శ్రీలంకతో వన్డే సిరీస్లో భారత మహిళల జట్టు సత్తా చూపించింది.
విశాఖపట్నం,న్యూస్లైన్: శ్రీలంకతో వన్డే సిరీస్లో భారత మహిళల జట్టు సత్తా చూపించింది. మరో మ్యాచ్ మిగిలుండగానే మూడు వన్డేల సిరీస్ను 2-0తో కైవసం చేసుకుంది. వైఎస్ఆర్-ఏసీఏ వీడీసీఏ స్టేడియంలో మంగళవారం జరిగిన మ్యాచ్లో భారత మహిళల జట్టు ఏడు వికెట్లతో శ్రీలంక మహిళల జట్టును చిత్తు చేసింది. టాస్ గెలిచిన భారత్ ఫీల్డింగ్ ఎంచుకోగా... శ్రీలంక 47.1 ఓవర్లలో 140 పరుగులకు ఆలౌటయింది.
ఓపెనర్ యశోద మెండిస్ (56) అర్ధసెంచరీతో రాణించింది. భారత బౌలర్లలో హైదరాబాద్ అమ్మాయి గౌహర్ సుల్తానా (4/15) వరుసగా రెండో మ్యాచ్లోనూ నాలుగు వికెట్లు తీసింది. తర్వాత భారత జట్టు 39.3 ఓవర్లలో 143 పరుగులు చేసి గెలిచింది. ఓపెనర్ స్మృతి మందన (51) అర్ధసెంచరీ సాధించింది. మరో ఓపెనర్ పూనమ్ రౌత్ (38) రాణించింది. కెప్టెన్ మిథాలీ రాజ్ (31 నాటౌట్) కీలక ఇన్నింగ్స్తో మ్యాచ్ను ముగించింది.