హైదరాబాద్‌కు రెండు కాంస్యాలు | Hyderabad, two bronze | Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌కు రెండు కాంస్యాలు

Jun 1 2014 12:27 AM | Updated on Sep 2 2017 8:08 AM

సౌత్‌జోన్ క్యారమ్ చాంపియన్‌షిప్‌లో హైదరాబాద్ పురుషుల, మహిళల జట్లు కాంస్యంతో సరిపెట్టుకున్నాయి. పురుషుల విభాగంలో డిఫెండింగ్ చాంపియన్ తమిళనాడుకు కర్ణాటక చేతిలో చుక్కెదురైంది.

సౌత్‌జోన్ క్యారమ్ చాంప్ కర్ణాటక
 సాక్షి, హైదరాబాద్: సౌత్‌జోన్ క్యారమ్ చాంపియన్‌షిప్‌లో హైదరాబాద్ పురుషుల, మహిళల జట్లు కాంస్యంతో సరిపెట్టుకున్నాయి. పురుషుల విభాగంలో డిఫెండింగ్ చాంపియన్ తమిళనాడుకు కర్ణాటక చేతిలో చుక్కెదురైంది. ఆడిన ఐదు లీగ్ మ్యాచ్‌ల్లోనూ నెగ్గడం ద్వారా కర్ణాటక చాంపియన్‌గా అవతరించింది. శనివారం జరిగిన చివరి లీగ్ మ్యాచ్‌లో కర్ణాటక 2-1తో తమిళనాడుపై గెలిచింది. తొలి సింగిల్స్‌లో జహీర్ పాషా (కర్ణాటక) 23-12, 19-13తో  రాధాకృష్ణన్ (తమిళనాడు)పై, రెండో సింగిల్స్‌లో రాజేశ్ (కర్ణాటక) 25-10, 25-15తో భారతీదాసన్ (తమిళనాడు)పై విజయం సాధించారు.
 
  డబుల్స్‌లో మాత్రం తమిళనాడు జోడి సాగయ్య భారతి-శక్తివేలు 25-15, 25-15తో శివకుమార్-చంద్రశేఖర్ (కర్ణాటక) జంటపై గెలిచింది. ఓవరాల్‌గా పది పాయింట్లతో కర్ణాటక చాంపియన్‌షిప్ గెలువగా, 8 పాయింట్లతో తమిళనాడు రన్నరప్‌గా నిలిచింది. పురుషుల, మహిళల విభాగాల్లో హైదరాబాద్ జట్లు 6 పాయింట్లతో మూడో స్థానం దక్కించుకున్నాయి. మహిళల ఈవెంట్‌లో డిఫెండింగ్ చాంపియన్ తమిళనాడు (10 పాయింట్లు) టైటిల్ నిలబెట్టుకుంది. ఇందులో కర్ణాటక (8) రజతం గెలిచింది.
 

Advertisement
 
Advertisement
Advertisement