవేదన మాత్రం వర్ణనాతీతం.

కప్పు ఇంగ్లండ్ గెలుచుకున్నా... న్యూజిలాండ్ మాత్రం అందరి మనసు గెలుచుకుందనడంలో ఎటువంటి సందేహం లేదు. ఈ పుట్టెడు దుఖంలో న్యూజిలాండ్ క్రికెటర్ జేమ్స్‌ నీషమ్( జిమ్మీ నీషమ్‌గా కూడా పిలుస్తారు) ట్వీటర్‌లో పోస్ట్‌ చేసిన ఓ మెసేజ్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ‘పిల్లలూ మీరెవరూ క్రీడల్లోకి రావొద్దు. మరి ఎదైనా ప్రొఫెషన్ తీసుకోండి. 60 ఏళ్లకే హ్యాపీగా ఆరోగ్యంగా చనిపోండి’ అంటూ జిమ్మీ  పోస్ట్‌ చేశాడు. ఈ క్రమంలోనే ఇంగ్లండ్‌కు అభినందనలు తెలియజేశాడు నీషమ్‌. జిమ్మీ నీషమ్ పెట్టిన ఈ పోస్టులకు నెటిజన్ల నుంచి విపరీతమైన రెస్పాన్స్ వస్తోంది. న్యూజిలాండ్ అభిమానులే కాదు.. భారత క్రికెట్ అభిమానులు సైతం నీషమ్‌ను ఓదార్చుతున్నారు. మీరు ఆడిన తీరు... ఎవరూ మరిచిపోలేరని అండగా నిలుస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement