‘ముస్లిం కాబట్టే షమీని పక్కన పెట్టారు’ | Mohammed Shami Being Rested Against Sri Lanka As He is a Muslim | Sakshi
Sakshi News home page

‘ముస్లిం కాబట్టే షమీని పక్కన పెట్టారు’

Jul 8 2019 12:23 PM | Updated on Jul 8 2019 12:45 PM

Pakistan Cricket Analyst Says Mohammed Shami Being Rested Against Sri Lanka As He is a Muslim - Sakshi

విరాట్‌ కోహ్లి, షమీ

ఇస్లామాబాద్‌ : టీమిండియా పేసర్‌ మహ్మద్‌ షమీ ముస్లిం కాబట్టే శ్రీలంకతో మ్యాచ్‌కు దూరం పెట్టారని పాకిస్తాన్‌ క్రికెట్‌ విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. భువనేశ్వర్‌ కుమార్‌ గాయంతో జట్టులోకి వచ్చిన షమీ అద్భుతంగా రాణించాడని, మూడు మ్యాచ్‌ల్లోనే 14 వికెట్లు పడగొట్టాడని పేర్కొన్నారు. అలాంటి ఆటగాడిని కాదని, గాయం నుంచి కోలుకున్న భువనేశ్వర్‌కు అవకాశం కల్పించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. బీజేపీ ఒత్తిడితోనే ముస్లిం అయిన షమీని పక్కకు పెట్టారని, ముస్లిం ఎదగవద్దనే ఎజెండాలో భాగంగానే విశ్రాంతి కల్పించారని సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రపంచకప్‌ నేపథ్యంలో ఓ పాక్‌ చానెల్‌ నిర్వహించిన డిబేట్‌లో ఆ దేశ క్రికెట్‌ విశ్లేషకులు మాట్లాడిని ఈ మాటలు ప్రస్తుతం నెట్టింట హల్‌చల్‌ చేస్తున్నాయి.

‘మూడు మ్యాచ్‌ల్లో(షమీ ఆడింది 4 మ్యాచ్‌లు)14 వికెట్లు పడగొట్టిన బౌలర్‌ను ఎవరైనా పక్కకు పెడ్తారా? ఇప్పటికే అతను రికార్డు నమోదు చేసే దిశగా దూసుకెళ్తున్నాడు. అత్యధిక వికెట్ల జాబితా రేసులో కూడా ఉన్నాడు. అలాంటి ఆటగాడిని ఎందుకు పక్కనపెట్టారో నాకు అర్థం కావడం లేదు. షమీని తీసుకోవద్దని జట్టు మేనేజ్‌మెంట్‌పై ఏమైనా ఒత్తిడి ఉందో ఏమో.. బీజేపీ ఎజెండాలో భాగంగా ముస్లింలు ఎదుగొద్దని షమీని పక్కకు పెట్టారేమో’ అని వ్యాఖ్యానించారు. ఇక షమీ విషయంలో ఇలా మతాన్ని అంటగడుతూ మాట్లాడటం ఇదే తొలిసారేం కాదు. ఇటీవల పాకిస్తాన్‌ మాజీ క్రికెటర్‌ అబ్దుల్‌ రజాక్‌ ఓ టీవీ కార్యక్రమంలో మాట్లాడుతూ.. ముస్లిం అయిన షమీ ఒక్కడే ఇంగ్లండ్‌పై పోరాడాడని, మిగతా బౌలర్లు ఏమాత్రం రాణించలేకపోయారని వ్యాఖ్యానించాడు. ఇక శ్రీలంకతో మ్యాచ్‌లో చహల్‌, షమీ స్థానాల్లో జడేజా, భువనేశ్వర్‌ తుది జట్టులోకి వచ్చిన విషయం తెలిసిందే. 

Advertisement
 
Advertisement
Advertisement