సింగిల్స్ గెలిస్తేనే... | Davis Cup: Yuki Bhambri to commence India's campaign | Sakshi
Sakshi News home page

సింగిల్స్ గెలిస్తేనే...

Sep 12 2014 1:38 AM | Updated on Sep 2 2017 1:13 PM

సింగిల్స్ గెలిస్తేనే...

సింగిల్స్ గెలిస్తేనే...

వరల్డ్ గ్రూప్‌కు అర్హత సాధించాలన్న లక్ష్యంతో పాటు మూడేళ్ల కిందట ఎదురైన పరాభవానికి ప్రతీకారం తీర్చుకోవాలని తహతహలాడుతున్న భారత్...

- సెర్బియాతో భారత్ డేవిస్ కప్ పోరు నేటి నుంచి
- యూకీ X లాజోవిచ్; సోమ్‌దేవ్ X క్రాజినోవిచ్
బెంగళూరు: వరల్డ్ గ్రూప్‌కు అర్హత సాధించాలన్న లక్ష్యంతో పాటు మూడేళ్ల కిందట ఎదురైన పరాభవానికి ప్రతీకారం తీర్చుకోవాలని తహతహలాడుతున్న భారత్... డేవిస్ కప్ పోరుకు సిద్ధమైంది. నేటి నుంచి మూడు రోజుల పాటు జరగనున్న ఈ టోర్నీలో ప్రపంచ రెండో ర్యాంక్ జట్టు సెర్బియాతో అమీతుమీ తేల్చుకోనుంది. సొంత గడ్డపై ఈ టోర్నీ ఆడటం భారత్‌కు అనుకూలాంశంమే అయినప్పటికీ ప్రత్యర్థి నుంచి తీవ్రమైన పోటీ ఉంటుంది. 2010లో వరల్డ్ గ్రూప్‌కు అర్హత సాధించిన భారత్... 2011లో సెర్బియా చేతిలో ఓడటంతో ఆసియా / ఓసియానియా గ్రూప్‌కు పడిపోయింది. అప్పటి నుంచీ గ్రూప్ దశలోనే ఆడుతున్న భారత్‌కు మళ్లీ ఇప్పుడు వరల్డ్ గ్రూప్‌కు అర్హత సాధించే మంచి అవకాశం వచ్చింది. అయితే ప్రపంచ నంబర్‌వన్ జొకోవిచ్, టిప్సరెవిచ్, విక్టర్ ట్రోస్కీలు ఈ టోర్నీకి గైర్హాజరైనా మిగతా ఆటగాళ్లతో సెర్బియా పటిష్టంగా ఉంది.
 
యూకీతో లాజోవిచ్...
ఈ టోర్నీలో భారత్ ముందడుగు వేయాలంటే సింగిల్స్ మ్యాచ్‌లు కీలకం కానున్నాయి. తొలి సింగిల్స్‌లో యువ ఆటగాడు యూకీ బాంబ్రీ... ప్రపంచ 61వ ర్యాంకర్ డుసాన్ లాజోవిచ్‌ను ఎదుర్కొంటాడు. మడమ గాయం నుంచి కోలుకున్న యూకీ ఇప్పుడిప్పుడే ప్రాక్టీస్ చేస్తున్నాడు. తన కంటే తక్కువ ర్యాంక్ ఆటగాళ్లతో ఆడిన మ్యాచ్‌ల్లో లాజోవిచ్ కేవలం నాలుగుసార్లు మాత్రమే ఓడటం అతని సత్తాను తెలియజేస్తోంది. రెండో సింగిల్స్‌లో స్టార్ ప్లేయర్ సోమ్‌దేవ్.. ప్రపంచ 107వ ర్యాంకర్ క్రాజినోవిచ్‌తో అమీతుమీ తేల్చుకుంటాడు.

అయితే గత ఆరు నెలలుగా ఏటీపీ సర్క్యూట్‌లో సోమ్‌దేవ్ తొలి రౌండ్‌ను దాటకపోవడం ఆందోళన కలిగిస్తోంది. శనివారం జరిగే డబుల్స్ మ్యాచ్‌లో వెటరన్ ప్లేయర్ లియాండర్ పేస్-రోహన్ బోపన్న... జిమోన్‌జిక్-బొజోల్‌జిక్‌లతో తలపడతారు. ఆదివారం రివర్స్ సింగిల్స్ మ్యాచ్‌లు జరగుతాయి. ఈ టోర్నీలో భారత్ విజయం సాధిస్తుందని పేస్ ఆశాభావం వ్యక్తం చేశాడు. ఒత్తిడిని ఎంత వరకు జయిస్తామనే దానిపైనే విజయావకాశాలు ఆధారపడి ఉంటాయన్నాడు. మరోవైపు యూకీ తొలి సింగిల్స్ ఆడటంపై నాన్ ప్లేయింగ్ కెప్టెన్ ఆనంద్ అమృత్‌రాజ్ సంతృప్తి వ్యక్తం చేశారు.
 
బోపన్నకు ‘నిబద్ధత’ అవార్డు
భారత టెన్నిస్ ఆటగాడు రోహన్ బోపన్న డేవిస్ కప్ కమిట్‌మెంట్ అవార్డు అందుకోనున్నాడు. డేవిస్ కప్‌లో తమ జాతీయ జట్టు తరఫున అంకిత భావంతో ఆడే ఆటగాళ్లను ఈ అవార్డుకు ఎంపిక చేస్తారు. ఆటగాళ్ల శ్రమకు ఈ అవార్డు గుర్తింపు ఇస్తుందని ఐటీఎఫ్ అధ్యక్షుడు ఫ్రాన్సిస్కో రికీ అన్నారు. శుక్రవారం ఇక్కడ సెర్బియాతో మ్యాచ్ సందర్భంగా బోపన్నకు అవార్డు అందజేస్తారు. లీటన్ హెవిట్ (ఆస్ట్రేలియా), గుస్తావో కుయెర్టన్ (బ్రెజిల్) కూడా ఈ అవార్డుకు ఎంపికయ్యారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement